అగ్ని మహా పురాణము

Table of Contents

205 - అథ భీష్మపఞ్చకవ్రతమ్

అగ్ని రువాచః-

అగ్ని దేవుడు చెప్పెను : ఇపుడు సకలమనోరథములను తీర్చు వ్రతరాజ మైన భీష్మపంచక వ్రతమును గూర్చి చెప్పెదను. కార్తిక శుక్లైకాదశినాడు ఈ వ్రతమును ప్రారంభించి, ఐదు దినములపాటు మూడు వేళల స్నానము చేయుచు తిలలతోను, యవలతోను దేవతలకును. పితరులకును ఐదు తర్పణము లీయవలెను మౌనముతో శ్రీమహావిష్ణువును పూజించ వలెను. పంచామృత - పంచగవ్యములతో స్నానము చేయించి, చందనాది సుగంధద్రవ్యములు అలది, ఘృతయుక్తమగు గుగ్గులు వెలిగించవలెను. ప్రాతఃకాలమునందును, రాత్రియందును శ్రీమహావిష్ణువునకు దీపము చూపి, భోజ్యపదార్థములు నివేదనము చేయవలెను. “ఓం నమో భగవతే వాసుదేవాయ”అను ద్వాదశాక్షరీమంత్రమును నూట ఎనిమిది పర్యాయములు జపించవలెను. ద్వాదశాక్షర మంత్రమునకు చివర ‘స్వాహా’ చేర్చి మృతసిక్తము లగు తిలలను, యవలను హోమము చేయవలెను. మొదటి దినమున భగవంతుని పాదములను కమలములతోను, రెండవ దినమున మోకాళ్లను, తొడలను బిల్వపత్రములతోను, మూడవ దినమున నాభిని భృంగరాజముతోను, నాల్గవ దివసమున దాణపుష్ప-బిల్వపత్ర-జపాపుష్ప ములతోను, ఐదవ దివసమున మాలతీపుష్పములతోను సర్వాంగములను పూజించవలెను. వ్రతము నాచరించువాడు భూమిపై శయనించవలెను. ఏ కాదశినాడు గోమయమును, ద్వాదశియందు గోమూత్రమును, త్రయోదశియందు పెరుగును. చతుర్దశి యందు క్షీరమును, చివరి దినమునందు పంచగవ్యములను ఆహారముగ గ్రహించవలెను. పౌర్ణమాసియందు నక్త వ్రతము చేయవలెను. ఈ విధముగ వ్రతము చేసినవాడు భుక్తిముక్తులను పొందును. భీష్ముడు ఈ వ్రతము నాచరించుటచే శ్రీహరిని చేరెను. కావుననే దీనికి ‘భీష్మపంచకము’ అను పేరు వచ్చినది. బ్రహ్మ కూడ ఈ వ్రతమాచరించి శ్రీహరిని పూజించేను. అందుచే ఈ వ్రతము పంచోపవాసాదులతో కూడియున్నది.

అగ్ని మహాపురాణమునందు భీష్మపంచకవ్రతకథన మను రెండువందలఐదవ అధ్యాయము సమాప్తము.