వరాహ మహా పురాణము
అధ్యాయము - 120
ఓమాధవీ! దేని చేత మనుజుడు గర్భ వాసము పొంద కుండునో ఆ సర్వ ధర్మ వినిశ్చయమును చెప్పెదను వినుము.
గొప్ప పని చేసియు తన్ను తాను పొగడు కొనక నిర్మలమగు మనస్సుతో పెక్కు సత్కర్మములు ఆచరించు వాడు.
నాకు ప్రియమైన నా పూజాది కార్యములు చేసియు అహంకారము పొందని వాడు, క్రోధము తాల్పని వాడు.
మనస్సుతో సమమును దర్శించుచు, లాభ నష్టములను పట్టించు కొనక అయిదు ఇంద్రియములపై అదుపు కలిగి, ఆ నిగ్రహమున ప్రీతి కలవాడు.
కార్యము, అకార్యమలను చక్కగా ఎరుగు వాడు, ధర్మము లన్నింట నిష్ఠకలాడు, చలి వేడి, గాలి, ఆకలి దప్పి అను వానిని సహించు వాడు.
దరిద్రు డయ్యును, పనుల యందు సోమరి తనము లేనివాడు, సత్యమే పలుకు వాడు, అసూయ లేని వాడు, ఎల్లప్పుడు తన భార్య యందే మనసు కలవాడు, ఇతరుల భార్యలను మోహింపని వాడు.
సత్య స్వరూప మగు పరమాత్మను గూర్చియే పలుకు వాడు, విశుద్ధమగు అంతరంగము కలవాడు, నిత్యము భగవద్భక్తుల యందు ప్రియము కలవాడు, వివేక వంతుడు, విశేషముల నెరుగువాడు, బ్రహ్మ జ్ఞానుల యందు పుత్ర ప్రేమ కలవాడు.
ప్రియములు పలుకు వాడు, ద్విజులయు, నా యొక్కయు కార్యముల యందు శ్రద్ధ కలవాడును అగు భక్తుడు పాడు కడుపులలో పడడు. నా లోకమున కరుగును.
వసుంధరా! నా పూజ యందు మిక్కిలి ఆసక్తి కల నరుడు వేరు జాతుల కడుపులలో పడకుండుటను గూర్చి వివరించి చెప్పెదను వినుము.
ప్రాణులను హింసింపడు, సర్వ ప్రాణుల మేలును కోరు చుండును. పరిశుద్ధుడై అన్నింటిని సమానముగా చూచును బంగారమును మట్టిపెళ్ల వలె భావించును.
చిన్న వయసు నందున్నను క్షమ, దమము కలవాడై పుణ్య కార్యముల యందాసక్తి కలిగి యుండును. మంచి పనులనే తెలిసి కొనును. పగవాడు కీడు చేసినను పట్టించు కొనడు
చేయ వలసిన దానిని మరవడు. అబద్ధములు వాగుడు. మోసముల నుండి మరలును. ఒక నిశ్చయమునకు వచ్చి దానిని తుది ముట్ట సాధించును.
ఎల్లప్పుడు ధృతి కలిగి యుండును. చాటు మాటున ఆక్షేపించడు, కేవలము సంతానము కొరకు తన యిల్లాలిని ఋతు కాలమున మాత్రమే పొందును.
భూదేవీ! ఇట్టి నరులు నా కర్మమున మిక్కిలి శ్రద్ధ కలవారై వేరు జాతుల గర్భము లందు పడరు. నా లోకమున కరుగుదురు.
వసుంధరా! మరల ఇంకొక విషయమును చెప్పెదను వినుము. ప్రపన్నులగు పురుషులకు సనాతనమగు ధర్మ మేదియో ఎరుగుము.
మనువు, అంగిరసులు, శుక్రుడు, గౌతముడు, సోముడు, రుద్రుడు, శంఖుడు, లిఖితుడు, కశ్యపుడు, ధర్ముడు, అగ్ని, వాయువు, యముడు, ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, శాండిల్యుడు, పులస్త్యుడు, ఆదిత్యుడు, పితృ దేవతలు, స్వయంభువగు బ్రహ్మ, వీరందరు ధర్మమును వేరు వేరు విధములుగా దర్శించిరి.
ఆయా నరులు తమ తమ ఆత్మల యందు ధర్మము విషయమున నిశ్చయమైన వ్రతము గలవారు. ఎవరి ధర్మమును వారు పాలింతురు. తమ అభిప్రాయమునే ధర్మముగా వక్కాణించిరి.
ధర్మము లన్నింటి యందును నిశ్చయ బుద్ధి కలవాడై యితరులను నిందిప రాదు. తన ధర్మము నందు తాను గట్టిగా నిలిచి ధర్మ కార్యములను తూల నాడకుండ వలయును.
ఈ గుణములతో చక్కని పొందిక కలిగి నా పనులు చేయు చుండు వాడు పశుపక్ష్యది యోనులలో ప్రవేశింపడు. నా లోకమున కరుగును.
మాధవీ! గర్భమను సంసార సాగరము నుండి తరించు మార్గమును మరియొక దానిని వక్కాణించెదను. వినుము.
ఇంద్రియములను గెలిచిన వారు, క్రోధముపై అదుపు కలవారు. లోభ మోహములను వదలి వైచిన వారు, తన పరిణత స్థితి యందు ప్రీతి కలవారు, ప్రతి దినము దేవతలను, అతిథులను, పితృ దేవతలను ప్రీతిగా చూచువారు.
హింస మొదలగు నీచ కార్యములను చేయని వారు, మద్య మాంసములను ముట్టని వారు, నిత్యము, గోవులకు వందన మాచరించు వారు, సురా పానము పొంత పోవని వారు.
బ్రాహ్మణ వనితను మనస్సు నందు కూడ దుష్ట భావముతో పొందని వాడు, విప్రునకు కపిల గోవును దాన మోసగు వాడు. ముదుసలిని మంచి మన్ననతో పరి రక్షించు వాడు.
కుమారు లందరిలో భేద బుద్ధిని చేయని వాడు, మిక్కిలి కోప గించిన బ్రహ్మవేత్తను చూచి ప్రసన్నుని చేయువాడు.
కపిల గోవును భక్తితో తాకువాడు, కన్యను చెఱుపని వాడు. అగ్నిని కాళ్లతో తాకని వాడు, కొడుకుతో వివాదము చేయని వాడు. నీటిలో మల మూత్రములు వదలని వాడు, గురువు పలుకును వెక్కిరింపని వాడు.
ఇట్లిట్లు ధర్మముతో కూడిన వాడై నన్ను పొందెడు వాడు గర్భవాస దుఃఖమును పొందడు. నా లోకమున కరుగును.
