భవిష్య పురాణము

188 -189 - పంచ మహాయజ్ఞాలు, అతిథి, సౌరధర్మదానం, పాత్రాపాత్రాలు - పంచమహాపాతకాలు

                        (ఇవి తొమ్మిదవ అధ్యాయములో వర్ణింపబడ్డాయి.)

            అరుణా! సూర్యునికి గానీ అగ్నికి గానీ గురువుకి గానీ బ్రాహ్మణునికి గానీ నైవేద్యం పెట్టకుండా భక్షించేవాడు పాపాన్ని భక్షిస్తున్నట్టే. గృహస్థు చేతివెంట కృషికార్యంలో గానీ, వాణిజ్యంలోగానీ, కోపంవల్లగానీ, అసత్యాది ఆచరణలో గానీ పంచసూనాలవల్ల గానీ పాపం, హింస జరుగుతాయి. (వండినప్పటి హింసలో దోషాలు పంచసూనాలు, పొయ్యి, తిరగలి, కల్వం, నీటికడవ, చీపురుల వల్ల ఇవి కలుగుతాయి.) సూర్యుని (అంటే నన్ను), అగ్నినీ, గురువునీ, అతిథినీ ఇతరులనూ సేవించే మార్గమైన పంచ మహాయజ్ఞాల వల్ల ఈ దోషాలూ పాపాలూ మాసిపోతాయి.

            ఓ ఖగవీరా! నన్ను దర్శించినంత మాత్రంచే ఏ వ్యక్తికైనా గంగాస్నాన ఫలం దక్కుతుంది. నాకు ప్రణామం చేస్తే సర్వ తీర్థాలనూ సేవించిన పుణ్యం ప్రాప్తిస్తుంది, అన్ని పాపాలూ నశిస్తాయి. సందెలలో నా సేవ చేసుకొనేవారికి నా లోకంలో ప్రవేశ ప్రతిష్ఠలు కలుగుతాయి. ఒక్కమారు భక్తితో నా ఆరాధనను చేసినా త్రిమూర్తులను, పితృదేవతలను, ఇతర దేవతలను ఒకేమారు పూజించినట్లు కాగా వారు సంతుష్టులౌతారు.

            శ్రాద్ధాలు పెట్టినప్పుడు నన్నూ, సౌరభక్తుల్నీ పూజిస్తే పితృదేవతలు మరింత సంతుష్టులౌతారు. పురాణవేత్త వస్తుండగా చూస్తే ఔషధాలన్నీ తమకు స్వర్గప్రాప్తి కలిగిందని, కలగబోతోందని ఆనందంతో నృత్యం చేస్తాయి. అతిథిరూపంలో పితృగణాలవారూ, దేవగణాలవారూ తమకు అప్పటికే అనుగ్రహం గల గృహస్థు ఇంటికి చివరి పరీక్ష పెట్టడానికి వస్తారు. అందుకే అతిథి తన తలవాకిట కనబడగానే గృహస్థు చేతులు జోడించి ఎదురేగి స్వాగతం చెప్పాలి. పాద్యం, ఆసనం, అర్ఘ్యం, స్నానం, అన్నాదులతో అర్చించి సేవించాలి. అతిథిరూప సంపన్నుడైనా, కురూపియైనా, మలిన వస్త్రధారియైనా, స్వచ్ఛాంబరధారియైనా, పండితుడైనా, పామరుడైనా, నిఖిలాగమవేత్తయైనా, నిరక్షరకుక్షియైనా, వానినే దేవునిగా భావించి ఆదరించాలి.

            దానం సత్పాత్రునికే ఇవ్వాలి. పచ్చి మట్టి కుండలో పోసిన ద్రవ, జలాదులేలా పాడైపోతాయో, చవిటినేలలో నాటిన విత్తనమేలా వ్యర్థమైపోతుందో, బూడిదలో చేసే హవనం, వేసే హవన పదార్థాలూ ఎలా నిష్ఫలమైపోతాయో అలాగే అపాత్రదానం అతి పెద్ద దండగ.

