భవిష్య పురాణము

139 -145 - వ్యాసమహర్షి కృత అవ్యంగ, సూర్యమండలస్థ, పురుష, యోగజ్ఞాన వర్ణన

మగులు నిత్యం ధరించే అవ్యంగాన్ని గూర్చి ఒకనాడు వ్యాసమహర్షినడిగాడు సాంబుడు. ఆయన ఇలా చెప్పాడు.

‘సాంబా! దేవతలు, ఋషులు, నాగులు, గంధర్వులు, అప్సరసలు, యక్షులు, రాక్షసులు ప్రత్యేక ఋతువులలో సూర్యరథంతో బాటు కదులుతుంటారు. ఈ రథానికి తాడుగా వాసుకి వుండేవాడు. ఒకమారు అతని కంచుకము ఊడి క్రింద పడింది. నాగరాజు శరీరము నుండి విడివిడిన ఆ కుబుసాన్ని సూర్యదేవుడు తీసి సువర్ణంతో రత్నాలతో అలంకరించి తన నడుము చుట్టూ కట్టుకున్నాడు. అందుచేత సూర్యభక్తులు తమ దేవుని ప్రసన్నుని చేసుకోవడానికి కుబుసాల్లాంటి వస్త్రాలనే కట్టుకుంటారు. దీనిని ధరించడం వల్ల భోజకులకి పవిత్రతా, సూర్యభగవానుని అనుగ్రహమూ కలిగాయి. దీనినే అవ్యంగమని వ్యవహరిస్తారు.

దీనికి కుబుసంలాగే మధ్యలో ఖాళీ వుంటుంది. మొత్తమంతా ఒకే రంగులో వుండాలి. పత్తిదారంతో రెండువందల అంగుళుల విస్తీర్ణంలో నేయబడింది. ఉత్తమ అవ్యంగమన బడుతుంది. నూట ఇరవై అంగుళులది మధ్యమం. కనిష్ఠ అవ్యంగం నూటెనిమిది అంగుళులది. ఇంతకంటె చిన్నదానిని నేయకూడదు. సూర్యారాధనలోనే జీవనం గడపదలచుకున్న వారు ఎనిమిదేళ్ళవయసులోనే యజ్ఞోపవీతం వలె దీన్ని ధరించాలి. భోజకులకిది ముఖ్య సంస్కారము. దీన్ని ధరించినవాడు అన్ని విధాల సూర్యపూజనములకూ అధికారి అవుతాడు. ఈ అవ్యంగము సూర్యదేవమయము, సర్వవేదమయము, సర్వలోకమయము, సర్వభూతమయము. దీని మూలంలో విష్ణువు, మధ్యంలో బ్రహ్మ, అంతమందు శశాంకమౌళి నివాసముంటారు. అవే స్థానాల్లో ఋగ్యజుస్సామ వేదాలుండగా ముడులలో అథర్వ వేదముంటుంది.

ఇక సూర్యునికి అర్ఘ్యమెలా ఇవ్వాలో నారదుడు చెప్పాడు. స్నానం చేసి మూడు మార్లు సువర్ణదానమిచ్చి ఆచమనం చేసి పవిత్రీ (దర్భ) ధారణము చేసి తూర్పువైపు గాని ఉత్తరం వైపు గాని తిరిగి ఆచమనం చేయాలి. రెండుమార్లు నేలను తుడిచి మూడు మార్లు అభ్యుక్షణం చెయ్యాలి. ఆచమనం చేయకుండా ఏ పనిని చేసినా అది నిష్ఫలమవుతుంది. ఆచమనం లేని మనిషి శుద్ధికాడు. ఇపుడు తలపై గుడ్డను కట్టుకొని రకరకాల పుష్పాలతో సూర్యదేవుని పూజించి వ్యాహృతి పూర్వకంగా గాయత్రిమంత్రం చదువుతూ స్వామికి గుగ్గిలధూపమివ్వాలి. మరల పుష్పాంజలి సమర్పించాలి.

రక్తచందనం, పద్మ, కరవీర, కుంకుమాదులను నీటిలో కలిపి రాగిపాత్రలో పోసి సూర్యభగవానునికి అర్ఘ్యమివ్వాలి. అర్ఘ్యపాత్రను చేతిలో నిడుకొని మోకాళ్ళ పై కూర్చుని సూర్యుని ఆవాహన చేసి మనసులో ఆయననే ధ్యానిస్తూ ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ అర్ఘ్యమివ్వాలి.

