నారద మహా పురాణము - పూర్వార్థము
11 - గంగోత్పత్తిః - గంగామాహాత్మ్యమ్
నారదమహర్షి పలికెను :- “ఓ భ్రాతా ! చాల ఆశ్చర్యకరమైన విషయమును చెప్పితిరి. ఆ యగ్ని ఆదితిని వదిలి రాక్షసులను ఎట్లు క్షణములో దహించి వేసెను ? మిక్కిలి ఆశ్చర్యమును కలిగించు ఆదితి మహాత్మ్యమును తెలుపుము. సజ్జనులైన మునీశ్వరులు పరులకు ఉపదేశించుట యందే ఆసక్తి కలిగియుందురు కదా !”
సనకమహర్షి పలికేను:- ఓ నారదా ! హరిభక్తియందు ఆసక్తిగల మనసు కలవారి మహాత్మ్యమును వినుము. శ్రీహరి ధ్యానమునందు మనసునుంచిన సాధువులను ఎవరు బాధించగలరు ? హరిభక్తి పరుడున్న ప్రదేశమున బ్రహ్మ, శివుడు, శ్రీహరి, దేవతలు, సిద్ధులు మునీశ్వరులు ఎల్లపుడు నివసింతురు. శాంత చిత్తులైన వారి హృదయమున శ్రీహరి నీవసించును. హరి నామ కీర్తనము చేయువారికి ధ్యానము నందాసక్తి కలవారి విషయమునేమీ చెప్పువలయును. శివపూజ చేయువాడు కాని. శ్రీమహావిష్ణువును పూజించువాడు కొని ఉన్న ప్రదేశముననే లక్ష్మి, దేవతలందరు నివసించేదరు. విష్ణుపూజాపరుడున్న ప్రదేశమున అగ్ని బాధించదు. రాజు కాని, చోరులు కానీ, వ్యాధులు కానీ బాధించవు. పేతములు, పిశాచములు, కూష్మాండ గ్రహములు, బాలగ్రహములు, డాకీనులు, రాక్షసులు అచ్యుతుని పూజించువానిని బాధించజాలవు. పరులను పీడించు స్వభావము కల భూతభేతాలొదులు లక్ష్మీనారాయణులను పూజించు సద్భక్తులున్న చోట నశించుపోవును, ఇంద్రియజయము కలవారు, అందరి హితమును కోరువారు, ధర్మబద్దమైన కర్మలను ఆచరించువారు ఉన్న ప్రదేశముననే అన్ని తీర్థములు, దేవతలు ఉందురు. ఒక నిమిషము గాని నిమిషార్థము కాని యోగులున్న ప్రదేశముననే అన్ని శ్రేయస్సులు కలుగును. ఆ ప్రదేశమే పుణ్యతీర్థము. అదియే తపోవనము. శ్రీహరినామమును కీర్తించినంతనే అన్ని ఉపద్రవములు నశించును. స్తోత్రములచే పూజలచే నశించును. ధ్యానము చేసినచో నశించునని విడిగా చెప్పవలెయునా ? ఇట్లు రాక్షసులు సృష్టించిన అగ్నిచే రాక్షసులతో కూడియున్న అరణ్యమంతయూ కాలిపోయెను. విష్ణుచక్రముచే రక్షించబడిన అదితి మాత్రమే దగ్ధము కాలేదు.”
తరువాత ప్రసన్నమైన ముఖము కలవాడు, పద్మదళమువలె విశాలమైన నేత్రములు కలవాడు, శంఖ చక్ర గదొద్యాయుధములను ధరించినవాడు, చిరునవ్వుతో వెలుగుచున్న దన్తముల కాంతితో దిక్కులను ప్రకాశింపచేయువాడు అయిన శ్రీమన్నారాయణుడు అదితి సమీపములో ప్రత్యక్షమాయెను. పరమ పవిత్రమైన తన చేతితో అదితిని తాకుచు ఇట్లు పలి కెను.
శ్రీమన్నారాయణ భగవానుడు పలికెను :- “ఓ దేవమాతా ! నీవు తపస్సుచే నన్ను ఆరాధించితివి. నేను నీకు ప్రసన్నుడనైతిని. చాలకొలము అలసిఉంటివి నీకు శుభము కలుగును. సంశయించవలసిన పనిలేదు. నీకు నచ్చిన వరమును కోరుకొనుము. ఈయగలను. ఓ మహానుభావురాలా ! భయపడకుము. తప్పక మేలు జరుగును.” ఇట్లు శ్రీహరి పలుకగా శ్రీహరికి నమస్కరించి అన్ని లోకములకు ఆనందమును కలిగించు శ్రీహరిని స్తోత్రము చేసెను.
