వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 119

 

దేవీ! నీవు నన్నింతకు ముందడిగిన సంసార తరణమును గూర్చి మిక్కిలి రహస్యమగు దానిని చెప్పెదను వినుము.

 

నా పనుల యందు పరమ శ్రద్ధ కలవారు, విధి నను సరించి స్నాన మాచరించి చెడ్డ కూడు తిను వారయ్యు ఇంద్రియ నిగ్రహము కలవారై నాకడ కరు దెంతురు.

 

సుందరీ! నా సనాతనమగు రూపమేది చెప్ప బడుచున్నదో అదియే సర్వము సనాతనము అయిన నేను.

 

క్రింది వైపు, పై వైపు, అన్ని దిక్కులలో క్రిందు మీదు లందును నెలకొని ఉన్న వాడను నేనే.

 

కావున నా భక్తుడు పరమ గతిని కోరు వాడైనచో అన్ని విధముల అందరిని అన్నింటిని పూజాదికార్య సముదాయము చేత నమస్కరింప వలయును.

 

నా మార్గము ననుసరించు వారిని ఎట్లు వందనము చేయ వలయునో ఆ రహస్యమును, గొప్ప కీర్తికల దానిని కూడ నీకు తెలిపెదను

 

పరమమైన అర్చనను గావించి, ఆ విధమైన బుద్ధిని నిలుపుకొని తూర్పునకు మోగముంచి పరిశుద్ధుడై దోసిలితో నీటిని గ్రహించి మూల యోగమును చక్కగా చేసికొని ఈ మంత్రమును పలుక వలయును (మూల యోగము అన్నింటికి మూలమగు మనస్సును పరమాత్మతో కలుపుట)

 

ధర్మమును పరమ గతికి కారణమైన వాడు, సర్వలోక ప్రధానుడు, పురాణుడు, కృపతో భక్తుల సంసారమును పటాపంచలు చేయువాడు నగు శ్రీనారాయణుని పూజింతుము. ఈశ్వరా! ప్రసన్నుడవు కమ్ము.

 

మరల పడమటి వైపు మొగము పెట్టి దోసిలి లోనికి నీటిని గ్రహించి ‘ఓం నమో నారాయణాయ’ అని పలికి ఈ మంత్రమును పఠింప వలయును.

 

ఆది దేవుడు మొదటి సృష్టి కర్త. సనాతనుడు సర్వ ఐశ్వర్య రూపుడు. స్వర్గమున నున్నవాడు. సర్వమునకు మొదటి వాడు. అనంతమైన రూపములు కలవాడు. ఎందును ఎదురు లేని వాడు. సంసారము నుండి ముక్తి నొసగు వాడు.

 

అటు పిదప మరల నీటి దోసిలిని గ్రహించి అదే యోగముతో ఉత్తరము వైపు ముఖము ఉంచి ‘ఓం నమో నారాయణాయ’ అని పలికి ఈ మంత్రమును పఠింప వలయును.

 

దివ్యుడు, పరుడు, పురాణుడు, ఆది మధ్యాంతములు లేనివాడు, అనంతము లైన రూపములు గలవాడు, సంసారము నుండి విడుదల కలిగించు వాడునగు దేవుని అర్చింతుము.

 

వెను వెంటనే దక్షిణమునకు మొగము పెట్టి ‘ఓం నమః పురుషోత్తమాయ’ అని పలికి మంత్రమును చదువ వలయును.

 

యజ్ఞ రూపుడు, రూపములు నెరిగిన వాడు, కాల స్వరూపుడు, కాలమునకు మొదటి వాడు, ఊహింప రానివాడు, అనన్యమగు రూపము కలవాడు, సంసారమును రూపు మాపు వాడునగు స్వామిని పూజింతుము.

 

పిదప సమిధల పని ముగించి ఇంద్రియ నిగ్రహము కలవాడై అచ్యుతుని యందు మనస్సును నిలిపి ఈ క్రింది మంత్రమును చదువ వలయును.

 

మూడేడు లోకములకు నాథుడు, సోమ మార్గమున (యజ్ఞ పద్ధతి యందు) నిలిచి యుండు వాడు, జగత్తునకు ప్రధానుడు, మృత్యు రూపుడు అయి సంసారమును రూపు మాపు దేవుని యజింతుము.

 

ఈ తీరుగా బుద్ధియు ప్రజ్ఞయు గల భక్తుడు, పరమ గతిని కోరు వాడైనచో ఈ పూజా విధానములు మూడు సంధ్యల యందును భక్తితో చేయ వలయును.

 

ఇది యోగములలో పరమ యోగము, రహస్యములలో ఉత్తమ రహస్యము. జ్ఞాన మార్గములలో పరమ సాంఖ్యము. కర్మములతో ఉత్తమ కర్మము.

 

ఈ యోగమును మూర్ఖునకు, పిసిని గొట్టునకు, మొండి వానికి ఒసగ రాదు. ఉత్తమ శిష్యుడు, గట్టి గుండె నిబ్బరము కలవాడు నగు దీక్షితునకు మాత్రమే ఒసగ వలయును.

 

శ్రీమహా విష్ణువు ఉపదేశించిన ఈ రహస్యమును బుద్ధి ప్రజ్ఞలు గల వాడై భక్తుడు చావు దాపురించి నపుడును మరువ రాదు.

 

ప్రతి దినము ప్రాతః కాలమున నిద్ర లేచి ఏ మాత్రము చెదరని వ్రతము కలవాడై దీనిని పఠించు వాడు సత్త్వ గుణముతో కూడిన వాడై నా హృదయమున శాశ్వతముగా నిలుచును.

 

ఈ విధానముతో మూడు సంధ్యల యందును కర్మము నాచరించు వాడు పశు పక్ష్యాదుల కడుపున పుట్టినను నా లోకమున కరుగును.