భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
49. సప్తమీ కల్పమున సూర్య మహాత్మ్య వర్ణనము
తా ॥ వాసుదేవుడిట్లనెను. “ఇక సర్వకామములను సఫలము చేయునది, విఘ్నములను నశింపజేయునది, పాపములను హరించివేయునది, పుణ్యప్రదమైనదియునైన సూర్యభగవానుని పూజించు విధానమును చెప్పెదను. సూర్యమంత్రములచే స్నానము చేసి వానితోడనే ఆతని పూజింపవలెను. స్నానము మొదలుకొని సాకల్యముగ చెప్పదలచిన కారణముననట్లు చెప్పుచుంటిని. ఆచమించి, ఆజలమునటులే పట్టుకొని శుచిశుద్దమైన ముద్రతో నీరాజనము చేసి, అప్పుడు నీటిని శోధించి. హృదయ పావిత్ర్యమును కలిగించు మంత్రముతో స్నానమాచరించి, అదేమంత్రముతో లేచి మఱల ఆచమనముచేసి వస్త్రములను ధరించి. రెండు పర్యాయములు మఱలనొచమనము చేసి సప్తాక్షరమంత్రము (ఓం ఖలాయ స్వాహా)తో శరీరము పై నీరు చల్లుకొని, లేచి ఆచమించి అదే మంత్రముతో సూర్యున కర్ఘ్యమియవలెను. ఇచ్చి అదేమంత్రమును జపించుచు తనను తాను సూర్యునిగా హృదయమునందు ధ్యానింపవలెను. ఆ పిదప మందిరమునకుఁబోయి సూర్యభగవానుని తేజో రూపమును పూజింపవలెను. మొదట సమాహిత చిత్తముతో పూరక, కుంభక, రేచకములతో ప్రాణాయామము చేయవలెను. ఓంకారముతో ప్రాణాయామము చేసి శరీరాదులయందు బుట్టిన దోషములు నశింపజేయవలెను. ఆత్మశుద్ధి, సిద్ధి కొఱకు, వాయువ్య, ఆగ్నేయ, మా హేంద్ర, వారుణాది కిల్బిషములను, నీటిని సంప్రోక్షణ చేయుటద్వారా నిర్మూలింపవలెను. వాయువు, అగ్ని, ఇంద్ర, వరుణ నామకధారణలతో శోషణము, దహనము, స్తంభనము, ప్లావనము చేయగానవి నశించును. అప్పుడు పరిశుద్ధమైన తన యాత్మలో నెలకొనియున్న సూర్యభగవానునకు నమస్కరింపవలెను. పంచభూతమయమైన శరీరమును కూడా నతనిచే వ్యాప్తమైన దానినిగ చింతింపవలేను
తా॥ సూక్ష్మ, స్థూల శరీరములను, ఇంద్రియములని వానివాని స్థానములందు నిశ్చలస్థితిలో నుండునట్లు చేసి 'ఖ' ఆదిగనుండు హృదయాదులను హృదయాదులయందు ‘అంగన్యాసము చేయవలెను. “ఓం ఖః స్వాహా హృదయాయనమః, ఓంఖం స్వాహా శిరసే స్వాహా, ఓం ఉల్కాయస్వాహా శిఖాయైవషట్, ఓం యాయస్వాహా కవచాయ హుం, ఓం ఖాం స్వాహా నేత్రత్రయాయ వౌషట్, ఓం హాం స్వాహా అస్రాయఫట్. ఇట్లంగన్యాసము చేసి, కర్మప్రసిద్ధికొఱకు ఓంకారముతో కూడిన మూలమంత్రము ముమ్మారు జపించి జలమునభిమంత్రించి దానిని పూజాద్రవ్యములపై. సంప్రోక్షించి సూర్యదేవుని, శుభప్రదములైన గంధపుష్పాది ద్రవ్యములతో పూజింపవలెను. ఆవిధముగ పగటియందు మూర్తులన్నింటియందును, రాత్రి సమయమున అగ్నియందును సూర్యభగవానుని పూజింపవలెను. ప్రభాత కాలమున పూర్వాభిముఖముగ, సాయంసమయమున పశ్చిమాభిముఖముగ, రాత్రి సమయమున నుత్తరాభిముఖముగ సూర్యదేవునినారాధింపవలెను. 'ఓం ఖఖోల్కాయ స్వాహా' అనునీ సప్తాక్షరమంత్రముతోనొక పద్మకర్ణికను ధ్యానించి. దానియందు ప్రభామండల మధ్యమున నాదిత్యమండలము, దానిలో సర్వలక్షణ సంపూర్ణుడు, సహస్రకిరణములతో నుజ్జ్వలముగ ప్రకాశించు దివాకరుని స్వరూపమును భావించి. అతనిని ఎఱ్ఱని గంధములతో, పుష్పములతో, రసవత్తరములైన నైవేద్యములతో, రక్తచందనము, కరవీరములు, ఎఱ్ఱని వస్త్రములతోనుత్తరీయములతో. భూషణములతో, ఆవాహనాద్యుపచారము లతో పూజింపవలెను, ఈ కర్మక్రమమును విజుఁడైనవాడు తదేక చిత్తముతో తెలిసి చేయవలెను. మంత్రములచేనావాహన చేసి యొకచోస్థాపించినది మొదలుకొని పూజా పరిసమాప్తి వఱకు దేవతాసాన్నిధ్యముననే ఉండవలయును. పాద్యాద్యుపచారములతో పూజించి, యధాశక్తిగ నర్ఘ్యమునివేదించి, జపముచేసి, యథావిధిగ ధ్యానము చేసి, ఆ తరువాత దేవతను ఉద్వాసన చేయవలెను.