అదితి పలికెను:- ఈ దేవతలకు దేవుడవు, ప్రభువును, అంతటా వ్యాపించియుండువాడవు, సత్త్వరజస్తమో గుణభేదములచే లోకవ్యాపారములకు కారణభూతుడవు అయిన ఓ జనార్థనా! నీకు నమస్కారము. అనేక రూపములు గలవాడవు, రూపములేనివాడవు, మహానుభావుడవు అన్నిటిలో ఒకే రూపముతో నుండువాడవు, గుణరహితుడవు, అనన్త కళ్యాణగుణస్వరూపుడవు అయిన నీకు నమస్కారము. అన్ని లోకములకు నాధుడవు, పరమజ్ఞానస్వరూపుడవు, సజ్జనులగు భక్తులను వాత్సల్యముతో చూచు స్వభావము కలవాడవు, మంగళస్వరూపుడవు అయిన నీకు నమస్కారము. మునీశ్వరులు పూజించి అవతార రూపములు గల ఆదిపురుషుని నా కోరిక సిద్ధించుటకు నమస్కరించుచున్నాను. శ్రుతులకు, జ్ఞానులకు తెలియ శక్యము కానివాడు జగత్కారణభూతుడు, మాయతో కూడియుండువాడు, మాయకు వశము కానివాడు అయిన పరమాత్మకు నమస్కరించుచున్నాను. ఆశ్చర్యమును కలిగించు నీ దర్శనము మాయను పారద్రోలుటకు కారణము. జగత్స్వరూపుడు, జగత్కారణ భూతుడు అయిన అందరిచే నమస్కరించబడు వానిని నమస్కరించుచున్నాను. నీ పాదపద్మముల పరాగములను సేవించుటచే తమ మస్తకములను కాపాడు కొనుచు పరమసిద్ధిని పొందుచున్నారు. కమలాపతివైన నీకు నమస్కారము. బ్రహ్మాదులకు కూడా తెలియ శక్యము కాని మహిమ కలవాడు, భక్తులకు సన్నిహితముగా నుండువాడు, భక్తులతో కలిసి ఉండువాడు అయిన స్వామిని నమస్కరించుచున్నాను. అన్ని సంగములను వదిలి శాంతచిత్తులయిన వారికి ఆత్మ సంగతిని కలిగించు కరుణాసముద్రుడు, సంగరహితుడు, యజ్ఞములకు ప్రభువు యజ్ఞకర్మస్వరూపుడు, యజ్ఞకర్మలయందు ఉండువాడు, యజ్ఞఫలములనిచ్చువాడు యజ్ఞకర్మలను బోధించువోడు అయిన ఆదిదేవునికి నమస్కరించుచున్నాను. కేవలము నామసంకీర్తనముచే అజామిలునికి పరమపదమును ప్రసాదించిన లోకసాక్షిని నమస్కరించుచున్నాను. హరిరూపముతో నున్న మహాదేవుడుగా, శివరూపముతో నున్న జనార్దనుడుగా, లోకాధిపతిగానున్న జగద్గురువునకు నమస్కరించుచున్నౌను. నీ మాయాపొశముతో బంధించబడి బ్రహ్మాదిదేవాధిపతులు కూడా పరస్వరూపమును తెలియలేకున్నారు. అట్టి సర్వనాయకుడవగు నీకు నమస్కారము. అయోగ్యులకు హృదయపద్మములో నున్ననూ దూరమున నున్నవానీ వలే తోచుచున్నావు. ప్రమాణములకు అందని సత్త (ఉనికి) గల జ్ఞాన సాక్షికి నమస్కారము. నీ ముఖమునుండి బ్రాహ్మణులు పుట్టిరి. బాహువులనుండి క్షత్రియులు పుట్టిరి. ఊరువులనుండి వైశ్యులు పుట్టిరి. పాదములనుండి శూద్రులు పుట్టిరి. మనసు నుండి చంద్రుడు, నేత్రము నుండి సూర్యుడు, ముఖము నుండి అగ్ని, ఇంద్రుడు, ప్రాణము నుండి వాయువు పుట్టెను. ఋగ్యజుస్సామ స్వరూపునకు సత్యవాక్స్వరూపునకు షడంగరూపునకు మాటిమాటికి నమస్కారము. నీవే ఇంద్రుడవు; వాయువు; చంద్రుడవు; శంకరుడవు; యముడవు; అగ్నీవి; నిర్ఋతివి; వరుణుడవు; సూర్యుడవు, దేవతలు, స్థావరములు, పిశాచములు, రాక్షసులు, పర్వతములు సిద్దులు, గంధర్వులు, నదులు, భూమి, సముద్రములు అన్నియు నీవే. జగత్తునకు ఈశ్వరుడవు నీవే. పరములన్నిటికీ పరుడవు నీవే. ఈ ప్రపంచమంతయూ నీరూపమే. కావున నీకు సర్వకాలములందు నమస్కారము. దిక్కులేని వారికి నీవే దిక్కు. సర్వజ్ఞుడవు. భూతముల, దేవతల, అధిపతుల స్వరూపుడవు నీవే. ఓ జనార్దనా ! రాక్షసులచే బాధించబడు నా పుత్రులను కాపాడుము.” ఇట్లు దేవమాతయగు అదితి జనార్ధనుని స్తుతించి, మాటిమాటికి నమస్కరించి చేతులు జోడించి ఆనందాశ్రువులతో తడిసిన స్తనములు కలదై మరల ఇట్లు పలికెను.
“అన్నిటికి ఆదికారణభూతుడవైన ఓ దేవేశా ! నీ అనుగ్రహమునకు పాత్రురాలగుదునేని స్వర్గవాసులగు నా పుత్రులకు అడ్డులేని ఐశ్వర్యమును ప్రసాదించుము. ఓ అంతర్యామీ ! జగత్స్వరూపా ! సర్వజ్ఞుడా ! పరమేశ్వరా ! నీకు తెలియనిదేమున్నది ? నన్ను పరీక్షించుచుంటివా ? అయిననూ నా మనసునకు నచ్చిన దానిని నీకు చెప్పేదను. నా పుత్రులు వ్యర్ధులై ఉన్నారు. దైత్యుల చేత పీడింపబడుచున్నారు. అయిననూ నేను దిలీపుత్రులను హింసించదలచలేదు. వారు కూడా నా పుత్రులే. వారికి హాని కలుగకుండా నా పుత్రులకు ఐశ్వర్యమును ప్రసాదింపుము.” ఇట్లు అదితి పలుకగా దేవదేవేశుడగు శ్రీమన్నారాయణుడు మరల ప్రీతిచెంది అదితిని సంతోషింపచేయుచు ఆదరముతో దేవమాతను గూర్చి ఇట్లు పలికెను.
