నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

18 - మార్గశీర్షపౌర్ణిమాయాం లక్ష్మీనారాయణవ్రతమ్

సనకమహర్షి పలికెను : ఓ మునిసత్తమా ! ఇంకొక ఉత్తమవ్రతమును చెప్పదను. ఈ వ్రతము అన్ని పాపములను నశింపచేయును. పరమ పవిత్రమైనది. అన్ని దుఃఖములను తొలగింపచేయును. బ్రాహ్మణక్షత్రియ వైశ్య, శూద్రులకు స్త్రీలకు అన్ని కోరికలను తీర్చును. ఈ వ్రతము నాచరించినచో అన్ని వ్రతముల నాచరించిన ఫలము లభించును. దుస్స్వప్నములను నశింపచేయును. ధర్మమును ప్రసాదించును. దుష్టగ్రహములను నివారింపచేయును. ఈ పూర్ణిమా వ్రతము అన్ని లోకములలో ప్రసిద్ధి చెందినది. ఈ వ్రతమును నిర్వర్తించినచో పాపరాశి నశించును. మార్గశీర్ష శుద్ధ పూర్ణిమనాడు పవిత్రుడై నియమముగా ప్రాతఃకాలమున దంతధావనము చేసుకొని ఆచొరానుగుణముగా స్నానము చేసి తెల్లని వస్త్రములను ధరించి శుద్దుడై ఇంటికి వచ్చి మౌనము వహించి, పాదప్రక్షాళనమును చేసుకొని ఆచమనమును చేసుకొని ప్రభువైన నారాయణుని స్మరించుచు నిత్య విధియైన దేవార్చనను చేసి తరువాత సంకలపూర్వకముగా భక్తి భావముతో లక్ష్మీనారాయణ దేవుని అర్చించవలయును. వ్రతమును స్వీకరించినవాడు ఆవాహనాసనగంధపుష్పాదులచే ‘నమో నారాయణాయ’ అని భక్తి తత్పరుడై పూజించవలయను. గీత నృత్యవాద్యములచే పురాణ పఠనాదులచే కాని స్తోత్రములచే కాని ఆరాధించవలయును. లక్ష్మీనారాయణుని పురోభాగమున చతురస్ర స్థండిలమునేర్పరచి గృహ్యసూత్రానుసారముగా ఆ స్థండిలమున ఆరంగుళముల ప్రదేశమున అగ్నిని స్థాపించవలయును. ఆజ్యభాగాంతము వరకు పురుషసూక్తముచే పొంగలిచే (దరువు) నువ్వులచే నెయ్యిచే హోమమును చేయవలయును. సర్వపాపనివృత్తి కొఱకు ప్రయత్నముచే ఒకమారు, రెండుమార్లు మూడు మార్లు కాని హోమమును చేయవలయును. తమతమ గృహ్యసూత్రానుసారముగా ప్రాయశ్చిత్తాదికమంతటిని ముగింపచేసి, హోమమును సమాప్తిని గావించి శాంతి సూక్తమును పఠించవలయును.

