వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 13

 

 

ఈ గొప్ప అచ్చెరువును గాంచి గౌరముఖుడే ఫలము పొందెను? మణి నుండి పుట్టిన ఆ నాయకు లే ఫలము పొందిరి?

 

 

పరమ ధార్మికుడగు ఈ గౌరముఖ ముని యెవ్వడు? హరి విలాసమును గాంచి ఆ మునివరు డేమి చేసెను?

 

 

రెప్ప పాటు కాలములో చేసిన భగవంతుని ఆ అద్భుత కార్యమును చూచి ఆ ముని ఆ దేవుని ఆరాధింప గోరిన వాడై ఇతరులు పొంద జాలని ప్రభాసమను సోమ తీర్థమున కరిగెను.

 

 

తీర్థములను గూర్చి చక్కగా భావించు వారు అచటి దేవుని దైత్య సంహారకు డందురు. అట్టి హరిని ఆగౌరముఖుడు ఆరాధించెను.

 

 

ప్రభువైన నారాయణ దేవుని ఆతడు అర్చించు చుండగా మహా మునియు, మహా యోగియు నైన మార్కండేయ డచటకు వచ్చెను.

 

 

అట్లు అభ్యాగతుడై వచ్చిన మహర్షిని దవ్వులనే కాంచి అర్ఘ్య పాద్యములతో ఎదుర్కొని భక్తితో, పరమానందముతో అర్చించెను.

 

 

పవిత్రమగు దర్భాసనమున కూర్చున్న ఆ మునిని గాంచి గౌరముఖుడు, ‘మహర్షీ! మహావ్రతా! నన్నేమి చేయు మందురో సెలవిండు’ అని యడిగెను.

 

 

గౌరముఖు డిట్లు పలుకగా మహా తపస్వియగు మార్కండేయుడు తీయని మాటలతో ఆతని కిట్లనెను.

 

 

మహా మునీ! సత్పురుషులను కలియుటయే ఘన కార్యము, నీకేదైన సందియములు గలవని యున్నచో నన్నడుగుము.

 

 

మహర్షీ! వేద వేత్తలు పితరులని చెప్పు చుందురే వారు అన్ని వర్ణముల వారికి సమానులుగా నుందురా? లేక ఆయా వర్ణములకు వేరు వేరుగా నుందురా?

 

 

దేవత లందరికి మొదటి వాడు గురువైన నారాయణుడు. ఆతని వలన బ్రహ్మ పుట్టెను. అతడు ఏడుగురు మునులను సృజించెను.

 

 

ఆ పరమేష్ఠి నన్ను పూజింపుడని వారితో పలికెను. వారు తమ్ము తామే అర్చించు కొనిరని వేదము చెప్పు చున్నది.

 

 

అట్లు గొప్ప వికారపు పని చేసిన కుమారులను బ్రహ్మ యిట్ల శపించెను. ఇది మహా దోషము. నా ఆజ్ఞను మీరు మీరితిరి. “ఈ కారణమున మీరందరు జ్ఞానము మొత్తము కోల్పోవుదురు. ఇందు సంశయము లేదు”.

 

 

బ్రహ్మ యిట్లు శపింపగా ఆతని ఆ పుత్రులు అక్కడి కక్కడ వంశమును వృద్ధి పొందించు కుమారులను పొంది స్వర్గమున కరిగిరి.

 

 

బ్రహ్మము నెరిగిన ఆ బ్రహ్మ కుమారు లట్లు స్వర్గమున కరుగు చుండగా వారి పుత్రులు వారికి శ్రాద్ధములు పెట్టి తర్పణము గావించిరి.

 

 

బ్రహ్మ సంకల్పము వలన పుట్టిన ఆ యేడుగురును విమానముల నధివసించి, మంత్ర పూర్వకముగా చేసిన ఆ పిండ దానమును చూచుచు నిలిచి యుండిరి.

 

 

బ్రాహ్మణోత్తమా! ఈ పితృ దేవత లెవ్వరు? ఎంత కాల ముందురు. ఆ లోకమున నెలకొన్న పితృ గణము లేవి?

 

 

దేవతలకు సోమ రసమును పెంపొందించుచు వారిలో కొందరు శ్రేష్ఠులు మరీచి మొదలగు నేడుగురు స్వర్గమున నుండిరి. వారినే పితృ దేవత లందురు.

 

 

అందులో నలుగురు ఆకారము కలవారు. మువ్వురు లేనివారు. వారు సృజించిన లోకములను చెప్పెదను వినుము.

