భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
100. సప్తమీ కల్పమున నందానామ సప్తమీ వర్ణనము
తా॥ బ్రహ్మదేవుడిట్లనెను మార్గశిర మాస శుక్లపక్షమున వచ్చు సప్తమీ తిథి “నంద' యనబడును. అది యన్నివిధములైన ఆనందములను కలుగజేయు శుభప్రదమైన తిథి. ఈ నందాసప్తమీ వ్రతమున పంచమినాడేక భుక్తము, షష్ఠినాడు నక్తము, సప్తమీనాడు ఉపవాసము చేయవలెనని బుద్దిమంతులు చెప్పుదురు. ఇందు మూడు పారణము లుండుననియు నుడువుదురు. జాజిపూలు, సుగంధచందనము. కర్పూరము అగరు కలిపిన మిశ్రమము ధూపము, పులకండముతో గూడిన పెరుగన్నము నైవేద్యము-వీనితో సూర్యుని పూజింపవలెను. ఈ నైవేద్యము సూర్యదేవునకిష్టమైనది, దీనినే బ్రాహ్మణులకిచ్చి, వారుభుజించిన పిమ్మట తాను తినవలెను. మొదటి పారణమున ధూపము కొఱకీ విధి నిర్దేశింపబడుచున్నది. మోదుగపూలు, సాథ్యమైన ఏదేని ధూపము లేక పక్షకధూపము సూర్యపూజలో వినియోగింపవచ్చును. కర్పూరము, చందనము, చెంగల్వకోష్టు, అగరు, యావనము(సిలకము). గ్రంథపర్ణి, కస్తూరీ, కుంకుమము, వెల్లుల్లి, హారీతకి-వీని మిశ్రమము పక్షక ధూపమనబడును. రెండవ పారణమున 'ప్రబోధ' ధూపము, శర్కరతో చేయబడిన అరిసెలు, నైవేద్యము ఆదేశింపబడినది. నల్లని అగరు, తెల్లతామర, సుగంధబాల, కస్తూరి. చందనము, నంది వర్థనము, ముస్త, శర్కర- వీని మిశ్రమము ప్రబోధ ధూపమనబడును. బ్రాహ్మణులకు అరిసెలతో భోజనము పెట్టవలెను. వేపాకు ప్రాశనము చేసి తాను మౌనముగ భుజింపవలెను. ఇది రెండవ పారణ విధిగా పేర్కొనబడినది.
తా॥ ఇక మూడవ పారణమున శుభ్రములైన నల్లగలువలు, గుగ్గలు, ధూపము, సూర్యప్రీతికై పాయస నైవేద్యము, విలేపనమునకు, ప్రాశనమునకును చందనము విధిగా చెప్పబడినవి. ఇట్లు ఉత్తమమైన మూడవ పారణ విధి కూడా నీకు చెప్పబడినది కదా!, మనుష్యులకు పవిత్రతను గూర్చు సూర్యనామములను వినుము. “విష్ణువు, భగుడు, ధాత ప్రసన్నుడగుగాక” అని యిట్లుచ్చరింపవలెను. ఈ విధానముగ ప్రయత మానసుడై నందాసప్తమీనాచరించువాడు సకల మనోరథములను సిద్ధింపజేసి కొని చిరకాలమానందించును. అటు పిమ్మట సూర్యలోకమునకుఁబోయి అచటనానందముగ నుండును. ఈసప్తమీ ఆనందమును కలిగించునది. దీనియందుపవాస పారణములు చేసినవాడు సూర్యలోకప్రాప్తినంది యానందించును. దీని విధానమును నీకు వివరించితిని.
శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు నందయను సప్తమీ వర్ణనమనేడు నూఱవ అధ్యాయము సమాప్తము.
