వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 136

 

దేవీ! దీపము ముట్టుకొని నా పూజలు చేయుట అను దోషము వలన మానవుడు పాటు నొందును.

 

పుణ్యాత్ములారా! దానిని గూర్చి చెప్పు చున్నాను. వినుము. అట్టివాడు అరువది యేండ్లు కుష్ఠ రోగియై చండాలుని యింట ఉండును. ఇందు సంశయము లేదు.

 

ఇట్లు ఆ కర్మ ఫలము ననుభవించి నా క్షేత్రమున మరణించె నేని నా భక్తుడై పవిత్రమగు భాగవతుని యింట జన్మించును.

దీపమును తాకిన దానికి ప్రాయశ్చిత్తమును చెప్పెదను. దీనితో మానవులు నీచములగు చండాల యోనుల నుండి బయట పడుదురు.

 

ఏదో ఒక మాసమున శుక్లపక్ష ద్వాదశి నాడు నాలుగవ కాలమున ఆహారమును కొనుటయు, ఆరు బయలున నిద్రించుటయు చేయ వలయును.

 

విధి ననుసరించి నాకు దోష పరిహారముగా దీపము నొసగి పవిత్రులై నా పూజా మార్గమున నిలుతురు.

 

దీపము తాకుట అను దోషము నుండి శుద్ధి కలిగించు విధానమును నీకు చెప్పితిని. దీని వలన నరుడు శుభమును పొందును.

                                               

 

 

నరుడు వల్లకాటికి వెళ్ళి స్నానము చేయకయే నన్ను తాకినచో అట్టి దోషము ఫలమును స్పష్టముగా చెప్పెదను. వినుము.

 

పదు నాలుగేండ్లు భూమిపై నక్క యగును. ఏడేండ్లు పక్షి రాజగు గ్రద్ద యగును. అవి రెండును మనుష్య మాంసమును తిను చుండును.

 

పిదప పదు నాలుగేండ్లు పిశాచ మగును. అటుపై ముప్పది యేండ్లు శవముల ఎంగిలిని తిను చుండును.

 

నారాయణుని వలన అట్టి మాట విని ధరణి యిట్లు పలికెను. లోకనాథా! జనార్దనా! నాకు మిక్కిలి ఉత్కంఠ కలుగు చున్నది. ఈ రహస్యమును మొత్తముగా చెప్ప దగును.

 

పుండరీకాక్షా! వల్లకాడు ఈశ్వరుని మెప్పు పొంది నట్టిది. అట్టి పవిత్రము, శివుడు మెచ్చినది యగు వల్లకాటి యందలి దోషమేమి?

 

గొప్ప తేజస్సు గల భగవానుడు శివ దేవుడు కాంతులు చిమ్మునది, గొప్ప శక్తి కలదియు నగు పుఱ్ఱను చేత బట్టి అందు ప్రతి దినము క్రీడించు చుండును.

రుద్రుడు మెచ్చినది, రాత్రుల యందు ఆతనికి ప్రియమైనది అగు శ్మశానమును నీవు నిందింపనేల?

 

 

దేవీ! ఈ కథను శ్రేష్ఠమైన దానిని బాగుగా వినుము. ఉత్తమములగు వ్రతములు కలవారు కూడ సర్వ భూతములకు నాథుడైన శంకరుని, ఆతడొ నర్చిన మిక్కిలి దుష్కరమైన కార్యమును ఎరుగ కున్నారు.

 

త్రిపురాసుర సంహార సమయమున పసి వారిని, ముదుసలులను, ఆడువారిని చంపి ఆ పాపము చేత కట్టువడి శివుడు కాలు చేతు లాడని దశలో నుండెను.

 

మనస్సు మహిమ చెడిపోగా, తనదగు యోగమాయ పనికిమాలినది కాగా ఆ మహేశ్వరుడు తన ప్రమథ గణములు చుట్టి యుండగా మొగము వెలవెల పోయి అచట స్థానేశ్వరుడై నిలిచి పోయెను.

