మత్స్య మహా పురాణము

Table of Contents

36 - ఇంద్ర యయాతి సంవాదము

శౌనకుడు శతానీకునితో ఇంకను ఇట్లు చెప్పెను. రాజేంద్రుడగు యయాతి స్వర్గమును చేరి దేవభవనమునందు నివసింపసాగెను. అచట నతనిని దేవతలు సాధ్యులు మరుత్తులు వస్తువులు మొదలగువారు పూజించు (ఆదరించు)చుండిరి. అతడు పుణ్యమును ఆచరించినవాడును ఇంద్రియనిగ్రహము కలవాడును (కావున తన తపోబలమున సంపాదించిన పుణ్యలోకములలో) దేవలోక బ్రహ్మలోకములలో ఒక దానినుండి మరియొక దానికి సంచరించుచు చాలకాలము ఉండెను. అని పరంపర లో వినుచున్నాము. ఇట్లు ఒకప్పుడు ఆ నృప శేషుడు యయాతి ఇంద్రలోకమునకు పోయెను. మాటల సందర్భములో ఇంద్రుడు యయాతిని ఇట్లు అడిగెను: “రాజా! పూరుడు నీ రూపమును గ్రహించి వార్ధకముతో లోకమున వ్యవహరించినందుకు సంతసించి నీవు నీరాజ్యము నతని కిచ్చినప్పుడు అతనికి ఏమీ ఉపదేశించితివో నిజము చెప్పుము.” యయాతి: “గంగా యమునా నదుల నడుమ నున్న ఈ దేశమంతయు నీ విషయము! పరిపాలనలో ఉండు ప్రదేశము). ఈ భూభాగమున కంతటికి నీవు రాజవు. నీ అన్నలు నీరాజ్యపు అంచులందును వానికి అవతలను ఉండు దేశములను పొలింతురు.

“శిష్టులందరలో గొప్పవారును ఓర్పుగలవారును పురుషులలో అధికులు. ఎట్లన-ఓర్పు లేనివానికంటె అదికలవాడు విశిష్టుడు. మానుష ధర్మము లేనివారికంటె అదికలవాడును వివేకము లేనివానికంటే అదీకలవాడును విశిష్టతరుడు. ఇతరులు చెడు మాటలాడినను తానట్టివి ఆడ రాదు. ఇట్లున్న చో కోపము నిగ్రహింపబడును. ఆ కోపము ఆక్రోశించినవానినే నిర్గహించును. తిట్లు తినినవాని పాపము తిట్టినవానికి అంటును. ఇతరుల హృదయమునకు వ్రణము కలిగించు పనులు చేయరాదు. క్రూర వచనములు పలుకరాదు. హీనునినుండి ఎంత గొప్ప వస్తువునైన గ్రహింపరాదు. తాను ఏది పలికిన ఇతరులు నొప్పిపడుదురో) ఇతరులు ఏది పలికినచో తన మదికి నొప్పి కలుగునో అట్టి దుర్వచనములు తానితరులను పలుకరాదు. అది పాపలోకములకు పోవుటకు కారణమగును. అరుంతుదుడు (ఇతరుల హృదయ వ్రణమును రేపెడి కూరపు పనులు చేయుచు ఆట్టి మాటలాడుచు నుండువాడు) అగు పురుషుడు తీక్షవచనములు పలుకువాడు మాటలనెడి ముండ తో ఇతరుని బాధించువాడు మనుష్యులందరలో అశుభస్వరూపులని తెలియవలెను. అటి వాడు తన ముఖమునందు నిర తిని (అలక్ష్మిని) కట్టుకొని మోయువాడే. సజ్జనులు తన ఎదుటను మెచ్చుకొనునట్లును వెనుక ను ప్రశంసించునట్లును నడుచు కొనవలెను. సజ్జనులు ఒక వేళ నిందించినను ఓర్చు కొనవలెను. వారి నడువడిలో మంచివానిని తాను గ్రహించి పూజ్యమగు నడువడితో మెలగవలెను. (పరుష) వచనములు నోటినుండి వెలువడు బాణములు, వాటి దెబ్బ తినినవాడు రాత్రిం బవళ్ళును శోకించుచుండును. అవి ఇతరుల హృదయ మర్మము లందు తప్ప గ్రుచ్చు కొనవు. కనుక వివేకి యుగువాడు వాటిని ఎవరిమీదను విడువరాదు. భూతములయందు మైత్రి సానుభూతి) దానము.మధుర వచనములు పలుకుట. ఈ మూటితో సదృశమగు సంవతనము (ఇతరులను తనవైపు తిప్పుకొనునది) మరి ఏదియు లేదు. కనుక ఎల్లప్పుడును నెమ్మదిగా మాటలాడవలయును. పరుషము లేక్కడ నెప్పుడు నాడరాదు. పూజ్యులగు ఇతరులను పూజించుచుండ వలయును. అభిశాపవచనము లేన్నడు నాడరాదు.”

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశానుకీర్తనమున యయాతి చరితమున ఇంద్ర యయాతి సంవాదమున యయాతి పూరునకు బోధించిన నీతులు అను ముప్పదిఆరవ అధ్యాయము.