మత్స్య మహా పురాణము

Table of Contents

2 - మత్స్యరూపుడగు విష్ణువు మనువునకు అవాంతర ప్రళయాదిక మెరిగించుట

ఆ మత్స్యము ఇట్లు పలుకగా మను వా విష్ణుని ఇట్లడిగెను: భగవన్! ఎన్ని సంవత్సరముల తరువాత ప్రళయము సంభవించును! ప్రభూ! మధుసూదనా! ప్రాణులను ఎట్లు రక్షింతును? నేను మరల నీతో ఎట్లు కలియగలను? మత్స్యము ఇట్లనెను: ఇది మొదలుగా మహీతలమున అనావృష్టి కలుగును. నూరేండ్ల వరకు కరపులు కలిగి ప్రాణులకు మరణము కలిగించును. పిమ్మట అల్పప్రాణులకు నాశముకలిగించుచు సూర్యుని ఏడు కిరణములు కాలెడి నిప్పు కణికలను వర్షించును. ఆ ప్రళయ కాలమున బడబాగ్నియును విజృంభించును. పాతాళమునుండి సంకర్షణుని భగవంతుని ఒక వ్యూహము) ముఖమునుండి అగ్ని వెలువడును. శివుని నుదుటి మూడవకంటి అగ్నియు మూడులోకములను నిర్దహించుచు క్షోభము కలిగించును. ఇట్లు భూమియంతయు తగులబడి తాబేటి(వీపు)వలె అగును. ఆకాశము సూర్యునిచే మిగుల వేడిమిపొందును. దానివలన దేవతలు నక్షత్రములు కూడ నశించును. సంవర్తము భీమనాదము ద్రోణము ఇంద్రము వలాహకము విద్యుత్పతో కము శోణము అను ఈ ఏడు ప్రళయమేఘములును ప్రళయాగ్ని వేడిమికి పుట్టి భూమిని తమ వాననీటితో ముంచివేయును. ఏడు సముద్రములును కలిసి ఒకటిగా ఏర్పడి కలవరము చెందును. ఇవి మూడు లోకములను పూర్ణముగా ఏకార్ణవముగా చేయును. అట్టి స్థితిలో నీవు ఈ దేవనౌకను తీసికొని బీజములు మొదలగు వాని నిలువను దీనియందు ఉంచి నేను ప్రవర్తిల్ల చేయు యోగము రక్షణ విధానము)తో వాటిని రక్షించుము. ఈ నావను నాకొమ్మున కట్టి వేసి నాప్రభావమున అన్ని విధముల రక్షింపబడుచు దేవతలును నశించినను నీవు ఒక్కడవు ఉందువు. ఈ అవాంతర ప్రళయకాలమున చంద్ర సూర్యులు-నేను బ్రహ్మ-నాలుగు లోకములు (స్వర్గమ ర్య పాతాళ బ్రహ్మలోకములు)-పుణ్య అగు నర్మదానది-మార్కండేయ మహాఋషి శివుడు వేదము(లు) పురాణములు ఇతర విద్యలు నీవు ఇవి అన్నియు నిలుచును. ఇట్లు చాక్షుష మన్వంతరము తరువాత అవాంతర ప్రళయముతో ఏకార్ణవము కాగా 'పిమ్మట నీ సృష్టికి ఆరంభమున మహీతలమున వేదములను ప్రవర్తిల్ల జేయుదును.

 ఇట్లు పలికి భగవానుడు అక్కడనే - అంతర్ధానము పొందెను. మనువుకూడ పూర్వము సూచింపబడిన ప్రాణి ప్రళయము వరకును తనకు వాసు దేవుని అనుగ్రహము వలన కలిగిన యోగమును అవలంబించి అభ్యాసము (మరలమరల అనుష్టించుట) చేయుచు ఉండెను. వాసుదేవుడు చెప్పిన సమయమున అట్లు జరుగగానే జనార్దనుడు కొమ్ముగల మత్స్యము రూపమున ప్రాదుర్భవించెను. ఆది శేషుడు త్రాటిరూపమున మునిమనువుకడకు వచ్చెను. ఆధర్మవేత్త సర్వభూతములను లాగి దగ్గరకు తీసికొని సర్పపు త్రాటితో చేపకొమ్మున నావను కలిపికట్టెను. జనార్దనుని నమస్కరించి ఆ మత్స్యపు శృంగమునకు సమీపమున నిలిచెను. ఆ అవాంతర ప్రళయము గడిచిన తరువాత మనువు అడుగగా మత్స్యరూపుడు అగు యోగ శాయి విష్ణువు పురాణమును ప్రవచించెను. ఋషిసత్తములారా! దానిని మీకు ఇప్పుడు చెప్పెదను వినుడు. ఇంతకు ముందు మీరు నన్ను అడిగిన సృష్టి మొదలగు విషయములను గూర్చియే అట్లే ఏకార్ణవమున ఉన్న మనువు కేశవుని ఇట్లు ప్రశ్నించెను: ప్రపంచపు ఉత్పత్తిని ప్రళయమును వంశమును మన్వంతరములను వంశాను చరితమును భువన విస్తారమును వివిధములగు దానములను ధర్మములను శాశ్వతమగు శ్రాద్ధకల్పమును వర్ణాశ్రమ విభాగమును ఇష్టములు పూర్తములు అను సత్కర్మములను దేవతల ప్రతిష్టలు మొదలగునవి ఇది ప్రతియొక్కటియు చెప్పవేడుచున్నాను. 