 

వసుంధరా! అట్లు మాయ నశించిన ఈశ్వరుని నేను ధ్యానించితిని. ఈశ్వరుడు మరల తన శక్తిని పొంద వలయునని నా భావన.

 

నేను దివ్యమగు చూపుతో ఆ దేవుని చూచునంతలో ఆ సర్వభూత మహేశ్వరుడు నశించిన మాయా బలము కలవాడై యుండెను.

 

నేనందు పోయి యజించు కోరిక గల ముక్కంటిని చూడగా అతడు చైతన్యము లేనివాడు, జ్ఞానము కోల్పోయిన వాడు, యోగ బలము నశించిన వాడు, జ్ఞానము లేని వాడునై కన్పట్టెను.

 

అప్పుడు నేను సుఖమును గూర్చు పలుకు నిట్లు పలికితిని. రుద్రా! ఇదియేమి? ఇట్లు పాప భావము చుట్టుకొని యున్నావు?

 

నీవు కర్తవు. వికర్తవు. వికారమైన ఆకారము కలవాడవు. సాంఖ్యము, మోగము నీవే. లోకముల పుట్టుకకు పరమ గతికి కారణమవు నీవే. (సాంఖ్యము = జ్ఞాన మార్గము = యోని = పుట్టుక స్థానము. పరాయణమ్‌ = పరమ గతి)

 

ఓయి ఉగ్రా! నీవు దేవ దేవుడవు, మొదటి వాడవు, సోముడవు. దిక్కు లన్నియు నీవే. ఈ ప్రమథ గణములు చుట్టుకొని యుండగా నిన్ను నీవేల తెలియ కున్నావు.

 

దేవదేవా! ఈశా! ఇదియేమి? పాలి పోయితివి. మిడి గ్రుడ్లవాడ వైతివి. నిజమున కిది యేమో, అడుగు చున్నాను. చెప్పుము.

 

నీ యోగమును, మాయను గుర్తు తెచ్చు కొనుము. మహాత్ముడగు విష్ణువును నన్ను చూడుము. నీ ప్రియము కొరకే ఇదిగో నేను ఇచటికి వచ్చితిని.

 

అంత నా మాటవిని మహేశ్వరుడు కొంత తెలివిని పొందెను. పాపముతో వేడెక్కిన కనులు కలవాడై తీయగా ఇట్లు పలికెను.

 

దేవా! ఉన్న దున్నట్లు చెప్పెదను. వినుము. సర్వ లోకములలో శ్రేష్ఠుడు, మంగళుడు అయిన నారాయణుడు కాక మరి యింకొకడు ఇట్లు చేయ గలడా?

 

ఓ విష్ణూ! నీ అనుగ్రహము వలన నేను పవిత్రుడ నైతిని. నా యోగము, నా జ్ఞానము నాకు లభించినవి. మాధవా! నా జబ్బు పోయినది. నీ దయ వలన నేను నిండు చందురుని వలె నిర్మలుడ నైతిని.

 

నీవు నన్నెరుగుదువు. నేను నిన్నెరుగుదును. మన యిరువురను మరియొక్క డెవ్వడును ఎరుగడు.

 

ఎల్లప్పుడు అంటి పెట్టుకొని యుండు వాడే అయినను బ్రహ్మయు ఆ విధముగా మనల నెరుగడు. మేలు! విష్ణూ! మహాత్మా! నీవు మాయ లన్నింటికి పెట్టెవు.

 

ఆ హరుడు నాతో ఇట్లు పలికి ఒక్క క్షణ కాలము ధ్యానము న నిలిచి మరల నాతో ఇట్లనెను.

 

విష్ణుదేవా! నీ దయ వలన నేను త్రిపురములను కూల్చి వైచితిని. ఆ రక్కసులను చంపి వైచితిని. గర్భవతులగు స్త్రీలును నా చేత మడిసిరి.

