భవిష్య పురాణము

104 - త్రివర్గ సప్తమీ మహిమ

విష్ణుదేవా! కోరికలతో గాని, నిష్కాములై గాని ఉపవాస వ్రతాలను కొన్నిటిని చేసి సూర్యభగవానుని దరికి జేరే కొన్ని వ్రతాలున్నాయి. విన్నవిస్తాను.

ఫాల్గున శుక్ల సప్తమినాడు భక్తిపూర్వకంగా మరల మరల హేలినామక సూర్యదేవుని జపం, పూజనం చేసేవారికి సూర్యలోకప్రాప్తి కలుగుతుంది. దేవపూజనం ద్వారా పవిత్రులై నూటయెనిమిది మార్లు జపం చేయాలి. స్నానం చేస్తున్నా, నడుస్తున్నా కూర్చొనియున్నా, లేస్తున్నా - అంటే అన్నివేళలా సూర్యనామోచ్చరణను చేస్తుండాలి. ఉపవాసం చేస్తున్నపుడు కఠినహృదయులతో, అన్యాయపరులతో, ఇతర రాక్షసగణాలతో మాట్లాడరాదు. శ్రద్ధాపూర్వకంగా, సూర్యదేవునిపైననే మనస్సును ఏకాగ్రం చేసి పూజచేస్తూ ఈ శ్లోకాన్ని పఠించాలి.

హంస హంస కృపాలుస్త్వమగతీనాం గతిర్భవ

సంసారార్ణవ మగ్నానాం త్రాతా భవ దివాకరా (బ్రాహ్మ 104/4)

హే పరమహంస స్వరూపా!

సూర్యభగవాన్! తమరు దయాళువు. గతిహీనులకు సద్గతిని ప్రాప్తింపజేసే దైవము. సంసారసాగరంలో నిమగ్నులై బాధలు చెందుతున్న వారికి తమరే రక్షకులు అని శ్లోకభావము.

ఈ రకంగా ఉపవాసం చేసి ఏకాగ్ర చిత్తంతో ఆయనను పూజించాలి. పూర్వాహ్ణకాలంలోనే స్నానం చేసి పూజ చేసిన తరువాత ఈ ‘హంసహంస’ శ్లోకాన్ని జపించి భగవంతుడైన సూర్యుని పాదాలపై మూడుమార్లు జలధారను అర్పితం చేయాలి. ఇలా చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ సప్తములలో కూడా సూర్యార్చన చేసేవారికి మృత్యులోకంలో కూడా శ్రేష్ఠగతి లభిస్తుంది. ఆ పై సూర్యలోకప్రాప్తి వుంటుంది. ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వియుజ మాసాలలో ఇదే పూజను ఇలాగే ఉపవాస పూజన జపాదిక్రమంలో చేసి ‘మార్తాండ’ నామం, జపాలతో అనుసంధానం చేసిన తరువాత గోమూత్రాన్ని నోట్లో వేసుకొనే వ్యక్తి పవిత్రుడై, ధనవంతుడై అనాయాస జీవనాన్ని గడిపి కుబేరలోకానికి వెళతాడు. కార్తికాది నాలుగు మాసాలలో ఇదే వ్రతాన్ని ఆచరించి ‘భాస్కర’ నామజపాలు చేసి చివరపాలను ప్రాశ్న చేసిన వానికి సూర్యలోకప్రాప్తి కలుగుతుంది. ప్రతిమాసంలోనూ బ్రాహ్మణులకు వారు కోరిన ద్రవ్యాలను దానం చేస్తుండాలి. చాతుర్మాస సమాప్తియందు పురాణ శ్రవణం చేయించాలి. కీర్తనలను పాడించాలి. విద్వాంసులైన కథావాచకులను పూజించి శ్రాద్ధకర్మలు కూడా చేసి అందరినీ భోజనాలతో సంతృప్తిపరచాలి సూర్య నారాయణునికి, శ్రద్ధగా పితృదేవతల పేర, ఏం చేసినా ఇష్టమే.