భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
18. ప్రతి పత్కల్ప సమాప్తి వర్ణనము
తా ॥ సుమంతుముని ఇట్లనెను. “పూర్ణిమనాడు ఉపవాసము చేసి పాడ్యమినాడు భక్తితో ఈ విథానమున బ్రహ్మను పూజించు మానవుడు -1. బ్రహ్మపదమును పొందును. వాస్తు దేవతలను ముఖ్యముగా బ్రహ్మమంత్రములతో పూజింపవలేను -2. కార్తిక మాసమునందు బ్రహ్మదేవుని రథయాత్ర చెప్పబడినది. అట్టి రథయాత్రను భక్తితో నిర్వహించిన మానవుడు బ్రహ్మలోకమును పొందును -3. రాజేందొ! కార్తిక పూర్ణిమనాడు బ్రహ్మదేవుని సావిత్రితో కూడ మృగచర్మము నందాసీనుని చేసి -4. వివిధములైన వాద్యములతో నగరమునందూరేగించి తిరిగి యథాస్థానము చేర్పవలెను -5. మొదట శాండిల్యసగోత్రజుడైన బ్రాహ్మణుని భోజనాద్యుపచారములచేత పూజించి, మంగళవాద్యముల ధ్వనులతో దేవుని రథమునందధిరోహింపజేయవలెను -6. శాండిలీపుత్రుని రథము ముందు సవిధానముగా పూజించి, బ్రాహ్మణులచేత స్వస్తి పుణ్యాహవాచనము చేయించి -7. దేవుని రథమునందారోపణ చేసి ఆ రాత్రి జాగరణము చేయవలెను. వివిధములైన నృత్యాది ప్రదర్శనములచేత, విరివియైన వేదఘోషల చేత -8. ఇట్లు జాగరణ చేసి ఉదయముననే యథాశక్తి బ్రాహ్మణునకు అనేక విధములైన భక్ష్య భోజ్యములతో కూడిన భోజనము పెట్టి -9. అతనిని వజ్రపురవతోను, పాలు పాయసముతోడను యథావిధిగ సత్కరించి -10. బ్రాహ్మణులచేత వైదికవిధితో స్వస్తివాచనము, పుణ్యాహవాచనము చేయించి నగరమునందు రథమును త్రిప్పవలెను-11.
తా॥ బ్రహ్మరథమును నాలుగువేదములు తెలిసిన బ్రాహ్మణులచేత లాగింపవలయును. అనగా రథమును లాగువారు ఋగ్యజుస్సామాధర్వణ వేదములను పఠించుచుండవలెను -12. ఆ సురశ్రేష్ఠుడైన దేవదేవునిరథము సమతలముగానున్న మార్గము ద్వారా పురమునంతయును ప్రదక్షిణముగా త్రిప్పవలెను -13. రాజా! శుభమును కోరువాడు శూద్రుని చేత మాత్రము రథమును లాగింపకూడదు. బుద్దిమంతుడు, భోజకుడైన బ్రాహ్మణుని విడిచి రథము నధిరోహింపజేయరాదు -14. బ్రహ్మదేవుని కుడి ప్రక్క సావిత్రిని, ఎడమ భాగమున భోజకుని స్థాపించి ముందుభాగమున బ్రహ్మను స్థాపన చేయవలెను -15. ఈ విధముగా వివిధ వాద్యధ్వనులతోను, శంఖారావములతోను రథమును పురమంతయు త్రిప్పవలెను. ఆ పిదప-రథయాత్రానంతరము నీరాజనమిచ్చి దేవుని స్వస్థానమున నిలుపవలేను -16. ఇట్లు 'రథయాత్ర' చేసిన వాడును, భక్తితో చూచినవాడును, రథము లాగిన వాడును బ్రహ్మలోకమునొందును -17. బ్రహ్మదేవుని మందిరమున కార్తికమాస అమావాస్యనాడు దీపములను వెలిగించినవాడు బ్రహ్మపదమును పొందును -18. పాడ్యమినాడు బ్రాహ్మణులకు గుడమిశ్రితములగు దీపములను, సదశములైన నూతన (అంచులు గల' శ్వేత వస్త్రములను సమర్పించి పూజించువాడు బ్రహ్మపదమును పొందును -19. ఆ పాడ్యమినాడే నూతన వస్త్రములతో, గంథ పుష్పాదులతో తనను తాను అలంకరించుకొనువాడు బ్రహ్మపదమును పొందును-20.
తా ॥ పాడ్యమి తిథి మహా పుణ్యప్రదమైనది. బలిచక్రవర్తి రాజ్యము పొందిన దినము. బ్రహ్మకు ప్రీతిపాత్రమైనది. నిత్యమును బాలగా కీర్తింపబడునది -21. ఈ తిథియందు బ్రాహ్మణులను, విశేషించి తనను తాను పూజించుకొనువాడు అమిత తేజోవంతుడైన విష్ణుదేవుని స్థానమగు వైకుంఠమునకు పోవును -22. చైత్రమాసమునందలి ప్రతిపదనాడు చండాలుని స్పృశించినను, స్నానమాత్రమున -23. ఏ దోషమంటకుండ పవిత్రత చేకూరును. మనోవ్యాథులు కాని శరీర రుగ్మతలు కాని బాధింపవు. అందుచే చైత్ర ప్రతి పద మిక్కిలి శ్రేష్టమైనది. ఆనాడు స్నానము తప్పక చేయవలెను -24. అదియే సర్వరోగ వినాశకరమైన దివ్యనీరాజనము. ఆవులు, గేదేలు మొదలగునవి ఏవైన ఉన్నచో వానిని ఆదినమున చక్కగా అలంకరింపవలెను -25. నూనె, ఆయుధములు, వస్త్రములు మొదలగు వానితో అలంకరించి వానీని తోరణముల క్రిందికి చేర్పవలేను. ఆపై బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను -26. కార్తీక, ఆశ్వయజ, చైత్రమాసములందలి ఈ మూడు తిథులు శ్రేష్ఠములైనవిగా చెప్పబడినవి -27. కార్తిక పాడ్యమినాడు స్నానము దానము నూరురెట్లు ఎక్కువ పుణ్యప్రదము. ఈ తిథి బలిచక్రవర్తి రాజ్యము పొందిన దినము. సుఖమునిచ్చునది. పవిత్రమైనది. అశుభమును నశింపజేయునది -28.
శతార్థసాహస్ర సంహితయగు శ్రీ భవిష్యమహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున ప్రతిపత్కల్ప సమాప్తివర్ణనమను పదునెనిమిదవ అధ్యాయము సమాప్తము.
