భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
131. సప్తమీ కల్పమున దారుపరీక్షా వర్ణనము
తా॥ నారద మహర్షి యిట్లు చెప్పఁదొడఁగెను. “సాంబా! ఇక సర్వదేవతల యొక్క, ముఖ్యముగా సూర్యదేవుని యొక్క ప్రతిమా విధిని గూర్చి నీకు విశదముగాఁజెప్పెదను-1. భక్తులకు శుభములను సంపాదించునట్టి ప్రతిమలేడు విధములు చెప్పబడినది. బంగారము, వెండి, రాగి, మట్టి,అయి-2. కట్టితో చేయబడినవి; చిత్తరువు రూపమున వ్రాయబడినదియు నని దేవతామూర్తులేడు విధములు. దొరువుతో నిర్మింపబడువానిని గూర్చి నీకు సాకల్యముగ వర్ణించి చెప్పెదను-3. సంవత్సర, మాస, పక్ష, తిథి, వారాదులు చక్కగ శోధించుకొని, శాస్త్రవిహితములైన శుభనిమిత్తములతో, శకునములతో నరణ్యమునకుఁబోవలెను-4. పాలుగారేడు చెట్లు స్వాభావికముగ బలహీనమైనవిగావున వానిని వదలి పెట్టవలెను. నాలుగున్రోవలు కలియుచోటనున్నవానిని, బాల వృక్షములను-5. దేవాలయముల సమీపముననున్నవానిని, పుట్టలలో పుట్టిన వానిని, దేవతలుండుచెట్లను, గుడులలో, బౌద్ధాలయములలో, ఉద్యానవనములలో నున్నవానిని-6. శ్మశాన ప్రదేశములందు పెరిగిన వానిని, పక్షులు గూళ్ళుకట్టుకొని యున్నవానిని, తొఱ్ఱలు గలవానిని, ఎండిన అగ్రములు గలవానిని-7. శస్త్ర వాయ్వగ్ని విద్యుద్దూషితములైనవానిని, ఏనుగులు మున్నగువానిచే భ్రష్టము చేయబడిన వానిని, రోగముగలవానిని, (చీడ మొదలగునవి పట్టినవానిని), తెగులుసోకిన వానిని-8. ప్రతిమా నిర్మాణమున కయోగ్యములుగావున వానిని వదిలివేయవలెను. అకాలమునందు పుష్పించువానిని, కాలమునందు వదలివేయవలెను. సన్నగిలిపోయిన ఆకులు గల చెట్లు, రాక్షసులు, కాకులు, కొంగలు నివసించు చెట్లు, ఒకేకొమ్మగలవి, మూడు కొమ్మలుగలవి, మిక్కిలి యెక్కువ కొమ్మలుగలవి, అధమజాతికి చెందినవియునైన వృక్షములు విడువదగినవి-9. ఇప్ప, దేవదారు, వృక్షరాజమగు చందనము, బిల్వవృక్షము, అంబాళము, చండ్ర, అంజన-10. వేప, టేకు, పనస, తెల్లతెగడ, ఏఱుమద్ది, రక్తచందనము-ఇవి ప్రతిమలు చేయుటకు శ్రేష్ఠమగు వృక్షములు.