ఏహిసూర్య సహస్రాంశో తేజో రాశే జగత్పతే

అను కంపయ మాం దేవ గృహాణార్ఘ్యం దివాకర

అనంతరం ఈ ప్రార్థన చేయాలి.

అర్చితస్త్వం యథాశక్త్యా మయాభక్త్యా విభావసో।

ఐహికాముష్మికీం నాథ కార్యసిద్ధిం దదస్వమే (బ్రాహ్మ. 143-47)

మూడు కాలాలలోనూ ఇలా సూర్యారాధనను ధూప అర్ఘ్యాలతో చేసేవానికి అశ్వమేధయజ్ఞఫలం, పుత్ర, ధన ఆరోగ్యప్రాప్తీ, అంతంలో సూర్యలోక నివాస ప్రాప్తీ కలుగుతాయి. శతానీక మహరాజా! ఇక వేదవ్యాస మహర్షి శ్రీకృష్ణభగవానునికి విన్నవించిన సూర్యమండలస్థ పురుష వర్ణనను వివరిస్తాను విను.

భాస్కర భగవానునిలో మూడు కళలుంటాయి. ప్రథమ కళ అగ్నిలోనుంటుంది. అందులో అన్ని కర్మ సిద్దులూ సిద్ధిస్తాయి. రెండవ ప్రకాశిక కళ ఆకాశస్థితమై వుంటుంది. మూడవకళ సూర్యమండలంలోనే వుంటుంది. సవితాదేవుని అనగా సూర్యుని ఈ మండలం అజరము, అవ్యయము. ఈ మండలమధ్యంలో సత్, అసత్ ఆత్మకుడైన ఆ  పరమాత్మ పురుషరూపంలో వుంటాడు. ఈయనను మహాసూర్యుడంటారు. నిష్కలుడనీ, సకలుడనీ ఈయనను వ్యవహరిస్తారు. తత్త్వాలతో సహా సకల భూతాలలోనూ అవస్థితుడైవుండే పరమాత్మ కాబట్టి నిష్కలుడు. తృణ, గుల్మ, లతా, వృక్ష, సింహ, వృక, హస్తి, పక్షిదేవతా మనుష్య, జంతు, జలాది అన్నింటి అంతరాత్మలలోనూ ఆయన వ్యాప్తుడైవున్నాడు. రెండవ కళలో వృష్టి అనగా జల ప్రదానాది పనులను చేస్తాడు. మూడవ, తేజఃకళలో భక్తులకు మోక్షమిస్తాడు. దానిని పొందిన భక్తునికి పరమశాంతి ప్రాప్తిస్తుంది.

పరమాత్మ ఓంకారస్వరూపుడు. ఓంకారంలో మూడున్నర మాత్రలున్నాయి కదా! ఇందులో అర్ధమాత్రయైన మకారాన్ని జపిస్తే, ధ్యానిస్తే సదసదాత్మక జ్ఞానం లభిస్తుంది. సూర్యనారాయణ రూపం మకారం. మగ సంజ్ఞికులు ఆ ధ్యానం నుండి వచ్చినవారు. సూర్యప్రసాదమేదైనా భుజిస్తారు కాబట్టి వారిని భోజకులన్నారు.

శ్రీకృష్ణుడడిగిన మీదట వ్యాస మహర్షి యోగజ్ఞానాన్ని గూర్చి కూడా ఉపన్యసించాడు ఇలా,

ఈ శరీరమంతా ఎముకలతో, నరాలతో, చర్మంతో, రక్తమాంసాలతో నిర్మితమైనది. మలమూత్రాది దుర్గంధ యుక్త పదార్ధాలతో నిండియున్నది. ఇది సర్వరోగనిలయం. వృద్ధాప్యం, శోకం ఇందు దాగియున్నవి. వాటి సమయం రాగానే అవి పైకి వస్తాయి. రజోగుణాది సమన్వితమై అనిత్యమై భూతసంఘాలకు ఆవాసమైయున్నదిది. కాబట్టి ఇందు ఆసక్తిని సర్వథా పరిత్యజించాలి.

వృక్షాల క్రింద నివసించడం, భోజనానికై మట్టితో చేయబడిన భిక్షాపాత్రను మాత్రమే ఉంచుకోవడం, సాధారణ వస్త్రాలను ధరించడం, ఎవరి సహాయాన్నీ యాచించకుండా, పొందకుండా సర్వభూతాలపై సమభావాన్ని వహించియుండడం ఇవి జీవన్ముక్తుని లక్షణాలు.

