భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
41. షష్టీ కల్పమున బ్రాహ్మణ వివేక వర్ణనము
తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “వేదాధ్యయనము కూడ. ఈ బ్రాహ్మణ్యమును కలిగించును. బ్రాహ్మణుని వలె వైశ్యులు, క్షత్రియులు, రావణాది రాక్షసులు. శ్వాదులు, మాలలు, దాస్యముచేయువారు, బోయలు, గొల్లలు, జాలరులు ఇంకను ఇతర శూద్రజాతివారు వేదములధ్యయనము చేయుదురు. కొందఱు శూద్రులు దేశాంతరములకుఁబోయి, బ్రాహ్మణ, క్షత్రియుల నాశ్రయించి వ్యవహారమున, ఆకారమున, భాషాది విషయములందును బ్రాహ్మణ సదృశులుగా చేయబడి. వేదములు చదివి, లేక రెండు వేదములో, ఒక్కవేదమో యధాక్రమముగ నేర్చుకొని శుద్ధబ్రాహ్మణ కన్యను, శుభలక్షణములు గలదానిని వివాహమాడుదురు. లేక వేదములభ్యసించి, క్షత్రియ, వైశ్యజాతులతో సమానత్వమునుబొంది గౌడదేశమునకు తూర్పుననున్న దేశమునకో లేక దక్షిణ దేశమునకో చెందిన జాతిగా నేర్పడెదరు. వారి శూద్రత్వమజ్ఞాతమగులచే తమకిష్టమైన బ్రాహ్మణ జాతిని పొందుదురు. అందువలన వారి వేద విభాగముగాని, చేయుక్రియనుగాని, అనుసరించిచేయబడిన విభేదము, తెలియబడకుండును. న్యాయమార్గము ననుసరించు శాస్త్రకారులు కూడ నటులే చేప్పియుండిరి. వారు యథార్ధ విషయమును గ్రహించి మత్సరములేని సత్పురుషులుగా నుండిపోయిరి. వేదములను సాంగమున నధ్యయనము చేసినను అవి ఆచారహీనులను పవిత్రులఁజేయఁజాలవు. వేదాధ్యయనము చేయుట బ్రాహ్మణులకృత్యము. వృత్తి సద్వృత్తము కలిగియుండుటయే బ్రాహ్మణలక్షణము. నాలుగు వేదములనభ్యసించి యుండినను సద్వృత్తమున లేని బ్రాహ్మణుని చేత ఏ కార్యము(ను) చేయబడదు. అతడే కర్మచేసినను, స్త్రీ రత్నము నపుంసకుని ప్రేరేచినట్లు నిష్పలమగును. శిఖ, ఓంకారము, సంస్కారము, సంధ్యోపాసనము, మేఖల(మొలత్రాడు) దండము, జింక చర్మము, పవిత్రమొదలగునవి శూద్రులయందు కూడా నిష్టానుసారముగ నుండ వచ్చును.
తా॥ శూద్రుల ప్రసంగమును నివారించుటకు త్రిమూర్తులకు కూడా శక్యము కాదు. ఇక మానవులైనచో దానిని నివారింపలేరు సరికదా తామే స్వయముగ తప్పుకొందురు. కాబట్టి మానవులలో యజ్ఞోపవీత సంస్కారములు, మేఖలలు, పీలకజుట్లు ప్రత్యేక దృష్టితో చూడబడవు. చేతబడి మంత్రములు మొదలగు వానిలోను, దుర్లభములని చెప్పబడు కార్యములలోను బ్రాహ్మణునకు మాత్రమే శక్తి యుండినచో అతనికి సంబంధించిన వారిని ఎవరు చంపగలుగుదురు?. తపస్సు, సత్యము మొదలగువాని మహాత్మ్యము వలన దేవతా సంబంధమగు జ్ఞానమును చింతన చేయు శక్తి కలుగును. ఇక మంత్ర శక్తి యనినచో నది యందఱకును అందుబాటులోనుండును. మోసముచేయుట, దుర్భాషలాడుట వంటివి సర్వమానవ సాధారణములే కావున బ్రాహ్మణ శూద్రులలో నెట్టి భేదములేదు. శాపమిచ్చుట, అనుగ్రహించుట, మున్నగువానిలో నెట్టి శక్తిభేదములేదు. దొంగలు, బందిపోట్లు, రాజులు, దుర్మార్గులు మొదలగు వారిచే దోచుకొనబడుటయందున మానవులలో నే భేదములేదు. తనకు దుఃఖము కలిగినపుడు