భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
44. షష్ఠి కల్పమున వర్ణవిభాగ వివేక వర్ణనము
తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “విడువదగిన దేదియో, స్వీకరింపదగినదేదియో బాగుగ తెలిసినవారు, అన్యాయ మార్గమును బోధించుశాస్త్రమును వదలినవారు, మనస్సును, వాక్కును ఇంద్రియములను జయించినవారు, సదాచార పరాయణులు. నియమములకు, ఆచారములకు కట్టుబడి జీవించువారు, స్వ, పరహితమును కలిగించు మార్గములను వెదకుటయందు నిరంతరము కృషిచేయుచుండువారు, సంసారమును కాపాడుకొనేడునుపాయములు గల పనులతో గూడియండుకోరిక గలవారు, సత్యమును దర్శించునేర్పరులు, మనోలయ స్థితియందుండువారు, క్రోధరహితులు, స్వాధ్యాయము, భక్తి నిండిన హృదయము గలవారు, సంసర్గమును విడిచినవారు, ఈర్ష్యలేనివారు. దుఃఖము, దర్పములేనివారు, శాంతులు, ప్రాణులన్నీంటిమేలు కోరువారు, సుఖదుః ఖములను సమదృష్టితో చూచువారు, ఏకాంతమునందుడువారు. నియమపాలనకనుకూలమగు నవయవములు గలవారు, ధర్మబుద్దిగలవారు, పాపభీతిగలవారు, అహంకారమమకారములు లేనివారు, దానశూరులు, కరుణాళువులు. సత్పదార్థమైన బ్రహ్మమునెఱంగువారు, చాంచల్యరహితులు, శాస్త్రములన్నింటియందు నిష్ఠగలవారు, సర్వలోకములకు మేలుచేయుటకు ప్రవృత్తుడైన, స్వయంభువు. వాగీశ్వరుడు, నాభిజన్ముడు అయిన బ్రహ్మదేవుని చేత ప్రకటము చేయబడిన సంప్రదాయములనాచరించువారు బ్రాహ్మణులని తలంపబడుచున్నారు. సర్వప్రాణులకభయమునిచ్చు మహాతపోధనులైన ఋషులచే లోక కల్యాణము కొఱకు శుభసంప్రదాయము ప్రతిష్ఠింపబడినది. గొప్పదనమువలన భగవానుడు బ్రహ్మయనబడును. అతడు సృష్టికి కేంద్రస్థానము. భక్తితో గూడి అతనికి ప్రపన్నులైన వారు బ్రాహ్మణులనబడుదురు. ఆ పన్నులను రక్షించువారు క్షత్రియులు. జీవనోపాయ వర్తనము గలవారు వైశ్యులు. వేదమునుండి దూరమైనవారు శూద్రులని చెప్పబడుదురు.
తా॥ ఆచార రతులైన బ్రహ్మవాదులు బ్రాహ్మణ్యమును గూర్చి చెప్పుదురు. (ఆచారరతులు, బ్రహ్మవాదుల సమాజమే బ్రాహ్మణ్యమని చెప్పుదురు) వారు ఎప్పుడును మనస్సు కోరిన ఫలమునే (మోక్షమునే) ప్రశంసింతురు. ఓర్పు, ఇంద్రియనిగ్రహము, దయ, దానము, సత్యము శుచిత్వము, ధైర్యము, కనికరము విషయవైముఖ్యము, మృదుత్వము, ఋజువర్తనము, తృప్తి, నిరహంకారత, తపస్సు, కామక్రోధాది రాహిత్యము (శాంతి). ధర్మము, జ్ఞానము, కొండెకాని తనము లేకుండుట, బ్రహ్మచర్యము, వివేకము, ధ్యానము, ఆస్తికత్వము, ద్వేషరాహిత్యము, ప్రపంచ వస్తు విముఖత, శాంతస్వభావము. పాపభీతి, దొంగతనము లేకుండుట, అనసూయత, ఆశలేకుండుట, నిస్సంగత, గురు సేవ, మనస్సు, వాక్కు, కర్మలయందు సంయమము. ఈ విధమైన ఆచారములననుసరించియుండు వారికి బ్రహ్మత్వము సమృద్ధిగానుండును. ప్రతిదినము వృద్ధి చెందుచునే యుండును. వారు తమ అభిరుచి ననుసరించి పొందిన వర్ణమునందలి యాచార నిష్ఠవలన మహాతేజముగలవారగుదురు. సర్వశాస్త్రములకును విరోధముకాని రీతిలో నుండుటవలన పరిశుద్ధమనస్కులగుదురు. సత్పురుషుల కిష్టులై, ప్రాజ్ఞులై, పురాణములు, ఆగమశాస్త్రములు అధ్యయనము చేయుట వలన పండితులై, గానము చేసిన గీతాశాస్త్రముననుష్ఠించువారలై, ధర్మశాస్త్రము నందు బద్దమనస్కులై పఠించుచుందురు. నాలుగేసి యుగముల విభాగముతో నేర్పడిన మన్వంతరములన్నింటియందును వర్ణాశ్రమములను బట్టి చేయబడిన కర్మ సర్వోత్తమమై సిద్ధించును. అటుల సిద్ధించిన కర్మయందు, ఆయావర్ణాశ్రమములలో నన్యోన్య సమన్వయము కలుగునటీశ్వరుడు స్వయముగనోక కట్టుబాటును-అది ప్రారంభింపబడినప్పటి క్రమముననే నెలకొల్పేను. దానిని స్వీరించిన వారిలో మనోబలము గలవారే అధిక సంఖ్యాకులు. ఇతరులలో కొందఱిని బలహీనులు రక్షించెడి క్షత్రియులనుగా కట్టడిచే సేను.