శ్రీమన్నారాయణ భగవానుడు పలికెను :- “ఓ దేవమాతా ! నేను సంతోషించితిని. నీకు శుభమగు గాక. నేను నీకు పుత్రుడనగుదును. సవతి కొడుకుల యందు దుర్లభమగు వాత్సల్యమును నీవు చూపితివి. నీవు చేసిన స్తోత్రమును చదివిన మానవులకు ఐశ్వర్యముతో కూడిన పుత్రులు తరుగకుండా ఉందురు. తన పుత్రునియందు ఇతరుల పుత్రుని యందు సమభావములో నుండు వారికి పుత్రశోకము కలుగదు. ఇది సనాతన ధర్మము.”
అదితి పలికెను :- ఆదిపురుషుడవు పరమపురుషుడవు అయిన నిన్ను నేను మోయలేను. నీవు లెక్కలేనన్ని బ్రహ్మాండములు రోమకూపములుగా గలవాడవు. సర్వేశ్వరుడవు సర్వకారణుడవు. దేవతలందరూ శ్రుతులన్నియూ నీ ప్రభావమును తెలియజాలవు. అట్టి దేవదేవేశుడవైన నిన్ను నేనెట్లు ధరించగలను ? అణువుకంటె అణువు, పుట్టుకలేని వాడవు, పరము కంటే పరుడవు, ప్రభువువు, పురుషోత్తముడవైన నిన్ను నేనెట్లు ధరించగలను ? నీ నామస్మరణ మాత్రముననే మహాపాతకములతో కూడి యున్నవాడు కూడా పాతకముల నుండి విడివడును. అట్టి దేవదేవుడవైన నీవు గ్రామ్యులమైన (అజ్ఞానులు) మాయందేట్లు పుట్టెదవు ? మత్స్యవరాహాద్యవతారములవలె ఇది కూడా ఒక అవతారమే. నీ విశేష చేష్టలనెవరు తెలియగలరు ? నీ పాదపద్మములకు వందనములాచరించుచు, నీ నామమును స్మరించుచు నిన్నే ధ్యానించుచుందును. నీ సంకల్పము ప్రకారము చేయుము.
సనకమహర్షి పలికెను :- దేవదేవుడగు జనార్దనుడు అదితి పలికిన మాటలను విని దేవమాతకు అభయమిచ్చి ఇట్లు పలికేను.
శ్రీమన్నారాయణ భగవానుడు పలికెను :- “ఓ మహానుభావురాలా ! నీవు నిజమునే చెప్పితివి. ఈ విషయమున సంశయమే లేదు. అయిననూ రహస్యములన్నింటికంటే పరమ రహస్యమును నేను చెప్పుచున్నాను, వినుము. రాగద్వేషములు లేనివారు, అసూయను పోగొట్టినవారు, డాంబికము లేని వారు, నా భక్తులు నాయందే మనసును నిలిపిన వారు, నన్ను ధరించగలరు (మోయగలరు). ఇతరులను బాధించుటలో వైముఖ్యము కలవారు, శివభక్తి పరాయణులు, నా కథను వీనుటలో ఆసక్తి కలవారు నన్ను మోయగలరు. పతివ్రతలు, పతియందు పేమ గలవారు, పతిభక్తి పరాయణులు మాత్సర్యమును విడిచిన స్త్రీలు కూడా నన్ను మోయగలరు. తల్లిదండ్రులను సేవించువారు, గురుభక్తి కలవారు, అతిథియందు ప్రీతిని చూపువారు, బ్రాహ్మణులకు హితమును చేయువారు నన్ను మోయగలరు. పుణ్యతీర్థములను సేవించుటయందాసక్తి కలవారు, సత్సంగమునందు కోరిక గలవారు, లోకులను అనుగ్రహించు స్వభావము కలవారు నన్ను మోయగలరు. ఇతరులకు ఉపకారము చేయువారు, ఇతరుల ద్రవ్యమును ఆశించనివారు, ఇతరుల స్త్రీల విషయమున నపుంసకుల వలె నుండు వారు నన్ను మోయగలరు. తులసిని ఉపాసించువారు, నామసంకీర్తనము చేయువారు, గోవులను రక్షించువారు నన్ను మోయగలరు. ఇతరుల నుండి దానమును గ్రహించనివారు, ఇతరుల అన్నమును భుజించనివారు, ఇతరులకు అన్నమును జలమును ఇచ్చువారు నన్ను మోయగలరు. ఓ దేవీ ! నీవు భర్తయందు అనురాగము కలదానవు. సాధ్వివి. ప్రాణులహితమును కోరుదానవు. కావున నీకు పుత్రునిగా జన్మించి నీ కోరికను తీర్చగలను.” దేవదేవేశుడగు శ్రీమన్నారాయణుడు ఇట్లు పలికి దేవమాతయగు అదితికి తన మెడలోని పుష్పమాలను, అభయమునిచ్చి అంతర్థానమును చెందెను. దక్షప్రజాపతి పుత్రిక దేవమాతయగు అదితి సంతోషముతో నిండిన మనసుగలదై శ్రీమన్నారాయణునికి నమస్కరించి తన ఇంటికి వెళ్ళెను.
మహానుభావురాలు, సంతోషయుక్తు రాలు, లోకములచే నమస్కరించదగినది అయిన అదితి కొంతకాలమునకు సరిఅయిన సమయమున అన్ని లోకములచే నమస్కరించబడు శ్రీమన్నారాయణుని పుత్రునిగా ప్రసవించెను. శంఖచక్రములను ధరించినవాడు, శాంతుడు, చంద్రమండల మధ్యమున గోచరించువాడు, అమృతకలశమును, పెరుగన్నమును చేత ధరించినవాడు, వామనుడను పేరుగలవాడు, వేయి సూర్యుల ప్రకాశము కలవాడు, వికసించిన కమలముల వలె విశాలములైన నేత్రములు కలవాడు, అన్ని ఆభరణములు కలవాడు, పచ్చని వస్త్రమును ధరించినవాడు, స్తోత్రము చేయదగినవాడు, మునిగణములతో కూడియుండువాడు, అన్ని లోకములకు ఒక నాయకుడు అయిన శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించుట చూచిన కశ్యప మహర్షి ఆనందముతో తడబడుచు నమస్కరించి చేతులు జోడించి స్తోత్రము చేయుటకు ఉపక్రమించెను.