            కరుణ కలిగిన చోట శ్రద్ధగా చేసే దానం ఉత్తమం. అంధ, కృపణ, బాల, వృద్ధ, ఆతుర శ్రేణులకిచ్చే దానానికి అనంతమైన విచిత్రఫలం వుంటుంది. ఇచ్చేవానికీ పుచ్చుకొనేవారికీ కూడా స్వర్గప్రాప్తి కలుగుతుంది. సాధుపురుషులు దానాన్ని యాచించడం గానీ స్వీకరించడంగానీ తమ కోసం అంటే స్వార్థం కోసం చెయ్యరు. ఈ దానం దాతకు ఎక్కువ ఫలాన్నిస్తుంది. ప్రతి యింటికీపోయి, స్వార్థం కోసం యాచించేవాడు పూజ్యుడు కాడు. అయినా దాత ఆ అంశాన్ని పట్టించుకోకూడదు. యాచనకు వచ్చిన వాని విషయంలో పాత్రతను పట్టించుకోకూడదు. ఉన్నదేదో ఇవ్వడమే. అంతే.

            యాచకునికి స్వాగతం చెప్పాలి. కోపించి, దుర్భాషలాడి, విసుక్కొని చేయుదానానికి ఫలముండదు. ప్రేమతో ఇచ్చేది ఎంత తక్కువైనా శ్రేష్ఠమే. సత్కారపూర్వకంగా చేసే దానానికి అనంత ఫలాలుంటాయి. ప్రియ, మధురవచన సహితంగా చేసే దానం కల్యాణకారి కాగలదు. దానము, ప్రదానము, నియమం, యజ్ఞం, ధ్యానం, హవనం, తపం - ఇవన్నీ కూడా క్రోధంతో చేస్తే నిష్ఫలాలైపోతాయి. ఉదారత, స్వాగతం, మైత్రి, అనుకంప (దయ), అమత్సర (శాంతం) - ఈ ఐదు అంశాలతో కూడిన దానం గొప్పదైన, అనంతమైన ఫలాన్నిస్తుంది.

            హే ఖగశ్రేష్ఠా! వారాణసి (వారణాసి అనుట దోషము) ప్రయాగ, పుష్కరస్థలి, గంగ, సముద్రతటం, నైమిషారణ్యం (నైమిశా... దోషం) మహాపుణ్య, మూలస్థాన, ముండీరస్వామి (కోణార్క) కాలప్రియ, క్షీరికావాస - ఈ క్షేత్రస్థానాలు దేవసేవితాలు, పితరసేవితాలు. నన్ను చూడడానికి, సేవచేయడానికీ దేవతలూ, పితృదేవతలూ అక్కడికి వస్తారు. అన్ని సూర్యాశ్రమాలూ, పర్వతం నుండి జారిపడు అన్ని నదులూ, ఆవులు, సిద్ధులచే మునులచే ప్రతిష్ఠింపబడిన స్థానాలన్నీ పుణ్యక్షేత్రాలుగా చెప్పబడుతున్నాయి. సూర్యమందిర యుక్తమైన పుణ్యక్షేత్రంలో నుండు వారిలో ఎవరికైనా చేసెడి అతిస్వల్ప దానం కూడా ఆ క్షేత్రప్రభావం చేత అనంత ఫలదాయకమౌతుంది. సూర్యగ్రహణ, చంద్రగ్రహణ, ఉత్తరాయణ విషువ వ్యతీపాత, సంక్రాంతి - ఇవి పుణ్యకాలాలుగా చెప్పబడుతున్నాయి. భక్తిభావం, పరమప్రీతి, ధర్మం, ధర్మభావన, ప్రతిపత్తి - ఈ ఐదూ శ్రద్ధకు పర్యాయాలు. శ్రద్ధాపూర్వక విధానంతో సుపాత్రునికి ఇయ్యబడిన దానం ఉత్తమం, అనంత ఫలప్రదం, అక్షయ పుణ్యదాయకం. ఆర్తులు, దీనులు, గుణవంతులు నగువారికి చేయు స్వల్పదానమైనా అనంత ఫలాలనిస్తుంది. అన్ని కోరికలనూ తీరుస్తుంది. శ్రేష్ఠలోక ప్రాప్తిని కలుగజేస్తుంది. శ్రద్ధ ముఖ్యం. శ్రద్ధయే దానము, శ్రద్ధయే పరమతపము, శ్రద్ధయే యజ్ఞము, శ్రద్ధయే పరమోపవాసము. అహింస, క్షమ, సత్యం, నమ్రత, శ్రద్ధ, ఇంద్రియనిగ్రహం, దానం, యజ్ఞం, తపం, ధ్యానం పదీ ధర్మసాధనాలు.

