నారద మహా పురాణము - పూర్వార్థము
101 - బ్రహ్మవైవర్తపురాణానుక్రమణీ నిరూపణమ్
శ్రీ బ్రహ్మ పలికెను :-
నాయనా! ఇపుడు పదియవది, వేద మార్గాను దర్శకము యగు బ్రహ్మ వైవర్త పురాణమును చెప్పెదను వినుము. సావర్ణి మనువు దేవర్షియగు నారదునకు స్వయముగా చెప్పెను. ధర్మార్థ కామ మోక్షముల సారము, హరి హరులయందు ప్రీతి, హరి హరుల అభేద సిద్ది ఈ పురాణమున ప్రతిపాదించబడినది. శతకోటి విస్తృతమగు నాచే చెప్పబడిన పురాణము వివరించబడిన రథంతర కల్పవృతానమును వేద వ్యాస మహర్షి సంక్షేపముగా చెప్పెను. వ్యాసుడు బ్రహ్మవైవర్త పురాణమును నాలుగు భాగములుగా పదునెనిమిది వేల శ్లోకములు కలదానినిగా నిర్మించేను. ఈ పురాణమున బ్రహ్మ ప్రకృతి విఘ్నేశ కృష్ణ ఖండములు కలవు. మొదటిదగు సృష్టి ప్రకరణమున సూతర్చి సంవాదమున పురాణోపక్రమము చేయబడినది. తరువాత నారద బ్రహ్మల వివాదము ఇద్దరీ పరాభవము, తరువాత శివలోకగమనము, జ్ఞానలాభము, శివ వాక్యముచే కలుగుట, మరీచి నారదులు జ్ఞానము కొరకు సిద్ద సేవితము, పరమ పావనము, త్రైలోక్యాశ్చర్య కరమగు సావర్ణి ఆశ్రమమునకు వెళ్ళుట ఇవి బ్రహ్మఖండమున ప్రతిపాదించబడినవి. తరువాత సావర్ణి నారదుల సంవాదము, కృష్ణ మాహాత్మ్యయుతము నానా కథా సమన్వితము, ప్రకృతి అంశ భూతములగు కల చరితమును వర్ణించుట, మాహాత్మ్యములు పూజాదికములు విస్తృతముగా వర్ణించ బడినవి. ఇది ప్రకృతి ఖండము. సర్వ భూతి ప్రదాయకము. గణేశ జన్మ వృత్తాన ప్రశ్న, సుపుణ్యక మహావ్రతము, పార్వతీ దేవికి కుమారస్వామి గణపతులు పుట్టుట, కార్తవీర్యార్జునుని పరశురాముని చరిత్రము, జామదగ్న్య గణేశుల వివాదము, ఇది సర్వపాప వినాశకమగు విఘ్నేశ ఖండము. శ్రీ కృష్ణ జన్మవృత్తాంత ప్రశ్నము. అద్భుతమగు శ్రీ కృష్ణ జన్మ, గోకుల గమనము, పూతనాది వధ, పలువిధములగు బాల్య కౌమార లీలలు, శరద్రాత్రి గోపికలతో రాసక్రీడ, రహస్యముగా రాధతో క్రీడించుట బహువిస్తృతముగా వర్ణించబడినది. అక్రూరునితో కలిసి శ్రీ కృష్ణుడు మధురా నగరమునకు వెళ్ళుట, కంసాధులను వధించుట, కృష్ణునికి ఉపనయన సంస్కారము. సాందీపని వద్ద విద్యాభ్యాసము, కాలయవన వధ, ద్వారకా గమనము, అచట నరకాది వధ. ఇవియన్నియు కృష్ణ ఖండమున చెప్పబడినవి. ఈ కృష్ణ ఖండము మానవుల సంసార ఖండమును చేయును. ఈ అలౌకికము అగు బ్రహ్మ వైవర్త పురాణమును చదివిననూ, వినిననూ, ధ్యానము చేసిననూ పూజించిననూ, అభివందనము చేసిననూ ముక్తిని పొందును. విజ్ఞాన జ్ఞానములను శమింప చేయు పరమఘోరమగు సంసార సాగరము నుండి చదువు వారు వినువారు విముక్తులగుదురు. మాఘ పూర్ణిమనాడు ఈ పురాణమును వ్రాసి బ్రాహ్మణునకు దానము చేసినచో అజ్ఞాన బంధము నుండి విముక్తుడై బ్రహ్మలోకమును పొందును. బ్రహ్మ వైవర్తక పురాణాను క్రమణిని చదివిననూ వినిననూ శ్రీ కృష్ణ ప్రసాదము వలన కోరిన ఫలము లభించును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్థపాదమున బ్రహ్మవైవర్తక పురాణానుక్రమణి యను నూట ఒకటవ అధ్యాయము సమాప్తము.
