వరాహ మహా పురాణము
అధ్యాయము - 50
ముని శ్రేష్ఠుడగు అగస్త్యుడు పుష్కరమను తీర్థమున కరిగి కార్తీక మాసమున మరల భద్రాశ్వుని మందిరమున కరుదెంచెను.
అట్లు వచ్చిన మునిని చూచి మిక్కిలి ధర్మ బుద్ధి గల రాజు అర్ఘ్యము, పాద్యము మొదలగు వానితో పూజించి ఆసనమును గ్రహించిన వాడును. నిష్ఠతో కూడిన వ్రతములు కలవాడును అగు అతనితో సంతోషముతో ఇట్లు పలికెను.
పూజ్యుడా! ఋషి సత్తమా! నీవు మునుపు ఆశ్వయుజ మాస ద్వాదశి వ్రత విధానమును చెప్పి యుంటివి. ఇప్పుడు కార్తిక మాసమున ఆ వ్రతము పుణ్య మెట్టిదో నాకు తెలియ జెప్పుము.
రాజా! మహాబాహూ! విను, కార్తిక మాస ద్వాదశి నాడు విధి పూర్వకముగా ఉపవాస ముండినచో కలుగు ఫల మెట్టిదో చెప్పెదను.
మునుపటి పద్ధతి ప్రకారమే సంకల్ప మొనరించి స్నానము చేయ వలయును. నిర్మలుడగు నారాయణ దేవుని అర్చింప వలయును.
‘ఓం నమః సహస్రశిరసే’ అని భుజములను, ‘నమో విశ్వరూపిణే’ అని కంఠమును, ‘నమో జ్ఞానాస్త్రాయ’ అని అస్త్రములను ‘నమః శ్రీవత్సాయ’ అని రొమ్మును. ‘నమో జగద్గ్రసిష్ణవే’ అని ఉదరమును, ‘నమో దివ్య మూర్తయే’ అని నడుమును, ‘నమః సహస్ర పాదాయ’ అని పాదములను పూజింప వలయును.
ఇట్లు వివేక వంతుడు అనులోమ విధానముగా దేవేశుని పూజించి ‘ఓం నమో దామోదరాయ’ అని హరి సర్వాంగములను అర్చింప వలయును. (సాధారణముగా దేవతలను పాదముల నుండి శిరస్సు వరకు అన్న క్రమముతో పూజింతురు. అది అనులోమ విధానము.)
ఇట్లు విధానము ననుసరించి పూజించి ఆ దేవుని ముందు లోపల రత్నములు కలివియు, తెల్లని గంధపు పూత కలవియు, మాలలు కట్టిన మెడలు కలవియు, తెల్లని వస్త్రములు చుట్ట బడినవి యును, నువ్వులు, బంగారు నాణములు గల రాగి పాత్రలు పైని నిలిపి నవియు నగు నాలుగు కుంభములను ఉంచ వలయును.
ఇట్లు నాలుగు సముద్రములు కూర్చి నట్లగును. వాని మధ్య మునుపటి పద్ధతి ప్రకారము, యోగీశ్వరుడు, యోగ నిద్రలో నున్న వాడు, పీతాంబరము తాల్చిన వాడు అగు హరిని బంగారు ప్రతిమ రూపముతో నిలుప వలయును.
ఆ దేవుని కూడ ఇట్లే పూజించి ఆ రాత్రి అచట జాగరము చేయ వలయును. యోగీశ్వరుడగు హరిని గూర్చి విష్ణు మయమైన యజ్ఞము నాచరింప వలయును.
పెక్కండ్రు రాజులు తీర్చిన పదునారు అరలు గల చక్రమున హరి నుంచి తెల్లవారిన పిదప బ్రాహ్మణునకు దాన మొసగ వలయును.
నాలుగు సాగరములను (కుండలను) నలుగురు బ్రాహ్మణులకును, యోగీశ్వరు డగు హరిని అయిదవ బ్రాహ్మణునకు నిష్ఠతో శుచియై ఒసగ వలయును.
గొప్ప వేద విద్వాంసున కిచ్చినచో సమమైన ఫలము, వేదమును సంపూర్ణముగా నెరిగిన వాని కిచ్చినచో రెండు రెట్లు ఫలము. పాంచ రాత్రాగమమున ఆచార్యు డైన వాని కిచ్చినచో వేయి రెట్లు ఫలమును కలుగును.
రహస్యములతో, మంత్రములతో వేదము నెరిగిన వాని కిచ్చినచో కోటి కోటి రెట్ల ఫలితము సిద్ధించును.
గురువు ఉండగా ఇతరుని ఆశ్రయించి పూజించిన వాడు పాడు బుద్ధి కల వాడగును. ఇట్టి వాని కిచ్చిన దానము ఫలము లేని దగును. వాడు చెడు గతి నందును.
చదువు లేనివాడో, కలవాడో గురువే జనార్దనుడు. సరియగు దారి యందున్న వాడో లేనివాడో గురువే పరమ గతి.
ఒక గురువును పొంది మోహము వలన అతని యొద్ద భేద బుద్ధి పొందు పురుషా ధముడు కోటి జన్మములు నరకమున యాతనలు అనుభవించును.
ఇట్లు విధి పూర్వకముగా ద్వాదశి యందు విష్ణువు నర్చించి విప్రులకు శక్తి ననుసరించి దక్షిణ లొసగి భోజనము పెట్ట వలయును.
ఈ ధరణీ వ్రతమును మునుపు ప్రజాపతి ఆచరించి ప్రాజాపత్యమును, అట్లే శాశ్వత పర బ్రహ్మ స్వరూపమగు ముక్తిని పొందెను.
యువనాశ్వుడను రాజర్షియు ఈ వ్రత విధానము చేత మాంధాత యను కొడుకును, శాశ్వత బ్రహ్మమును పొందెను.
అట్లే హైహయ రాజు కృతవీర్యుడను వాడు కార్తవీర్యుడను కొడుకును పొందెను. శాశ్వత బ్రహ్మమును సాధించెను.
ఇట్లే శకుంతలయు తపస్సు చేసి దుష్యంతుని వలన చక్రవర్తియగు శాకుంతలుని పొందెను.
ఇట్లే పురాణ ప్రసిద్ధులు, వేద ప్రసిద్ధులు నగు చక్రవర్తులు ఈ విధానముతో ఉత్తమమగు చక్రవర్తిత్వమును పొందిరి.
మునుపు పాతాళమున కూరుకొని పోయిన భూదేవి ఈ వ్రతము నాచరించెను. అందు వలన దీనికి ధరణీ వ్రతమను ఉత్తమ నామము కలిగెను.
వ్రతము పరి సమాప్తి యయిన తరువాత, సంతోషించిన శ్రీహరి ధరా దేవిని వరాహ రూపము తాల్చి పైకెత్తి, నీటిలో మునిగిన నావను వలె, నిలువ బెట్టెను.
నేను నీకు ప్రీతితో కొనియాడి చెప్పిన ఈ ధరణీ వ్రతమును భక్తితో విను వాడును. శ్రద్ధతో ఆచరించు వాడును పాపము లన్నింటి నుండి విడుదల పొందిన వాడై విష్ణు సాయుజ్యము నందును.
