అగ్ని మహా పురాణము

Table of Contents

53 - అథ లిజ్గాది లక్షణమ్ :

హయగ్రీవుడు చెప్పెను: బ్రహ్మదేవా! ఇపుడు నేను లింగాదుల లక్షణము చెప్పెదను; వినుము. లింగము పొడవులో సగమును ఎనిమిది భాగములు చేసి, వాటిలో మూడు భాగములు విడచి, మిగిలిన ఐదు భాగములతో చతురస్రమైన విష్కంభము నిర్మింపవలెను. మరల పొడవును ఆరు భాగములు చేసి వాటిని ఒకటి, రెండు, మూడు ఆను క్రమమున వేరుగా ఉంచవలెను. వీటిలో మొదటి భాగము బ్రహ్మదేవునిడి; రెండవది విష్ణువునకు సంబంధించినది. మూడవది శివునిది. దీనికి “వర్గమాన భాగము” అని పేరు. చతురస్ర మండపమున కోణ సూత్రార్థ ప్రమాణము గ్రహించి, దానిలో అన్ని కోణముల మీదను గుర్తులుంచవలెను. ఇట్లు చేయగా ఎనిమిది కోణముల వైష్ణవ భాగము సిద్ధించును. సందేహము లేదు. పిమ్మట పదునారు కోణముల తోడను, ముప్పదియారు కోణములతోడను కూడిన దానిగా చేయవలెను.

పిమ్మట ఆరువది నాలుగు కోణములుండునట్లు చేసి అచట ఒక గోళాకార రేఖ గీయవలెను. పిమ్మట శ్రేష్టుడైన ఆచార్యుడు లింగము, శిరోభాగమును ఖండించవలెను. పిమ్మట లింగ విస్తారమును ఎనిమిది భాగములుగ విభజింపవలెను. పిమ్మట వాటిలో ఒక భాగము యొక్క నాల్గవ భాగమును విడువగా ఛత్రాకారమగు శిరస్సు ఏర్పడును. మూడు భాగము లందును. పొడవు వెడల్పులు సమానముగా నుండు లింగ సకల మనోభీష్టములను ఇచ్చును. దేవపూజిత లింగము నందు పొడవులోని నాలుగవ భాగముచే విష్కంభము ఏర్పడును.. ఇపుడు అన్ని లింగముఆ లక్షణములను వినుము.

పండితుడు పదునారు అంగుళముల లింగమునకు మధ్య బ్రహ్మరుద్ర భాగములకు సమీపమున నున్న సూత్రము తీసికొని దానిని ఆరు భాగములుగ విభజింపవలెను. వేయమన - సూత్రముల సాహాయ్యముతో నిశ్చయింపబడిన ఈ పరి మాణమునకు ‘ఆంతరము' అని పేరు. అన్నింటి కంటే ఉత్తరము నందున్న లింగమును ఎనిమిది యవలు పెద్దదిగా ఉండునట్లు చేయవలెను. మిగిలిన లింగములను ఒక్కొక్క యవ తగ్గునట్లు చేయవలెను. పైన చెప్పిన లింగము క్రింది ప్రదేశమును మూడు భాగములుగ విభజించి పై భాగము నౌక దానిని విడచి వేయవలెమ. మిగిలిన రెండు భాగములను ఎనిమిది భాగములుగ విభజించి పై మూడు భాగములను విడచి వేయవలెను. ఐదవ భాగము పై భాగము నుండి తిరుగుచున్న ఓక దీర్ఘ రేఖ గీయవలెను. ఒక భాగమును విడచి, మధ్యయందు ఆ రెండు రేఖలను కలపవలేను. ఇది లింగముల సాధారణ లక్షణము. ఇపుడు పిండిక యొక్క సర్వసాధారణ లక్షణమును చెప్పెదను; వినుము.

బ్రహ్మ భాగమునందు లింగము ఎత్తు తెలిసికొని, పండితుడు, బ్రహ్మ శిలాస్తాపనముచేసి, దాని పైననే ఉత్తమరీతిచే కర్మ సంపాదనము చేయవలెను. పిడిక ఎత్తు తెలిసికొని దానిని విభజించవలెను. రెండు భాగముల ఎత్తును పీఠముగా గ్రహింపవలెను. వెడల్పులో ఆది లింగముతో సమానముగనే ఉండవలెను. పీఠ మధ్య భాగమున గుంట చేసి దానిని మూడు భాగములుగ విభజింపవలెను. తన ప్రమాణము యొక్క సగము త్రిభాగముచే బాహల్యమును ఏర్పరుపవలెను. బాహుల్యము తృతీయ భాగముచే మేఖల నిర్మించి దానితో సమానముగ గుంట చేయవలెను. అది క్రమముగ పల్లముగ నుండవలెను. మేఖల పదహారవ భాగమంత మేఖల నిర్మించి దాని కొలతను అనుసరించి పీఠము ఎత్తు ఏర్పరుపవలెను. దీనికి “విక రాజము” అని పేరు. శిల యొక్క ఒక భాగము భూమిలోనికి ఉండవలెను. ఒక భాగములో పిండిక నిర్మితము కావలెను. మూడు భాగములతో కంఠము, ఒక భాగముతో పట్టిక నిర్మింపవలెను. రెండు భాగముల పైన పట్టము నిర్మింపవలెను. ఒక భాగముచే శేష పట్టికలు నిర్మింపవలెను. కంఠము వరకు ఒక్కొక్క భాగము ప్రవేశించ వలెను. పిమ్మట ఒక భాగముచే నిర్గమము (నీరుపోవు మార్గము) నిర్మింపవలెను. ఇది శేషపట్టిక వరకు ఉండవలెను. ప్రణాల తృతీయ భాగముచే నిర్గమము ఏర్పడవలెను. మూడవ భాగము మొదటి వేలిచివరి భాగమంత గుంట చేయవలెను. అది మూడవ భాగములో సగము విస్తారముండవలెను. ఆ గుంట ఉత్తరమువై పు ఉండవలెను. ఇది పిండికా సహితమైన సాధారణ లింగము వర్ణనము.

ఆగ్నిపురాణమునందు లింగాది లక్షణమను ఏబదిమూడవ అధ్యాయము సమాప్తము.