            పరస్త్రీనీ, పరులధనాన్నీ అపేక్షించేవారు, గురువునీ, ఆర్తులనీ, అశక్తులనీ, శత్రువుచే పరాభవింపబడిన వానినీ కష్టపెట్టి మరింత హింసించువారు పాపకర్ములనబడతారు. అటువంటి వారిని పరిత్యజించాలి. కాని, పాపకర్ముని భార్యను, పుత్ర, మిత్ర సందోహాన్నీ అవమానించరాదు. వారిని అవమానించుట గురునిందతో సమానమైన పాపంగా పరిగణించబడుతుంది. బ్రాహ్మణులను హింసించువాడు, మద్యమును సేవించువాడు (తాగుబోతు) స్వర్ణచోరుడు, గురువుగారి మంచం మీద పడుకొనేవాడు, ఇలాటివాడి సంగాతకాడూ - పంచ మహాపాతకులు. క్రోధ, ద్వేష, భయ, లోభాలచే ఆవేశించబడిపోయి బ్రాహ్మణులను అవమానించేవాడు బ్రహ్మహత్య చేసినట్లే భావింపబడతాడు. యాచకులనూ, బ్రాహ్మణులనూ రావించి ‘నా దగ్గరేమీ లేదు’ అంటూ గోల పెట్టి ఏమీ ఇవ్వకుండానే తిరగగొట్టువాడు చండాలుడితో సమానుడు. దేవతల, ద్విజులు, గోవుల భూమిని అపహరించువాడు బ్రహ్మఘాతకుడే. ఏ మూర్ఖుడైతే సౌరజ్ఞానాన్ని పొంది, పరిత్యజిస్తాడో, అంటే ఆ నియమాలేవీ పాటించడో వాడిని తాగుబోతుని చుట్టుకొనే పాపమే పట్టుకొంటుంది. అగ్నిహోత్రాన్నీ తల్లిదండ్రులనూ వదిలేసినవాడూ, కుకర్మలకు సాక్షిగా వుండేవాడూ, మిత్రహంతకుడూ, పంచయజ్ఞాలు చేయనివాడూ, అభక్ష్యభక్షకుడూ, నిరపరాధులైన ప్రాణులను కొట్టి బాధించేవాడూ ఎన్ని ధర్మసాధనలను రాజ్యంకోసం చేసినా వానికి ఆధిపత్యం సిద్ధించదు. పాపఫలం తగ్గదు. సర్వజగత్పతినైన నా ఆరాధన ద్వారానే ఆత్మలోకాధిపత్యం అలువడుతుంది. భోగియైనవాడు ముందా భోగాసక్తిని వీడి నన్ను పూజించాలి. విరక్తుడికి, శాంత చిత్తుడికీ నా సూర్యసంబంధిత లోకాలన్నిటి ద్వారాలనూ తెఱిచి వుంచుతాను.