నారద మహా పురాణము - పూర్వార్థము
119 - ద్వాదశమాసస్థిత దశమి వ్రత కధనమ్
సనాతన మహర్షి పలికెను :-
ఇపుడు నీకు దశమి వ్రతములను చెప్పెదను. ఈ వ్రతములనుచేయు మానవుడు ధర్మరాజునకు ఇష్టుడగును. చైత్రశుక్ల దశమినాడు ఆ సమయము లభించు ఫలపుష్పాదులచే గంధాదులచే ధర్మరాజును పూజ, గవలయును.ఉపవసించి కాని ఏక భుక్తముతో కాని పూజించి పదునాలుగు మంది బ్రాహ్మణులను భుజింపచేసి శక్తి కొలది దక్షిణనీయవలయును. ఇట్లు ధర్మరాజును పూజించువాడు ధర్మరాజాజ్ఞచే దేవతలతో సమానుడగును. వైశాఖ శద్ధ దశమినాడు శ్రీ మహావిష్ణువును గంధాద్యుపచారములతో, సువాసనగల తెల్లని పూవులచే పూజించి, నూరు ప్రదక్షిణలనాచరించి, ప్రయత్నముతో బ్రాహ్మణులను భుజింపచేసినచో శ్రీ విష్ణులోకమును పొందును. జ్యేష్ఠశుద్ధ దశమినాడు గంగానది స్వర్గమునుండి భూలోకమున కొచ్చెను కావున ఈ దశమి పరమ పవిత్రమైనది. జ్యేష్టమాస శుక్లపక్షము, బుధగ్రహము, దశమి తిధి, గర, ఆనంద వ్యతీపాతములు, కన్యేష్ణువు, వృషభ, సూర్యుడు ఈ దశయోగము మహాపుణ్యతమము. ఈ యోగము పదిపాపములను హరించును కావున దీనిని దశహరయందురు. ఈ దినమున గంగానదికి వెళ్ళి, ప్రీతితో యధావిధిగా గంగా జలమున స్నానము చేసినవాడు శ్రీహరి లోకమును చేరును. ఆషాఢ శుక్లదశమి పవిత్రమైనదని మన్వాదులు చెప్పిరి. ఈ దినమున స్నానము, జపము, దానము హోమములు స్వర్గమును ప్రసాదించును. శ్రావణ శుక్ల దశమి సర్వాశాపూరకము. ఈ రోజు శివుని గంధాద్యుపచారములచే పూజించవలయును. ఉపవాసము కాని ఏక భుక్తము కాని చేయుచు, బ్రాహ్మణులను భుజింపచేసి, జపము, పరము, గోవులకు అన్నదానము సర్వపాపనాశకము. భాద్రపద శుక్లదశమినాడు దశావతార వ్రతము చెప్పబడినది. ఈ దినమున జలాశయమున స్నానము చేసి సంధ్యావందన మాచరించి, దేవర్షి పితృతర్పణము చేసి, సావధానముతో దశావతారములను పూజించవలయును. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, శ్రీరామ, పరశురామ, కృష్ణ, బుద్ద కల్కులు దశావతారములు. బంగారముతో దశావతారమూర్తులను చేయించి, యధావిధిగా పూజించి పదిమంది బ్రాహ్మణులను పూజించి దానము చేయవలయును. ఉపవాసమును కాని ఏకభుక్తమును కొని చేసి బ్రహ్మచారులకు భోజనము పెట్టి విడిచి తాను భుజించవలయును. ఈ వ్రతమును భక్తిచే చేసి ఇహలోకమున సకల భోగములనుభవించి అంతమున విమానమునధిరోహించి విష్ణులోకమును చేరును.
