భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
63. బ్రహ్మదిండిసంవాదమున ఆదిత్య క్రియోయోగ వర్ణనము
తా॥ సుమంతుముని యిట్లనెను. “మహా తేజస్వియగు దిండి, సురజ్యేష్ఠుడు, లోకేశుడు చతుర్ముఖుడైన బ్రహ్మదేవునకు శిరస్సువంచి నమస్కరించి యిట్లనెను-1. “మహాత్ములు, దేవదేవులగు మీ దర్శనమున ధన్యుడనైతిని. మీ చెంత క్రియాయోగమును తెలిసికొనుటకు సూర్య భగవానునిచే నాదేశింపబడితిని. అమృత తుల్యమగు నా యోగమును గూర్చి సాకల్యముగ మీరు చెప్పుదురట!-2. అందుచే దానిని వివరింపుమని వేడుచున్నాను. దేవ దేవుడగు సూర్య భగవానుని నిరంతరము సంతోషపుపగలిగిన రీతిగా దానిని నాకుపదేశింపుడు”-3. బ్రహ్మదేవుడిట్లనెను. “రమ్మురమ్ము! గణాధిపా! ఇటుల నా సమీపమునకు రమ్ము! నీ బ్రహ్మహత్యాదోషమాతని దర్శనముచేతనే పటాపంచలైపోయినది-4. అమిత తేజస్వియైన సూర్యదేవునిచే ననుగ్రహింపదగిన వాడవైతివి. ఆతని నారాధించుటకు నీ మనస్సు విధేయమై యున్నచో -5. అతనిని పూజించుట కిచ్చకలిగినచో, ఆద్యంత రహితుడు, భగవానుడునైన భానుదేవుని సేవింపదలచినచో మొదట నియమ శీలుడవు కావలయును-6. అట్లు దీక్షాన్వితుడు కాని వాడా దేవుని తత్త్వతః స్తుతించుటకు, తెలిసికొనుటకు, దర్శించుటకును శక్యముకాదు. ఇక మూడులాతని గుజించిన యూహనైనను ప్రవేశింపజాలరు-7. అతనినే మనస్సునందు నిలుపగలిగియున్న సౌర దీక్షా గుణాన్వితులనేక జన్మలయందును పవిత్రులుగనుందురు-8. అనేక జన్మల సంసారమున ప్రోగైన పాప సమూహము క్షీణింపనిదే పురుషులకు సూర్యాభిముఖమైన బుద్ధి కలుగనేరదు -9. సూర్యునియందు ద్వేషము కలుగువాడు బ్రాహ్మణులను, వేదములను నిందించువాడు పాప బీజమునుండి పుట్టినవాడని యెఱుంగవలెను.
తా॥ సంప్రదాయ విముఖల పైన (నాస్తికుల పైన) ప్రేమ కలుగుట, హేతువాదమునందానుకూల్యభావము కలుగుట, అనునవి విష్ణు మాయలో పడిపోయిన దురాత్ములకు సంభవించును-11. మానవులకు పాపము నశించిపోయినప్పుడు వేదములు, బ్రాహ్మణులు, దేవదేవేశుడైన సూర్య దేవుడు - వీరలయందు నిశ్చలమైన శ్రద్ద ఉదయించును -12. పాప సంచయమంతయు క్షీణించి స్వల్ప మాత్రముగ శేషించి యున్నవారు కర్మదీక్షా స్వభావమును స్వీకరించుచుందురు. సంశయములేదు-13. పాపములతో దుర్గమమైన సంసారమున బడి తిరుగుచున్న మానవులకు, భక్తితో ప్రీతుడగు సూర్య దేవుడొక్కడే చేయూత నిచ్చి కాపాడగలడు-14. సర్వ పాపములను నశింపజేయగల సూర్యదేవుని భావమున నంతటను నింపుకొని భక్తితో పూజింపుము. ఆతడు ప్రీతుడగును”-15. దిండియిట్లనెను. “ఓ బ్రహ్మదేవా! ఏ లక్షణములుగల మానవులు దీక్ష కరులగుదురు? దీక్ష నందినవారు చేయదగిన దేదియో నాకుఁజేప్పుడు -16. దిండి ప్రశ్నకు బ్రహ్మయిట్లనెను. కర్మచేత, మనస్సు చేత, వాక్కు చేతను ఏ ప్రాణినైనను హింసింపకుండువాడు, సూర్య భగవానునియందు మనఃపూర్వకమగు భక్తిగలవాడు గుణాన్వితమైన దీక్షకరుడు-17. బ్రాహ్మణులకు, దేవతలకు నిత్యము నమస్కరించువాడు, ఆస్తిక భావమునందెట్టి కల్మషములేనివాడు సూర్యదేవుని పూజింపగలడు-18. దేవతలందఱిని సూర్యునిగాఁ దెలియువాడు, సర్వ లోకములును భాస్కరుడేయని భావించువాడు, తననుతాను వారిక భిన్నుడనని యెఱుంగువాడు, సూర్యత్వమును పొందగలడు-19. దేవుని, మనుష్యుని, ఇతర పశువులు, పక్షులు, చీమలు మున్నగుపోనిని, చెట్లను, రాళ్లను, కఱ్ఱలను, దిక్కులను, భూమిని, జలమును, ఆకాశమును-20. తనను కూడ దేవేశుడైన సూర్యుని కభిన్నములని భావించువాడు దీక్షా గుణములను పొందును-21.