కశ్యపమహర్షి పలికెను :- “సమస్త జగత్తునకు కారణభూతునకు నమస్కారము. సమస్తలోకములను రక్షించు వానికి నమస్కారము. దేవతల నాయకునికి నమస్కారము. దైత్యులను నశింపచేయువానికి నమస్కారము. భక్తజన ప్రియునికి సజ్జనరంజకునికి, దుర్జననాశకునికి, జగదీశ్వరునికి నమస్కారము. కారణార్థము వామనుడైన వానికి, అమిత పరాక్రమము కలవానికి శార్జము చక్రము ఖడ్గము గదను ధరించిన పురుషోత్తముడైన శ్రీమన్నారాయణునకు నమస్కారము. సముద్రమున నివసించువానికి, సజ్జనహృదయకమలముల యందు నివసించు వానికి, సూర్యాదితేజోరాశులను మించిన తేజస్సు కలవానికి, పుణ్య కథలలో నివసించువానికి నమస్కారము. సూర్యచంద్రులు నేత్రములుగా గలవానికి, యజ్ఞఫలము నిచ్చువానికి, యజ్ఞాంగములతో ప్రకాశించువానికి, సజ్జన ప్రియునికి నమస్కారము. జగత్కారణములకు కొరణమైన వానికి, శబ్దాదిగుణములు అంటని వానికి, దివ్యానందము నిచ్చువానికి, భక్తుల మనసులో నుండు వానికి నమస్కారము. చీకటిని తొలగించువానికి, మందరపర్వతమును మోసిన వానికి, యజ్ఞవరాహమను పేరుగల వానికీ, హిరణ్యాక్షుని చీల్చిన వానికి నమస్కారము. వామన రూపమును ధరించిన మౌనికీ, క్షత్రియ కులాంతకునికి, రావణాసురుని మర్ధించిన వానికి, నందసుతునికి నమస్కారము. కమలాకాంతునకు, ఆనందము నిచ్చువానికి, తలచిన వారి ఆర్తీని తొలగించువానికీ, మాటి మాటికి నమస్కారము. యజ్ఞేశునకు, యజ్ఞవిన్యాసునకు, యజ్ఞవిఘ్నవినాశునకు, యజ్ఞరూపునకు, పూజారూపునకు, యజ్ఞాంగునకు నమస్కారము. నిన్ను పూజింతును. లోకవనుడైన వామనుడు ఇట్లు స్తుతించబడి చిరునవ్వుతో కశ్యపునికి ఆనందమును పెంచుచు ఇట్లు పలికెను.
శ్రీమన్నారాయణ భగవానుడు పలికెను :- “ఓ తండ్రీ ! దేవతలచే పూజించబడువాడా ! నీ విషయమున సంతోషించితిని. నీకు శుభము కలుగును. త్వరలోనే నీ కోరికను సాధించగలను. నే నిదివరకు రెండు జన్మలలో మీకు పుత్రుడినైతిని. అట్లే ఈ జన్మలో కూడా మీకు ఉత్తమానందమును అందించగలను.”
ఇంతలో బలిచక్రవర్తి గురువైన శుక్రాచార్యులతో, ఇతర మునీశ్వరులతో కలిసి దీర్ఘసత్రమను. గొప్పయజ్ఞము నారంభించెను. ఆ యజ్ఞమున హవిస్సును స్వీకరించుటకు లక్ష్మీనారాయణుని ఋషులు ఆహ్వానించిరి. వృద్ధిచెందిన ఐశ్వర్యముకల బలిచక్రవర్తి చేయుచున్న యజ్ఞములో పాల్గొనుటకు తల్లిదండ్రుల ఆజ్ఞను పొంది బ్రహ్మచారి అయిన వామనుడు భక్తవత్సలుడు కావున చిరునవ్వుతో లోకమును మోహింప చేయుచు శ్రీహరి ప్రత్యక్షముగా హవిస్సును స్వీకరించుటకు వచ్చేనా అనునట్లు అచటికి వచ్చెను. చెడునడక గలవాడుకాని, మంచి నడక గలవాడుకొని, జడుడు కాని హితుడు కొని భక్తి కలవానిలో హారీ వేంచేసి యుండును. జ్ఞాననేత్రము గల ఋషులు వచ్చుచున్న వామనుని చూచి శ్రీమన్నారాయణ దేవునిగా తెలిసి సభ్యులతో కలిసి లేచిరి. దైత్యగురువైన శుక్రాచార్యులు ఈ విషయమును తెలుసుకొని ఏకాన్తమున బలిచక్రవర్తితో ఇట్లు పలికెను. మూర్బులు తన బలమును తెలియకనే కార్యములను చేతురు కదా.
శుక్రాచార్యులు పలికెను :- “ఓ దైత్యరాజా ! సౌమ్యుడా ! శ్రీమహావిష్ణువు వామనరూపముతో అదితి పుత్రుడై నీ సంపదను హరించబోవుచున్నాడు. ఇపుడు నీ యజ్ఞమునకు వచ్చుచున్నాడు. కావున నీవు అతనికి ఏ కొద్దిదైనను ఈయకుము. ఓ పండితుడా ! నా అభిప్రాయమును వినుము. తన బుద్దిసుఖము నిచ్చును. గురుబుద్దీ విశేషముగా సుఖము నిచ్చును. పరబుద్ధి వినాశనము కలిగించును. స్త్రీబుద్ధి ప్రళయమునే కలిగించును. శత్రువులకు హితమును చేయువానిని చంపియే తీరవలయును.”