 

 

వారి ప్రభావమును, మహిమను విస్తరించి చెప్పెదను. ఆ యేడుగురిలో మువ్వురు ధర్మ రూపమగు ఆకారము ధరించిన వారు. వారి నామములను, లోకములను వర్ణించెదను. వినుము.

 

 

ఆ కాంతి స్వరూపులు నివసించు లోకములకు సంతానకము లని పేరు. వారు మూర్తి లేని పితృ సముదాయము లైరి. వారు ప్రజాపతి పుత్రులు.

 

 

విరాజుని పుత్రులకు వైరాజులని పేరు. వారు దేవతలకు పూర్వులు. దేవతలు వారిని పూజింతురు.

 

 

వీరు తమ లోకము నుండి జారి మరల సనాతన లోకము లను పొంది నూరు యుగములు గడచిన పిమ్మట బ్రహ్మ వేత్తలుగా పుట్టుదురు.

 

 

ఈ పితృ దేవతలు పూర్వస్మృతి పొంది మిక్కిలి శ్రేష్ఠమగు యోగమును సాధించి, శుద్ధమగు ఆ యోగ మార్గము నందే మనసు నిలిపి పునర్జన్మము లేని స్థితి పొందుదురు.

 

 

ఈ పితృ దేవతలు శ్రాద్ధ క్రియ యందు ముందు ప్రీతి నొందిన వారై యోగుల యోగమును వృద్ధి పొందింతురు.

 

 

యోగివరా! కావుననే యోగులకు శ్రద్ధా పూర్వకమగు పూజలు చేయ వలయును. ఇది సోమపులను వారి ఉత్తమ మగు మొదటి సృష్టి.

 

 

స్వర్గ లోకమున నివసించు ఈ బ్రహ్మణ వరేణ్యలు, బ్రహ్మ పుత్రులగు మరీచి మొదలగు వారు భూలోకమున నివసించు వారికి పూజ్యులు. ఆ మరీచి మొదలగు వారికి మహల్లోక వాసులు అర్చింపదగిన వారు.

 

 

ఆ మహర్లోక వాసులు కల్ప వాసికులను పేరు గలవారు. వారికి జనలోక వాసులగు సనకాదులు అర్చింపదగిన వారు. వారికి తపో లోకమున నున్న వైరాజులు మాన్యులు. వారికి సత్య లోక వాసులగు ముక్తులు మన్నింప దగిన వారు. ఇది పితృ దేవతల వరుస.

 

 

మరీచి సంతతి వారైన అగ్నిష్వాత్తులు, విరాజుని సంతతి వారగు బర్హులు, వసిష్ఠుని సంతతి వారగు సుకాలేయులు మూడు వర్ణముల వారికి అర్చింప దగిన వారు. శూద్రులకు వేరుగా పితృ దేవతలు లేరు.

 

 

పై మూడు వర్ణముల వారి అనుమతి గొని శూద్రుడు పితృ దేవత లందరిని అర్చింప వలయును. అంతేకాని శూద్ర జాతికి చెందిన పితృ దేవతలు వేరుగా లేరు.

 

 

విశేషమైన శాస్త్ర దృష్టి చేతను, పురాణములను చక్కగా ఎరిగిన కారణమునను సర్వ విద్యావేత్తలగు విప్రుల యందు ముక్త చేతన కలవాడు కానవచ్చు చున్నాడు. (మహాతత్వ వేత్తయే ముక్తి నొందుట కర్హుడని భావము - విప్రుడనగా విద్యా సంపద పరి పూర్ణముగా గలవాడు)

 

 

ఇట్లు ఋషులు స్తుతించిన శాస్త్రముల ద్వారమున తన వలన పుట్టిన పూజ్యులను గూర్చి తెలిసి కొని బ్రహ్మ సృష్టికి సంబంధించిన స్మృతిని, పుత్రుల స్మృతిని పొందెను. వారు కూడ ఆ జ్ఞానముతో పరమ నిర్వాణమును పొందిరి.

 

 

వసువు మొదలగు వారికి కశ్యపుడు మొదలగు వారు, వర్ణముల వారికి వసువు మొదలగు వారు యాజ్యులు (యజింప దగిన వారు), గంధర్వుడు మొదలగు వారు సామాన్యముగా పూజ్యులని తెలియ దగును.

