భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

46. షష్ఠి కల్పమున కార్తికేయ మహాత్మ్య వర్ణనము

            తా॥ సుమంతుముని యిట్లనెను. “భాద్రపదమాసమునందలి షష్ఠితిధి పుణ్యప్రదమైనది. పాపమును నశింపజేయునది. శివకరమైనది. శాంతినిచ్చునది. కుమారస్వామికి ప్రియమైనది. ఆనాడు దక్షిణమార్గముననుసరించిన కుమారస్వామిని దర్శించిన వారికి స్నాన పానాదిక భోగము లక్షయమున ప్రాప్తించును. బ్రహ్మహత్య వంటి ఘోర పాపములనుండి ముక్తులగుదురనుటలో సంశయము లేదు. కాబట్టి ఆ దినమున కార్తికేయుని తప్పక దర్శింపవలేను. భక్తితో ఆ దేవుని నాదినమున పూజించువారు ఇహలోకమునందీప్సిత సుఖములనుభవించి ఆ పిమ్మట నింద్రలోకమునకుఁబోవుదురు. భక్తి శ్రద్దలతో గుహునికి కఱ్ఱతో గాని, శిలలతోగాని శాశ్వతముగ నుండు దృఢమైన మందిరము నిర్మింపజేయువారు నెమలి వాహనము పై పయనించి కార్తికేయ లోకమునకు బోవుదురు. ఆ దేవుని మందిరమున, చిమ్ముట మొదలగు పారిశుద్ధ్య కార్యక్రమములు చేయువాడు, టెక్కెమును నాటువాడు రుద్రలోకమునకుఁబోవును-6. చందనము, అగరు, కర్పూరము మున్నగు వానిచే గుహుని పూజించువాడు, గజ, అశ్వవాహనాదులతో కూడిన సేనాధిపతిత్వమును పొందును. కార్తికేయుడు సదోరాజులకు పూజ్యుడు. ఆయనకు మారుగ రాజులకు పూజింపదగినవాడు మజిలేడని చెప్పుదురు. కృత్తికా పుత్రుడైన కుమారస్వామిని యుద్ధమునకు బోవువాడు పూజించినచో, యుద్ధభూమిలో నింద్రుడు రాక్షసులను జయించినట్లు శత్రువులను జయించును. కావున మిక్కిలి పూనికతోనా దేవుని పూజింపవలెను. సంపెంగలు మొదలగు పుష్పములతో పూజించువాడు సర్వపాపముల నుండి ముక్తుడై పిదప కైలాసమునకేగును. షష్ఠినాడు పగటియందుగాని, రాత్రిగాని నూనే భుజింపకూడదు. ఆదినమున పగలంతయు ఉపవసించి రాత్రి భోజనము చేయువాడు సర్వపాపములనుండి ముక్తుడై కార్తికేయ లోకమునకుఁబోవును. శ్రద్ధాయుక్తుడై మూడు పర్యాయములు దక్షిణ దిశవైపుఁబోయి దేవదేవుడైన కృత్తివాసుని పూజింపవలెను. అట్టివాడు శాంతి పదమును బొందును.

శతార్ధసాహస్య సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున షష్ఠికల్పమునందు కార్తికేయ మాహాత్మ్య వర్ణనమను నలుబదియాఱవ అధ్యాయము సమాప్తము. (షష్ఠీ  కల్పము సమాప్తము)