భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

51. సప్తమి కల్పమున మహా సప్తమీ వర్ణనము

తా॥ వాసుదేవుడిట్లనెను. “మాఘమాస శుక్లపక్ష పంచమినాడు ఒకే పూట భోజనము చేయుట, షష్ఠినాడు రాత్రికి మాత్రమే భుజించుట చెప్పబడినవి. సప్తమి నాడే యుపవసించుట కొందఱి యభిమతము. షష్టినాడుపవసించి సప్తమినాడు పారణ చేయవలయునని కొందఱి యభిప్రాయము. షష్ఠినాడు ఉపవాసము చేసి, రక్తచందన మిశ్రమములతోను, గన్నేరు పూలతోను విజుడు సూర్యుని పూజింపవలెను. సుఖకరుడు, భాస్కరుడైన రవిని, గుగ్గులు, సారెసత్తులనబడు భక్ష్యవిశేషములతోను దేవ దేవుడైన సూర్యుని పూజింపవలెను ఇట్లే ఈ పూజ మాఘము మొదలుకొని నాలుగు మాసములు చేయవలెను. ఆత్మశుద్ది కొఱకు గోమయమును ప్రాశనము చేయవలెను. గోమయము తోనే స్నానము చేయవలెను. శక్తికొలదిగ భూదేవతలగు బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. జ్యేష్ఠాది మాసములయందు శ్వేతచందనము, పరిమళభరితములైన తెల్లనిపూలు సూర్యపూజకు శ్రేష్టములు. నల్లని అగరు, ధూపము, పాయసనైవేద్యము, యోగ్యమైనవి. వీనితోడనే బ్రాహ్మణులను తృప్తిపఱచుచు వారిని భుజింపజేయవలెను. కార్తికాది మాసములందు, పంచగవ్యప్రాశనము, దానితోనే స్నానము, అగిసెపూలు శ్రేష్ఠములని చెప్పబడినవి.

తా॥ విష్ణుక్రాంత ధూపములతో పూజింపవలెను. బెల్లపు భక్ష్యములు, చెఱుకురసము నైవేద్యము పెట్టవలెను. యథాశక్తిగ పోనీతో సహా బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. శుద్దికొఱకు స్నానమునకు, పానమునకు కుశోదకమునుపయోగింపవలెను. మాఘమాసమునందు మూడవ పారణము తరువాత బ్రాహ్మణ భోజనము, దానము రెండింతలు చేయవలెనని చెప్పబడినది. శక్తి కొలదిగ దేవదేవుడగు సూర్యభగవానుని పూజ, రథదానము, రథయాత్ర చేయవలెను. సంపదయుండెనేనీ వ్రతఫల ప్రాప్తికొఱకు, చెప్పబడిన రీతిగా బంగారు రథమునే దానము చేయవలెను. ఈ విధముగ 'రథసప్తమి' అను పేరుగల వ్రత విధానము చెప్పబడినది. ఇది మహా సప్తమి యని ప్రఖ్యాతినందినది. మహాపుణ్యప్రదమైనది. అభ్యుదయకరమైనది. దీనియందుపవసించినవారు ధనమును, పుత్రులను, కీర్తిని, విద్యను పొందుదురు. చంద్రునితో సమానమైన కాంతిగలవాడై సర్వభూమండలమును పాలించును.

శతార్థ సాహస్ర్య సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమికల్పమునందు మహాసప్తమి వర్ణనమను ఏబది యొకటవ అధ్యాయము సమాప్తము.