తా॥ మనస్సుచేత, వాక్కుచేత, కర్మచేత ఏ ప్రాణియందును పాపకార్యముచేయని వాడు సౌర దీక్ష కరుడగును-22. సూర్య భగవానునాశ్రయించి నియమశీలుడై తపము చేయువాడు, యజ్ఞములు చేయువాడు, భూరీ దక్షిణలిచ్చువాడు పొందేడి యుత్తమగతిని యితరులెవరును పొందరు-23. సర్వాత్మనా సూర్యదేవుని యందు భక్తి కలిగి, అతని యందే భావము నిలిపి కృత కృత్యుడగువాడు శ్రేష్ఠుడైన సౌరదీక్షాపరుడు-24. భక్తి భావముతో సూర్య దేవునుపాసించువారి కులమున దక్క కులపావనుడైన ధన్యుడు పుట్టడు-25. సూర్య దేవుని యందు భక్తికలిగి యాతని పూజ చేయించువాడు పాపములనుండి ముక్తుడై సూర్యలోకమును చేరును-26. భక్తి భావముతో సూర్య దేవాలయమును నిర్మింపజేయువాడు ఏడు తరముల పురుషులను సూర్య లోకమునకు చేర్చువాడగును-27. సూర్య దేవాలయమున ఎన్ని సంవత్సరములు పూజ జరుగుచుండునో అన్నీ వేల సంవత్సరముల వఱకతడు సూర్య లోకమున వెలుగొందుచుండును-28. ఎవని యింట సలక్షణముగ సూర్యార్చన సంతత విధిగా జరుగుచుండునో, ఎవని మనస్సునిష్కామముగ నుండునో అట్టివాడు ముక్తినందును.
తాII మనోజ్ఞములు, పరిమళ భరితములునైన పుష్పములచే యతమానసుడై సూర్యదేవుని పూజించువాడు,-30. ప్రతి దినము వివిధములగు ధూపములచేత, సువాసనగల మైపూతలచేత సూర్యుని యజ్ఞము, పూజ, చేయువాడు,-31. ఉత్తమ గతినందుదురు. యజ్ఞేశ్వరుడైన సూర్యదేవుడు యజ్ఞములచేత పూజింపబడును. అనేకములగు సాధనోపకరణములు, సంబారములు యజ్ఞమునకు కావలసియుండును-32. దీండీ! విశేష ధనవంతులు కానివారు యజ్ఞ ద్రవ్యములు సమకూర్చుకొనజాలరు. అందుచే భక్తి గలవారు గజీకలతో కూడ పూజింపవచ్చును. అట్లు పూజించినవారికి కూడ భానుదేవుడు సర్వయజ్ఞములచే దుర్లభమగు ఫలమునిచ్చును-33. హృద్యములైన పుష్పములు, ధూపములు, గంధానులేపనములు, అమూల్యమైన యాభరణములు, ప్రియమైన వస్త్రములు-34. భక్ష్యములు, ఫలములు మొదలగు నాహార పదార్దములు, తద్దత మనస్కుడవై సూర్య భగవానునికి సమర్పింపుము-35. ఆద్యుడు, సకల భువనముల కాధార భూతుడునైన ఆతనిని యథాశక్తిగ ప్రసన్నుని చేసికొనుము. అతని నారాధించు మానవుడతనిలోననే లయమగును-36. పుష్పములచేత, తీర్థోకములచేత, తేనె, నేయి, పాలు మున్నగువానిచే గ్రహేశ్వరుడు, ఆకాశగతుడునైన సూర్యదేవున కభి షేకము చేయవలెను-37. అటుల చేసిన పుణ్య ప్రదములైన దధిక్షీర ప్రదములు, మధువులు నిండిన లోకములు, విశేషలక్షణముగల సుఖ జీవితమునొసంగును-38. స్తోత్రములు, గీతములు, వాద్యములు, బ్రాహ్మణ సంతర్పణలు మున్నగువానితో మనఃపూర్వకముగ దివాకరునారాధింపుము-39. ఆ జగన్నాథుడైన సూర్య భగవానునారాధించియే నేను లోకములను సృష్టించితిని. అతని నారాధించియే విష్ణువు లోకములను పరిపాలింపఁగడంగెను-40. అతని ప్రసాదము వలననే రుద్రుడు భవానిని పొందెను. ఋషులందఱ దివాకరునర్పించి ప్రకాశించుచున్నారు-41. నీవు కూడ ఆ దేవ దేవునినొక సంవత్సరము వఱకునుపవాసాదులతో పూజించి ప్రసన్నుని చేసికొనుము. ఆతడు తుష్టుడై ఇహ పరశాంతులనొసంగును.
శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమి కల్పమున, బ్రహ్మదిండి సంవాదమున ఆదిత్యక్రియాయోగ వర్ణనమను అటువది మూడవ అధ్యాయము సమాప్తము.
