భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

99. సప్తమీ కల్పమున మహాజయా కల్ప వర్ణనము

తా॥  బ్రహ్మదేవుడుడిట్లనెను. “శుక్లపక్ష సప్తమీనాడు రవి సంక్రమణము జరిగిన నది మహాజయ సప్తమీగా, సూర్యునకు ప్రియమైనదిగా పేర్కొనబడును. సూర్య భగవానుడే చెప్పినట్లాదినమున చేసిన స్నానము, దానము, జపము, హోమము, పితృతర్పణము, దేవతార్చన మున్నగు నే పుణ్యకర్మయైనను కోటిరెట్లు ఫలమొసంగునని చెప్పనైనది. ఆనాడు ఏ మానవుడు భక్తితో సూర్యునకు ఘృతస్నానము చేయించునో అట్టివాడశ్వమేధ ఫలమున పొంది స్వర్గలోకమునకుఁబోవును. భాస్కరదేవుని యందు భక్తికలిగి యాతనికి క్షీరాభిషేకము చేసినవాడు పాపములన్నింటి నుండియు ముక్తుడై సూర్యలోకమునకు బోవును. విష్ణు తేజమువంటి తేజము గలవాడై, కాంతిచేత సూర్యునితో సమానుడై, చిరుమువ్వలతో నలంకరింపబడిన కర్పూర విమానము నందు పయనించి సూర్యలోకము చేరును. అచట చిరకాలము వసించి వెంటనే రాజగును. ఇదియే ‘మహాజయ' యను పేరుగల సప్తమీ. త్రిపురాంతకా! దీనియందునుపవసించి సూర్యభక్తిగలవాడై వ్రతాచరణము చేసినవాడు సూర్యలోక గతుడగును. ఆ పిదప పరబ్రహ్మప్రాప్తినంది శోకరహీతుడగును.

శ్రీ భవిష్య మహాపురాణము నందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు మహాజయా కల్పవర్ణనమను తొంబది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.