నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

116 - ద్వాదశమాసస్థిత సప్తమీ వ్రత నిరూపణం

ఓ నారాదా! ఇపుడు నేను నీకు సప్తమి వ్రతములను చెప్పెదను వినుము ఈ వ్రతముల నాచరించిన మానవుడు సూర్యుని సాయుజ్యమును పొందును.చైత్ర శుక్ల సప్తమినాడు బయట స్నానము చేయవలయును. గోమయముచే అలుకబడి, గౌరవర్లమృత్తికచే పూయబడిన స్థండిలమున అష్టదల పద్మమును లిఖించి కర్ణికయందు సూర్యుని ఉంచి, పూర్వపత్రము నందు ధాతువులచే చేయబడిన ఇద్దరు దేవతల నుంచవలయును. ఆగ్నేయ పత్రము నందు కారకములచే చేయబడిన గంధర్వుల నుంచవలయును. దక్షిణ పత్రము నందు రాక్షస ద్వయము నుంచవలయును. నైఋతి దిక్పత్రము నందు ఆకృతి ద్వయము నుంచవలయును. పశ్చిమ పత్రము నందు కాద్ర వేయులగు మహానాగుల నుంచవలయును. వాయువ్య పత్రమునందు యాతుధాన ద్వయమును, ఉత్తర పత్రమున ఋషిద్వయమును, ఐశాన్య పత్రమునందు ఒక గృహము నుంచవలయును. ఇట్లుంచిన వాటిని గంధమాల్యాను లేపనములచే, దీప ధూపనైవేద్యములచే, తాంబూల క్రమకాదులచే పూజించవలయును. ఇట్లు పూజించి, నూటా ఎనిమిదిమార్లు నేతితో హోమమును చేయవలయును. సూర్యునికి ఎనిమిది, ఇతరులకెనిమిది ఆహుతులనీయవలయును. వేదియందు నామ మంత్రముచే నీయవలయును. తరువాత పూర్ణాహుతిని ఆచరించవలయును. యధాశక్తిగా బ్రాహ్మణులకు దక్షిణ నీయవలయును. ఇట్లు సవిధిగా ఈ వ్రతము నాచరించినచో సర్వసౌఖ్యములను పొందును. దేహాంతమున సూర్యమండలమును ఛేదించి పరమ పదమును చేరును.

వైశాఖ శుక్ల సప్తమినాడు జహ్నుమహర్షి జాహ్నవీ నదిని కోపముచే త్రాగి మరల దక్షిణ కర్ణము నుండి విడిచెను. ఈ దినమున ప్రత్యూష కాలమున గంగానదిలో స్నానముచేసి గంగానదిని గంధపుష్పాక్షతాదులచే సర్వోపచారములచే పూజించవలయును. ఈ గంగావ్రతమున ఒక వేయి ఘటములను దానము చేయవలయును. ఈ వ్రతమును భక్తితో చేసినచో ఏడు తరములను స్వర్గమునకు చేరును. ఈ దినమున కమల వ్రతమును కూడా చెప్పిరి. ఆ విధానమును చెప్పెదను. ఒక తిలమాత్ర సువర్ణముతో కమలమును నిర్మించి వస్త్రయుగ్మముచే కప్పిపుచ్చి, గంధ దూపాదులచే పూజించవలయును. పద్మహస్తునకు నమస్కారము. విశ్వధారికి నమస్కారము. దివాకరా! నీకు నమస్కారము. ప్రభాకరా! నీకు నమస్కారము. ఇట్లు దేవేశుని ప్రార్థించి సూర్యాస్తమయమున ఉదకుంభముతో స్వర్ణకమలమును, కపిలగోవును బ్రాహ్మణునకు సమర్పించవలయును. ఆ దినము ఉపవసించి మరునాడు భుజించవలయును. భక్తితో బ్రాహ్మణులను భుజింపజేసి వ్రత సాఫల్యమును పొందును. ఈ దినముననే నింబవ్రతములచే (వేపాకు) పూజించవలయును. “ఓంకారమును” ఆదిలో చేర్చి “ఖభోల్కాయ” అను మంత్రముచే నింబపత్రమును భుజించవలయును. మౌనముగా భూమియందు పరుండవలయును. మరునాడు బ్రాహ్మణులను భుజింపజేసి తాను కూడా బంధువులతో కలిసి భుజించవలయును. ఈ నింబపత్ర వ్రతము నాచరించు వారికి సర్వసౌఖ్యముల నిచ్చును. ఈ సప్తమినే శర్కరా నామముతో పిలిచెదరు. అమృతమును త్రాగుచున్న సూర్యుని హస్తము నుండి అమృత బిందువులు భూమి మీదపడి శాలిముద్దయవ ఇక్షువులుగా పుట్టినది. చెరుకు నుండి శర్కర అమృతము వంటి చెఱుకురసము స్రవించినది కావున సూర్యునకు ప్రియమగు శర్కర హవ్యకవ్యములలో ఉపయోగింతురు. ఈ శర్కరా సప్తమి వ్రతము నాచరించినచో అశ్వమేధ ఫలమును ప్రసాదించును. ఈ వ్రతము సర్వదుఃఖములను ఉపశమింప చేయును. పుత్ర సంతానమును పెంచును. ఈ సప్తమినాడు శర్కరాదానము శర్కరా భోజనమును శ్రద్ధతో చేయవలయును. ఈ వ్రతము సూర్యునకు చాలా ప్రియము. పరమ భక్తిచే ఈ వ్రతము నాచరించు వారికి సద్గతి లభించును. ఇక జ్యేష్ఠ శుద్ధ సప్తమినాడు రవి స్వయముగా ఇంద్రుడాయెను. యధావిధిగా ఆ ఇంద్రుని పూజించి ఇంద్రియ నిగ్రహముతో ఉపవసిచినచో దేవేంద్రుని అనుగ్రహము వలన స్వర్గమును పొందును. ఆషాఢ శుక్ల సప్తమినాడు భాస్కరుడు వివస్వాన్ అను పేరుతో పుట్టెను. ఆ దినమున వివస్వంతుని గంధపుష్పాదులచే ప్రత్యేకముగా పూజించి చక్కగా ప్రార్ధించి సూర్యసాయుజ్యమును పొందును. శ్రావణ శుక్లసప్తమినాడు శుభకరమగు అవ్యంగమను వ్రతమును ఆచరించవలయును. నాలుగు హస్తముల పత్తి సార్థవస్త్రములను గోపతి పూజాంతమున ప్రీతి కొఱకు దానము చేయవలయును. ఈ వ్రతము పరమ శుభప్రదము. ఈ సప్తమి హస్తా నక్షత్రయుక్తమగుచో పాపనాశిని కాగలదు. ఈ దినమున దానము జపము, హోమము అంతయూ అక్షయమగును. భాద్రపద శుక్లసప్తమినాడు అముక్తాభరణ