బలిచక్రవర్తి పలికెను :- “ఓ గురువర్యా ! ఇట్లు ధర్మమార్గవిరోధముగా చెప్పవద్దు. స్వయముగా శ్రీమహావిష్ణువే స్వీకరించినచో ఇంతకన్నా ఎక్కువ కావలసినదేమున్నది. శ్రీమహావిష్ణువునకు ప్రీతి కలిగించుటకే విద్వాంసులు యజ్ఞమును చేసెదరు. ఆ శ్రీమహావిష్ణువే స్వయముగా హవిస్సును స్వీకరించినచో ఈ భూమండలమున నన్ను మించినవాడెవడుండును ? దరిద్రుడైనను శ్రీమహావిష్ణువునకు ఏ కొంచెమర్పించిననూ అదియే ఉత్తమమైన, అక్షయమైన దానమనబడును. పురుషోత్తముని పరమభక్తి చే స్మరించిననూ ఏదో విధముగా ఆర్చించినను ఉత్తమ గతిని ప్రసాదించును. దుష్టచిత్తులు స్మరించినను శ్రీహరి పాపములను హరింపచేయును. అనుకోకుండా తాకిననూ అగ్ని కాల్చును కదా ! శ్రీహరి నామము నాలుక చివర నుంచుకొనినవాడు మళ్ళీ తిరిగి రాని విష్ణులోకమును పొందగలడు. రాగద్వేషాదులను వదిలి ఎప్పుడూ గోవిందనామస్మరణము చేసిన వారు విష్ణుభవనమును చేరునని పండితులు చెప్పెదరు. శ్రీహరియందు భక్తిచే అగ్నియందు కాని, బ్రాహ్మణునియందు కాని హవిస్సును అర్పించినచో శ్రీహరి ప్రసన్నుడగును. నేను శ్రీహరి సంతోషము కొఱకే ఉత్తమ యాగమును చేయుచున్నాను. “ఈ యాగమునకు స్వయముగా శ్రీమహావిష్ణువే వచ్చినచో కృతార్థుడనగుదును. సంశయములేదు.” ఇట్లు బలిచక్రవర్తి చెప్పుచుండగా వామన రూపమును ధరించిన శ్రీమహావిష్ణువు హవిస్సులచే జ్వలించుచున్న అగ్నిచే సుందరమైన యాగస్థానమునకు వచ్చెను. కోటిసూర్యుల కాంతి గలవాడు తగిన విధముగా అవయముల పొందికలో అందముగానున్న వామనుని చూచి తొందరతో లేచి చేతులు జోడించి స్వాగతము పలి కెను. అసనము నర్పించి వామనరూపముతో నున్న శ్రీమహావిష్ణువునకు పాదప్రక్షాళనము చేసి కుటుంబముతోపాటు పాదోదకమును శిరస్సున ధరించి పరమానందమును చెందెను. బలిచక్రవర్తి జగన్నివాసుడగు - శ్రీమహావిష్ణువునకు, యథావిధిగా అర్ఘ్యమునిచ్చి శరీరమున పులకలు, కన్నుల ఆనందబాష్పములు రాగా ఇట్లు పలికెను.
బలిచక్రవర్తి పలికెను :- “ఈవేళ నా జన్మ సఫలమైనది. ఈ వేళ నా యజ్ఞము సఫలమైనది. నా జీవితము ధన్యమైనది. నేను కృతార్థుడనైతిని. సంశయము లేదు. ఎంత శ్రమించిననూ లభించని సఫలమైన అమృతవర్షము నాకు లభించినది. నీ రాకచే శ్రమలేకనే గొప్ప పండుగ వచ్చినది. ఈ ఋషులందరూ కృతార్డులైరి. సంశయము లేదు. వీరు మొదట చేసిన తపస్సు ఈ వేళ సఫలమైనది. నేను ముమ్మాటికీ కృతార్థుడనైతిని. నీకు ముమ్మారు వందనములు. నీ ఆజ్ఞచే నీ పనిని చేయవలయునని నా సంకల్పము. మిక్కిలి ఉత్సాహముతో నున్న నన్ను ఆజ్ఞాపించుము” ఇట్లు బలిచక్రవర్తి పలుకగా వామనుడు నవ్వుచు పలికెను. తపస్సు చేసుకొనుటకు నాకు మూడడుగుల భూమి నిమ్ము. ఈ మాటలను వినిన బలి “రాజ్యమునో, నగరమునో, గ్రామమునో కోరక, చివరకు ధనమునైన కోరక ఇది యేమీ ఇట్లు అడిగితిరి.” అని పలికెను. ఆ మాటలను వినిన వామనుడు రాజ్యభ్రష్టుడు కానున్న వానికి వైరాగ్యమును కలిగించునట్లు ఇట్లు పలికెను.
