అగ్ని మహా పురాణము

Table of Contents

188 - అథు ద్వాదశీవ్రతాని

అగ్ని రువాచః -

ఆగ్ని దేవుడు పలికెను: ఇపుడు భుక్తి ముక్తి ప్రదములగు ద్వాదశీవ్రతములను గూర్చి చెప్పెదను. ద్వాదశినాడు రాత్రిమాత్రమే భోజనము చేయవలెను ఎవనినుండియు, ఏమియు గ్రహింపరాదు. ఉపవాసము చేసి కూడ భిక్షాగ్రహణము చేయువానికి ద్వాదశీవ్రతఫలము సిద్ధించదు. చైత్రశుక్ల ద్వాదశినాడు మదనద్వాదశీ వ్రతము చేయువాడు భోగమోక్షములను కోరుచు కామదేవరూపుడగు మహావిష్ణువును పూజించవలెను. మాఘశుక్ల ద్వాదశినాడు ‘భీమద్వాదశీ’ వ్రతము చేసి “నమో నారాయణాయ” అను మంత్రముతో శ్రీమహావిష్ణువును పూజించవలెను. ఇట్లు చేసినవాడు సర్వమును పొందగలుగును. ఫాల్గున శుక్ల ద్వాదశినాడు ‘గోవిందద్వాదశీమంత్రము చేయవలెను. ఆశ్వయుజమునందు “విశోక ద్వాదశీ” వ్రతము చేయువాడు శ్రీమహావిష్ణువును పూజించవలెను. మార్షశీర్షశక్ల ద్వాదశినాడు శ్రీకృష్ణుని పూజించి లవణదానము చేయువాడు సకలర సదానములు చేసిన ఫలము పొందును. భాద్రపదమున ‘గోవత్సద్వాదశీ’ వ్రతము చేయువాడు గోవత్సమున పూజించవలెను. మాఘమాసము తరువాత వచ్చు ఫాల్గునకృష్ణద్వాదశి శ్రవణనక్షత్రయుక్త మైనచో దానికి “తిలద్వాదశి” ఆని పేరు. ఆ దినమున తిలలతో స్నానము చేసి, తిలలతో హోమము చేసి, చిమ్మిలి నైవేద్యము పెట్టవలెను. దేవాలయమునందు తైలదీపము వెలిగించి, పితరులకు తిలతర్పణములు చేయవలెను. బ్రాహ్మణులకు తిల దానము చేయవలెను. హోమోపవాసముల వలననే తిలద్వాదశీ వ్రత ఫలము లభించును. “ఓం నమో భగవతే వాసుదేవాయ” అను మంత్రముతో శ్రీమహావిష్ణువును పూజించవలేను. ఈ విధముగ ఆరు పర్యాయములు తిలద్వాదశీ వ్రతము చేసినవాడు తన కులముతో కూడ స్వర్గమునకు పోవును. ఫాల్గున శుక్లపక్షమునందు ‘మనోరథద్వాదశీ’ వ్రతము చేసినవాడు శ్రీమహావిష్ణువును పూజించవలెను. ఈ దివసమునందే ‘వామద్వాదశీ’ వ్రతము చేయువాడు ఒక సంవత్సరము, కేశ హసీనామములతో శ్రీమహావిష్ణువును పూజించవలెను. అతడు మరణానంతరము స్వర్గమునకే వెళ్ళును. నరకమున కెన్నడును వెళ్ళడు. ఫాల్గునశుక్ల పక్షమున “సుమతిద్వాదశి” వ్రతము చేసి విష్ణువున పూజించవలెను. భాద్రపదశుక్ల పక్షమున “ఆనంతద్వాదశీ” వ్రతము చేయవలెను. మాఘశుక్ల పక్షమునందు ఆశ్లేషతో గాని, మూలతో గాని కూడిన తింద్వాదశి చేయువాడు “కృష్ణాయనమః” అను మంత్రముతో శ్రీకృష్ణుని పూజించి, తిలహోమము, చేయవలెను. ఫాల్గున శుక్ల పక్షమున సుగతిద్వాదశీ వ్రతము చేయువాడు ఒక సంవత్సరము “జయ కృష్ణ నమస్తుభ్యమ్” అను మంత్రముతో శ్రీకృష్ణుని పూజించవలెను. ఇట్లు చేయుటచే భుక్తి ముక్తులను రెండింటిని పొందును. పుష్యశుక్ల ద్వాదశినాడు “సంప్రాప్తి ద్వాదశీ” వ్రతము చేయవలెను.

ఆగ్ని మహాపురాణమునందు ద్వాదశీ వ్రతవర్ణన మను నూట ఎనుబది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.