భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

57. సప్తమి కల్పమున ఆదిత్యమహిమ వర్ణనము

తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “బ్రహ్మకు పాలు, జావ శ్రేష్టమగునాహారము. భూతేశ్వరుడగు కార్తికేయునకు ఫలములు నివేదింపవలెను. వివస్వంతునకు తేనె, మాంసము, మద్యము నివేదింపవలెను. సపరివారుడైన ఇంద్రునకు భక్ష్యములు, అగ్నికి హవిష్యాన్నము, విష్ణు దేవునకు శ్రేషాన్నము నర్పింపవలెన. రాక్షసులకు చెఱుకు రసముతోఁజేయబడిన మద్యము, మాంసాన్నము, రేవతునకు సంస్కరింపబడిన మాంసాన్నమును సమర్పింపవలేను. యమునకు తిలాన్నము, అశ్వినీ కుమారులకు భక్ష్యములు, వసువులకు మాంసము నీయవలెను. పితృదేవతలకు తేనె, నేయితో గూడిన పాయసమును, గౌరీ దేవికి జావ, లక్ష్మీదేవికి పెరుగు నైవేద్యము పెట్టవలెను. సరస్వతీ దేవికి త్రిమధురము, వరుణునకు చెఱకు రసముతోడి యన్నము, కుబేరునకు ఖండ శర్కరాన్నము, మిత్రుడను సూర్యునకు నునిదియే నివేదింపవలెను. మరుత్తులకు నూనే, మజ్జిగలతో తర్పణము చేయవలెను. మాతృకలకు మాంసాన్నము, పప్పు నివేదన చేయవలెను. భూత గణమునకు పుష్కలమగు భోజనములు, సూర్యునకు జలము, గణాధిపతికి లడ్డువములు, (ఉండ్రాళ్లు). నీరృతికి చక్కిలములు, విశ్వేదేవతలకు సర్వ విధములగు భక్ష్యములనర్పించి తృప్తిపరుపవలేను. ఋషులకు క్షీరాన్నము, నాగములకు పాలు, సూర్యరథమునకు సర్వభూత బలి చేయవలెను.

తా॥ రథ వాహకులకు నలుఁగు, మద్యము, మాంసము ఈయవలెను. బ్రహ్మకు ఆజ్యము, శివునకు నువ్వులు. కుమారస్వామికీ పేలములు, సూర్య దేవున కెప్పుడును అమ్ల పత్రము. ఇంద్రునకు ఆరగ్వధము (జేల) అగ్నిహోత్రునకు హవిష్యము, చక్రికి సప్తధాన్యములు, గురుడునకు మత్స్యములు. యక్షులకు వివిధములైన అన్నములు, రేవతునకు మ్రాని బంక, యమునకు పుల్లవేలగదండలు, సమర్పింపవలెను. అశ్వినీకుమారులకు కొండగోగు, లక్ష్మీదేవికి తామరలు, చండికా మాతకు మంచి గంథము. సరస్వతీ దేవికీ వెన్న, వినతకు మాంసము, అప్సరలకు జాజిపూలు. వరుణునకు శ్రీ పర్ణము (వెల్లి?) నిరృతికి ముల్లంగి, కుబేరునకు మారేడు, మరుత్తులకు వెలగ. గంధర్వులకు తేల, వాస్తవులకు కర్పూరము, గణాధిపునకు దేవదారు. పితృదేవతలకు దాసనవేళ్లు, భూతములకు తాండ్ర, గోవులకు యవలు, మాతృదేవతల కక్షతలు. విఘ్ననాయకునకు గుగ్గులము, విశ్వేదేవతలకన్నము, ఋషులకు మేడి, నాగులకు పాలు సమర్పింపవలెను.

తా॥ భూత గణనాథా! స్వర్ణవరప్రభా భాసమానుడైన భాస్కరునకు తేనె, నేయి మొదలగు పూర్వోక్త వస్తువులన్నింటిని నివేదింపవలెను. రథాశ్వములకు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము భక్తితో, ఏకాగ్రచిత్తముతో మట్టిపండ్లు నివేదింపుచుండువలేను. విచక్షణుడు సర్వదేవతలకును భక్తి శక్తులననుసరించి ధూపము సమర్పింపవలెను. ఏయే దేవతలకేయే ధూపము, మంత్రము చెప్పబడినదో ఆయాదేవతలకాయా ధూపములను సమంత్రకముగనర్పింపవలెను. శాంతి నిమిత్తము బ్రాహ్మణులకు నువ్వులు దానము చేయవలెను. నేతితో గూడిన తిలలను అగ్నిలో వ్రేల్చవలెను. దేవతలకు స్వాహాకారములతో పితృదేవతలకు స్వధాకారములతో నర్పించుట, వారికి అమృత తుల్యములగును. ఇది బ్రాహ్మణులకు రక్షణ కల్పించునవి యనియు విజ్ఞులెఱుంగుదురు. ఇవి కశ్యపుని శరీరము నుండి యుద్భవించినవి. స్నాన, దాన, హోమ, తర్పణ, అశనములందు శ్రేష్ఠములైనవి. ఇట్లు దేవతలను, గ్రహములను శ్రద్ధగా పూజించి, రథము పై నుండి సూర్యదేవుని క్రిందకు దింపి మల మండలమునందు స్థాపింపవలెను. దుర్దృష్టి నివారణార్థమై, దీపములు, నీరు, యవలు, అక్షతలు, ప్రత్తి గింజలు, ఉప్పు, ఊక మున్నగువానిచే ఆరతిచేసి (దిష్టితీసి). సూర్యదేవుని, భార్యలతో సహా వేదికపై ప్రతిష్టింపవలెను. అచట నా దేవ దేవుని పది దినముల వఱకు పూజింపుచుండువలేను. భూతలమందీ పూజ 'దశాహ్నిక' యని ప్రఖ్యాతి పొందినది. అట్లు చేయబడు పది దినముల పూజలో నాలుగవనాడు. దేవునికి స్నానోపచారము చేయవలెను. అభ్యంగన భోజనాదులు, పూజా సత్కారములు ప్రత్యేకముగ జరుపవలెను. ఈ విధానమున దీవాకరునికి పది దినముల పూజచేసి, సమాప్తిని కూడా ప్రత్యేకముగ చేసి, దేవుని ఎప్పటి స్థలమునకుఁజేర్పవలెను.

శతార్ధసాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహా పురాణమునందలి బ్రహ్మపర్వమున రథ సప్తమి కల్పమున ఆదిత్యమహిమ వర్ణనమను ఏబది యేడవ అధ్యాయము సమాప్తము.