శ్రీమన్నారాయణ భగవానుడు పలికెను :- “అన్ని రహస్యములలో పరమ రహస్యమును చెప్పెదను. ఓ దైత్యరాజా ! వినుము. ఏ సంగములు లేనివారికి అర్ధములతో ఏమి ప్రయోజనమో చెప్పుము. నేను అన్ని ప్రాణులలో అన్తర్యామిగా ఉందునని భావించుము. అట్లే ఈ జగత్తంతయూ నాలోనే ఉన్నది. కావున ఇతరులతో నేను సాధించవలసినదేమున్నదో చెప్పుము. రాగద్వేషములు లేక శాంతులై కపటమును వదిలి నిత్యానంద స్వరూపులుగా నున్నవారు ఇతర ధనములతో నేమి సాధించగలరు ? తన వలె అన్ని ప్రాణులు అని చూచువారికీ ఇదియంతయు ఆత్మకంటే భిన్నము కానిదే అయినపుడు ఇచ్చువాడెవడు ? ఇచ్చునదేమి ? ఈ భూమి క్షత్రియాధీనములో నుండును అని శాస్త్రనిర్ణయము. రాజాజ్ఞలో నుండువారికి పరమానందము లభించును. ఓ బలిచక్రవర్తీ ! మునులు కూడా తమ తపస్సులో ఆరవభాగమును రాజునకీయవలయును. అన్నివిధములుగా ప్రయత్నించి ఈ భూమిని బ్రాహ్మణునకు దానమును చేయవలయును. భూదానము యొక్క మాహాత్మ్యము ఇంకొకదానికి లేదు. ఉండబోదు. భూదానమును చేయువారు పరమానందమును పొందుదురు. ఈ విషయమున సంశయము లేదు. నిత్యాగ్నిహోత్రుడు, శ్రోత్రియుడు అయిన బ్రాహ్మణునికి ఏ కొంచెము భూమీనీ దానము చేసిననూ పునరావృత్తి రహితమైన బ్రహ్మలోకమునకు వెళ్ళును. భూమిదానమును చేసినవాడు అన్ని దానములు చేసినవాడగును. భూదానము చేసినవారు మోక్షమును పొందెదరు. భూదానము సర్వ శ్రేష్ఠమైన దానము. భూదానము అన్ని పాపములను నశింపచేయును. మహాపాతకములతో కూడియున్ననూ అన్ని పాతకములున్ననూ పదిమూరలు భూమిని దానము చేసినవారు అన్ని పాపములనుండి విముక్తుడగును. యోగ్యునికి భూదానము చేయువాడు అన్ని దానములు చేసిన ఫలితమును పొందును. భూదానముతో సమానమైనది మరియొకటి ఈ మూడు లోకములలో లేదు. బ్రతుకు తెరువు లేని బ్రాహ్మణునికి భూమిని దానము చేసినవానికి కలుగు పుణ్యఫలమును నేను కూడా నూరు సంవత్సరములలో కూడ చెప్పజాలను. దేవపూజలయందాసక్తుడై బ్రతుకుతెరువులేని బ్రాహ్మణునికి ఏ కొంచెము భూమిని దానము చేసిననూ వోడు. విష్ణువే. ఇచట సంశయములేదు. చెఱుకు, గోధుమ, కంది, పోకచెట్టు గల భూమిని దానము చేసినవాడు విష్ణువే. సంశయములేదు. బ్రతుకు తెరువు లేనివాడు, దరిద్రుడు, కుటుంబము కలవాడు అయిన బ్రాహ్మణునికి కొంచేము భూమిని దానము చేసిననూ విష్ణుసాయుజ్యమును పొందును. దేవపూజలయందు ఆసక్తుడైయున్న బ్రాహ్మణునకు ఒక అడ్డ ధాన్యము (నాలుగు కిలోలు) విత్తుటకు యోగ్యమైన భూమిని దానమును చేసినవాడు మూడు రోజులు గంగా స్నానమును చేసిన ఫలమును పొందును. బ్రతుకుతెరువు. లేనివాడు సదాచార పరాయణుడు అయిన బ్రాహ్మణునకు నాలుగు బస్తాల ధాన్యమును విత్తుటకు తగిన భూమిని దానము చేసిన వానికి నూరు అశ్వమేధ యాగముల ఫలమును నూరు గంగా స్నానముల ఫలము లభించును. దరిద్రుడైన బ్రాహ్మణునకు పుట్టెడు ధాన్యమును (8 బస్తాలు) విత్తుటకు తగిన భూమిని దానము చేసినవానికి, వేయి అశ్వమేధములను నూరు వాజపేయములను గంగాతీరమున చేసిన ఫలము లభించును. అన్ని దానములలో గొప్ప దానము సాటిలేని దానము భూదానమని చెప్పబడినది. భూదానము అన్ని పాపములను నశింపచేయును. మోక్షమును ప్రసాదించును.