దానిని తొలగించుకొనుట, స్వజనులను రక్షించుట అనునట్టివానికి శూద్రుడు కారణభూతుడు కాడు. (అట్టి పరిస్థితులు రాకుండా చూచుకొనును). బ్రాహ్మణుడు కూడా అట్టివాడే కదా!. అగ్గలించిన బ్రాహ్మణులలో నెవడేని యొకడీ కలియుగమున, ఈ దేశమున చేయరాని పనులు చేయకున్నను, వేటొక కాలమున వేడొక దేశమున నా విధముగనకార్యకరణమున తగుల్కొనవచ్చును. శాపానుగ్రహసామర్థ్యముల వంటివి పరమాత్మకుఁదెలియును. కొందఱు ఇట్టి శక్తిని బ్రహ్మత్వ సాధన చిహ్నముగ పేర్కొందురు. సంసారము పై వ్యామోహముగల మనస్సుగలవారు, మోహమనెడీ చీకటిలో ఆవరింపబడినవారు, అగ్నిలో మిడుతలవలె ఊర్థ్వ మార్గములందలి గోతులలో పడిపోవుదురు.
తా॥ వేద సంసర్గము వలన బ్రాహ్మణుల జాతియందు "జాతిధర్మము' ఇంచుక ప్రత్యేకమైనది, ఇది బ్రాహ్మణ జాతియందు ప్రసిద్ధము. శూద్రజాతి కిట్టిదిలేదు. సంస్కారమనునది పుట్టువుచేత, లేక సమగ్రత (లేక ఉపకరణముల) చేత కలుగుచున్నది. శూద్రుల కొఱకు మాత్రము సాధారణత్వగుణము మాత్రమే ఎక్కువగా పోషకమైయున్నది. బ్రాహ్మణులలో పండితులచేత కల్సింపదగిన భేదమైదు విధములుగ నున్నది. కాని జాతి వలన కలిగినది గాని, వేదమువలన కలిగినదిగాని ఏ విశేషమునులేవు. ఉన్నదని చెప్పుటకు హేతువేమియు లేదు గావున లేదని చెప్పుటజరిగినది. సపోతన వస్తువునకు క్రమక్రమ క్రియలు లేవు. ఎప్పుడును క్రియ చేయకుండువాడు కర్మభ్రష్టతకు కారణముకాడు కాని వేదవిహితమైన కర్మలాచరింపవలసిన వాడయియును నాచరింపమివలన వేద సాపేక్షముగ నతడు కర్మహీనతకు కారణమగుచున్నాడు. సామీప్యము వలన వీడు వానితో సమానమైన వాడగుచున్నాడు. కాలాతిక్రమణమైన పిదప దేనికొఱకై ననుచూచుట యుక్తముకాదు. మనోవృత్తిలో నుండువాడు వేద యోగముతోగూడ నెదిగినచోనతడద్వితీయమైన జ్ఞానముకలవాడగును. ఇతరులెవ్వరును అతనిని తెలిసికొనజాలరు. విశేషమగు రీతిలోనధ్యయనము చేయగల సహజ స్వభావమునకు తోడుగా నసహజమగు వేదసంసర్గము కూడా లభించుటచే నతిశయమునొందు వానిని, ఎవ్వడును ఆశ్రయింపకుండనుండడనినచోనది సమంజసమేయగును. అందజీచే కోరబడు బ్రాహ్మణ్యము దృశ్య స్వభావముకలదాయేమి? అయ్యయో! అది 'అదృష్ట' రూపముగదా! కనబడు రూపమందతిచేనెఱుంగబడును. అట్లుకాని దానికి మార్గమేముండును. ఏదియునుండదు. సమగ్రతా భావము వలన బ్రాహ్మణుని శరీరమునందొక పరమమైన విశేషముండును. దానిచేతనతని యాత్మయందలి దేవతలు, ఏది పుణ్యమో దానిని, ఏది పాపమోదానిని, ఏది సరియైనది కాదో దానిని ఏది శాస్త్రమున చెప్పబడినదో దానిని స్మరించుచుందురు. అశేషానుష్టాన గుణముల చేత శూద్రులుకూడ సమగ్రులై బ్రాహ్మణులతో సమానులుగానుందురు. కాబట్టి ఆధ్యాత్మికముగ గాని, బాహ్యనిమిత్తకముగ గానీ ‘బ్రాహ్మణ-శూద్ర' అనెడి విశేషమేమియు నుండదు . మిక్కిలి సంస్కారముగల పురుషులందజిలోనను సంస్కారము చేత అతిశయించినవాడు, బ్రాహ్మణ వర్గమున గొప్ప సంస్కారము గలిగిన ముఖ్యుడును ఉండవచ్చును. కాని అతనికి వ్యాసాదులతో మాత్రము సామ్యము ఘటింపదు.
