భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
80. సప్తమీ కల్ప మహాత్మ్య వర్ణనము
తా॥ సుమంతుముని యిట్లనెను. 'ఇట్లు సూర్యుని మాహాత్మ్యమును గుఱించిన దివ్యకథ విని సాంబుడు మఱలనారదుని యిట్లు ప్రశ్నించేను “ సాంబుడిట్లనెను. “ముని సత్తమా! సూర్యుదేవుని పూజించుట వలన, ఆదేవదేవుని సేవాగ్ధమై దానములిచ్చుట వలన, అతనికి నమస్కరించుటవలన, అతని సమక్షమున గీత వాద్యాదులతోనతనికి ప్రీతికలిగించుట వలన. ఎట్టి ఫలములు గలుగునో వానిని గూర్చి నాకు చెప్పడు. దేవతలతో నెల్లప్పుడును పూజింపబడు నాలోక బాంధవుని నేను కూడా అయా ఫలముల ననుసరించి పూజింతును”-. నారదుడిట్లనెను. “ఇదే విషయమును గూర్చి పూర్వము దిండి, లోకపితామహుడైన బ్రహ్మదేవునడిగెను. ఆ వివరములు చెప్పెదను. సావధానుడవై వినుము. సురజ్యేష్ఠుడైన బ్రహ్మదేవుడు సుఖాసీనుడైయుండగా దిండి తలవంచి నమస్కరించి యాతనితో నిట్లనెను "బ్రహ్మదేవా! సూర్యపూజవలన, అతని ప్రీత్యర్థమై చేసెడు దానము వలన, నమస్కారము వలన, నృత్యగీత వాద్యాది సేవ వలన ఇతిహాస పురాణముల ప్రవచనములచేత, వానిని వినుటచేత, వీనిని సూర్యదేవుని యెదుట నిర్వహించుట చేత ఏఫలములు కలుగునో వానిని నాకుఁజేప్పుడు. సూర్యమందిరమున శుభ్రము చేయుట, అలికి ముగ్గుల పెట్టుటమున్నగు వాని వలన కలుగు ఫలమునూ కూడా నాకుఁదెలుపుడు”. బ్రహ్మదేవుడిట్లు పలికెను. “సూర్యుని స్తుతించుట, జపించుట, అతని సేవకొఱకు కానుకలిచ్చుట, పూజించుట, షఫీతిథినాడు ఉపవసించుట వలన సర్వపాపములనుండి విముక్తి లభించును. తలను నేల పైనాన్చి సూర్యనమస్కారములు చేయువాడు ఆక్షణముననే సర్వపాపములనుండి ముక్తుడగును. సందేహము లేదు.
తా॥ భక్తితో సూర్యదేవునకు ప్రదక్షిణము చేయువానికి సప్తద్వీపములతో గూడిన భూమికి ప్రదక్షిణము చేసిన ఫలములభించును . ఇహమునందు సర్వరోగ వినిర్ముక్తుడై సూర్యలోకమునకుఁబోవును. కాని ప్రదక్షిణము పాదరక్షలు లేకుండ చేయవలెను. పాదరక్షలతో ప్రదక్షిణము చేసినచో నరకము సంప్రాప్తమగును. పాదరక్షలతో గూడి సూర్యమందిర ప్రవేశము చేయువానికి “అసిపత్రవనమ'ను ఘోరమగు నరకము ప్రాప్తించును. మనస్సు నందు సూర్యదేవుని ధ్యానించుచు ఆకాశప్రదక్షిణము చేయువానికి దేవతలందఱును ప్రసన్నులగుదురు.. వారతని యెడ సంతుష్టులై శుభస్థితినిత్తురు. అంతియగాక అతని అభీష్టములను సఫలము చేయుదురు. షష్ఠినాడు ఒక పర్యాయము మాత్రమే భుజించు నియమముతో, లేక సప్తమీనాడైనను సూర్యదేవునర్చించువాడు సూర్యలోకమునకుఁబోవును.. రాత్రింబవలును షష్టి లేక సప్తమీ నాడు ఉపవాస వ్రతముతోనుండి సూర్యారాధన చేయువాడు 'పరమగతినందును. కృష్ణ పక్ష సప్తమీనాడు జితేంద్రియుడై ఉపవసించి ఎఱ్ఱని వస్తువులతో నాదేవుని పూజింపవలెను. తామరపువ్వులు, గన్నేరుపూలు, కుంకుమనీరు, చందనము, లడ్డుపములతో సూర్యభగవానునర్చించువాడు సూర్యలోకమునందును. శుక్లపక్ష సప్తమీనాడు ఉపవాస దీక్షతో తెల్లని పూజా వస్తువులతో భాస్కరుని పూజింపవలేను. జాజిపూలు, మల్లెలు, తెల్లకలువలు, కడిమిపూలు, పాయసము, వజ్రములతో సూర్యునర్చింపవలెను. అటుల పూజించువాడు సర్వపాపములనుండి ముక్తుడై, పరిశుద్ధాత్ముడై, చంద్రకాంతి వంటి కాంతి గలవాడై హంసలతో గూడిన విమానమున సూర్యలోకమును చేరును.
