భవిష్య పురాణము

105-106 - కామదా, పాపనాశినీ సప్తమి వ్రతం

విష్ణుదేవా! ఫాల్గుణ శుద్ధసప్తమినాడు ఉపవాసం చేసి సూర్యదేవునికి విధివిధాన యుక్తంగా పూజ చేయాలి. ఆ తరువాతి రోజు అష్టమినాడు ప్రాతర్వేళనే లేచి స్నానాదికములు ముగించుకొని మరల సూర్యనారాయణుని పూజించి బ్రాహ్మణులకు దక్షిణ లివ్వాలి. శ్రద్ధాపూర్వకంగా సూర్యనిమిత్తమై ఆహుతులనిచ్చి భాస్కరునికి ప్రమాణం చేసి ఈ విధంగా ప్రార్థన చేయాలి.

యమారాధ్య పురాదేవీ సావిత్రీకామనాయవై

సమే దదాతు దేవేశః సర్వాన్‌కామన్ విభావసుః II

యమారాధ్యా దితిః ప్రాప్తా సర్వాన్ కామాన్ యథోప్సితాన్

సదాదాత్వఖిలాన్ కామాన్ ప్రసన్నో మే దివస్పతిః

భ్రష్ఠ రాజ్యశ్చ దేవేంద్రో యమభ్యర్చ్య దివస్పతిః

కామాన్ సంప్రాప్తవాన్ రాజ్యం సమేకామం ప్రయచ్ఛతు (బ్రాహ్మ. 105/5 - 7)

ప్రాచీన కాలంలో సావిత్రీదేవి తన భర్త ప్రాణాలకై వెళుతూ ఎవరిని శరణువేడిందో ఆ స్వామి నా అన్ని కోరికలనూ తీర్చాలి గాక. అలాగే అదితినీ, దుర్వాసశాపము నుండి ఇంద్రుని కాపాడిన దివస్పతి సూర్యదేవుడు నన్ను కాపాడాలిగాక - అని దీని భావం.

హే గరుడధ్వజా! ఈ విధంగా ఆయన ప్రార్థనతో ఈ పూజ సంపన్నమవుతుంది. అనంతరం సంయమనంతో నుండి హవిష్యాన్నమును తినాలి. ఫాల్గున, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠమాసాల్లో పారణ ఇదే పద్ధతిలో చేయాలి. భక్తిపూర్వకంగా ఈ నాలుగు నెలలూ కరవీర పుష్పాలతో సూర్యదేవుని పూజించాలి. ఆవుకొమ్మును తడిపిన నీళ్ళను నోటిలో పోసుకొని ముతకచక్కెర కలిపి ఉడికించిన బియ్యాన్ని నైవేద్యమిచ్చి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి.

ఆషాఢాది నాలుగు మాసాలకీ పారణక్రియ ఇలా వుండాలి. ఈ నెలల్లో మల్లెపూలు, గుగ్గిల ధూపం, నూతి నీరు, పాయస నైవేద్యములతో పూజించాలి. ప్రతినెలలోనూ బ్రాహ్మణులకు దక్షిణలివ్వాలి. ప్రతి పారణలో సూర్యదేవుని భక్తిపూర్వకంగా ధ్యానిస్తూ, కూడబెట్టిన ధనంలోంచి తీసి దానాలిస్తుండాలి.

పీనాసితనమంటే పరమనీచ గుణం. అదున్నచోట సూర్యుడుండడు. పారణం తరువాత జలము మున్నగు వాటితో స్నానం చేయించినచో సూర్యదేవుడు సుప్రసన్నుడై ఇక తప్పించుకోవడానికి ప్రయత్నం కూడా చేయను అంటున్నట్లు కనిపించి మన మనస్సులోని కోరికలన్నింటినీ తీరుస్తాడు. పాపాలన్నింటినీ నశింపజేస్తాడు. దేహాంతంలో బంగారు విమానాన్నెక్కించి తనలోకానికి గొనిపోతాడు. మరల భూమిపైకి పంపినపుడు మహారాజ జన్మనిస్తాడు.