భవిష్య పురాణము

17-18 - అధివాసన, యజ్ఞకర్మల్లో ఉత్తమ బ్రాహ్మణ, ధర్మదేవత స్వరూపాలు

బ్రాహ్మణులారా! దేవ ప్రతిష్ఠకి ముందురోజే దేవతల అధివాసనను చేయించాలి. విధి విధానంలో అధివాసన పదార్థాలైన ధాన్యాదులను, యూపాదులను కూడా సిద్ధం చేసి వుంచాలి. కలశపై గణేశుని స్థాపించి దిక్పాలురనూ, గ్రహాలనూ పూజించాలి. తటాక, ఉద్యానాదుల ప్రతిష్ఠలో ప్రధానరూపంలో బ్రహ్మదేవునీ, శాంతి, ప్రపాయాగాలలో వరుణదేవునీ, శైవప్రతిష్ఠలో శివునితోబాటు సోమ, సూర్య, విష్ణు దేవులనూ అర్ఘ్య పాద్యాదులతో అర్చించాలి. ద్రుపదాదివం (యజు. 20/20) అనే మంత్రంతో ముందుగా ప్రతిమకు స్నానం చేయించాలి. తరువాత ఇతర మంత్రాల ద్వారా గంధ, పుష్ప, ఫల దర్భ, సిందూర, చందన, సుగంధిత తైల, పుష్ప, ధూప, దీప, అక్షత, వస్త్రాది ఉప చారాలతో పూజించాలి. మండలంలోపల ప్రధానదేవతను ఆవాహనం చేసి అందులోనే అధివాసనం చేయించాలి. సురక్ష(కర్ములు అనగా మానవులు) కర్ముల ద్వారా ఆస్థానాన్ని సురక్షితం చేయాలి. ఆ తరువాత ఆచార్యుడు, ఋత్విక్కు, యజమాని కలిసి మధుర పదార్థాలతో కమ్మని భోజనాన్ని చేయాలి. అధివాసన క్రియా సంపన్నత లేని ప్రతిష్ఠలు ఫలాన్నివ్వవు. నిత్య, నైమిత్తిక, కామ్య కర్మాల్లో విధిననుసరించి కుండ మండపరచనను గావించియే హవన కార్యాన్ని చేపట్టాలి.

బ్రాహ్మణులారా! యజ్ఞకార్యంలో అనుష్ఠాన ప్రమాణంగా భావింపబడే అంకె ఎనిమిది ఎనమండుగురు ద్వారపాలకులు, ఎనమండుగురు యాజక బ్రాహ్మణులు ఉండాలి. ఈ బ్రాహ్మణులు శుద్ధులు, పవిత్రులు, ఉత్తమ లక్షణయుక్తులు అయివుండి, వేద మంత్రాల్లో పారంగతులై వుండాలి.