తా॥ వారిని క్షత్రియులను) సంతోషింపజేయుచు, యజింపజేయుచు, వారినాశ్రయించి, నిత్యము, సత్యమునైన బ్రహ్మమును గూర్చి చెప్పువారు బ్రాహ్మణులు. వారిలో కొందఱు “బలహీనులు' వైశ్యకర్మయందు చేరిరి. వీరు ముందుజాగ్రత్తతో భూమియందలి కుత్సిత మార్గములను నశింపజేయుచుండిరి. భూమిని దున్నివ్యవసాయముచేయుట, (గోరక్ష) వాణిజ్యము, పొదుపు మున్నగు మిశ్రిత వృత్తినాశ్రయించిన వారిని వైశ్యులని చెప్పెను. దుఃఖితులు, నిలుకడలేనివారు, సేవలు చేయుటలో శ్రమింపగలవారు, తేజస్సులేనివారు, అల్పబలముగలవారు-ఇట్టి వారిని శూద్రులని యతడు చెప్పెను. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతుల వారికి వారి వారి స్వభావ జనితములైన గుణములననుసరించి పరస్పరముగ నాయకర్మలు విభజింపబడినవి. శాంతము, తపస్సు, ఇంద్రియ నిగ్రహము, శుచిత్వము, క్షమ, ఋజుత్వము, జ్ఞానము, విజ్ఞానము, ఆస్తికత-ఇవి బ్రాహ్మణ జాతికి సహజలక్షణములు పరాక్రమము, తేజస్సు, ధైర్యము, సామర్థ్యము, యుధిష్ఠిరత్వము, ఔదార్యము, ప్రభుత ఇవిక్షత్రియులకు సహజ లక్షణములు. వ్యవసాయము, గోరక్ష, వర్తకము-ఇవి వైశ్యులకు స్వాభావిక లక్షణములు. సేవా కర్మము శూద్రులకు సహజ గుణములు యోగము, తపస్సు, దయ, దానము, సత్యము, ధర్మము, వేదము, వైరాగ్యము, అనుభవజ్ఞానము, శాస్త్రజ్ఞానము, దైవ విశ్వాసము-ఇవి బ్రాహ్మణ లక్షణములు. జ్ఞానమయమైన శిఖ, తపోమయమైన “పవిత్ర', కలవానికి సమృద్ధమైన బ్రహ్మత్వముండునని స్వాయంభువ మనువు నుడివెను. ఏ వర్ణమునందైనను ఉత్తములు, మధ్యములు, అధములని మనుష్యులు ముత్తెఱఁగులుగనుందురు. వీరిలో పాపకర్మలనుండి నివృత్తిపొందినవాడు బ్రాహ్మణుడుగ నేర్పరుపబడును. శూద్రుడైనను శీల సంపన్నుడైనచో బ్రాహ్మణున కన్ననధికుడగును. ఆచారహీనుడైన బ్రాహ్మణుడు, శూద్రునకన్నను హీనుడగును. గృహములందుగాని, ఆంగళ్లలోగాని మద్యపానమును తాకని వాడు, విక్రయింపనివాడు సచ్ఛూద్రుడనబడును. జాతీయొక్కటియేయనియు, పనిని బట్టి మఱియొకటి, మఱియొకటిగ భేదించినదని స్పష్టమే, మాటయొకటియేయైనను ఇతర లక్షణములను పొంది భాషలుగా రూపొందినది. సమస్త వస్తువై విధ్య సంభరితమగు భూర్బువస్సువర్లోకములందు స్పష్టిస్థితిలయాత్మకముగ వ్యాపించియున్న పరమాత్మవాచియగునోంకారయొక్కటియే. అట్టి తజి, మనుష్యుల విభాగము కొఱకు, యోగ్యత మూలముగా కన్పట్టు మార్గమున నెందులకు పోకూడదు?
శతార్ధ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్యమహాపురామునందలి బ్రహ్మపర్వమునందు షష్టీకల్పమున వర్ణ విభాగ వివేక వర్ణనమను నలుబది నాల్గవ అధ్యాయము సమాప్తము.
