భవిష్య పురాణము

133 - మందిర నిర్మాణం

నారదుడు సాంబడు స్మరించగానే వచ్చి మందిరనిర్మాణం ఎలా గావించాలో చెప్పాడు. సూర్యమందిరమెప్పుడూ తూర్పుముఖమై వుండాలి. ముఖ్యమందిరంలో స్వామి, స్నానగృహం దక్షిణంవైపూ, యజ్ఞశాల ఉత్తరం వైపూ ఉండాలి. (ఇతర దేవతలలో ఎవరినెక్కడ స్థాపించాలో ఇదివరకే చెప్పబడింది.) సూర్యనారాయణునికి సమీపంలోనే ఉచితస్థానంపై పురాణ ప్రవచనానికి ఏర్పాట్లుండాలి. ప్రాసాదాలలో గృహరాజ, సర్వతోభద్రాలంటే స్వామికి ప్రీతి.

నక్షత్ర, గ్రహాల అనుకూలత, శుభశకునాలు చూసుకొని కాష్ఠగ్రహణం అంటే కర్ర కోసం బయలుదేరాలి.

ఈ క్రింది చెట్లు దేవాలయానికి పనికిరావు. పాలుగారేవి, బలహీనమైనవి, కూడళ్ళలో దేవస్థానాల్లో, పుట్టలమధ్యలో, చైత్యాల్లో, స్మశానాల్లో, ఆశ్రమాల్లో పెరిగేవి, పిల్లలు లేని వారు పెంచుతున్నవి. అనేక పక్షిజాతులకాశ్రయమిచ్చేవి, శస్త్ర, వాయు, అగ్ని, విద్యుత్, గజదూషితాలు, రెండు మూడే కొమ్మలున్నవి. పై భాగం ఎండిపోయినవి ప్రతిమను చేయడానికి పనికిరావు. తమంత తామే పడిపోయినవి, ఏనుగులచే పెకిలింపబడినవి, శుష్కించి కొంతమేర అగ్నికి ఆహుతైనవి, అసలు పక్షులు లేనివి కూడా పనికి రావు.

వృక్షానికి పూజ చేసి గాయత్రిమంత్రాభిమంత్రిత జలంతో ప్రోక్షణం చేసి రెండు ఉజ్జ్వల వస్త్రాలను ధరించి గంధమాల్యాలతో వృక్షాన్ని పూజించి దానికెదురుగా కుశాసనంపై కూర్చొని దేవదారు సమిధలతో అగ్నిలో ఆహుతులిచ్చి నమస్కారం చేసి ఇలా ప్రార్థించాలి.

ఓం ప్రజాపతయే సత్య సదాయ నిత్యం

శ్రేష్ఠాంతరాత్మన్ సచరాచరాత్మన్

సాం నిధ్య మస్మిన్ కురు దేవ వృక్షే

సూర్యావృతం మండల మావిశేశ్చ నమః

ఈ విధంగా ప్రజాపతి సమానమైన వృక్షానికి నమస్కరిస్తూ దానికి సాన్నిధ్యం ప్రసాదించుమని దేవుని కూడా ప్రార్థించాలి. వృక్షానికి మోక్షాన్నివ్వబోయే గొడ్డలిని కూడా వృక్షమూలంలో పెట్టి పూలతో ధూపంతో పూజించాలి. ఆవృక్షంపై జీవించే ప్రాణులకు కూడా నమస్కరించాలి.

ప్రభాతకాలంలో బ్రాహ్మణులకు భోజకులకు దక్షిణలిచ్చి విశేషజ్ఞులు స్వస్తి వాక్యాలు చదువుతుండగా చెట్టును కొట్టాలి. తూర్పు- ఈశాన్య, ఉత్తరం దిక్కులవైపు చెట్టు పడితే శుభం.

ఇక్కడ నారదుడు అందరు దేవతల ప్రతిమలూ ఎలా వుండాలో చెప్పాడు. ఒక జాన (హస్తం) రెండు, మూడు లేదా మూడున్నర జానల దాకా సూర్యుని ప్రతిమ వుండవచ్చు. ఇది దేవాలయ ద్వారం ఎత్తును బట్టి వుండాలి. ఒక జాన ప్రతిమ సౌమ్యంగా వుంటుంది. రెండైతే ధనధాన్యాలిస్తుంది, మూడైతే సర్వకార్యసిద్ధిని చేకూరుస్తుంది. మూడున్నర జానల పొడవున్న ప్రతిమయైతే దేశంలో సుభిక్షత, ఆరోగ్యం, శుభం కలిగేలా చూస్తుంది. దేవాలయ ద్వారవిస్తీర్ణంలో ఎనిమిదవవంతు ప్రతిమ విస్తీర్ణం వుండేలా నిర్మించాలి.

సూర్యభగవానుని ప్రతిమ విశాలనేత్రాలతో, కమలసమాన ముఖంతో, రక్తవర్ణములై బింబసమానములై సుందరములైన పెదవులతో, రత్నజటిత ముకుటాలంకృతమైన మస్తకంతో, మణికుండల కటక, అంగద, హారాది అలంకారాలతో సుశోభితమై అవ్యంగ అభ్యంగధారణతో, చేతిలో వికసిత కమలంతో మెడలో సువర్ణమాలతో అతిశయ సుందరంగా అన్ని శుభలక్షణాలతో విరాజిల్లేలా నిర్మింపబడాలి.

బ్రహ్మదేవుని మూర్తికి చేతిలో కమండలువుండాలి. కింద కమలాసనముండాలి. నాలుగు ముఖాలూ సంయుక్తంగా వుండాలి. కార్తికేయమూర్తి కుమార స్వరూపంలో, చేతిలో శక్తి ఆయుధంతో కడు సుందరంగా వుండాలి. ఈయన ధ్వజం మయూరమండితమై వుండాలి. ఇంద్ర ప్రతిమ ఐరావతంపై నుండాలి. ఈ ఐరావతం తెల్లగానూ, నాలుగు స్వచ్ఛమై, కనులు మిరుమిట్లు గొలిపే దంతాలతో వుండాలి. ఇంద్రుని చేతిలో వజ్రాయుధ ముండాలి

సూర్యభగవానుని ప్రతిమను ఈశాన్యంలో నాలుగుతోరణాలు, చిగురుటాకులు, పుష్పమాల, పతాకాదులతో అలంకరించి మండపంపై అధివసింపచేయాలి. కర్రతో చేయబడిన సూర్యప్రతిమ శ్రీ, విజయ, బల, యశ, ఆయు, ధనాలను ప్రదానం చేస్తుంది. మట్టితోనైతే ప్రజాకళ్యాణాన్ని, మణిమయమైతే లోకకళ్యాణ, సుభిక్షత్వాన్ని, బంగారందైతే పుష్టినీ, వెండిదైతే కీర్తినీ, రాగిదైతే ప్రజావృద్ధినీ, రాతిదైతే విపులభూమినీ ఇస్తుంది. ఇనుము, గాజు, తగరాలతో నైతే మాత్రం అనిష్టప్రాప్తి వుంది. కాబట్టి ఈ ధాతువులతో సూర్యప్రతిమను చేయరాదు. సాంబడు అడిగిన మీదట నారదుడిలా సూర్యదేవమయత్వాన్నీ చెప్పసాగాడు.