జపం కోసం ఒక జాపకుడిని కూడా వరించవలసివుంటుంది. బ్రాహ్మణులను పద్ధతి ప్రకారం గంధ, మాల్య, వస్త్ర, దక్షిణలతో పూజించాలి. ఉత్తమత, సర్వలక్షణ సంపన్నత, పారంగత్వము ఈ మూడూ ఉన్న బ్రాహ్మణుడు దొరకలేదు కదా అని ఏదో ఒక లక్షణం లేని వానిచే యజ్ఞం చేయించి వేస్తే ఆ యజ్ఞానికి ఉత్తమ ఫలం దక్కదు. బ్రాహ్మణవరణ సమయంలో గోత్రనామాలు చూసుకోవాలి. తులా పురుషదానంలోనైతే అలాగే, స్వర్ణపర్వత, వృషోత్సర్గ, కన్యాదానాల్లోనైతే గోత్రంతో బాటు ప్రవరను కూడా ఉచ్ఛరించాలి. (విధురుడు = భార్యపోయినవాడు), విధురుడు, కృపణుడు, శూద్రుని ఇంటిలో నివసించేవాడు, మరుగుజ్జు, వృషలీపతి, బంధు స్త్రీ గురు ద్వేషి, హీనాంగుడు, అధికాంగుడు, కొక్కిరివంటివాడు, దాంభికుడు, ప్రతిగ్రాహి, వంకర గోళ్ళవాడు, వ్యభిచారి, కుష్టురోగి, నిద్రమోతు, వ్యసనపరుడు, ఏ దీక్షాలేనివాడు, పెద్దకురుపున్నవాడు, కొడుకులేనివాడు, తాను మాత్రమే తింటూ కుటుంబపోషణను చేయనివాడు వీరెవరూ యజ్ఞపాత్రులు కారాదు. వారికెటువంటి ప్రవేశమూ, యజ్ఞమున లేదు. బ్రాహ్మణవరణము, పూజనమంత్రముల భావమిలా వుంటుంది; ఆచార్యదేవా! మీరు బ్రహ్మ యొక్క మూర్తియే. ఈ సంసారంలో మునిగిపోతున్న నన్ను రక్షించండి. గురుదేవా! నాకీ యజ్ఞమును చేసే సదవకాశం లభించిందంటే అది కేవలం మీ ప్రసాదమే. నా కీర్తి చిరకాలము పాటు నిలబడాలంటే, మీరు నాపట్ల ప్రసన్నులు కావాలి. అన్ని ప్రాణులకూ ‘ఆది’ మీరే. సంసారసముద్రాన్ని దాటింపగలిగేదీ మీరే. జ్ఞానామృతాన్ని పంచే ఆచార్యులు మీరు. మీరే యజ్ఞస్వరూపమై వెలుగుతున్నారు. మీరు వేదాలను షడంగ యుక్తంగా తెలుసుకొని యున్నారు. మాకు మీరే మోక్షప్రదులు. దయచేసి మండలంలో ప్రవేశించి ఈ బ్రాహ్మణులను వారి వారి స్థానాలలో ప్రవిష్టులను చేసి ఆదరంతో చూసుకోవాలి. వేది యొక్క పశ్చిమ భాగంలో ఆచార్యుని కూర్చోబెట్టాలి. కుండానికి అగ్రభాగంలో బ్రహ్మగారిని ఆసీనులను చేయాలి. హోతా, ద్వారపాలాదులనూ తమతమ ప్రత్యేకస్థలాల్లో ఆసీనులను గావించి యజమాని ఆచార్యాదులను సంబోధిస్తూ ఇలా ప్రార్ధించాలి. ‘భూదేవులారా! మీరంతా నాపాలిట నారాయణ స్వరూపులు. నాయజ్ఞాన్ని సఫలం చేయండి. యజుర్వేద తత్త్వార్థము తెలిసిన బ్రహ్మసమానుడవైన ఆచార్యదేవా! మీకు ప్రణామములు. మీరు సంపూర్ణ యజ్ఞకర్మకు సాక్షీభూతులు. ఋగ్వేదార్థజ్ఞాతవై ఇంద్ర రూపుడవైన ఓ బ్రాహ్మణోత్తమా! మీకు నమస్కారము. ఈ యజ్ఞకర్మ సిద్ధికై జ్ఞానమూర్తియు, మంగళరూపియునగు శివునికి మీ ద్వారా నమస్కరిస్తున్నాను. అన్ని దిశ - విదిశలలో నుండి ఈ యజ్ఞాన్ని కాపాడండి. దిక్పాల రూపులైన బ్రాహ్మణ దేవులకు నమస్కారము.’

యజ్ఞ, దేవార్చన, యాగాది కర్మలను సంకల్పపూర్వకంగా చేయాలి. కోరిక సంకల్ప మూలకమైతే యజ్ఞము సంకల్ప సంభూతము. సంకల్పము చెప్పుకోకుండా చేసే పనికి ఫలితముండదు. గంగా, సూర్య, చంద్ర, ఆకాశ, భూమి, రాత్రి, దివం, యమ, కాల, పంచ మహాభూతాలు శుభాశుభకర్మలకు సాక్షులు. కాబట్టి వివేకవంతుడైన మానవుడు అశుభకర్మల నెవరెంత చెప్పినా చేపట్టబోడు. శుభకర, ధర్మాచరణను వద్దన్నా మానడు. ధర్మదేవత శుభశరీరంతో శ్వేత వస్త్రధారణలో నొకమారు, వృష స్వరూపంలో నొకమారు గోచరిస్తూ రెండు చేతులనూ వరదాన, అభయ ముద్రాధారణలో వుంచుకొని ధర్శనమిస్తాడు. ఈయన అన్ని ప్రాణులనూ సుఖపెట్టడానికే చూస్తాడు, సజ్జనులకు మోక్షాన్నివ్వగలడు. ఈ విధమైన స్వరూప స్వభావాలున్న ధర్మదేవత సత్పురుషులకు కళ్యాణకారకుడు, రక్షకుడు అగుచున్నాడు.