18-19 - ఏకాహయజ్ఞం, మహాశక్తి కాళీ ప్రతిష్ఠ

మునులారా! కలియుగంలో పెద్దగా స్తోమతులేని వ్యక్తి దేవతాదులు ప్రతిష్ఠను ఒక రోజులో కూడా పూర్తి చేయవచ్చు. ఏరోజు ప్రతిష్ఠచేయదలచుకున్నాడో ఆరోజే బ్రాహ్మణుడాతనిచే ఘృతాధివాసం చేయించవచ్చు. ఉత్తరాయణంలో శరత్కాలం అయిపోయాక వసంతర్తువులో యజ్ఞాలను ప్రారంభించాలి. నారాయణాది మూర్తులలో ముప్పది రెండు తేడాలుంటాయి. గజాననాది దేవతల ప్రతిష్ఠ విహితకాలంలో చేయాలి. ప్రతి నిత్యక్రియలను ఆపి, బ్రాహ్మణలకు భోజనాలు పెట్టి యజ్ఞ గృహంలో ప్రవేశించాలి. వేదిపై విష్ణుభగవానుని కుటుంబసమేతంగా ప్రతిష్ఠించి, ఆయనకు విభిన్న తీర్థ, సముద్ర, నదీజలాలు, పంచామృతాలు, పంచగవ్యాలు, సప్తమృత్తికాల మిశ్రిత జలం, తైలం, కషాయ ద్రవ్యాలు, పూలనీరులతో స్నానం చేయించాలి. తులసి, మామిడి, శమీ, కమల, గన్నేరు, పత్ర, పుష్పాలతో ఆయనను అర్చించాలి. తరువాత మూర్తిలో ప్రాణప్రతిష్ఠ చేయాలి. విధిపూర్వకంగా హవనం చేసి, బ్రాహ్మణులను దక్షిణలతో సంతుష్టిపఱచి పూర్ణాహుతి నిచ్చెయ్యాలి.

కాళిక వంటి మహాశక్తుల ప్రతిష్ఠలోముందురోజు దేవి ప్రతిమను అధివాసనం చేసి ఆభ్యుదయక శ్రాద్ధాన్ని చేయాలి. అమ్మవారి ప్రతిమకు కమలయుక్తజలంతో పంచగవ్యాలతో స్నానంచేయించాలి. కుంభం పై దుర్గాదేవిని అర్చించాలి. తరువాత ఆ మూర్తికి ప్రాణప్రతిష్ఠ చేయాలి. బిల్వ పత్రాలతో ఫలాలతో నూరు ఆహుతులివ్వాలి. దక్షిణగా సువర్ణాన్నివ్వాలి. కాళికా, తారాదేవి ప్రతిమలను వేర్వేరుగా అర్చించాలి. దుర్గమ్మకు నానా ప్రకారాల సుగంధ ద్రవ్యాలతో మూడురోజులపాటు స్నానంచేయించాలి. కన్యలచేత సుగంధ జలాలతో స్నానంచేయించాలి. ఎనిమిదవ రోజు రాత్రి విశేషపూజలనొనరించి పాయస హోమం చేయాలి.

ఆగమానుసారం శివలింగప్రతిష్ఠలో ముగ్గురు బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. విశేషంగా, భగవానుని ప్రతిమను అధివాసనం చేయించాలి. నిత్యక్రియనూ ఆభ్యుదయక శ్రాద్ధాన్నీ చేయాలి. రెండవరోజు పొద్దున్నే ఆచార్యుని ఎంపిక చేసుకోవాలి. పద్ధతి ప్రకారం ప్రతిమకు స్నానం చేయించి, ప్రతి, తన కుటుంబంతో కలిసి శివలింగార్చన గావించాలి. శాస్త్రానుసారము గోవునుగాని, బంగారంతోనో, మైనంతోనో చేసిన ఆవు బొమ్మను గాని దానం చెయ్యాలి. హవనం పూర్తయినాక శుద్ధమైన నేతి ద్వారా వసుధారా ప్రదానం గావించాలి. ఇలాగే, సూర్య, గణేశ, బ్రహ్మాది ప్రతిమలనూ ప్రతిష్ఠించవచ్చును. ఇదే విధంగా వారాహి, త్రిపురాదేవి, భువనేశ్వరి, మహామాయ, అంబిక, కామాక్షి, ఇంద్రాక్షి, అపరాజితాది మహాశక్తిస్వరూపాల ప్రతిష్ఠకూడా చేయవచ్చును. రాత్రి జాగరణ చేసి గొప్ప ఉత్సవాన్ని చేయించాలి. దేవి ప్రతిష్ఠలో కుమారీ పూజనూ చేయాలి.