తా॥ బ్రాహ్మణాది చతుర్వర్ణముల వారిలో నొక్కొక్క వర్ణమువారికి క్రమమున రెండేసి చొప్పున పైన సూచింపబడిన మధూకాది వృక్షములు నిర్దేశింపబడినవి. తక్కిన నింబాది వృక్షములు సర్వవర్ణ సాధారణములుగ పేర్కొనబడినవి-12. సాంబా! నేను ముందు చెప్పబోవు తత్తద్వర్ణోద్దిష్టములగు వృక్షములను గూర్చి వినుము. దేవదారు, జమ్మి ఇప్ప, చందన వృక్షములు బ్రాహ్మణులకు శుభప్రదములు-13. క్షత్రియులకు చండ్ర,తుమ్మికి,రావి కరకత వృక్షములు శుభదాయకములు-14. వైశ్యులకు చండ్ర, చందన వృక్షములు శ్రేష్ఠములైనవి. పుణ్యప్రదములైనవి-15. నాగకేసరము, వేఁగిన, మామిడి, మద్ది యనునీ చెట్లు శుభకరములు. పుణ్యప్రదములు-16. అభిమతమగు వృక్షము కడకుఁబోయి దానిని యథావిధి పుష్పాదులతో పూజించి, గ్రాహ్యవృక్షముగ దానిని గుర్తించుటకై ప్రతిమా చిహ్నమును లిఖింపవలేను-17. కేశములు, అంగారములు(బొగ్గులు) మున్నగు కాలుష్యము లేని పవిత్రము, ఏకాంతమునైన ప్రదేశమున, ప్రాణులకు కష్టము కలిగింపని రీతిగనున్న, తూర్పు, లేక ఉత్తరదిక్కుగనున్న స్థలమునందు-18. పెరిగిన చెట్టునెన్నవలెను. అది చక్కగ చిగురించి, విస్తీర్ణమైన శాఖలుగలదియై, పుష్కలమైన యాకులు గలిగి నిటారుగఁబెరుగుచున్నదై, ప్రణాది రహితమై, మిక్కిలి పుష్టిగనేదిగి, యారోగ్యవంతమైన త్వక్కు, పర్ణములు గలిగి నిగనిగలాడుచుండవలెను-19. తమకుతాము పతనమైనవిగాని, ఏనుగులు మున్నగువానిచే పడగొట్టబడినవిగాని, ఎండిపోయినవిగాని, అగ్నిచే కాల్పబడినవిగాని, పక్షులచే ఏడువబడినవిగాని-20. ప్రతిమా నిర్మాణమునకు నిరుపయోగములుగావున నట్టి చెట్లను వదలి పెట్టవలెను. శుభప్రదములు, ఆకులు కొమ్మలతో నిగనిగలాడుచు, ఫల పుష్పాదులతో కళకళలాడు చెట్లను మాత్రమే గ్రహింపవలేను.
తా॥ కార్తీకము మొదలుకొని యెనిమిది మాసములలో నేదేని యొక శుభదినమున నుపవాస దీక్షతోనుండి, పుష్పధూప సుగంధ ద్రవ్యాదులతో నధివాసనము నిర్వర్తించి వానిని గ్రహింపవలెను-22. ఎన్నిక చేసిన చెట్టు క్రింద చుట్టును నేలనరికి శుభ్రముచేసి గాయత్రీ మంత్రముతో నభిమంత్రించిన జలమునంతటయు ప్రోక్షణ చేయవలెను-23. తెల్లని పరిశుద్ద వస్త్రములు ధరించి గంధ పుష్పధూప దీపనైవేద్యములతో వృక్షమును పూజింపవలేను-24. అటు పిమ్మట సమీపముననే దర్భలు పఱచి, దేవదారు సమిధలతో నీక్రింది మంత్రముతో హవనము చేయవలెను. ఆపై 'ఓం భూర్భువస్సువః' అని వృక్షమును పూజింపవలెను. “ఓ ప్రజాపతీ! సత్యస్వరూపా! వృక్షస్వరూపా! వృక్షరాజమా నీకు నమస్కారము. శ్రేష్టాంతరాత్మా! సచరాచరాత్మా! దేవా! ఈ వృక్షమున నీవు సాన్నిధ్యము చేయుము (ఆవహింపుము) సూర్యవృతమండల మిందు ప్రవేశించునుగాక. నమస్కారము”.-26. ఇట్లు పూజించి వృక్షముననునయించుచు నిట్లు చెప్పవలెను. “వృక్షరాజమా! లోక కల్యాణము అక్క నీవు మంగళకరమైన దేవాలయమునకు వెడలిపొమ్ము!-27. దేవా! అచట నీవు ఛేదన తాపాదులు లేకుండ సుఖముగ నుందువు. ఆయా సమయములందు లోకములు నిన్ను గంథపుష్పధూపాదులతో, నైవేద్యములతో పూజింపుచుండగలవు-28. దానం జేసి నీవానందముగ నుండగలవు. ఇట్లు వృక్షము ననునయంచి వృక్ష మూలమున గంథపుష్పధూపాదులతో గొడ్డలిని పూజించి, దాని శిరస్సు తూర్పుదెసగా నుండునట్లు జాగ్రత్తగా నిలిపీ యుంచవలెను.
