భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

121. సప్తమీ కల్పమున విశ్వకర్మకృత తేజః శాతనము

తా॥ శతానీకుడిట్లనెను. “మునీశ్వరా! సూర్యభగవానుని శరీర శాతనము గూర్చి లోగడ సంక్షేపముగఁజెప్పియుంటిరి. ఆ విషయమును విస్తృతముగ వినదలచితిని. కావున దయయుంచి వివరించి చెప్పుడు. సుమంతుముని యిట్లు చెప్పఁదొడగెను. “కురునందనా! తండ్రి యింటికి వెడలిపోయిన సంజ్ఞాదేవియందే తన మనస్సుని నిలిపి సూర్యదేవుడు “సంజ్ఞ నా రూపమును సరిచేయునని'యాలోచించుచుండెను. అంతలో బ్రహ్మదేవుడటకేతెంచి సూర్యభగవానునకు ప్రీతికరమైనట్టి మధురమైన శుభవాక్యమునతనికి వినిపించెను. ‘భగవాన్! దేవతలందఱికిని నీవాదిదేవుడవు. ఈ జగత్తంతయు నీవు వ్యాపించి యున్నావు. మీ మామయగు విశ్వకర్మ నీరూపమును సరిదిద్దగలడు. సూర్యదేవునకిట్లు చెప్పి బ్రహ్మ, విశ్వకర్మతో సూర్యభగవానుని రూపము సౌందర్యమయమగునట్లుగ శాతనము చేయుమని యాదేశించెను. అప్పుడు బ్రహ్మదేవుని యాజ్ఞననుసరించి విశ్వకర్మ శానము నారోపించీ భాస్కరుని శరీరమును మెల్లమెల్లగా చెక్కడము చేసి యందమగు రూపమగునట్లు చేసెను. బ్రహ్మదేవుడప్పుడు సర్వదేవగణములతోను, వేద వేదాంగ పారంగతులైన మహరులతోను గూడి నానా విధములైన రహస్యస్తోత్రములతో సూర్యదేవుని సంతోషింపఁజేసెను. “హే జగన్నాథా! పుణ్యభూముల పాలిట చల్లని చంద్రుని వంటివాడా! సర్వలోకములకును దేవాధిదేవా! నీకు స్వస్తియగుగాక! శాంతికలుగుగాక! అని యిట్లు బ్రహ్మదేవుడు స్తుతింపగా. రుద్రుడు, విష్ణువు మొదలగు దేవతలు 'దేవా! దివస్పతే! ఈ లేఖన క్రియచే నీ తేజస్సు వృద్ధియగుగాక! యని యాతని స్తుతించిరి. ఇంద్రుడు కూడా అటకేతెంచి లిఖ్యమానుడైన సూర్యభగవానుని "హే జగత్పతే! నీకు జయముగుగాక! నీవు తత్వదుడవుసుమా'యని కీర్తించెను.

