భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

105. సప్తమీ కల్పమునందు కామదా సప్తమీ వ్రత నిరూపణము

తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “విష్ణు దేవా! ఫాల్గున మాస శుక్లపక్ష సప్తమీనాడు మానవుడుపవాస వ్రతముతో భాస్కర దేవునారాధించి, భక్తితో సూర్య నామమును జపించుచు మిత భోజనుడై, జితేంద్రియుడై, మేల్కొనినప్పుడును సూర్య దేవునే కీర్తించుచునుండ వలయును. స్త్రీయునిటులే చేయవలెను. మరుసటి దినమున నష్టమినాడు ప్రయత మానసుడై స్నాన మాచరించి సూర్య భగవానునర్చించి బ్రాహ్మణునకు దక్షిణ నీయవలెను. పిదప నా దేవునుద్దేశించి యగ్నియం దాజ్య హోమము నిర్వర్తించి, జగన్నాథుడగు నాతనికి నభివాదము చేసి యిట్లు ప్రార్థింపవలెను. పూర్వ కాలమున సావిత్రీ దేవి, ఏ దేవునారాధించి తన యభీష్టమును ఫలవంతమొనర్చుకొనెనో అట్టి దేవేశుడగు విభావసుడు నాకును వాంఛిత ఫలమిచ్చుగాక. దివస్పతి యగు దేవేంద్రుడు రాజ్యభ్రష్టుడై యే దేవునర్చించి మఱల తన స్వర్గ సామ్రాజ్యమునే గాక కామితార్థముల నన్నింటిని పొందెనో అట్టి సూర్య దేవుడు నామనోరథమ నొసంగుగాక. ఏ దేవు నర్చించి దితి తన యశేష మనో భీష్టములను పొందెనో అట్టి సూర్య భగవానుడు ప్రసన్నుడై నా కోరికలన్నింటినీ డేర్చుగాక." ఇట్లు ప్రార్థించి వివస్వంతుని పూజను సంపన్నము చేసి నియతుడై చక్కగా హవిష్యమును భుజింపవలేను. ఫాల్గున చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసములో నాలుగు పారణములతో నీ వ్రతము సంపన్నమగును. నాలుగు మాసములలోను సూర్య దేవుని గన్నేరు పూలతో పూజింపవలెను. కృష్ణా గురు ధూపమును ప్రయోగింపవలెను. గోశృంగ జలమును ప్రాశనము చేయవలెను.

తా. ఖండ శర్కరతో పక్వము చేయబడిన పదార్థములను నివేదింపవలెను. బ్రాహ్మణులకు దక్షిణ నీయవలెను. ఇక ఆషాఢాదిగా నాలుగు మాసములలో నిర్వర్తింపవలసిన పారణ క్రియను వినుము. ప్రశస్తమైన జాజి పూలు, గుగ్గులు ధూపము, పాయస నైవేద్యమును సూర్య పూజలో వినియోగింపవలెను. బావి నీరు ప్రాశనము చేయవలెను. సూర్య దేవునకు నైవేద్యమిడిన పాయసమునే స్వయముగ భుజింపవలెను. తక్కిన క్రియలన్నియు పూర్వము చెప్పబడినట్లాచరింపవలెను. కార్తికాది మాసములలో శరీర శుద్ధి కొఱకు గో మూత్రము నుపయోగింపవలేను. మహాంగ ధూపము, ఎఱ్ఱగలువలు పూజకై యుపయోగింపవలేను. కొంసారము (నేతిలో వేయించిన పిండిలో శర్కరను గలిపి చేసిన పదార్థము)ను సూర్య భగవానునకు నైవేద్యము పెట్టవలేను. ప్రతి మాసము నందును బ్రాహ్మణునకు దక్షిణ నీయవలెను. కర్పూరము, చందనము, నిడుముస్తే, అగరువు, నందివర్ధనము. మిరియములు, శర్కర, సుగంధము, సిప్లకము (చీల్లమడ్డీ) వీని మిశ్రమము మహాంగ ధూపమనబడును. సూర్యదేవునకు సదా యిష్టమైన దీ ధూపము. ప్రతి పారణమునందున సూర్యదేవునికి ప్రీతికరములైన ఆయా వస్తు క్రియాదులచే నాతని సంతుష్టుని జేయుచుండ వలెను. విత్త శాఠ్యమును విడనాడి యధాశక్తిగ యథా సంభవముగ నీ ప్రతా చరణము చేయవలెను. సప్తాశ్వుడైన సూర్యభగవానుడు సద్భావముచే పూజింపబడుటచే ప్రీతుడగుటచే పారణాంతమున నా దేవదేవునకు యథా శక్తిగా నభిషేక పూజాదులు చేయవలెను. విష్ణు దేవా! సూర్య భగవానుడు ప్రీతుడైనచో నవ్యాహతముగ వాంఛిత ఫలములనిచ్చును. అందుచే నీ సర్వ కామదా సప్తమీ వ్రతము పుణ్యప్రదము, పాపహరము. దీనిని చేయువాడు కోరిన దెల్లయు నీడేరును. పూర్వకాలమున నింద్రుడీ వ్రతోపవాసము లాచరించి త్రిభువనాధిపత్యమునొందెను.

 తా॥  సావిత్రి పుత్రుని పొందెను. అదితి కూడ పుత్రులను బడసెను. యదువులు తమ యభీష్టములను పొందిరి. ధౌమ్యుడు వేదములను పొందెను. విష్ణు దేవా! నీవును లక్ష్మీదేవిని బడసితివి. శంకరుడు శుద్ధిని ప్రాప్తించేను. నేను పీతామహత్వము నొందితిని. ఇదంతయు నా సూర్యభగవానుని యనుగ్రహము చేతనే కదా జరిగినది. ఇంక నెందలో ఆ దేవునారాధించి తమ కోరికల నీడేర్చుకొనిరి. ఇందు సందేహమేమియు లేదు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు, స్త్రీలు తమ తమ యభీష్టములాదేవుని కృపచే నెరవేర్చుకొనిరి. సూర్య ప్రీత్యర్థముగ చేయునుపవాస వ్రతము వలన నెవడేది కోరునో వానికదిలభించును. మనుష్యుడు సూర్యారాధనచే నిస్సంశయముగ తన మనోరథమును పొందగలడు. పుత్రుడు లేని వానికి పుత్రుడు కలుగును. సూర్యలోక ప్రాప్తి కలుగును. రోగగ్రస్తుతకారోగ్యము చేకూరును. కన్యకు మంచి భర్త లభించును. ఇహ లోకమునకు వచ్చి. యుస పాసవ్రత మాచరించి, సర్వ మనోభీష్టముల నొంది పిదప నేవడేని సూర్య లోకమున నానందించును . ఉపవాస వ్రతము నాచరించువాడు సంతాన హీనుడుగ గాని, దరిద్రుడుగ గాని, కనికరములేని వాడుగ గానీ, స్త్రీగ గాని జన్మింపడు. పెక్కు సంవత్సరముల వఱకు సూర్యలోకమున నానందించును. సూర్య తేజస్వియై బంగారు తేరు పై నెక్కి గో లోకమునకు, సూర్య లోకమునకు చేరి యచట చిరకాలము మోదించును. తిరిగి యిహలోకమున కేతెంచి సూర్య దేవుని యనుగ్రహముచే నింద్ర సన్నిభుడైన రాజగును. ఇందు సందేహము లేదు .

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు  'కామదాసప్తమీ వ్రత నిరూపణమను నూట యైదవ యధ్యాయము సమాప్తము.