 

బాలురు, వృద్ధులను పది దిక్కులకు పరువులు తీయుచు నా వలన చచ్చిరి. ఆ పాపము వలన నేను కాలు చేతులాడింప జాల కున్నాను.

 

నా యోగము, నా మాయ, నా ఐశ్వర్యము అన్నియు చెడి పోయినవి. కృష్ణా! మాధవా! ఇట్టి పాప దశలో ఉన్న నాకు ఇప్పుడు కర్తవ్యమేమి?

 

విష్ణూ! నిక్కముగా నా పాపమును పరిమార్చు ప్రాయశ్చిత్త మెట్టిది? ఏది చేసినంత నేను దోషము నుండి ముక్తి పొందుదునో దానిని నాకు చెప్పుము.

 

ఇట్లు చింత పైకొన్న మనసు గల శివునితో నేనిట్లంటిని. శంకరా! పుఱ్ఱల మాలను చేతబట్టి నీవు ‘సమల’ అను చోటికి అరుగుము.

 

నా మాట విని భగవానుడగు పరమేశ్వరుడు నాతో ఇట్లు పలికెను. జగత్పతీ! మరల నాకు చక్కగా తెలియ జెప్పుము. నేను పోవలసిన ఆ ‘సమల’ ఎట్టిది?

 

అంత ఆ శంకరుని పలుకు విని ఆతని పాపము శుద్ధి యగుటకై నేనిట్లు పలికితిని.

 

రుద్రా! శ్మశానమే సమల. కుళ్ళుతో నిండినది. గాయముల చెడు వాసనతో కూడి యుండును. అందు మనుజులు చైతన్యము లేనివారై పడి యుందురు.

 

శంకరా! అచట పుఱ్ఱలను గైకొని వేల కొలది దివ్యములగు ఏండ్లు చెడని వత్రము కలవాడవై విహరింపుము.

 

పిమ్మట మాంసములను తిను చుండుము. పాపక్షయము కలుగు పనులను జేయ గోరుము. హింసించు స్వభావము గలవాని నంజుడులు నీకు ప్రియమైన భోజనము లగును.

 

నీ ప్రమథ గణము లన్నింటితో పాటు అచట చెదరని నిశ్చయము కలవాడవై నిండుగా వేయి యేండ్లు నిండిన పిదప గౌతమ మహాముని ఆశ్రమమున కరుగుము.

 

చక్కని విధులతో నెలకొన్న ఆ ఆశ్రమమున నిన్ను నీవు తెలిసికొన గలవు. గౌతమ ముని దయ వలన నీవు పాపములు పోయిన వాడ వగుదువు.

 

పాపముల పుట్ట అయిన నెత్తిని నున్న పుఱ్ఱను ఋషి పడగొట్టుటకు సమర్థు డగును. సంశయము లేదు.

 

ఇట్లతనికి వరమిచ్చి నేనచట అంతర్ధానము చెందితిని. రుద్రుడును పాపములు చుట్టు ముట్టిన ఆ శ్మశానమున తిరుగు చుండెను.

 

భూమీ! అందు వలననే వల్లకాడన్న నా కిష్ట ముండదు. రుద్రుడు చేసిన పాపమున్న తావు కదా! దానికి సంబంధించిన రోత పనిని గూర్చి నీకు చెప్పితిని.

 

సంస్కారము పొందకున్నను నా పూజా కార్యముల యందు శ్రద్ధ కలవాడు పాపము నుండి విడివడు ప్రాయశ్చిత్తమును చెప్పెదను.

 

పదునైదు దినములు దినము నాలుగవ భాగమున భోజనము చేయుచుండ వలయును. ఒక్క వస్త్రమును తాల్చి దర్భల చాప పై బయలున నిద్రించు చుండ వలయును.

 

తెల్లవారు జామున పంచగవ్యమును త్రావ వలయును. ఇట్లు చేసి అన్ని పాపముల నుండియు విడివడి నా లోకమున కరుగును.

 

 

సుశ్రోణీ! తెలక పిండి తిని నన్ను సమీపించు వాని ఆ గొప్ప పాతకమును గూర్చి చెప్పెదను. వినుము.

