భవిష్య పురాణము

158 -159 - సౌరధర్మ నిరూపణంలో సూర్యావతార కథనం

            “గురుదేవా! తేజస్వి, భగవానుడునయిన సూర్యభగవానుడు త్రిమూర్తులకే వర ప్రదానం చేయగలిగాడు. పృథ్వితో సహా అన్ని లోకాలనూ దేవతలతో సహా అన్ని ప్రాణులనూ ఉత్పన్నం చేశాడు. సహస్ర శీర్షాలు, సహస్ర నేత్రాలు, (సహస్రానికి పైబడి)సహస్రాధిక పాదాలు మున్నగునవి గల విశ్వరూపుడు, ఉత్పాదక వినాశాలకధిపతియైన పరంజ్యోతియైన శ్రీ సూర్యనారాయణమూర్తి కశ్యపపుత్రునిగా అవతరించాడని విన్నాను. ఇదెలా జరిగింది?” అని ప్రశ్నించాడు శతానీకుడు.

            “మహారాజా! మీరు చాల జటిలమైన విషయాన్నే వినగోరుతున్నారు. నా సామర్థ్యం మేరకు వివరిస్తాను. శ్రద్ధాభక్తితత్పరులై వినండి. సహస్రాధిక కిరణాలతో, శీర్షాదులతో లోకకళ్యాణాన్ని గావిస్తున్న సూర్యనారాయణుడు కశ్యపుని ఇంట, అదితి గర్భాన అవతరించడం నిజంగా ఆశ్చర్యమే.

            మహారాజా! అదితీకశ్యపుల కొకప్పుడు ఎందరో పుత్రులు జనించడం. పుట్టిన మరుక్షణమే మరణించడం జరిగింది. పుత్రశోకంతో, దుఃఖాన్ని ఇక తట్టుకోలేక ఒకనాడు అదితి కశ్యపుని వద్దకు వెళ్ళింది. ఆ మహానుభావుడైన మహర్షి తపస్సు చేసుకునే సమయమది. ఆయన అగ్ని సమానమైన తేజస్సుతో, దండధరుడై, కృష్ణమృగచర్మం పై ఆసీనుడై, వల్కలధారియై, భాస్కరదేవుని వలె దేదీప్యమానుడై కాంతులు విరజిమ్ముతుండగా ఆమె దర్శించింది. అయినా ఆగలేక ఇలా అడిగేసింది. ‘నాధా! మీరింత నిశ్చింతగా ఎలా కూర్చోగలుగుతున్నారు? నా పుత్రులు మీ పుత్రులు కారా? వారు పుడుతూనే ఎందుకు పోతున్నారో మీరు తెలుసుకోగలరు కదా!’

            కశ్యపుడు వెంటనే లేచి బ్రహ్మ లోకం వెళ్ళి ఆ లోకపాలకునే ఇలా అడిగాడు తండ్రీ అదితి అడిగిన ప్రశ్న ఇది ఏమి చెప్పమంటారు?’

            బ్రహ్మ ఇలా అన్నాడు. ‘పుత్రా! మనం భాస్కరభగవానులు పరమ దుర్లభ స్థానాన్ని చేరుకోవాలి. పద’.

            ఇలా చెప్పి బ్రహ్మ అదితినీ, కశ్యపునీ తోడ్కొని విమానారూఢుడై సూర్యదేవుని భవనాన్ని చేరుకున్నాడు. ఆ సమయంలో సూర్యలోక సభలో ఒకచోట వేదధ్వని వినిపిస్తుంటే మరొకచోటు యజ్ఞాచరణ కనిపిస్తోంది. బ్రాహ్మణులు వేదంలో శిక్షణనిస్తున్నారు. పదునెనిమిది పురాణాలనూ అనర్గళంగా చెప్పగలవారూ విద్యావిశారదులూ, మీమాంసకులూ, న్యాయశాస్త్రకోవిదులూ, వేదాంత వేద్యులూ, లోకాయాతికాదులూ ఎందరో మహానుభావులు సూర్యోపాసనలో నిమగ్నులై వున్నారు. విద్వాంసులైన బ్రాహ్మణులు జప, తప, హవనాదులు కావిస్తున్నారు. ఆసభలో కశ్యపుడు రశ్మిమంతుడైన దివాకరుని దర్శించాడు.