ఓ దైత్యరాజా ! ఈ విషయమున ఒక ఇతిహాసమును చెప్పెదను. వినుము. ఈ ఇతిహాసమును శ్రద్దగా వినిన వానికి భూదానఫలము లభించును. పూర్వకోలమున బ్రాహ్మకల్పమున మహామతి, దరిద్రుడు, వృత్తి హీనుడగు బ్రాహ్మణుడు, భద్రమతి అని పేరుగల వాడుండెను. ఇతను అన్నిశాస్త్రములను, అన్ని వేదములను అన్నిపురాణములను, ధర్మ శాస్త్రములను అభ్యసించేను. భద్రమతికి ఆరుగురు భార్యలుండిరి. శ్రుతి, సింధు, యశోవతి, కామిని, మాలినీ, శోభా అని వారి పేర్లు. ఈ భార్యలయందు ఇతనికి రెండు వందల నలభైమంది పుత్రులు కలిగిరి. ఈ పుత్రులు భార్యలు చివరికి తాను కూడా ఆకలిచే పీడించబడుచు ఆకులమైన మనస్సుతో విలపించెను. భాగ్యరహితమైన జన్మ, ధనములేని జన్మ వ్యర్థము. ధర్మము, ఖ్యాతి లేని జన్మము వ్యర్థము. బహుసంతానము గలవానికి ఐశ్వర్యము లేనిచో వాని జన్మము వ్యర్థము. సౌమ్యత, వైదుష్యము, సత్కుల జన్మ మొదలగు సద్గుణములు దారిద్ర్యసాగరములో మునిగిన వారికి శోభించవు. ఐశ్వర్యము లేనివానిని ప్రియులు, పుత్రులు, పౌత్రులు, బాంధవులు, సోదరులు, శిష్యులు అందరూ విడిచెదరు. చండాలుడైనను, బ్రాహ్మణుడైనను భాగ్యవంతుడే పూజింపబడును. దరిద్రుడైన పురుషుడు శవము వలె లోకముచే నిందించబడును. సంపద కలవాడు కఠినుడైనను మృదుస్వభావము కలవాడే. గుణ హీనుడైననూ గుణవంతుడే. మూర్బుడైననూ పండితుడే. ఐశ్వర్యగుణముతో కూడినవాడు పూజించదగినవాడే. సంశయము లేదు. దారిద్ర్యము దుఃఖప్రదము. అందులో ఆశ పరమదుఃఖప్రదము. ఆశతో కూడినవారు అంతులేని దుఃఖమును పొందెదరు. ఆశకు దాసులైనవారు లోకమంతటికీ దాసులగుదురు. ఆశను దాసిగా చేసుకొన్నవారికి లోకమే దాస్యము చేయును. మహాత్ములకు అభిమానమే తిరుగులేని ధనము. ఆశచే అభిమానము నశించినచో దారిద్ర్యము ప్రాప్తించును. సర్వశాస్త్రార్థములు తెలిసినవాడైనను దరిద్రుడైనచో మూర్బుని వలె అనిపించును. దారిద్ర్యమను గొప్ప మొసలి పట్టినవానికి మోక్షము లేదు. దరిద్రత చాలా దుఃఖమును కలిగించును. ఆ దారిద్ర్యములో బహుపుత్రత, బహుభార్యాత్వము మరీ దుఃఖప్రదము. ఇట్లు సర్వశాస్త్రములు తెలిసిన భద్రమతి విలపించి ఐశ్వర్యము నిచ్చు మరియొక ధర్మమును గూర్చి ఆలోచించెను.
అన్ని దానములలో ఉత్తమ దానము భూదానమని నిశ్చయించి, దానము నిచ్చువాడేవడో అతడే వరిష్ణుడు అని, పరమ ధర్మమును పొందించునది అన్ని కోరికలను నెరవేర్చునది దానములలో ఉత్తమదానము భూదానమని ప్రశంసించబడినది. భూదానము చేసి కావలసిన దానినంతటిని పొందవచ్చును అని నిశ్చయించి బుద్ధిమంతుడు ధైర్యము గలవాడయిన భద్రమతి భార్యాపుత్రలతో కౌశాంబియను నగరమునుకు వెళ్ళెను. సుఘోషుడను పేరుగల ఐశ్వర్యవంతుడైన బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళి అయిదు మూరల భూమిని యాచించెను. సుఘోషుడు ధర్మము యందాసక్తి కలవాడు కావున కుటుంబి అయిన భద్రమతిని చూచి ప్రీతి గల మనసుతో చక్కగా పూజించి ఇట్లు పలికెను. “ఓ భద్రమతీ ! నేను కృతార్థుడనైతిని. నా జన్మ సఫలమైనది. నీయనుగ్రహముతో నా కులము పొవనమైనది.” అని పలికి భద్రమతిని బాగుగా పూజించి ధర్మ తత్పరుడైన సుషుడు అతనికి అయిదు మూరల భూమిని దానము చేసెను. విష్ణువునకు సంబంధించిన పృథివి, విష్ణువుచే పాలించబడు పృథివి. అట్టి పృథ్విని దానము చేయుటచే నాకు జనార్దనుడు ప్రసన్నడగు గాక అను మంత్రముచే సఘోషుడు ఆ బ్రాహ్మణోత్తముని విష్ణుభావనచే పూజించి ఆతనడిగినంత భూమిని దానము చేసెను. అట్లు భూదానమును స్వీకరించిన భద్రమతి హరిభక్తుడు శ్రోత్రియుడు కుటుంబి జ్ఞాని అయిన బ్రహ్మణోత్తముడు యాచించగా దానము చేసెను. ఇట్లు భూదానము చేసిన సుఘోషుడు కోటి వంశములతో కూడిన వాడై వెళ్ళిన తరువాత దుఃఖించని విష్ణుభవనమును చేరెను. సుఘోషుని నుండి భూమిని స్వీకరించిన భద్రమతి కూడా కుటుంబముతో పదివేల యుగములు విష్ణుభవనమున నివసించి, కోటియుగములు బ్రహ్మ భవనమున నివసించి, అయిదు కల్పములు ఇంద్రపదవిని అధిష్ఠించీ తరువాత భూలోకమునకు చేరి అన్ని ఐశ్వర్యములతో మహానుభావుడై ఉత్తమభోగములను అనుభవించేను. అయినను భద్రమతి కామ రహితుడై విష్ణువునందు భక్తిగలవాడై బ్రతుకుతెరువు లేని బ్రాహ్మణులకు భూమిని దానము చేసెను. భద్రమతికి శ్రీమహావిష్ణువు ప్రసన్నుడై సాటిలేని తత్త్వసంపదను ప్రసాదించి కోటి వంశములతో కూడిన వానికి సాటిలేని, మోక్షము నిచ్చెను. కావున సర్వధర్మ పరాయణుడవైన ఓ దైత్యపతీ ! మోక్షము కొఱకు తపస్సు చేయుటకు మూడడుగుల భూమినిమ్ము. అపుడు బలి చక్రవర్తి సంతోషించినవాడై జలపూర్ణమైన కలశమును తీసుకొని బ్రహ్మ చారియైన వామనునకు భూదానమును చేయుటకు సిద్ధపడెను.