తా॥ పుట్టుక యనునది స్వాభావికమైనదయినందున, అధ్యయనమునకు ప్రత్యేకతయేమియులేనందువలన జాతులలో భేద కారణత్వము సంభవింపదు. సమస్తమైన జనులలో, దూరదూరములయందుండెడి పరులచేత, శరీరసంబంధమైన పాంచ భౌతికత్వమునుండియు, మనస్సుయొక్క అవుష్టసంస్కారమునుండియు కొనిరాబడిన జీవుని యందు 'జాతి'యేది?. ఇక నితర నాస్తిక, మ్లేచ్చ, యవనాదీ జనములయందును. వేదశాస్త్ర సరణిని బహిష్కరించిన దురాత్ములయందును, క్రూరమైన సాహసకృత్యములు చేయువారియందును ధర్మము వలన నతిశయించిన వాడు కన్పట్టుటయేమి? అందువలన అతడు బ్రాహ్మణ జాతియందలి సామగ్ర్యము వలన జన్మించిన వాడు కాడుగదా!. అకారణమున అంతరాత్మయందుగాని, బాహిరముగ గాని విభేదమేమియును లేదు. సుఖాదులయందుగాని, ఐశ్వర్యమునందుగాని, ఆజ్ఞయందుగానీ, అభయములయందుగాని వీర్యమునగాని, ఆకృతియందుగాని, కన్నులయందుగాని, వ్యాపారమునందుగాని ఆయుష్యమునగాని, అంగమునందుగానీ, బలుపునగాని, బలహీనతలోగాని, స్థైర్యమునగాని, చపలత్వమునగాని. ప్రజ్ఞయందుగాని, వైరాగ్యమున గాని, ధర్మమునగాని పరాక్రమమునగాని, త్రివర్గమున గాని, నైపుణ్యమునగానీ, రూపాదులలోగాని, ఔషధములందుగానీ. స్త్రీ గర్భమునగాని, గమనము'నందుగానీ, దేహముల విసర్జనమునగానీ నవ రంధ్రములలో గానీ, ప్రేమయందుగాని, ప్రమాణమునందుగాని, రోమములయందుగాని. శూద్ర బ్రాహ్మణులమధ్య భేదము మృగ్యమే యగుచున్నది. అన్ని ధర్మములయందును సమానత్వమే తప్ప భేదమును దేవతలు కూడా చూడజాలరు. పుట్టుక యనునది ఇంతవఱకు చెప్పబడినంత మాత్రమైనదే. ఈ విషయమును శాస్త్రకారులు గాని మేధావులుగాని తిరస్కరింపజాలరు.
