భవిష్య పురాణము

58 - 60 - రథసప్తమి మహిమ

మాఘశుక్లషష్ఠినాడుపవాసము చేసి గంధాది ఉపచారాలతో సూర్యపూజను గావించి ఆ రాత్రి ఆయన ప్రతిమ వద్దనే శయనించాలి. సప్తమినాటి ఉదయం ప్రాతఃకాలం నుండే పద్ధతిగా పూజనాచరించి ఉదారంగా బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. ఇలా ఒక యేడాది పాటు ప్రతి సప్తమినాడూ చేస్తూ, కృష్ణపక్షాలలో తదియనాడు ఏకభుక్తం, చవితినాడు నక్తవత్రం, పంచమినాట అయాచితవ్రతం - అంటే ఎవరినీ అడగకుండా వారే తమంతతాము వచ్చి అన్నం పెడితే తినడం - షష్ఠినాడు పూర్తిగా ఉపవాసము, సప్తమినాడు పారాయణ చేయాలి. తరువాత రథయాత్రను జరపాలి.

ఈ మాఘసప్తమి అత్యుత్తమతిథి. ఈ రోజు పాపహరణార్థమై సూర్యదేవుని తలచుకొని చేసే స్నాన, హోమ, దాన, పూజాది సత్కర్మలకు సాధారణ ఫలానికి వెయ్యిరెట్ల ఫలం వస్తుంది. ఈ రథయాత్రను గూర్చి విన్నా, చదివినా బ్రహ్మహత్యా పాతకం వంటి మహాపాపాలు కూడా నశిస్తాయని చెప్పి బ్రహ్మ సత్యలోకానికేగగా శివుడు కూడా తన గమ్యం వైపు బయలుదేరాడు.”

శతానీకుకుడు సూర్యభగవానునికి తమ పట్లగల అనుగ్రహాన్ని ఇలా నెమరు వేసుకున్నాడు.

“మునీంద్రా! మాపై ఆయనకు గల అనుగ్రహాన్ని ఏమని చెప్పను, ఎంతని చెప్పను? మా పితామహులగు యుధిష్ఠిరులు వారికి అక్షయపాత్రను దయచేశాడు. వారు వనంలో కూడా బ్రాహ్మణులను, ఋషులను, సంతుష్టపఱచి పుణ్యాత్ములైనారు. దేవతులు, ఋషులు, సిద్ధులు, మానవులు ఆయననారాధించి తరిస్తూనే వున్నారు. వారి ద్వారా నేనాయన మాహాత్మ్యాన్ని వింటునే వున్నాను. ఆయన ఉదయించుట వల్లనే ప్రపంచం ప్రాణవంతం, చైతన్యవంతం అవుతుంది, ఆయన చేతులనుండి బ్రహ్మ విష్ణువులు, లలాటం నుండి శివుడు ఉద్భవించారని విన్నాను. అయినా తనివి తీరలేదు. సూర్యభగవానుని ప్రసన్నం చేసుకొనే ఉత్తమమంత్ర స్తోత్ర, రహస్య విద్యా, వ్రతాదులను వినగోరుతున్నాను. ఆయన కీర్తన ద్వారా జిహ్వను ధన్యం చేసుకోవాలను కుంటున్నాను. రత్నాలకు మేరు పర్వతం, ఆశ్చర్యాలకు ఆకాశం, తీర్థాలకు గంగ ఆశ్రయమైనట్లుగానే సర్వ దేవగణాలకూ ఆశ్రయము సూర్యభగవానుడేనని కూడా విన్నాను. ఆయన యొక్క ఉపాసనను ఇంకా వినాలను కుంటున్నాను.”