9-11 - వట, బిల్వ, పూగీ ఫలాది వృక్షయుక్త ఉద్యానప్రతిష్ఠ

            (పూగీ = పోక)

బ్రాహ్మణులారా! వటవృక్షప్రతిష్ఠను చేసేటపుడు చెట్టుకి దక్షిణదిశలో దాని మూలానికి దగ్గరలో మూడు జానల జాగాలో వేదినొకదానిని నిర్మించి దానిపై మూడు కలశలనుంచాలి. వాటిపై క్రమంగా గణేశునీ, శివునీ, విష్ణువునీ పూజించి ‘చరు’ అనగా హోమయోగ్యమైన పక్వాన్నంతో హోమం చేయాలి. మఱ్ఱి (మొక్క) కి మూడింతలు ఎఱ్ఱని దారాన్ని పవిత్రీకరించి మ్రానుకి చుట్టాలి. యవలనూ క్షీరాన్ని బలిగా ఇవ్వాలి. యూప స్తంభాన్ని ఆరోపితం చేసుకోవచ్చు. వటవృక్షమూలంలో యక్ష, నాగ, సిద్ధ, గంధర్వ, మరుద్గణాలకు పూజ చేయాలి.

బిల్వవృక్ష ప్రతిష్ఠలో ముందురోజు మొక్కను పవిత్రస్థలంలో గోలెంలో వుంచి మరునాడు త్ర్యంబకం.. (యజు. 3/60) అనే మంత్రం పఠిస్తూ పవిత్రస్థానంలో స్థాపితం చేయాలి. సునావమా.. (యజు. 21/7) మంత్రం చదువుతూ దానికి గంధపు నీటితో స్నానం చేయించాలి. మే గృహ్ణామి.. అనే మంత్రం చదివి మొక్కపై అక్షతలు జల్లాలి. కయానశ్చిత్ర.. (యజు. 27/39) అనే మంత్రంతో ధూపాన్నీ, వస్త్రాలనూ, మాలలనూ వేయాలి. తరువాత రుద్ర, విష్ణు, దుర్గ, ధనేశ్వరులను పూజించాలి. మరునాడు తెల్లారక ముందే లేచి శాస్త్రానుసారము నిత్యక్రియలను పూర్తి చేసుకొని ఇంటిలో ఏడు బ్రాహ్మణ జంటలకు భోజనాలు పెట్టాలి. తరువాత బిల్వం యొక్క మూలప్రదేశంలో రెండు జానల గుండ్రటి వేదిని నిర్మించి దానిని రంగులతో సుందర పుష్పాలతో అలంకరించి దానిపై అష్టదళకమలాన్ని రచించాలి. మొక్కను ఎఱ్ఱటి దారంతో అయిదు, ఏడు లేదా తొమ్మిదిచుట్లు చుట్టాలి. మూలంలో ఉత్తరం వైపు తిరిగి కూర్చుని ధాన్యం జల్లి త్రిమూర్తులనూ, గణేశ, శేష, అనంత, ఇంద్ర, వనపాల, సోమ, సూర్య, పృథ్వి వీరికి క్రమంగా పూజలు చేయాలి. తిలలు, అక్షతలతో హవనంచేసి నేతి పిండివంటకాన్ని నైవేద్యం పెట్టాలి. యక్షుల కోసం ఉడదము (ఒకరకమైన పప్పుధాన్యము) నూ, పిండి వంటకాన్నీ, గ్రహాల తృప్తికోసం దానినే వెదురు పాత్రలో పెట్టి నైవేద్యం పెట్టాలి. బిల్వ వృక్ష దక్షిణ దిశనుండి పాలను ధారగా పోసి ప్రదానంచేయాలి. యూపాన్ని ఆరోపించుకొని, వృక్షానికి కర్ణభేదనం చేసి, సూర్యభగవానునికి అర్ఘ్యమివ్వాలి.

వంద హస్తాల పొడవు వెడల్పులున్న తోట యొక్క ప్రతిష్ఠకైతే, అందులో పోక (పూగీఫల) మామిడి వంటి వృక్షాలుంటే, అపుడు వాస్తు మండలాన్ని రచించి వాస్తుమున్నగు దేవతలకు పూజలుచేసి యజనకర్మలను నిర్వహించాలి. విశేషించి విష్ణు, ప్రజాపతి మున్నగు దేవతలను పూజించాలి. హవనం చివర్లో బ్రాహ్మణులకు దక్షిణలివ్వాలి.