 

మహామునీ! ఇట్లు నీకు పితృ దేవతల సృష్టిని గూర్చి స్థూలముగా చెప్పితిని. కోటి సంవత్సరములు చెప్పినను దీని కంతము కానరాదు.

 

 

బ్రాహ్మణోత్తమా! శ్రాద్దమునకు తగిన కాలములను తెలిపెదను. వానిని గూర్చి వినుము.

 

 

శ్రాద్ధము కొఱకు ఉత్తమ పదార్థము, సర్వ విద్యలు గల ఉత్తమ ద్విజుడు దొరకి నపుడు శ్రాద్ధ కర్మము చేయ వలయును. అట్లే వ్యతీపాత యోగము నందును, అయన సమయము లందును చేయ వలయును.

 

 

విషువము వచ్చి నపుడు, సూర్య చంద్రుల గ్రహణముల యందును, ఆయా రాశుల యందు సూర్యుడు ప్రవేశించు నపుడును శ్రాద్ధము పెట్ట వలయును. (విషువ మనగా రాత్రి కాలము, పగటి కాలము సమానముగా నున్న దినము)

 

 

నక్షత్రములను బట్టి, గ్రహములను బట్టియు పీడలు సంభవించి నపుడును, చెడు కలలు వచ్చిన పుడును, క్రొత్త పంటలు వచ్చు కాలము లందును ఇష్టమును బట్టి శ్రాద్ధములు చేయనగును.

 

 

ఆర్ద్రా, విశాఖా స్వాతి నక్షత్రముల యందు అమావాస్య సంభవించి నపుడు చేసిన శ్రాద్ధములతో పితృ దేవతలు ఎనిమిది సంవత్సరములకు సరిపడు తృప్తి పొందెదరు.

 

 

పుష్యమి, మఘ, పునర్వసు అను నక్షత్రముల యందు అమావాస్య వచ్చి నపుడు పూజ లొందిన పితృ దేవతలు పండ్రెండేండ్లు తృప్తి పొందెదరు. (రౌద్ర నక్షత్ర మనగా రుద్రుడు దేవతగా గల నక్షత్రము - మఘ)

 

 

పితృ దేవతల తృప్తిని కాంక్షించు వారు ధనిష్ఠ, పూర్వాభాద్ర, శతభిష నక్షత్రముల యందు, అమావాస్య వచ్చినపుడు శ్రాద్ధములు చేయ వలయును. ఇట్టి సమయము దేవతలకును దుర్లభ మైనది. ( వాస్తవ నక్షత్ర మనగా ధనిష్ఠ, అజైకపాద మనగా పూర్వాభాద్ర, వారుణము - శతభిషము)

 

 

ఇట్లు పైని చెప్పిన తొమ్మిది నక్షత్రముల యందు అక్షయ పుణ్య ఫలము గోరు వారు శ్రాద్ధ కర్మము లాచరింప వలయును, వేల కోటులు ఏండ్ల కైనను ఆ పుణ్యము తరుగదు.

 

 

పితృ దేవతలు శ్రాద్దమునకు మిక్కిలి పవిత్ర మగు కాలములు కూడా మాకు రహస్యముగా చెప్పిరి. అవి వైశాఖ మాసము శుక్ల పక్ష తృతీయా తిథియు, కార్తీక శుక్ల పక్షమున నవమీ తిథియు.

 

 

భాద్రపద కృష్ణపక్ష త్రయోదశి, మాఘమాస అమావాస్య, సూర్య చంద్రుల గ్రహణ సమయము, అష్టక దినములు రెండు అయనములు శ్రాద్ధమునకు మంచివి. (పూర్ణిమ తరువాత వచ్చు సప్తమి- అష్టమి- నవమీ తిధులను అష్టకము లందురు)

 

 

నువ్వులతో కలసిన నీటిని పితృ దేవతలకు భక్తి పూర్వకముగా పెట్టిన శ్రాద్ధము వేయి ఏండ్లకు సరి పడినదను రహస్యమును పితృ దేవతలు చెప్పుదురు.

 

 

మాఘ మాసము కృష్ణ పక్ష అమావాస్య శతభిషా నక్షత్ర యుక్త మైనచో అది పితృ దేవతలకు మిక్కిలి ప్రీతి కరమైన కాలము. అట్టి మహా భాగ్యము అల్ప పుణ్యులకు లభింపదు.

 

 

మాఘమాస కృష్ణ పక్ష అమావాస్య ధనిష్టతో కూడిన వేళ పితృ దేవతల కిడిన జలము, అన్నము ఆ వంశము వారికి పదివేల సంవత్సరములు తృప్తి నొసగును.

