భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
70. సర్షప సప్తమి వర్ణనము
తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “అప్పుడు మధ్యాహ్న సమయమున స్నానమాచరించి, పరిశుద్దమనస్కుడై యథావిధిగ దేవతలను పూజించి, సుఖాసీనుడై-1. చక్కగా, మౌనముగా జపముచేసి, అగ్నిహోత్రునకాహుతులిచ్చి, దేవాలయమునుండి వెడలి భోజకులకు భోజనము లేర్పాటుచేయవలెను-2. పౌరాణికులు, ఇతిహాస విదులు, వేదవిత్తములైన బ్రాహ్మణులనందజీని భుజింపజేయవలేను-3. ఎఱ్ఱని వస్త్రములు, ఆవులు, సుగంధపుష్పాదులు, నేయితో గూడిన అన్నము, పాడియావు, ఇంకను తనకు ప్రియమైన వస్తువు భోజకునకు ఈయవలెను-4. భోజకులు దొరకని పక్షమున పౌరాణికులకు, వారును లభింపని యెడల బ్రాహ్మణ వేదమంత్ర పాఠకులకు లేక సామవేద పాఠకులకు పూర్వము సూచింపబడిన వస్తువుల నీయవలెను-5. భోజన విషయమునను మొదట భోజకులు, పౌరాణికులు, వారుకాక మంత్ర విదులు, వేదవేత్తలు అనుక్రమమున వారిని భుజింపజేయవలెను-6. భక్తి సమన్వితుడై మానవుడిట్లు ఏడు సప్తమీవ్రతములను శ్రద్దాయుక్తుడు, అనసూయుడునై నిర్వర్తించిన యెడల అనంత సుఖమును పొందును-7. పది అశ్వమేధ యాగములు చేసిన ఫలమును ఏడు సప్తమీ వ్రతములను చేసిన మానవుడు పొందును-8. ఈ లోకమున నీవ్రతాచరణమున లభింపజాలని దుప్రాప్యమైన ఫలమేదియును లేదు. ఈ వ్రతముచే శాంతింపని రోగములీలోకమున నేవియులేవు-9. అన్ని విధములైన కుష్టు వ్యాధులు, తగ్గవనుకొనబడు మొండి వ్యాధులుకూడ, గరుడుని భయముతో సర్పములు పారిపోయినట్లు నిశ్చయముగ రోగిని విడిచి పారిపోవును-10. మూ॥ ప్రతనియమతపోభిః సప్తమీ సప్త ఏవం విధివదేహహి కృత్వా మానవో ధర్మశీలః
తా॥ మానవుడు ధర్మ శీలుడై వ్రతముల చేత, నియమములచేత, తపస్సుల చేతను, ఏడు సప్తమి వ్రతములను విధి పూర్వకముగ నాచరించి, జ్ఞానము, ధనము, సంతానము, భాగ్యము, ఆరోగ్యము, పుణ్యములతో కూడి సుఖించి శాశ్వతమైన సూర్య లోకమును పొందును-11. ఓ బ్రాహ్మణ శ్రేష్టుడా! ఈ వీధిని గూర్చి వినినను, చేసినను, మనుష్యుడు సహస్ర కిరణుడైన సూర్యుని చేరును. సందేహములేదు-12. దేవతలు, మునుల, పురాణజులు ఎవరైనను ఈ సూర్య సప్తమి గూర్చి చెప్పుచున్నారు. వీరందఱును పరమాత్ముడైన సూర్యుని పూజించుచున్నారు-13. నేను నీకు చెప్పిన ఈ సూర్యవ్రత విధానము ఋషులకు సంబంధించినది. (ఋషులాచరించి ఫలములను పొందియుండినది) ఇది సూర్యుని యందు భక్తి గలవానికి మాత్రమే ఉపదేశింపవలెను. ఇతరులకెప్పుడును చెప్పరాదు-14. ఇది నిత్యము వినిపించువాడు, వినువాడును సూర్యదేవునిలో చేరిపోవుదురనుటలో సందేహములేదు-15. ఈ కథను మొదటి నుండియు వినినవాడు రోగార్తుడైన యెడల రోగముల నుండి ముక్తుడగును. జిజ్ఞాసువు సఫల మనోరథుడై సూర్యలోకమునకేగును-16. మార్గమునందు ప్రయాణము చేయుచున్నప్పుడిది పఠింపు చుండినచో క్షేమముగా గమ్యము చేరును. ఎవడేది కోరునో వానికది నిశ్చయముగ లభించును-17. తదేక భావముతో ఏకాంతమునందు నిష్ఠగలవాడై ఈ శ్రేష్ఠమైన, ఉపాసన రహస్యమైన రీతిగా చేసిన యెడల-18. మహాత్ముడైన భాస్కరదేవుని పరమస్థానమును పొందును. గర్భధారణ పొందిన స్త్రీ ఈ కథను శ్రద్ధగా వినినచో సుఖ ప్రసవమై పుత్రుని కనును-19. గొడ్రాలు గర్భము ధరించి పుత్ర పౌత్రాదులతో విలసిల్లును. అమిత తేజుడైన భానుదేవుడే నా కిదంతయు చెప్పియుండెను. దానినే నేను నీకు సభక్తికముగ చెప్పితిని-20. సర్వ పాపములను శమించుట కొఱకు నీవును సూర్య భగవానునర్చింపుము. అతడే ధాత. విధాత.
జగత్తు కంతటికిని గురువు-21. నిత్యమును తాను ఉదయించుచునే తన కిరణములతో జగత్తునందలి చీకట్లను పారద్రోలి వెలుగులను నింపును. ఆ ద్వాదశాత్ముడైన ఆదిత్యుడు ప్రసన్నుడగుగాక-22.
శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమి కల్పమునందు ఆదిత్య మాహాత్మ్యమున సర్షప సప్తమి వర్ణనమను దెబ్బదియవ అధ్యాయము సమాప్తము.