ఆశ్వయుజ శుద్ధ దశమిని విజయదశమి యందురు. ప్రాతః కాలమున గృహాంగణమున (వాకీట) నాలుగు గోమయ పిండములను చక్రవాల రూపమున నుంచి వాటిమధ్య భాగమున రామలక్ష్మణ భరత శత్రుఘ్నులను పూజించవలయును. మూత ఉన్న నాలుగు గోమయ పాత్రలలో క్లిన్నమగు (తడిసిన ధాన్యమును వెండితో నుంచి ధోత వస్త్రముతో కప్పి పితృమాతృ భ్రాతృపుత్ర జాయా భృత్య సమన్వితముగా యధావిధిగా గంధపుష్పనైవేద్యాదులతో పూజించి నమస్కరించి, బ్రాహ్మణులను భుజింపచేసి, పూజించి, దక్షిణనిచ్చి,తాను భుజించవలయును. ఇట్లు వ్రతము నాచరించినవాడు ఆ సంవత్సరము ధనధాన్యసమృద్ధికలవాడై సుఖముగా ఉండును. ఇక అపరాష్ట్ర సమయమున దశమినాడు చక్కగా పూజించిన తూర్పుదిక్కుననున్న శమీవృక్షప్రాంతమునకు వెళ్ళి దాని మూలమున నున్న మట్టిని తీసుకొని స్వగృహమునకొచ్చి, గీతవాద్య ధ్వనులతో ఆ మట్టిని యధావిధిగా పూజించి సిద్దముచేసి, తన పరివార బలముతో పూర్వద్వారమునుండి బయలువడలి స్వస్థ చిత్తముతో గ్రామమునకు బయటవెళ్ళి, పత్రకాదులచే చేయబడిన శత్రు ప్రతికృతిని కానీ, మనసుతో కల్పించిన ప్రతికృతిని కాని బాణముతో బాగుగాకొట్టి సంతోషముతో తన ఇంటిని చేరవలయును. ఇట్లుచేసిన తరువాత శత్రువును ఓడించుటకు యుద్దమునకు కూడా వెళ్ళవచ్చును. ఇట్లు విజయదశమిని యధావిధిగా నాచరించినవారు ధనమును, జయమును, పుత్రులను, గోవులను, గజములను, అశ్వములను, మేకలను, గొఱ్ఱలను ఇహలోకమున పొంది అంతమున స్వర్గమును చేరును.
ఇక కార్తీక శుక్ల దశమినాడు సార్వభౌమ వ్రతము నాచరించవలయును. ఏక భుక్తముతోకాని ఉపవాసముతోకాని, నిశీఢ కాలమున అపూపాదులతో పదిదిక్కులందు ఇంటి వెలుపలకాని గ్రామమునకు వెలుపలకాని బలిని ఆర్పించవలయును. గోమయముచే అలికిన భూమిమీద అష్టదల పద్మమును లిఖించి, గణేశాదులను ఈ మంత్రములచే అర్పించవలయును. నేను చేసిన పాపకర్మచే పూర్వదిక్కున నున్న పాపమును దేవరాజగు ఇంద్రుడు ఇపుడు నశింపచేయుగాక. నేను చేసిన పాపకర్మలచే ఆగ్నేయ దిక్కున నునళ్ళీ నా పాపరాశిని అఖిలేష్టపదుడు తేజోరాజగు అగ్ని నశింపచేయుగాక. నాపాపకర్మల వలన దక్షిణ దిక్కుననున్న నా పాపరాశిని అఖిలేష్ట ప్రదుడు ప్రేతరాజగు యముడు నశింపచేయుగాక. నా పాపకర్మల వలన నైఋతి దిశలో నున్న పాపరాశిని అఖిలేష్ట ప్రదుడు రారాజగు నిబతి నశింపచేయుగాక. నాపాప కర్మల పశ్చిమ దిక్కునను నా పాపరాశిని అఖిలేష్ట ప్రదుడు యాదః పతియగు వరుణుడు నశింపచేయుగాక. నా పాపకర్మల వలన వాయవ్య దిక్కున నున్న పాపరాశిని అఖిలేష్ట ప్రదుడు మరుత్తుల రాజగు వాయువు నశింపచేయుగావుత. నాపాప కర్మలవలన ఉత్తర దీక్కున నున్న నా పాపరాశి అఖిలేష్ట ప్రదుడు ఋక్షయక్ష అధిపతియగు సోముడు నశింపచేయుగాక. నా పాపకర్మల వలన ఈశాన్య దిక్కున నున్న నాపాపరాశిని అఖిలేష్టపదుడు భూతనాధుడగు ఈశానుడు నశింపచేయుగాక. నాపాప కర్మల వలన ఊర్థ్వ దిక్కునున్న నాపాప రాశిని అఖిలేష్ట ప్రదుడు ప్రజాపతి యగు బ్రహ్మనశింప చేయుగాక. నాపాప కర్మవలన అధోభాగముననున్న నాపాపరాశిని అఖిలేష్ట ప్రదుడు నాగరాజగు అనంతుడు నశింపచేయుగాత. ఇట్లు సావధానముతో పదిదిక్కులందు బలినిచ్చి దాని వెలుపల క్షేత్ర పాలునకు బలినీయవలయును. ఇట్లు ఆచరించి మిగిలిన రాత్రిని మంగలగీతములచే స్తుతి పాఠములచే, జపాదులచే గడుపవలయును. ప్రాతః కాలమున లేచి స్నానముచేసి లోకపాలులను బ్రాహ్మణులను పూజించి, పన్నెండు మందిని భుజింపచేసి శక్తికొలది దక్షిణనీయవలయును. ఇట్లు వ్రతము నాచరించి ఇహలోకమున భోగములననుభవించి ఒకయుగకాలము స్వర్గసుఖముననుభవించి సార్వభౌముడగును.