 

పదియేండ్లు గుడ్ల గూబయు, మూడేండ్లు తాబేలును అయి నా పూజా పరాయణుడు మరల మానవుడుగా పుట్టును.

 

గొప్ప శక్తి గల ప్రాయశ్చిత్తమును అట్టి వానికి చెప్పెదను. దాని చేత అతడు ఆ పాపము నుండి ముక్తుడై మోక్షమునకు అరుగును.

 

యవల పిండిని మజ్జిగతో కలిపి ఒక్క ముద్దను ఒక దినమునకు చొప్పున నీటితో కలిపి తీసికొన వలయును.

 

నా పూజల యందు ఆసక్తి కల నరుడు ఇట్లా విధి నాచరింప వలయును. రాత్రి యందు బయలున వీరాసనము వేసికొని యుండ వలయును.

 

ఆరు బయలున నిద్రించి వేకువ జామున ఆ సాధకుడు పంచగవ్యమును సేవింప వలయును. ఇట్లాతడు ఆ పాపము నుండి విముక్తుడగును.

 

భూదేవీ! ఇట్టి పద్ధతితో ప్రాయశ్చిత్త కర్మము లాచరించు వాడు మరల సంసారమున పొందడు. నా లోకమున కరుగును.

 

 

శ్రీవరాహ దేవుడు:

శ్రీవరాహ దేవుడు:

పంది మాంసముతో నాకు నివేదన మిడువారు మూర్ఖులు. పాప కర్ములు. వారు నా అర్చకు లైనను వారి గతి అట్టిదియే.

 

ఓ భూదేవీ! ఎట్టి దోషములను చేసి సంసారమున చిక్కు కొందురో వానిని తెలిపెదను. వినుము.

 

వరాహ రూపుడనగు నా అంగముల యందు ఎన్ని రోమములు కలవో అన్నివేల యేండ్లు నరకమున పడుదురు.

 

వసుంధరా! నీకు మరియొక విషయమును కూడ చెప్పెదను. వినుము. పంది మాంసముతో నాకు నివేదనము చేయువాడు, ఆ పాత్రల యందు ఎన్ని మెతుకు లుండునో అన్ని వేల యేండ్లు పంది కడుపున పడి యుండును.

 

నా ఆరాధన యందు శ్రద్ధ కలవారు ఇట్టి దోషము చేత ఎట్టి గతిని పొందుదురో తెలియ జెప్పెదను. చక్కగా వినుము.

 

అట్టివారు ఒక జన్మము కాలము గ్రుడ్డివారై ఉందురు. పంది మాంసమును నివేదన మిడిన పాపము వలన ఇట్టివారై మరల సంసారమును పొందుదురు.

 

అపుడతడు పెద్దది, శుద్ధము, భగవద్భక్తి కలది అగు కులమున పవిత్రుడై జన్మించును. వినయము కలవాడగును. సంస్కారము పొందిన వాడగును. ధనవంతుడు, గుణవంతుడు, రూపవంతుడు, శీలవంతుడు, శుచియు నగును.

 

అతని శరీరమును శుద్ధి యొనరించు ప్రాయశ్చిత్తమును చెప్పెదను. దాని వలన ఆ నా అర్చకుడు పాపము నుండి విడివడును.

 

ఏడు రోజులు పండ్లు, ఏడు రోజులు దుంపలు తినువాడు కావలయును. ఏడు రోజులు ఏమియు తినకుండ వలయును. మరల ఏడు రోజులు పాయసముతో గడుప వలయును.

 

ఏడు దినములు మజ్జిగతో, ఏడు దినములు జావతో ఏడు దినములు పెరుగుతో గడుప వలయును. ప్రతి దినము అహంకారము లేక మెలగ వలయును.

 

ఇట్టి నేను చెప్పిన కర్మ పద్ధతిలో ప్రాయశ్చిత్తమును ఆచరించు వాడు ఓ పుణ్యశీలా! నా లోకమున కరుగును.