అపుడు అంతటా వ్యాపించియున్న శ్రీమహావిష్ణువు జలధారనడ్డుచున్న శుక్రాచార్యుని తెలుసుకొని తన చేతిలో నున్న ధర్బా గ్రమున బ్రహ్మాస్త్రమును అనుసంధించెను. అపుడు ధర్బాగ్రమున కోటి సూర్యకాంతి గల అమోఘమైన అత్యుగ్రమైన బ్రహ్మాస్త్రము శుక్రాచార్యుల కన్నును మ్రింగవలయునని అసక్తి కలదాయెను. ఒంటి కన్నుగల శుక్రాచార్యుడు శూరులైన ఆ అసురులను శపించెను (చూడుము' అని శస్త్రమువంటి ఆ దర్బాగ్రమును చూపెను. తరువాత బలి చక్రవర్తి శ్రీమహావిష్ణువునకు మూడడుగుల భూమిని ధారవో సేను. విశ్వాత్మకుడైన శ్రీమహావిష్ణువు బ్రహ్మలోకము వరకు పెరిగెను. విశ్వశరీరుడైన శ్రీహరి . ఈ భూమిని రెండు అడుగులతో కొలిచెను. చివర వరకు శ్రీహరి పాదము కాంతివంతమై సాగగా కొలి బొటనవేలు గోరు చివరతో బ్రహ్మండము , రెడుగా చీలిపోయెను. ఆ బ్రహ్మండమునుండి జలము బహుధారలుగా బయటకు వచ్చెను. అట్లు వచ్చి విష్ణుపాదమును కడిగి నిర్మలము, లోకములను పావనము చేయు దాయెను. బ్రహ్మాండము వెలుపులనున్న జలము ధారారూపముగా నుండెను. అట్లు పావనమైన ఆ జలము బ్రహ్మాదిదేవతలను పొవనము చేసెను. సప్తర్షులతో సేవించబడి మేరుపర్వత శిఖరము పై పడెను. ఇట్లు అత్యాశ్చర్యకరమైన ఈ కార్యమును చూచిన బ్రహ్మాదిదేవతలు, ఋషులు, మనువులు ఆనందముతో పరవశులై స్తోత్రమును చేసిరి.
దేవతలు పలికిరి :- పరేశునికి, పరాత్మరూపునికి, పరాత్పరునికి, అపర రూపధారికి, బ్రహ్మ స్వరూపునికి, బ్రహ్మయందు ఆసక్తుడైన వాని బుద్దిలో నుండువానికి నమస్కారము. అడ్డులేని కర్మలు చేయు స్వభావము కలవానికి నమస్కారము. ఓ పరేశా ! పరమానన్ద స్వరూపా ! పరమాత్మా ! పరాత్పరా ! సర్వాత్మా ! జగత్స్వరూపా ! ప్రమాణములకు అందనివాడా ! నీకు నమస్కారము. అనేక నేత్రములు గల వానికి, అనేక బాహువులు గల వానికి, అనేక శిరస్సులు గల వానికి, అనేక గతులు గల వానికి నమస్కారములు. ఇట్లు బ్రహ్మాదులచే స్తుతించబడిన శ్రీమహావిష్ణువు సనాతనుడైన దేవదేవుడు స్వర్గవాసులైన దేవతలకు "అభయమునిచ్చి ఆనందించెను. విరోచనుని పుత్రుడైన బలి చక్రవర్తిని మిగిలిన ఒక అడుగు భూమి కొఱకు బంధించెను. తరువాత బలి చక్రవర్తి శరణువేడినవాడని తెలుసుకొని బలి చక్రవర్తికి రసాతల రాజ్యమును ప్రసాదించి, భక్తవత్సలుడైన శ్రీహరి ఇతనికి ద్వారపాలకునిగా ఉండెను.
నారద మహర్షి పలికెను :- భయంకరము సర్పముల భయముతో ఆకులము అయిన రసాతలమున శ్రీమహావిష్ణువు బలి చక్రవర్తికి ఆహారముగా ఏ పదార్థమును ఏర్పరిచెను ?
సనక మహర్షి పలికెను :- అగ్నిహోత్రములో మంత్ర పఠనము లేకనే హోమము చేయబడిన హవిస్సు, అయోగ్యునికిచ్చిన దానము, అపవిత్రునిచే అర్పించబడిన హవిస్సు, చేయబడిన దానము, సుకృతము ఇది అంతయు అధఃపతనఫలప్రదమై రసాతలమున బలి చక్రవర్తికి భోగ సాధనము. ఇట్లు శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తికి రసాతలము నిచ్చి, దేవతలకు అభయమును స్వర్గము నిచ్చెను. దేవతలు పూజించుచుండగా, మహర్షులు స్తోత్రము చేయుచుండగా, గంధర్వులు గానము చేయుచుండగా మరల వామనత్వమును పొందెను. ఆశ్చర్యకరమైన ఈ పనిని చూచి బ్రహ్మవాదులగు మునులు ఒకరినొకరు చిరునవ్వుతో చూచుచు పురుషోత్తముని నమస్కరించిరి. సర్వప్రాణి స్వరూపుడైన శ్రీమహావిష్ణువు వానమత్వమును పొంది సమస్తలోకమును మోహింపచేయుచు తపస్సునకు అరణ్యమునకు వెళ్ళెను. విష్ణుపాదమునుండి పుట్టిన గంగ ఇంతటి ప్రభావము కలది. గంగను స్మరించుట వలన అన్ని పాపములు నశించును. ఈ గంగామాహాత్మ్యమును దేవాలయమున, నదీతీరమున చదివిన వారికి, వినిన వారికి అశ్వమేధయాగము చేసిన ఫలము లభించును.
ఇది శ్రీ బృహన్నారదీయ పురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున గంగోత్పత్తి గంగామహాత్మ్యము అను పేరుగల పదకొండవ అధ్యాయము సమాప్తము.