మనువుతో మత్స్యము ఇట్లు పలికేను : (ఈ జరిగినది అవాంతర ప్రళయము. కాని ఈ కల్పాదికి ముందు) మహాప్రళయము జరిగిన సమయమున 'ఇది అంతయు చీకటితో నిండినదై స్థిర చర రూపమయిన ప్రపంచమంతయు గాఢనిద్ర యందు మునిగినదో అన్నట్లు తరప్రమాణముతో ఎరుగరానిదిగా అనుభూతిలో గురుతింపరానిదిగా దీని లక్షణము ఇది అని నిశ్చయించి చెప్పవీలుకానిదిగా అనుభవముతో తెలియ శక్యము కానిదిగా ఇంతవరకును అనుభవముతో తెలియ బడనిదిగా ఉండెను. అంతట నామరూపములతో వ్యక్తముకానివాడు యజ్ఞాది పుణ్యకర్మలకు కారణుడు అగు స్వయంభూ పరమేశ్వరుడు తన ఆ స్వభావమును వ్యక్తముచేయుచు ఆ చీకట్లను పోగొట్టుచు సాక్షాత్కారమునండెను. అనగా ఇంద్రియ ములకు గోచరము కానివాడును ఈ అవ్య క్రముకంటె పరుడు ( శ్రేష్టుడు)ను అంతర్యామి ( సమస్త భూతములయందుండి వాటి చిత్తవృత్తులను తన అదుపునం దుంచువాడుయు సనాతనుడు అతి ప్రాచీనుడు శాశ్వతుడు)ను నారాయణుడు అని ప్రసిద్ధి పొందినవాడు అగు ఆపరమాత్మయే స్వయముగా ఉద్బూతుడు అయ్యెను. తనకు శరీరము కావలెనని సంకల్పించు కొనుచు సమస్త జగత్తును సృష్టింపదలచుచు మొదట జలములనే సృష్టించేను. వాటియందు వీర్యమును నిలిపేను. ఆ వీర్యమే గొప్పదియు పెద్ద పరిమాణము కలదియు అగు బంగారు గ్రుడ్లుగా అయ్యేను. అది వేల సంవత్సరముల కాలము పాటు సూర్యుడే లేనిదై చీకటితో ఆవరింపబడినదయి యుండెను. మహా తేజస్వరూపుడు అగు పరమాత్మ తననుండి పుట్టిన గ్రుడ్డులోపల ప్రవేశించి అవ్య క్తమగు మత్స్యరూపము వదలి మరల విష్ణుత్వమును పొందెను. మత్స్యము - కేవలసత్-చిత్ - ఆనంద రూప విష్ణువు-ప్రవేశించి యుండువాడు) దానిలోపల ఈ భగవానుడు మరల సూర్యుడయ్యెను. ఆదిభూతుడు కావున ఆదిత్యుడు వేదపరుడగుటవలన బ్రహ్మయును అయ్యెను.

అంతట దివ్యమగు ఆ అండము రెండు ముక్కల య్యెను. అతడు అన్ని దిక్కులను శాశ్వతమగు -అండమునడుమ ఆకాశమును నిర్మించెను. దానీమావి నాశ్రయించి లోపలివైపున పర్వతములు ఏర్పడెను. ఉల్బము (మావితో సంబం ధించిన నీటిబుడగ) జల ప్రవాహములును నదులును నానారత్నములతో కూడిన సముద్రములును అయ్యెను. పరమాత్ముడగు ఆ దేవుడే ప్రజలను సృష్టింప సంకల్పించినం దున శత్రువుల నణచి ప్రజలను రక్షించగల ప్రజాపతి అయ్యెను. అండము మృతము(చీలినది) అయిన తరువాత ఏర్పడినందున అతని . ఆ తేజస్సునకు సూర్యునకు) మార్తాండుడని పేరువచ్చెను. ఆ మహాత్ముని రజోగుణమయ మగురూపము లోకముల కన్నిటికిని పితామహుడు(తాత)అగు చతుర్ముఖ భగవానుడుగా అయ్యెను. దేవాసుర మనుష్యులతో నిండిన జగమంతయు ఆయన చేతనే సృష్టింపబడినది. ఈర జోగుణ ప్రధాన పరమాత్ముని రూపమే మహత్తత్వము అని చెప్పబడుచున్నది.

ఇది మత్స్యమహాపురాణమున మత్స్యమనుసంవాదమున మత్స్యరూప నారాయణుడు మనువునకు అవాంతర ప్రళయాదికము నెరింగించుట అను ద్వితీయాధ్యాయము.