భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

21. తృతీయా కల్ప విధి వర్ణనము

తా॥ సుమంత్రుముని యిట్లనెను. “పతివ్రత, పతినే ప్రాణముగానేంచునది, భర్త శశ్రూషయందే తాత్పర్యముగలది. పరిశుద్ధమైన స్వభావముగలది, సౌందర్యవతియైన స్త్రీ కూడ-1. తృతీయా వ్రతోపవాసముగలదియై ఉప్పును వదిలి పెట్టవలెను. ఆ విధముగ భక్తితో యావజ్జీవము అనుష్ఠింపవలెను-2. అటులనుష్ఠించు వారియెడ గౌరీ దేవి సంతుష్టురాలై లావణ్యమును; మృదులము, మనోహరము, పురుషులకాకర్షణీయము, శ్లాఘ్యమునైన రూపసౌభాగ్యమునిచ్చును-3. రాజా! లవణవర్జితమైన ఈ గౌరీ వ్రతముననుష్ఠించుట చేత పురుషునకు మనస్సునానంద పెట్టగల స్త్రీ; స్త్రీకి ఆమే హృదయంగముడైన భర్త లభింతురు-4. ఈ వ్రతమును గూర్చి పూర్వము గౌరీ దేవి, ధర్మరాజుకు చెప్పగా, అతడు వినిన ప్రకారముగా నేను చెప్పబోవుచున్నాను. దానిని తెలిసికొనుము-5. (గౌరీ దేవి ధర్మరాజుతో నిట్లు చెప్పెను) "మానవులకు సౌభాగ్యమును కలిగించు ఈ వ్రతము నాచే సృష్టింపబడినది మనుష్యలోకమున, స్త్రీ, నియముగలదై ఈ వ్రతము నాచరించెనేని, నేను నా భర్తయగు శివునితో ఆనందముగానున్నట్లు, తన భర్తతో సుఖ జీవనము చేయును-6. ఏ అందమైన కన్య, భర్తను పొందజాలకుండునో, అట్టి కన్య ఈ వ్రతమునుద్దేశించి ఉప్పు (కారము) తినకూడదు. (ఉప్పులేని భోజనము చేయవలెను) నాయందే భక్తి ప్రేమలు కలిగి, మనస్సునందు, చిత్తమునందు నన్నే భావించుచుండవలయును-7. బంగారపు గౌరీ దేవి ప్రతిమను స్థాపించి గంధపుష్పాద్యలంకారములతో, వస్త్రాభరణాదులతో, పూలదండలతోను పూజించి-8. ఉప్పు, బెల్లము, నేయి, నూనె యధాశక్తి నివేదింపవలెను. సువాసనగల పులకండము, జీలకఱ్ఱ, ఆకు కూరలు కూడా నైవేద్యము పెట్టవలెను-9. వ్రతసమాప్తియందు మంచి విద్వాంసుడైన బ్రాహ్మణునకు, అరిసెలు (బెల్లముతో చేసిన ఉండలు), భక్ష్యములు, ఖండశర్కర వస్తువులు, దానమీయవలెను-10.

తా॥ స్వర్ణ ప్రతిమారూపముననున్న అమ్మవారికి ఈ వస్తువులను శుక్లపక్షమున నివేదింపవలెను. ధనహీనులైన వారు యధాశక్తిగ మధువృక్ష (ఇప్పచెట్టు) రూపముననున్న గౌరీ మాతకు భక్తితో సమర్పింపవలేను-11. రాత్రి సమయమున ఉప్పు కారములను తినుట మాని మౌన వ్రతమును బూని అమ్మను నిత్యము పూజించుచోనామె, సన్నిధానముననేయుండును. ఇందెంత మాత్రము సందేహములేదు-12. గౌరీ దేవి భూమియందలి చివురు సెజ్జ పై పరుండి నిత్యము సన్నిహితముగా నుండును. ఇంతకు ముందు నుడివిన నియమములననుసరించుచు ననుష్ఠంచు దేవీ ప్రత-13. మహాఫలమును చెప్పుచున్నాను వినుము. కన్య, భర్తను పొందును. అతడు ఆమె మెచ్చువాడు, మనసుకు నచ్చిన వాడగును-14, ఇహలోకమునందే ఆమె భర్తతో చిరకాలము క్రీడించి, సంతానమును కని, అతనితోపాటే వెడలిపోవును-15. మరీచ్యాది సప్తర్షిలోకములకుఁబోయి అటనుండి శివసదనమును చేరును-16. గౌరీ వ్రత పరాయణురాలై విగత భర్శకమైన స్త్రీ పతిభక్తి కలిగియుండెనేని-17. తన దేహము విడిచినయనంతరము యమదూతలనుండి తప్పుకొని ఆనందకరమైన వైకుంఠమును చూచి అటనుండి స్వర్గమునకు బోయి, అచ్చట తన భర్తతో రమించును-18. కోటి సంవత్సరములతనితో పదింతల సుఖమునుభవించి ఆమె ఈ లోకమునకు తన భర్తను కూడి వచ్చి ముందు చెప్పబడిన రీతిగ ఇష్టకామ్యసుఖములను పొందును-19. రాజా! ఇంద్రుని భార్యయగు శచీదేవి కూడ పూర్వయోవ్రతమును పుత్రార్థినియై ఆచరించి ఫలముగా జయంతుడను పేరుగల పుత్రునిబడ సెను-20.