తిలలలో అంటే నూనె గింజలలో నూనె, ఆవులో పాలు, కర్రలో అగ్ని ఉన్నట్టుగానే సమస్త

తిలే తైలం గవి క్షీరంకాష్ఠే పావక సంతతిః ।

ఉపాయం చింతయే దస్యధియా ధీరః సమాహితః

ప్రమాథి చప్రయత్నేనమనః సంయమ్య చంచలం

బుద్ధీంద్రియాణి సంయమ్యశకునానివ పంజరే (బ్రాహ్మ 145 - 5,6)

తిలలలో అంటే నూనె గింజలలో నూనె, ఆవులో పాలు, కర్రలో అగ్ని ఉన్నట్టుగానే సమస్త ప్రాణులలో పరమాత్మ ఉంటాడు. దీనినర్థంచేసుకొని లోకంలో నుండి పరమాత్మను పొందడమెలాగో ఆలోచించాలి. చంచలమైన మనస్సును ముందు అదుపులో పెట్టుకొని ఇంద్రియాలను పంజరంలో పక్షులను వలె బంధించి వుంచాలి. ఈ సంయమనం వల్ల శరీరం అమృతప్రాయమవుతుంది. ఒక విధమైన తృప్తి కలుగుతుంది. ప్రాణాయామం ద్వారా శారీరక దోషాలను, ధారణద్వారా సంచిత ప్రారబ్ధ పాపాలను, ప్రత్యాహారం ద్వారా సంసర్గజనిత దోషాలను, ధ్యానంతో జీవ సంబంధ దోషాలను వదిలించుకోవాలి. అపుడు ఈశ్వరీయగుణాలు ప్రాప్తించవచ్చు. అగ్నితాపంలో ధాతు దోషాలు దగ్ధమైనట్లు ప్రాణాయామం ద్వారా సాధకుని ఇంద్రియ జనిత దోషాలు దగ్ధమైపోతాయి. ఒక చేతితో మరొక చేతిని తోమి కడుక్కుని శుభ్రం చేసుకున్నట్లు శుద్ధబుద్ధి ద్వారా చిత్తాన్ని శుద్ధం చేసుకొని పవిత్ర భావనల ద్వారా చెడు అలవాట్లను దూరం చేసుకొని సర్వవిధాలా తనను తాను అత్యంత పవిత్రస్థాయికి చేర్చుకోవాలి. చిత్త శుద్ధి యేర్పడిన తరువాత శుభ, అశుభ కర్మలు వేరైపోతాయి. సాధకుడు రెండిటినుండీ వేరుపడి నిర్ద్వంద్వ, నిర్మమ, నిష్పరిగ్రహ, నిరహంకార వ్యక్తియై మోక్షమును పొందుతాడు.

సూర్యుడు పూర్వాహ్నంలో రక్తవర్ణుడై, ఋగ్వేదస్వరూపుడై, రాజసమూర్తియై ఉంటాడు. మధ్యాహ్నం శ్వేతవర్ణం, యజుర్వేద స్వరూపం, సాత్త్విక మూర్తి, సాయంకాలం కృష్ణవర్ణం, సామవేద స్వరూపం, తామసమూర్తి ఆయనకుంటాయి. ఈ మూటికీ భిన్నమైన తేజస్స్వరూపం, జ్యోతి స్స్వరూపం, సూక్ష్మ మరియు నిరంజన స్వరూపం ఆయన చతుర్థరూపమై యున్నది.

సాధకుడు పద్మాసనం వేసి సుషుమ్న నాడీమార్గంలో చిత్తాన్ని స్థిరం చేసి, ఓంకారంతో కుంభక, రేచక ప్రాణాయామ పద్ధతులలో కాలివ్రేళ్ళనుండి మస్తకం దాకా న్యాసం చేయాలి. నాభిలో అగ్నిని, హృదయంలో చంద్రుని, మస్తకంలో అగ్నిశిఖనీ న్యాసం చేసుకోవాలి. ఇది చతుర్థస్థానం. మోక్షాన్ని కోరుకునేవాడు ఈ స్థానాన్ని తప్పక తెలుసుకొని వుండాలి. ఋషిగణాలు సూర్యభగవానుని యొక్క తురీయ అంటే ఈ అత్యుత్తమ, అత్యున్నత స్థానాన్ని చేరుకొని అందులో సర్వస్వాన్నీలీనం చేసుకొని ముక్తులవుతారు.’ అని వినిపించి వ్యాసమునీంద్రుడు బదరికాశ్రమం వైపు వెళ్ళిపోయాడు.”