 

 

మాఘ మాస కృష్ణ పక్ష అమావాస్య పూర్వాభాద్ర నక్షత్రముతో కూడిన సమయమున పితృ దేవతలకు శ్రాద్ధము పెట్టినచో పరమ తృప్తి కలుగును. పితృ దేవత లోక నిండు యుగము సుఖముగా నిద్రింతురు.

 

 

గంగ, శతద్రువు, విపాశ, సరస్వతి, నైమిశారణ్యము లోని గోమతి అను నదులలో తీర్తమాడి ఆదరముతో పితృ దేవతల నుద్దేశించి గోపూజ మొదలగునవి చేసినచో పాపము లన్నియు పటా పంచలగును.

 

 

మాఘమాస కృష్ణ పక్షము తుది దినములలో త్రయోదశిలో కూడిన మఘా నక్షత్రమున్న రోజులలో కొడుకు లిచ్చు పుణ్య నదుల జలములతో తృప్తి పొందుట ఎన్నడో కదా! యని పితృ దేవతలు గొంతెత్తి పలుకు చుందురు.

 

 

చిత్తము, విత్తము పవిత్రము లైనచో, కాలము ప్రశస్త మయినచో, క్రియ శాస్త్రము ప్రకారము జరిగినచో సరియగు వ్యక్తి దొరికినచో గొప్ప భక్తి సమకూడినచో శ్రాద్ధములు నరులకు కోరిన కోర్కెల నన్నింటిని తీర్చును.

 

 

ఇచట పితృ దేవతలు పాడిన శ్లోకములు కొన్ని కలవు. ఉత్తమా! వానిని వినుము. విని వానిని చక్కగా భావించి అట్లా చరింపుము.

 

 

ధనము విషయమున కక్కుర్తి పడక మాకు పిండములను పెట్టు పుణ్యాత్ముడు బుద్ధి మంతుడు మా కులమున పుట్టు గాక!

 

 

రత్నములు, వస్త్రములు, గొప్ప వాహనములు, నీరు, ధనము అను వానిని మమ్ముల నుద్దేశించి విద్య పుష్కలముగా గల వారికి విభవము ననుసరించి అతడు ఒసగు గాక!

 

 

తనకు గలిగి నంతలో శ్రాద్ధ కాలమున భక్తితో నిండిన బుద్ధి కలవాడై తన సంపాదకు లోటు రాని విధమున విప్రవరులకు భోజనము పెట్ట వలయును.

 

 

అన్న దానము చేయ జాలని వాడినచో అడవి కూర నైనను తన శక్తితో సాధించి స్వల్పమగు దక్షిణగా బ్రాహ్మణ ప్రవరులకు ఇచ్చు గాక!

 

 

దానికిని శక్తి చాలనిచో చేతులతో కొన్ని నువ్వులను పట్టుకొని ఒక్క బ్రాహ్మణ శ్రేష్ఠున కైనను ప్రణమిల్లి ఇచ్చుగాక!

 

 

కనీసము ఏడెనిమిది నువ్వు గింజలతో దోసిలి నిండా నీరు గొని మమ్ము భావించి భక్తి నిండిన హృదయముతో ఇచ్చు గాక.

 

 

అదియు దొరకనిచో ఏదో విధముగా ఆవుల నుండి ఒక్క చుక్క పాలైనను సంపాదించి భక్తితో మాకు తర్పణము చేయు గాక!

 

 

ఏమియు లేని యెడల అడవి కరిగి చేతులు పైకెత్తి సూర్యుడు మొదలగు లోక పాలుర నుద్దేశించి పెద్దగా ఇట్లు పలుక వలయును.

 

 

నాకు సొమ్ములు లేవు, ధనము లేదు, శ్రాద్ధమునకు యోగ్యమైన దేదియు నాకు లేదు. నా పితృ దేవతల కొక్క నమస్కారము చేయు చున్నాను. దీనితో పితరులు తృప్తి పొంద దగును. వాయు మార్గమున నా చేతులు చాపి యుంచితిని.

 

 

ఉన్న వారిని, లేని వారిని ఉద్దేశించి పితృ దేవతలు పాడిన గీతిని నీకు వినిపించితిని. ఇట్లిట్లు చేసిన మనుజుడు భక్తితో శ్రాద్ధము పెట్టిన వాడగును.