భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
119. సప్తమీ కల్పమున దీపదాన మహాత్మ్య వర్ణనము
తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “ఒకానొక సమయమున దుస్తరమైన యంధతామిస్రమనేడు నరకమున బడి క్షోభించుచు, ఆక్రోశించుచున్న జీవులతో యమకింకరుడిట్లనెనట. మూఢజీవులారా! ఇఁకనిట విలపించుట చాలును. విలపించినచో మీ కిపుడేమి లాభము కలుగును? పూర్వము భ్రమప్రమాదాదులకు లోనై యీ ఆత్మ పదార్దము ను పేక్షించితిరి గదా. మొదట కొంచెమేనియు నాలోచింపక, అంతయునైన పిదప నిపుడు విచారించినచో సత్ఫలమెట్లు కలుగును? ఇప్పుడు యాతనననుభవింపుడు. ఏడ్చుచున్నారేమిటి?. దేహము కొద్దికాలమే. అది అనుభవించు విషయములు మిక్కిలి దుర్బలములు. ఇది యెవనికి తెలియదు. దాని వలననే మీరును ప్రమాదమున బడిపోయితిరి. ప్రాణి, వేయిజన్మలలో నేప్పుడో మానవ జన్మమెత్తును. కాని యా మానవ జన్మలోకూడ మిక్కిలి మూఢాత్ముడై విషయభోగముల వెంట పరుగుతీయనేమి. దొరాపుత్ర గృహక్షేత్రాదుల హితము కొఱకు మాత్రమే నీరంతరము ప్రయత్నించుచు మూఢులు తమ ఆత్మ హితమును గూర్చి యిసుమంతయు తెలిసికొనరుగదా! మోహితుడైన మానవుడు నరకమునఁబడియును, “నేను వంచింపబడితిని. నేను చేసికొనిన కర్మవలననే యీ నరకము నాకు ప్రాప్తించినది. ఈ కారణమున నిధి దాపురించినది” అనీ తెలసికొనజాలకున్నాడు. అశేషములగు కర్మలకు సాక్షీభూతులగు సూర్యచంద్రాదులనుగానీ, కాలమునుగాని, తనను తానుగాని, శుభాశుభములుగాని తెలియజాలకున్నాడు. భార్యాపుత్రాది సంసారలంపటత్వముగల శరీరధారు లకు వేజ్వేలు జన్మలు కలుగుచున్నవి. దేని కొఱకే కర్మచేయబడునో ఆఒక కర్మననుసరించి పరంపరగా నూఱు జన్మలు సంప్రాప్తమగు చున్నవి అహో! మోహ మాహాత్మ్యము నేమని చెప్పగలము! నరకముల యందును మమకారము నశింపదు గదా! జన్మతో సంబంధపడియున్న జీవుడు తల్లిని తండ్రిని పీడించుచుకూడ, తాను స్వయముగను ఏడ్చుచుండును. విషయభోగముల రుచులతోడి తత్కాల తర్పణములచే నిట్లాకర్షింపబడు చిత్తములుగల మనుజులకు పరమార్థములను దర్శింపగల బుద్ధి కలుగదు. మనస్సు నిరంతరము విషయాసక్తమై యుండును. సూర్యభగవానుని నామకీర్తనము చేయుటలో నాలుకకేమి భారమగును?. ఏ దీప సమర్పణమున వర్తించుటచే నమృతలాభము కలుగునో అట్టి వత్తి, నూనె మొదలగునవి అల్పమూల్యములే గదా! ఇంతకన్న లాభమేదీ కలదు. అట్లు వర్తించియుండిన చింతయేల కలుగును?.
తా॥ నిడు పైన చేతులకు స్వాతంత్ర్యముండగా సూర్యదేవాలయమున దీపము వెల్గించుట మహాఫలప్రదము, అట్లు దీపదానము చేయని మనుష్యుడు నరకమున కీడ్వబడి. విలపించును. నిస్సహాయులైన జీవుల రోదనమిప్పుడు దుష్కర్మ ఫలస్వరూపముగా కాననగుచునే యున్నది. కావున నేదైన చేయుటకు స్వాతంత్ర్యముండినయప్పుడే-అనగా స్థూల శరీరము ప్రాణములు కలిసి యుండిన దశలోనే మానవంతులకు సత్కర్మాచరణ మవశ్యకర్తవ్యము. ప్రాణములు పోయినను జీవుడు కర్మఫలభోక్తగా నిలిచియుండును. విషయభోగములందాసక్తి యెంత యున్నను తానిచ్చినదే తనకు లభించును. పాపములు చేసియుండుటచే నేడు నాచే గొనిరాబడిన యీ నరకస్థానమే మీకుఁదగియున్నది. ఇప్పుడేడ్చి ప్రయోజనమేమి? దాపురించిన యాతనను సహింపుడు. మీ కిష్టమును లేకున్నను ఈ దుఃఖము ప్రాప్తించినది. కాబట్టి పాపమునందెప్పుడు మీ మనస్సును ప్రవర్తింపనీయదగదుసుమా! ఒకవేళ అజ్ఞానవశమున పాప కర్మయందు మనస్సును పోనిచ్చినను నిరంతరముగ సూర్యారాధన చేసిన యెడల, సంచితమైన పాపము నశించును. బ్రహ్మదేవుడిట్లనెను. “యమ కింకరుని మాటలు విని మిక్కిలి దుఃఖముతో, ఆకలిచే కృశించిన కంఠము గలవారై, దాహార్తిచే పగిలిన దవడలు గలవారై నరకవాసులతనితో నిట్లనిరి. అయ్యా! ఘోరమైన యీ నరకయాతన ననుభవించుటకు మేమేమి దుష్కర్మచేసియుంటిమో దయచేసి చెప్పుడు”. వారి మాటలు విని యమకింకరుడిట్లనెను. “పూర్వము మీరు యౌవనోన్మాదము వలన నవివేకులై, కేళీ విలాసములలో(దొప్పదోగి ఘృతలోభముచేత సూర్యమందిరము నుండి దీపమును దొంగిలించితిరి. ఆకారణమున మీరీ తీవ్రమగు చల్లనిగాలిచే చీల్చబడుచు, ఆకలి దప్పులచే నలమటించుచు ఘోరమగు నీ నరకమునఁబడితిరి”. బ్రహ్మదేవుడిట్లనెను. విష్ణుదేవా! భాస్కరాలయమున దీపదానముచేఁగలుగు పుణ్యమును, నీకు వివరించితిని కృష్ణా! దీప సమర్పణ మెచటఁజేసినను ప్రశస్తమే. ముఖ్యముగ జగత్కర్తయగు సూర్యభగవానుని మందిరముననైనచో శ్రేష్ఠతరము. సాధుపురుషులాయా దానసాధనములచే నిచ్చిన ఆయాదీపములు, గ్రుడ్డి, మూగ, చెవిటి మొదలగునంగవికలుర చేతను, వివేక హీనులచేతను, నింద్యులచేతను, దేవాలయమునుండి యపహరింపబడి యన్యస్థలములకుఁగొంపోబడును.
శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు దీపదాన మాహాత్మ్య వర్ణనమను నూటపదునైదవ అధ్యాయము సమాప్తము.