 

 

 

ఓ వరారోహా! మద్యము త్రావి నా కడకు అరుదెంచు వాని దుర్గతిని తెలిపెదను. సుందరీ! దానిని తత్త్వముతో వినుము.

 

అట్టివాడు పది వేల యేండ్లు దరిద్రుడై పుట్టును. మరల ఆతడు సాధారణ మానవుడై నా భక్తుడగును. సంశయము లేదు.

 

ఓ వసుంధరా! నీకొక్క విషయమును చెప్పెదను. నిప్పురంగు గల మద్యమును త్రావినచో అట్టివాడీ పాపము నుండి ముక్తుడగును. (అగ్ని వర్ణ మద్యము = ప్రాయశ్చిత్తమునకై ఏర్పరచిన పవిత్ర వస్తువులతో కూడిన ద్రవ పదార్థము.)

 

ఈ విధానముతో ప్రాయశ్చిత్తము నాచరించు వానికి పాప మంటదు. మరల సంసారమున పడడు.

 

 

నా పూజకుడు కుసుమ ఆకుల కూరను తిని పదునైదేండ్లు ఘోరమగు నరకమున పందియై మ్రగ్గి పోవును.

 

పిదప మూడేండ్లు కుక్క కడుపునను, ఒక యేడు నక్క కడుపునను పుట్టును. పిదప పరిశుద్ధుడై నా కర్మముల యందు ప్రీతిగల వాడగును. నా లోకము నందు కొనును.

 

కుసుమలను తిన్నచో చాంద్రాయణ వ్రతమును శ్రద్ధతో చేయ వలయును. నివేదనము చేసినచో పండ్రెండు దినములు పాలు మాత్రమును పుచ్చుకొను వ్రతము నాచరింప వలయును.

 

ఈ పద్దతితో ప్రాయశ్చిత్తము నాచరించువాడు పాపము అంటనివాడై నా లోకమున కరుగును.

 

 

 

మాధవీ! చక్కగా ఉదుకని, ఇతరుని వస్త్రము ధరించి నా పూజ చేయు మూర్ఖుడు ప్రాయశ్చిత్తమును పొంద వలయును.

 

అంధకారమున మునిగి ఆ విధముగా నా పూజలు ఆచరించు వాడు పదియేండ్లు మృగమై పోవును.

 

ఒక జన్మము కాళ్ళు లేని వాడై, మూర్ఖుడై, కోపము గలవాడై యుండును.

 

నా భక్తి యందు నిలుకడ కలవడగు అట్టి వానికి మిక్కిలి శక్తి గల ప్రాయశ్చిత్తమును తెలిపెదను.

 

మాఘ మాసశుక్ల పక్ష ద్వాదశి నాడు నా పూజల యందు ఆసక్తి కలవాడై ఎనిమిది కాలముల తరువాత భుజించి (రెండు రోజులు ఉపవాస ముండి అని తాత్పర్యము) లోని యింద్రియ ములను, వెలుపలి యింద్రియ ములను అదుపున నుంచుకొని కొలనులో నిలిచి యుండి చెదరని మనస్సుతో నా భావనయే చేయుచు ఉండ వలయును.

 

ప్రాతః కాలమున సూర్యుడు దయించిన తరువాత పంచ గవ్యమును (ఆవు పాలు, నెయ్యి, వెన్న, మూత్రము, పేడలద కలిపిన పదార్థమును) త్రావి నా పూజలు కావింప వలయును.

 

ఈ విధముగా ప్రాయశ్చిత్తము చేసికొని వాడు, పాపము లన్నింటి నుండి విడివడి నా లోకమున కరుగును.

 

నా అర్చనలు చేయువాడు క్రొత్త భోజనములను తనవి కాని, ఇతరు లిచ్చినవి కాని, నాకు సమర్పింపక తినునేని అట్టి వానిని నేను ఇష్టపడను. అట్లు ముందుగా నాకు సమర్పించుట ఆతనికి కర్తవ్యము. దీనిని నేను లోభము తోడనో, రాగము తోడనో చెప్పుట లేదు.