తా॥ బ్రాహ్మణులు చంద్రకిరణములవలె శుభ్రమైనవారు కారు. క్షత్రియులు మోదుగపువ్వు వన్నెగలవారుకారు. వైశ్యులు హరిదళము వంటి వర్ణము గలవారు కారు. శూద్రులు బొగ్గువలె నల్లని వారునుకారు. అడుగులు వేసినడుచుట యందుగాని, శరీర వర్ణములయందుగాని, వెంట్రుకలయందుగాని సుఖదుఃఖములయందుగాని, రక్తమునందుగాని, చర్మము, మాంసము మెడ, ఎముకలు, ద్రవములందుగాని మానవులందుకు సమానులే. నిజమునకీ నాలుగు వర్ణములతో చెప్పబడు భేదము కలవారెట్లగుదురు?. వర్ణము, ప్రమాణములు, రూపములు, గర్భమున నుండుట, అటనుండి జన్మించుట, వాక్కు, బుద్ధి, కర్మేంద్రియములు, జీవితములు, బలములు, ధర్మార్థకామములు, రోగములు, ఔషధములు, -వీనియందు జాతివలన నేర్పడు భేద విశేషమేమియులేదు. ప్రజలకందఱికినీ పరమాత్మయే ప్రభువు కదా! జాతి భేదములేట్లేర్పడెను? ప్రమాణములు, దృష్టాంతములు, న్యాయచర్చలు మున్నగువాని మూలమున పరిశీలించినచో నీ భేదము ఛిన్నాభిన్నమై పోవును. ఒక తండ్రికి నలుగురు కొడుకులు, ఆ నలుగురు కొడుకుల జాతి యొకటియే. అటులే ప్రజలందఱకును తండ్రి పరమాత్మ యొక్కడే, తండ్రి యొక్కడగుచేత జాతిబేధములేదు. మేడి, రావి మున్నగు చెట్ల జాతులకు కొన్ని పండ్లు పై భాగమున, కొన్ని క్రిందుభాగమున నున్నను వర్ణము, రూపము, రసములచే అవియన్నియు అన్ని విషయములలో సమానముగనే ఉండునుగదా! అటులే మానవ జాతి కూడ ఒక్కటీయనియే భావింపవలెను. కౌశిక, కాశ్యప, గౌతమ, కాండిన్య, మాండవ్య, వసిష్ఠ, ఆత్రేయ, కౌత్స, ఆంగీరస, గర్గ, మౌద్గల్య, కాత్యాయన, భార్గవ సగోత్రీకులనెడు వివిధ గోత్రజాతులవారు. తోబుట్టువుల యొక్క, లేక కొడుకులు కోడండ్ర జంటల యొక్కయు సంతాన పరంపరలోని వారే. వారిలో వివాహకర్మ, వర్ణభేదములన్నియు కృత్రిమములే. కేవలము దేహసంబంధమైన బ్రాహ్మణత్వమును గుఱించి చెప్పువారికి గల గ్రుడ్డితనపు చీకటిని తొలగించుటకై వారి పై జాలి తలచి. శాస్త్రీయ దృక్పథమనెడి దివ్యౌషధములచే చేయబడిన అంజనమును పరిణామమున సుఖమును కలిగించుదానిని ప్రయోగించి వారికి మంచి చూపునిచ్చుచున్నాము.
తా॥ భౌతికాకృతి నశించు స్వభావము గలది యగుటవలనను, అట్లు నశింపగా మిగులునది శేషభూతము' వంటిదే కావునను, దేహమును ధరించి అందు నివసించు జీవులకు బ్రాహ్మణ్యమనునది కల్పింపబడదు. వారి ఒక్కొక్క అవయవము బ్రాహ్మణ్యమును పొందదు. వాని సమూహము కూడా అట్లు పొందజాలదు. పొందుననుట “అతిప్రసంగ'మగును. భూమీ, జలము, వాయువు, అగ్ని అను భూత సంఘాత పరిణామ విశేషము వలననే, సర్వప్రాణులకును కలుగు దేహత్వము వలన, బ్రాహ్మణత్వము కూడా ప్రాణులందరిని వర్తింపవలసి యుండును. కావున దేహమునకు బ్రాహ్మణత్వకల్పనము చేయుట తత్త్వము తెలియని వారి పనియగును. ఆ సంస్కర్తల శరీరమునకు కూడా బ్రహ్మత్వముండదు. ప్రయత్నపూర్వకముగ శరీరమునందు వెదకినను అదిలభింపదు. అందువలన అది దేహాత్మకమును కాదు అని చెప్పనగును. ఒక వేళ మీరు శరీరమునందు 'బ్రాహ్మణత్వము'ను చూడగలిగితిరేని అది అధమ కులములని చెప్పబడినవారిలోను, చండాలురలోను, ఆటవికులలోను పుట్టును. క్షీణించెడి దేహశక్తి గుణముల చేతను, శరీరమే భస్మాది రూపములుగా మారిపోవునదగుటచేతను బ్రాహ్మణ్యము దేహాత్మకమైనది కాదు. దేహమునందు పుట్టునదియును కాదు.
శతార్ధ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య పురాణము నందలి బ్రహ్మపర్వమున షష్టీకల్పమునందలి బ్రాహ్మణ వివేక వర్ణనమను నలుబది యొకటవ అధ్యాయము సమాప్తము.
