భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
106. సప్తమీ కల్పమున పాపనాశినీ వ్రత విధి వర్ణనము
తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “మహా భాగా! మఱియొక వ్రతమును గూర్చి చెప్పుచున్నాను వినుము. ఈ తిథి మాహాత్మ్యము పూర్వము సూర్య భగవానుని చేత దేవతలకు చెప్పబడినది”. అది విని విష్ణు భగవానుడిట్లనెను. “సుర శ్రేషా! విజయ, అతిజయ, మహాతిథియగు జయంతి యను తిథులను గూర్చి మీరు చెప్పగా వినియుంటిని. ఇక నాకు పాపనాశిని గురించి తెలుపుడు. అటు పిమ్మట సూర్య పూజకు ప్రశస్తమైన ఉత్తరాయణమును గుఱించి చెప్పుడు: ఉత్తరాయణమున సూర్య భగవాను నర్చించు వారి పాపములు నశింపజేసి, యా దేవుడక్షయ ఫలము లిచ్చు విషయమును భక్తితో నడుగుచున్న నాకు తెలియజెప్పుడు”. బ్రహ్మదేవుడిట్లు చెప్పదొడగెను. “శుక్ల పక్ష సప్తమీ దినమున సూర్య నక్షత్రమయ్యెనేని యది మహా-పుణ్యప్రదమగు పాప నాశినీ సప్తమీ” యన బరగును. ఆ తిథియందు జగద్గురువైన చిత్రభాను దేవేశుని పూజించినచో నాతడేడు జన్మలలోను చేసియుండిన పాపముల నుండి ముక్తునిఁజేయు ననుటలో సందేహము లేదు-5. నియత మానసుడై యా దినమున నుపవసించువాడు సర్వ పాప విముక్తుడై సూర్యలోక విభవము ననుభవించును. సూర్య దేవునుద్దేశించి యాదినమున చేసిన స్వల్పమైన దానము గాని, చేసిన హోమము గాని, యదియంతయు నక్షయమగును. సూర్య దేవుని సమక్షమున శ్రద్ధాపరుడై ఒక్క ఋగ్వేద మంత్రమునైనను జపించువానికి సమస్త ఋగ్వేదమును పఠించిన సత్పలము నా దేవదేవుడొసంగును. ఇది నిశ్చయము. ఒక్క సామము సామవేద సర్వస్వ ఫలము, ఒక్క యజుస్సు, యజుర్వేద సర్వస్వ పఠన ఫలమును, ఒక్క అధర్వ మంత్ర పఠన మఖిలాధర్వవేద పఠన ఫలము నోసంగునట్లా సూర్య దేవుడనుగ్రహించును. సప్తమీనాడు దేవ దేవుడైన దివాకరుని పూజించువారు రాత్రింబవలును తారకల వలె ప్రకాశించుచుందురు. భాస్కరుడిట్టి భక్తుల యశేషపాపములను నశింపజేయును. సూర్య ప్రోక్తమైన యీ పాపనాశినీ సప్తమీ వ్రతమును తప్పక చేయవలయును. ఈ తిథి యందు సూర్యార్చన చేయువాడు సూర్య లోకమునకుత్తమమైన కర్పూర విమానము పై పయనించి చేరుతు. తేజస్సు చేత శుక్ర సంకాశుడై, ప్రభ చేత సూర్య సన్నిభుడై, కాంతిచే చంద్రసముడై, శౌర్యము నందు హరి సమానుడై. వెలుగుచు. నచట దేవగణములతో గూడి సుఖముగ నుండును. మఱల నీ భువికేతెంచి చక్రవర్తి యగును.
శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు 'పాప నాశినీ' వ్రత విధి వర్ణనమను నూటయాఱవ అధ్యాయము సమాప్తము.