 

భగవంతుని భక్తుడై క్రొత్త ధాన్యముల అన్నములను నాకు సమర్పణము చేయని వాని పితృ దేవతలు పదునైదేండ్లు వాని అన్నమును తినరు.

 

క్రొత్త అన్నములను నా కర్పింపక ఎన్నడు గాని తిను నరునకు ధర్మము కలుగదు. ఇందు సంశయము లేదు.

 

ఆ పాపము నుండి ముక్తి పొంది నా భక్తుడు సుఖముగా నుండెడు ప్రాయశ్చిత్తమును, ఓ మహాభాగా! తెలిపెదను.

 

మూడు రాత్రులు ఉపవాసము చేయ వలయును. ఆరు బయలున నిద్రింప వలయును. నాలుగవ రోజున ఆతడు శుద్ధుడగును.

 

ఇట్లు విధిని ఆచరించి సూర్యోదయ కాలమున పంచగవ్యమును పుచ్చుకొని ఆ దోషము నుండి విడివడును.

 

ఈ విధానముతో ప్రాయశ్చిత్తము చేసికొని అన్ని తగులములను వదలి వైచి నా లోకమున కరుగును.

 

 

 

గంధములను, మాల్యములను ఒసగక ధూపమును నాకు అర్పించు వాడు క్రుళ్ళిన శవములను తిను రాక్షసుడై పుట్టును. సంశయము లేదు.

 

ఇరువది యొక్క యేండ్లు నింద్యమైన తావులలో నివసించు చుండును. ఇందు సంశయము లేదు.

 

వసుంధరా! ఇట్టి పాపమునకు ప్రాయశ్చిత్తమును నీకు వక్కాణించెదను. దేని వలన ఈ పాపము నుండి ముక్తుడగునో తెలిపెదను.

 

ఏదో ఒక నెలలో శుక్లపక్షము ద్వాదశి నాడు రెండు రోజు లుపవాస ముండి, పది పదునైదు దినము లుండ వలయును. పిదప తెల్ల వారిన పిదప సూర్యుడు దయించిన అనంతరము పంచ గవ్యమును పుచ్చుకొని ఆ పాపమును పోగొట్టు కొనును.

 

ఈ విధముగా ప్రాయశ్చిత్తము చేసికొను వాడే కాదు. ఆతని తండ్రి తాతలును పాపముల నుండి దాటుదురు.

 

 

 

చెప్పులు తొడిగికొని, నా దగ్గరకు వచ్చువాడు పదుమూడేండ్లు చర్మకారు డగును.

 

అందు ఆ జన్మము నుండి జారి పందియై పుట్టును. పంది జన్మము నుండియు పరిభ్రష్టుడై కుక్కయై పుట్టును.

 

కుక్క జన్మమును వదలి మరల మానవుడై పుట్టును. నాకు భక్తుడు, వినయము కలవాడు, దోషములు లేనివాడు నై సంసార దోషము లన్నింటిని వదలి నా లోకమున కరుగును.

 

వసుధా! ఈ విధానముతో కర్మము నాచరించు వాడు పాపపు అంటు లేని వాడగును. సంశయము లేదు.

 

భూమీ! భేరీనాదము చేయక నన్ను మేల్కొలుపు వాడు ఒక జన్మ కాలము చెవిటి వాడగును. సంశయము లేదు.

 

ప్రియా! ఆ భేరిని మ్రోగించు పనిలో ప్రమాద పడిన పాపము నుండి ముక్తి పొందెడు దానికి ప్రాయశ్చిత్తమును చెప్పెదను.

ఏదో ఒక నెలలో శుక్ల పక్ష ద్వాదశి నాడు ఆరు బయలున నిద్రించి వెనువెంటనే ఆ పాపము నుండి విడివడును.