మార్గశిర్ష శుద్ధ దశమినాడు ఆరోగ్యవ్రతము నాచరించవలయును. పదిమంది బ్రాహ్మణులను గంధాదులతో పూజించి, వారి పాదోదకమును పానము చేసి దక్షిణనిచ్చి విడిచి ఏక భుక్తముగా నుండవలయును. ఈ వ్రతమునుచేసిన వారు భూలోకమున ఆరోగ్యమును పొంది, ధర్మరాజానుగ్రహముచే స్వర్గమున దేవతవలె ఆనందింతురు. పుష్య శుక్ల దశమినాడు విశ్వేదేవతలను పూజించవలయును. క్రతువును, దక్షుని, వస్తువులను, సత్యుని, కాలుని, కాముని, మునిని, గురువును, విప్రుని, రామునీ ఈ పదిమందిలో పదిరూపులుగా కేశవుడున్నాడు. ఈ పదిమందిని దర్భలరూపముగా ఆసనములపై స్థాపించి గంధధూప దీప నైవేద్యములచే పూజించి ఒక్కొక్కరికి దక్షిణలనిచ్చి విడువవలయును. ఆ దక్షిణలను బ్రాహ్మణులకు కాని గురువుకుకాని సమర్పించవలయును. ఇట్లు ఏకభుక్తముతో ఈ వ్రతము నాచరించినవాడు ఇహపరములలో భోగములననుభవించును. మాఘశుక్ల దశమినాడు ఉపవసించి జితేంద్రియుడై అంగిరసులను పేరుగల పదిమంది దేవతలను బంగారుమూర్తులను చేసి గంధాద్యుపచారములచే చక్కగా పూజిచంవలయును. ఆత్మా, ఆయువు, మనసు, దక్షుడు, మద, ప్రాణ, బర్హిష్మాన్, గనిష్టుడు, దత్తుడు, సత్యుడు అనువారలు దశాంగిరసులు. పదిమంది బ్రాహ్మణులకు మధురాన్నములతో భోజనముపెట్టి, దశస్వర్ణమూర్తులను క్రమముగా దానము చేయవలయును. ఫాల్గున శుద్ద దశమినాడు పదునాలుగు మంది యములను పూజించవలయును. యముడు, ధర్మరాజు, మృత్యువు, అంతకుడు, వైవస్వతుడు, కాలుడు, సర్వభూతక్షయుడు, ఔదుమ్బరుడు, దధ్నుడు, నీలుడు, పరమేష్ఠి, వృకోదరుడు, చిత్రగుప్తుడు అనువారలు పదునాలుగు మంది యములు. గంధాద్యుప చారములతో చక్కగా పూజించి తిల అంబుమిశ్రాంబులతో ధరలతో ఒక్కొక్కరికి మూడుమార్లు తర్పణము చేయవలయును. తరువాత తామ్రపాత్రతో రక్తచన్దన సమంమిశ్రితలాక్షతయ వాంబువులతో సూర్యునకు అర్ఘ్యమియవలయును. ఓ సూర్యా! సహశ్రాంశూ? తేజోరాశీ ! జగత్పతీ! రమ్ము, నేను భక్తితో నిచ్చు అర్ఘ్యమును స్వీకరించి నన్ను దయ చూడుము. అను మంత్రముతో అర్ఘ్యము నిచ్చి పదునాలుగు మంది బ్రాహ్మణులను భుజింపచేసి, వెండిని దక్షిణగా నిచ్చి విడిచి, తాను భుజించవలయును. ఇట్లు యధావిధిగా వ్రతము నాచరించినవాడు ధర్మరాజానుగ్రహము వలన ఇహలోకమున పుత్రాది సకల భోగములను అనుభవించి, ఉత్తమ విమానమునధిరోహించి దేహాంతమున విష్ణులోకమును చేరును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వ భాగమున బృహదుపాఖ్యానమున చతుర్ధ పాదమున ద్వాదశమాస స్థిత దశమివ్రత నిరూపణమను నూటాపందొమ్మిదవ అధ్యాయము.