            దేవగురువు బృహస్పతి, అసురాచార్యుడు శుక్రుడు మున్నగువారు అక్కడ సూర్యోపాసన చేస్తున్నారు. దక్ష, ప్రచేత, మరీచి, భృగు, అత్రి, వసిష్ఠ, గౌతమ, నారదాది ఋషులు సూర్యుని స్తుతిస్తున్నారు. అంతరిక్ష, తేజ, పృథ్వి, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ప్రకృతి, వికృతి, అంగోపాంగసహితంగా మూర్తిమంతములై సూర్యుని సేవించసాగాయి. అర్థ, ధర్మ, కామ, మోక్షాదులు, హర్ష, మోహ, మహేశ్వర, సౌర, మారుతశక్త్యాదులు విశ్వకర్మ, అశ్వనీకుమారులు సుందర - సుందర వచనాలతో చేసే సూర్యదేవ గుణగానం మంద్రంగా మధురస్వనంలో వినిపిస్తోంది.

            అదితి కశ్యపులను ముందిడుకొని బ్రహ్మ సూర్యభగవానునితో సూటిగా ఒకే ప్రార్థన చేశాడు. ‘మహాప్రభో! తమరు దేవమాత అదితి గర్భాన కశ్యపుని యింట జనించి లోకకళ్యాణం గావించండి. ఈ త్రిలోకాలనూ మీ తేజంతో ప్రకాశింపజేయండి. దేవతలకు శరణమీయండి. అసురులను అంతమొందించండి. అదితి పుత్రులను రక్షించండి.’

            అదితి గర్భశోకాన్ని గూర్చి బ్రహ్మ సూర్యునికి చెప్పలేదు. అదంతా ఆయనకు తెలుసు.

            ‘తథాస్తు!’ అన్నాడు సూర్యభగవానుడు.

            కశ్యప మహర్షి సహర్షుడై అదితితో సహా తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాడు. బ్రహ్మ కూడా తన లోకానికి వెళ్ళాడు.

            మహారాజా! కాలాంతరంలో సూర్యుడు, ఈమారు, అదితి గర్భంలో ఉదయించగానే ఆకాశంలో దేవదుందుభులు మ్రోగాయి. గంధర్వగణాలు గానం చేశారు. ద్వాదశాత్ముడైన సూర్యదేవుడు ఏకాత్ముడై భూలోకాన్ని చేరగానే అందరు దేవతలు, ఋషులు, దక్షాది ప్రజాపతులు సూర్యస్తుతిని స్వాగతం పలుకుతున్నట్లుగా చేశారు. ఏకాదశరుద్రులు, అశ్వనీ కుమారులు, అష్టవసువులు, గరుడుడు, విశ్వేదేవులు, వాసుకి, రాక్షసులు కూడా ఆ సమయంలో వినయంగా చేతులు జోడించి నిలబడి స్వాగతాంజలులను ఘటించారు. బ్రహ్మయే స్వయంగా దిగి వచ్చి పృథ్విపై నిలబడ్డాడు. అక్కడున్న వారితో సూర్యదేవునికి నామకరణం చేసే పురోహితుడా అనునట్లుగా ఇలా చెప్పాడు బ్రహ్మ:

            ‘దేవర్షిగణ ప్రముఖులారా! బాలక రూపంలో వెలసిన ఈ భగవానులు, లోకేశ్వరేశ్వరులై శ్రీమాన్, వివస్వాన్ అనే నామరూపాలతో తెలియబడతారు. ఆదిత్యుడను నామంతో కూడా ప్రసిద్ధులౌతారు.” తదనంతరం దేవతలంతా బ్రహ్మతో సహా అదితి అదృష్టంకొద్దీ పుట్టిన ఆదిత్యునికి నమస్కరించి వారివారి లోకాలకి వెళ్ళారు.

            వేదాల ద్వారా కీర్తింపబడినవాడును, ఇంద్రాది ద్వాదశనామాలతో అప్పటికే జగత్ప్రసిద్ధుడైన భగవానుడు కాశ్యపునిగా ఆదిత్యునిగా తమ యింట జనించినందుకు కశ్యప దంపతులు పరమ సంతుష్టులైనారు. దుష్టులైన రాక్షసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

            సూర్యదేవుని పలుకులు కశ్యపమహర్షికి ఇలా వినిపించాయి. ‘ఓ మహర్షీ! ఎందరో బిడ్డలను కోల్పోయిన మాతృమూర్తి గర్భసిద్ధి కోసమే నేను నీ పుత్రునిగా ఉత్పన్నుడనైనాను.’

            శతానీక మహారాజా! ఈ విధంగా పరమసూర్యారాధకులైన బ్రహ్మ, కశ్యపుడు వారి ఆరాధనకు ఫలితంగా సూర్యదేవుని ఈ పృథ్విపై జనింపజేశారు.