తా॥ ఈ కర్మక్రమమందఱి పూజాక్రమముననుసరించి చెప్పబడినది. ఇక సూర్యదేవుని యావరణమున జపస్థానమును గూర్చిచెప్పెదను. మొదట ప్రధాన దేవతయైన సూర్యభగవానుని పద్మకర్ణిక యందును, దళములయందంగములను, ఉత్తరదిక్కు మొదలుకొని చంద్రుడు మొదలు రాహువు వఱకు గల గ్రహములను. ఆపైయావరణములందు లోకపాలుర మూర్తులను, రక్షణార్థమై వారి ఆయుధములను, వారి వారి ఆయా మంత్రముల చేత క్రమముగా పూజింపవలెను. ఓంకార పూర్వకముగ వారివారి నామములకు చతుర్థి విభక్తిని చేర్చి, చివరన 'నమః' అని చేర్చి అందటి దేవతల మంత్రములును చెప్పబడియున్నవి. ఇప్పుడు ముద్రలను గుఱించి చెప్పుదును. వ్యోమముద్ర, రతిముద్ర, పద్మముద్ర, మహాశ్వేత ముద్ర, అస్త్రముద్ర అనీ సర్వకర్మల ప్రసిద్దికొఱకు ఐదు ముద్రలు చేప్పబడినవి. రెండు చేతులను వెల్లకిల జేసి క్రమముగా వ్రేళ్లను చూపుడు వ్రేలికి యానుకొనునట్లు ముడిచి, రెంటిని సమముగా నథోముఖమగునట్లుంచి. రెండు చూపుడువేళ్లకొనలు మధ్యమాంగుష్ఠములపై నుండునట్లు సరిచేసినచో అది వ్యోమముద్రయని చెప్పబడును. అన్ని కర్మలయందును యోగ్యమైనదిగ దీనికి స్థానము కల్పింపబడును. వేళ్లనన్నింటిని పద్మాకారముగ ప్రసరింపజేసినయెడలనది పద్మముద్రయగును. మహాశ్వేత రవి ముద్రయేయని చెప్పబడినది. సూర్యభగవానుడు నిత్యమును రథము నధిరోహించి వేగమున తిరుగుచుండును. రెండు చేతులనూర్థ్వముఖములుగ జేసి యెడమ బొట్టన వ్రేలితో కలిపి ఆ ముద్రను ద్రవ్యశోధనయందు ముఖ్యముగా రక్షణకొఱకు నుపయోగింపవలెను. ఈ ముద్రచే సర్వమును పరిశుద్ధము చేయబడును. రక్షింపబడును. దీనిని పూజాసమాప్తి తరువాత నర్ఘ్యమిచ్చిన పిదప ప్రయోగింపవలెను.
తా॥ ఆత్మసిద్ధి కోరినచో, జపము, ధ్యానము ముగించిన పిమ్మట నీ ముద్రనుపయోగింపవలెను. ఇట్లు నిత్యమొక సంవత్సరము వఱకు విడువకుండ సూర్యోపాసన చేయవలెను. చేసినవాడు నిస్సంశయముగ నిహలోకమునందును, పరలోకమునందును కోరిన కోరికలను పొందగలడు. రోగముతో బాధపడు వాడారోగ్యవంతుడగును. ధనహీనుడు ధనమును పొందును. రాజ్యమునుండి భ్రష్టుడైనవాడు తిరిగి రాజ్యమును పొందును. పుత్రులు లేనివారికి పుత్రులు కలుగుదురు. ప్రజ్ఞ, మేధాశక్తి, సర్వసంపత్సమృద్ధి, కలిగి మానవుడు చిరకాలము జీవించును. సౌందర్యవతి, ఉత్తమ కుల సంజాతయైన భార్యను పొందును. స్త్రీయైనచో సౌభాగ్యవతి యగును. కన్యయైనచో పురుషశ్రేషుని భర్తగా పొందును. విద్యావిహీనుడు విద్యావంతుడగును. పూర్వమిట్లు సూర్య భగవానుని చేతనే చెప్పబడెను. ఈ సూర్యారాధనము నిత్యము చేయదగినది. ధనధాన్య సుఖముల నిచ్చునది. కోరనివానికి కూడ సంతాన, పశు సమృద్ధిని కలిగించునది. సూర్యోపాసకుని పొగడ్తలు స్వర్గము నందు కూడా మారుమ్రోగుచుండును. అతడెప్పుడును పుణ్యతరుడై ప్రకాశించును. ఈ లోకమునందు సర్వమనోరథ సిద్ధుడై మనుస్థానమును చేరును. బ్రాహ్మణులు సూర్యోపాస్తి చేసిన నాదేవుని యనుగ్రహమున తేజస్వులై దేవతల వలె ప్రకాశింతురు.
శతార్ధ సాహస్ర్య సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు సూర్యమాహాత్మ్య వర్ణనమను నలుబది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