తా॥ వసిష్టుని గూర్చిన కోరికతో అరుంధతి చేత కూడ ఈ వ్రతము చేయబడినది. ఆమె నేడుకూడ ఆకాశమునందు వసిష్టుని సమీపమునే కన్పట్టును-21. రోహిణి లవణమును విడిచి పెట్టి ఈ వ్రతమాచరించుట చేత ఆమె సవతులు మర్దింపబడిరి. ఆమె దేవి ప్రసాదము చేత నాకసమందచలమగు సౌభాగ్యమును పొందెను-22. ఈ విధముగ తృతీయాతిథి లోకపూజితమైనది. ముఖ్యముగా వైశాఖ మాసశుక్ల పక్షమున వచ్చు తిథి మిక్కిలి పుణ్యప్రదమైనది-23. ఇట్లు భాద్రపద, మాఘమాసములలో వచ్చునదికూడ పుణ్యప్రదమైనదే. సంశయములేదు. భాద్రపదమాఘ తృతీయ కూడా స్త్రీలకు ధన్యతనిచ్చునదిగా చెప్పుదురు-24, లోకమంతటికీని వైశాఖ తృతీయయే సాధారణముగ ఆచరింపదగినది. మాఘతృతీయయందు స్త్రీ పురుషులు గుడలవణములు దానమిచ్చుట శ్రేయస్కరము-25. గుడదానముతో దత్తుడు, ఉప్పుదానముతో విశ్వభువు సంతోషింతురు. భాద్రపదమున బెల్లపు భక్ష్యములు దానమీయవలెను-26. మాఘ తృతీయయందు శివప్రీతీ కొఱకు నీరు, లడువములు దానమిచ్చుట ప్రశస్తము-27. వైశాఖమాసమునందలి తదియనాడు చందన జల దానము చేత విష్ణువు, లడ్డువములచే శివుడు చందనదానముచే బ్రహ్మ సంతోషింతురు. ఇందు సందేహము లేదు-28. కురుశార్దూలా! వైశాఖమాసమునందలి యీ తృతీయాతిథి 'అక్షయతృతీయ'గా దేవతల చేత ప్రశంసింపబడినది-29. చంద్రుని వృద్దిననుసరించి “వసువ్రత'గా ఈతిథి వచ్చినదగుటచేత ఈ దినమున బంగారము, వెండి, భోజనము, నేయి మొదలగునవి ఏవి దానము చేసినను చేసిన వారికి అక్షయమైన సంపదలు కలుగును. ఆకారణముననిది. అక్షయ తృతీయ యని చెప్పబడినది-30. ఏ కొంచెము దానము చేసినను, లేక మిక్కిలిగా దానమిచ్చినను అది అంతయు అక్షయమై విలసిల్లును. అందుచేతనే ఇది అక్షయతృతీయయన బడినది -31. ఈ తిథియందు నీటితో నింపబడిన గిండి చెంబులు, లేక పండిన దానిమ్మపండ్లు దానమిచ్చిన వాడు సూర్యలోకమును పొందును-32. ఇట్లు ఉత్తమమైన తృతీయ గుణించి నీకు వివరించి చెప్పితిని. ఈ తిథియందు ఉపవసించిన వాడు సకలసంపత్సమృద్ధిని ఐశ్వర్యమును పొందును-33.

శతార్ధ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్యమహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున తృతీయా కల్పవీధి వర్ణనమను ఇరువది యొకటవ అధ్యాయము సమాప్తము.