మరల దేవుని సమీపించి మరల పూజను సలుపవలయును. భక్తి గలవాడై లక్ష్మీనారాయణునికి ఉపవాసమును ఆర్పించవలయను. ఓ దేవా ! నీ యాజ్ఞచే పౌర్ణమి తిథిన నిరాహారముగా నుండి మరుసటి దినమున భుజింతును. నాకు రక్షకుడవు కమ్ము. ఇట్లు విజ్ఞాపన చేసి స్వామికి అర్ఘ్యము నీయవలయును. అట్లే భూమి పై మోకాళ్ళనుంచి తెల్లని పూవులను అక్షతలను చేతిలో తీసుకొని క్షీరోదార్ణవ సంభూత ! అత్రిగోత్రసముద్భవ ! గృహాణార్ఘ్యం మయా దత్తం రోహిణీ నాయకప్రభో !” అను మంత్రముచే అర్ఘ్యమును చంద్రునకిచ్చి చేతులు జోడించి ప్రార్థించవలయును. (“పాలసముద్రమున పుట్టిన వాడా ! అత్రిగోత్రమున ఆవతరించినవాడా ! రోహిణీపతీ! నేనిచ్చిన అర్ఘ్యమును స్వీకరించుము” అని పై మంత్రమున కర్ణము) తూర్పు ముఖముగా నిలచి చంద్రుని చూచుచు తెల్లని కిరణములు కలిగిన, ద్విజరాజువైన, రోహిణీ పతివి, లక్ష్మీదేవి సోదరుడవు" అయిన నీకు నమస్కారము. అని ప్రార్థించి పురాణ శ్రవణాదులచే జాగరమును చేయవలయును, పవిత్రుడై ఇంద్రియ జయము కలిగి పాషండుల దృష్టి సోకక యుండవలయును. తరువాత ప్రొద్దున స్వాచారాను గుణముగా యథావిధిగా నిత్యకృత్యములను నిర్వర్తించి విభవాను గుణముగా విస్తరముగా మరల స్వామిని పూజించవలయును. బ్రాహ్మణులకు భోజనము పెట్టి, వినయముతో బంధుమిత్ర భృత్యపరివారముతో మౌనముగా తాను భుజించవలయును.

ఇట్ల పుష్యాది మాసములలో పూర్ణిమా తిథిన ఉపవసించి వికారరహితుడగు శ్రీమన్నారాయణుని భక్తితో పూజించవలయును. ఇట్లు ఒక సంవత్సరము వ్రతము నాచరించి కార్తీక పూర్ణిమ నాడు ఉద్యాపనమును చేయవలయును. ఆ విధానమును చేప్పెదను వినుము. కళ్యాణకరమగు చతురస్రమండపమును చేయవలయును. ఆ మండపమును పుష్పమాలాదులచే ఛత్రచామర ధ్వజములచే అలంకరించవలయును. చాలా దీపములనుంచవలయును. గంటలు అమర్చవలయును. అద్దములతో కలశములతో కూర్చవలయును. ఆ మధ్యన పంచవర్ణములతో సర్వతో భద్రమును లిఖించవలయును. దాని పై జలపూరిత కుంభమునుంచవలయును. కలశమును వస్త్రముతో కప్పి, బంగారముతో కాని, వెండితో కాని, రాగితో కాని చేసిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రము పై నుంచవలయును. ఆ ప్రతిమను పంచామృతముతో అభిషేకించి క్రమము ననుసరించి గంధాదులతో అర్చించవలయును. ఇంద్రియ --నిగ్రహము కలవాడై భక్య భోజ్యములను నివేదన చేయవలయును. శ్రద్ధతో చక్కగా జాగరణ చేయవలయును. మరుసటి దినమున ప్రాతఃకాలమున యథావిధిగా పూర్వము వలె విష్ణువు నర్చించవలయును. ఆ ప్రతిమను సదక్షిణగా ఆచార్యునకు దానము చేయవలయును. సంపదలున్నచో కాదనక బ్రాహ్మణులను భుజింపచేయవలయును. శక్తి ననుసరించి సావధానముగా తిలదానమును చేయవలయును. వివేకము కలవాడై వీధిపూర్వకముగా తిలహోమమును చేయవలయును. ఇట్లు చక్కగా లక్ష్మీనారాయణ వ్రతమును నాచరించినవారు ఇహలోకమున పుత్రపౌత్రాదులతో మహాభోగముల ననుభవించి అన్ని పాపముల నుండి విముక్తిని పొంది పదివేల తరములతో యోగులకు కూడా దుర్లభమగు విష్ణుభవనమును చేరుదురు.

ఇది శ్రీ బృహన్నారదీయ పురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున, వ్రతాఖ్యానమున మార్గశీర్ష పూర్ణిమనాడు లక్ష్మీ నారాయణ వ్రతమను పదునెనిమిదవ అధ్యాయము సమాప్తము.