తా॥ దిండి యిట్లనెను. “దేవా! శ్రేష్టమగు సప్తమీ కల్పమును నాకు సవిస్తరముగఁజేప్పుడు. నేనావిధానముననుసరించి సప్తమీనాడు ఉపవాస వ్రతము బూని ఆ సూర్యభగవానుని శరణుపొందెదను.”. బ్రహ్మదేవుడిట్లునుడివెను. ఉత్తమమగు సప్తమీ కల్పమును గూర్చి లెస్సగా నడిగితివి. ఇట్టి ప్రశ్ననే పూర్వము సూర్యభగవాను నరుణుడడిగెను. మానవుల శ్రేయస్సు కొఱకు భాస్కరదేవుడు ఏడు సప్తమీ తిథుల వ్రత విధానములు వివరించెను. అరుణుడీ వ్రతమును గూర్చి కారణాంతరమున నడిగి యుండెను. ఒకానొక సమయమున సూర్యదేవుడు ధ్యానము నాశ్రయించి యుండగా నరుణుడతనితో నిట్లు పలికెను. 'దేవదేవేశా! మీరు ధ్యానమునందేలయుంటిరి? మీరిట్లు నిలిచినచో దినము గడవదు. ఇట్లు నిలుచుటకు కారణము తెలుపుడు. కాలమును ముందుకు నడిపించుచు సాగిపొండు” అరుణుడిట్లడుగగనే సూర్యదేవుడిట్లు పలికెను. 'నేను ధ్యానముననుండుటకు కారణమును వినుము. అర్వావసువను బ్రాహ్మణోత్తమునకు సంతానము లేనందున. ప్రతిదినమతడు గంథపుష్పాదులచే నన్ను పూజించుచుండెను. పుత్రార్ధియై యాతడు నన్ను పూజించుచుండినను అతనికి పూజా విధానము మాత్రము తెలియకుండెను. ఎట్లు పూజించినచో నేను పుత్రులను అనుగ్రహింతునో అతడెఱుంగకుండెను. మానవులే విధితో పూజించినచో నేను ప్రసన్నుడనగుదునో దానిని చెప్పెదను వినుము. పూజా విధులలో సప్తమీ కల్పమను పేరు గలది ఉత్తమమైనది. దాని ననుసరించి నన్ను పూజించినవారికి పుత్రుల నొసంగుదును. ఈ సప్తమీ కల్పమును గొనిపోయి ఆ బ్రాహ్మణునకుఁజెప్పుడు. ఈ విధానమున నన్నాతడు పూజించును. అతనికి నేను పుత్రులనొసంగుదును. “సూర్యుడిట్లు చెప్పిన వెంటనే ఆఖగోత్తముడు బ్రాహ్మణుని చెంతకు బోయి సూర్యోక్త సప్తమీ కల్పమంతయు నాతని కుపదేశించెను. ఆ ద్విజోత్తముడదిసాంతముగ విని యధావిధిగ కల్పోక్త ప్రకారముగ వ్రతమాచరించెను. ఫల స్వరూపముగ నతడు సంపదలను, అభివృద్దిని, ఆరోగ్యము, బహుసంఖ్యాకులగు పుత్రులను బడసీ సూర్య తేజస్సుతో సమానమగు తేజస్సును పొంది సూర్యలోకమునకేగేను.
శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణము నందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమాహాత్మ్యవర్ణనమను ఎనుబదియ అధ్యాయము సమాప్తము.