తా॥ అంతలో విశ్వామిత్రుడు మున్నుగా సప్తర్షులటకేతెంచి 'దేవా! నీకు స్వస్తియగు గాక! స్వస్తియగుగాకఁ యని పలుకుచు వివిధస్తోత్రములచే నాదేవేశుని సంతుష్టి పఱచిరి. వాలఖిల్యులు వేద మంత్రములతో నాశీర్వదించి యాసూర్యభగవానుని సంతోషపఱచిరి. “హే లోకనాథా! ముక్తినొందువారికి నీవే ముక్తివి. ధ్యానము చేయువారికి ధ్యేయము నీవే. సర్వభూతములకు గతియునీవే. సర్వము నీయందే ప్రతిష్ఠితమైయున్నది. జగత్పతీ! మా ప్రజలకందఱకును సుఖము కలుగుగాక!. ఈ జగత్తంతయు నీ వలననే యుద్భవించుచున్నది. నీ యందే లయమగుచున్నది. నీవొక్కడవే రెండుగను, అనేకములుగను పరిణమించితివి. నిస్సంశయముగ. ఈ జగత్తునీ యొక్కని చేతనే సృజింపబడెను. నీ చేతనే మేలుకొల్పబడును” అని వాలఖిల్యులు స్తుతింపగా నంతలో విద్యాధరగణము, యక్షులు, రాక్షసులు, పన్నగులేతెంచి, శిరసువంచి, అంజలి ఘటింపుచు. శ్రోత్రములకు మనస్సునకు సుఖమును కలిగించెడి వాక్యముల నిట్లు పలికిరి. “హే భూతభావనా! నీ తేజస్సు సర్వభూతములకును సహింపఁదగినది యగునుగాక. హాహాహూహూ యనెడు గంధర్వులు, తుంబురుడు, నారదుడు.అనుగానకుశలుడు సూర్యభగవానుని స్తుతింపుచు నుచ్చెస్స్వరమున గానమునారంభించిరి. షడ్జ, గాంధార, మధ్యమ స్వరములను శ్రుతులుగ గ్రహము మార్చి రాగములు పాడుటయందు విశారదులగు వారు మూర్ఛనల చేతను (ఒక స్వరమునుండీ మజియొక స్వరమునకు క్రమారోహణావరోహనలు చేయుచు) మంద్ర, అర్ధమంద్రస్థాయిలోని ధైవత పంచమ స్వరస్థానములలో రాగ సంచారములు చేయుచు, తదనుగుణమున భావస్ఫోరక ముఖ వికాసాదులతో. మంద్ర, మధ్య, తారస్థాయులలో షడ్జ, గాంధార, మధ్యమములను స్వరత్రయమునందు శ్రుతి త్రయ గ్రహణముచే నేర్పడు రాగభేద ప్రకారమును గమక విన్యాసములతో వినిపించుచు రాగతాళ వాద్యములతో గూడి పాడిరి. విశ్వాచి, ఘృతాచి, ఊర్వశి, తిలోత్తమ,. మేనక, అప్సర స్త్రీలలో శ్రేష్ఠురాలగు రంభ తమ హావభావ విలాసములతో వివిధములగు నాట్యములను చేయుచుండిరి.

            తా॥ అప్పుడు సర్వదేవ సమూహములకును వీనుల విందుగ, మనస్సుల కొహ్లాదకరముగ నవ్యక్త మధుర గానము వెల్లివిరిసెను. వీణలు, వేణువులు, ఉడుక వాద్యములు, మద్దెలలు, మృదంగములు, తప్పెటలు. దేవ దుందుభులు, శంఖములు మొదలగు వాద్యములు వందలుగ, వేలుగ మ్రోగింపబడెను. గానము చేయుచున్న గంధర్వుల చేతను, నాట్యములాడుచున్న అప్సరోగణములచేతను. తతానదసుషిరఘనములనెడి వాద్యముల మ్రోతలచేతను అచటి వాతావరణమంతయు కోలాహలముగ చేయబడెను. ఆ సమయమున దేవతలందఱును తమ చేతుల నరవిరిసిన తామర మొగ్గలవలె ముగిడ్చి. తమ తమ ఫాలభాగములందుంచి సూర్యభగవానునకు నమస్కరించిరి. దేవతలందఱును సమావేశమైన యాకోలాహలమునందు. విశ్వకర్మ మెలమెల్లగా సూర్యతేజమునకు మెఱుగు పెట్టెను.హిమమునకు, జలమునకు, ధర్మమునకు, కాలమునకు కారణమైనవాడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులచే స్తుతింపబడినవాడు నైన భానుదేవుని తేజశ్శాతనము నిట్లు వినినవాడు ఆయుష్యము తీరిప పిదప సూర్యలోకమునకుఁబోవును.

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు విశ్వకర్మ కృత సూర్య తేజశ్శాతనమను నూట యిరువది యొకటవ అధ్యాయము సమాప్తము.