తా॥ పాయసము, లడ్డువములు, చిత్రాన్నములు, మాంసములు, పిండివంటలు, భక్ష్యములు-30. మద్యములు, గంధ పుష్పధూపములు మున్నగువానిచే చెట్టును పూజించి, దేవతలను, పితృదేవతలను, పిశాచములను, రాక్షసులను, సర్పములను, సురగణ వినాయకాదులను-31. పూజించి రాత్రివేళ వృక్షమును స్పృశించి దానితో నిట్లు చెప్పవలేను-32. “వృక్షరాజమా! నీవు దేవతలచే ప్రతిమల కొఱకు కల్పింబడియున్నావు. నీకు నమస్కారము. విధి విధానముగ మాచే నొనర్పబడు పూజను స్వీకరింపుము-33. విధి పూర్వకమైన యీ బలిని స్వీకరించి యిచట నివసించు ప్రాణులన్నియు మఱియొకచోటికి తమతమ నివాసములను మార్చుకొను గాక అవి మమ్ముక్షమించును గాక! వానికి నమస్కారము.”-34. తెలతెలవారుచుండగ చెట్టును మయొకసారి పూజించి, బ్రాహ్మణులకు, భోజకులకు దక్షిణనిచ్చి, పండితులచే స్వస్తి వాచనములను చెప్పించి, అప్పుడు ఆ వృక్షమును ఛేదింపవలెను-35 తూర్పునకు గాని, ఈశాన్యమునకు గాని, లేక ఉత్తర దిక్కునకు గాని యది పడిపోవునట్లు కొట్టవలెను కాని యన్యథా చేయరాదు-36. ఈ మూడు దిక్కులలో నేదేని యొక్క దిక్కునకు పడుటయే శ్రేష్ఠము. నైరృతికిగాని, ఆగ్నేయమునకుగాని, దక్షిణమునకు గాని చెట్టుపడుట శుభముకాదు. వాయువ్యమునకు పశ్చిమమునకు పడుట మధ్యమము-37. నలువైపుల బయటకు విస్తరించియున్న కొమ్మలన్నియు నజీకివేసి వానిని వెనుక భాగముననుంచి, అటుపిమ్మట వాస్తుననుసరించి నిలబడి వృక్షమును ఛేదింపవలెను-38. చేట్టు దేనీ నంటక నిశ్శబ్దముగా పడిపోవుట ప్రశస్తము. పడిన పిదప విఱిగినను, దానినుండి మధుర ద్రవముగానీ-39 నేయిగాని, నూనెగాని స్రవించుచుండినయెడల నట్టి వృక్షమును విసర్జింపవలెను. సాంబా! ఎట్లు ఛేదించిన శుభప్రదమో చెప్పుచున్నాను. వినుము-40. ఉదయకాలమున చెట్టును నీటితో తడిపి, పూర్వోత్తర దిక్కుగ సమీపించి, తేనె, నేయియుఁబూసిన గొడ్డలితో ప్రదక్షిణ క్రమమున చుట్టును కొట్టుచుఁబోవలెను-41. తూర్పునకుగానీ, ఈ శాన్యమునకు గానీ ఉత్తరమునకు గాని చెట్లు పడుట అభివృద్ధిని కలిగించును. ఆగ్నేయ కోణాదిగ పడినచో క్రమముగ నగ్ని ప్రమాదములు, మిక్కిలి భయంకరమగురోగములు, ధననాశము కలుగును-42. ఆగ్నేయ దిశయందు పడినచో యజమాని మఱుజన్మలో శిలయగును. దక్షిణమునకు పడినచో పావురమై పుట్టును. నైరృతి దిక్కున పతనమయ్యెనేని బల్లిగ జన్మించును. పశ్చిమమున పడేనేని (హిమశిల) తెల్లనీరగును.వాయువ్యమునకుఁగూలినచో బొట్టనవ్రేలు వంటి కీటకమగును. ఇట్టి దోషములెవ్వియును కలుగకుండ మంచి ముహూర్తమున చెట్టును నతికి కాష్ఠసంగ్రహణము చేయవలెను.
శ్రీ భవిష్య మహా పురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు దొరు పరీక్షా వర్ణనమను నూట పదునైదవ అధ్యాయము సమాప్తము.