 

ఈ పద్దతితో, ఓ వసుధా! అర్చనలను చేయువాడు అపరాధమును పొందడు. నా లోకమున కరుగును.

 

 

 

పొట్ట పగులు నట్లన్నమును తిని అజీర్ణముతో అవస్థ పడుచు క్రక్కుకొనుచు స్నానము చేయక నాకడ కరుగు దెంచు వాడు ఒక జన్మమున కోతి యగును. వేరొక జన్మమున నక్క యగును. ఇంకొక జన్మమున మేక యగును. తరువాత ఒక జన్మమున గ్రుడ్డి వాడగును. మరల ఎలుక యగును.

 

అట్టివాడు ఆ పాపము నుండి తరింప జేయ బడినవాడై గొప్ప కులమున శుద్ధుడు, శ్రేష్ఠుడు, అపరాధము లేని వాడునగు భాగవతుడై పుట్టును.

 

నా భక్తుని సుఖమును కూర్చునది, నా కర్మమున శ్రద్ధకల వానిని ఆ పాపము నుండి విడుదల చేయునదియు నగు ప్రాయశ్చిత్తమును చెప్పెదను.

 

యవల పిండితో మూడు రోజులు, దుంపలతో మూడు దినములు, పండ్లను తినుచు మూడు రోజులు, పులుపు ఉప్పు లేని చప్పిడిని తినుచు మూడు దినములు, పాయసముతో మూడు దినములు, పేల పిండితో మూడు దినములు, గాలి తినుచు మూడు రోజులు గడుప వలయును. ఆరు బయట పండు కొని మూడు దినములు గడుప వలయును.

 

తరువాత తెల్ల వారిన వెనుక పండ్లు తోముకొని పంచగవ్యమును పుచ్చుకొన వలయును. శరీరమును శుద్ధి చేసికొన వలయును.

 

ఈ విధానముతో ప్రాయశ్చిత్తము చేసికొను వానికి పాపము ఉండదు. అతడు నా లోకమున కరుగును.

 

మహేశ్వరీ! ఇది ఆఖ్యానములలో మిక్కిలి గొప్ప ఆఖ్యానము. తపస్సులలో శ్రేష్ఠమైన తపస్సు, దీనిని నేను బ్రాహ్మణులకు చెప్పు చున్నాను.

 

ఇది ధర్మము, ఇది కీర్తి, ఆచారములలో గొప్పశక్తి కలది. గుణములలో మిక్కిలి శ్రేష్ఠ మైనది. కాంతులలో గొప్ప కాంతి కలది.

 

ప్రాతః కాలమున నిద్రలేచి ప్రతి దినము దీనిని పఠించు వాడు ముందు పది తరముల వారిని, వెనుక పది తరముల వారిని పితృ దేవతలను తరింప జేయును.

 

ఆరోగ్యములలో, మహారోగ్యము మంగళములలో గొప్ప మంగళము. రత్నములలో పరమమైన రత్నము. అన్ని పాపములను అణగార్చునది.

 

ఏ భాగవతుడు చెదరిని నిష్ఠ కలవాడై ప్రతి దినము దీనిని చదువునో ఆతడు సర్వ పాపములు చేసిన వాడైనను ఆ పాపముల అంటులేని వాడగును.

 

ఇది జపింప దగినది. ప్రమాణమైనది. సంధ్యను ఉపాసించుటయే యైనది. ప్రాతః కాలమున నిద్ర లేచి దీనిని పఠించు వాడు నా లోకమున కరుగును.

 

మూర్ఖుల నడుమ దీనిని పఠింప రాదు. చెడు శిష్యులకు దీనిని బోధింప రాదు. నా అర్చన యందు శ్రద్ధ గల భాగవత శ్రేష్ఠునికి దీనిని ఒసగ వలయును.

 

దేవీ! ఆచార నిశ్చయమును గూర్చి మున్ను నీవు నన్నడిగిన దానిని వివరించి చెప్పితిని. మరియు నీవు దేనిని వినగోరు చున్నావు?