వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 32

రాజా! నీకిపుడు గొప్పది యగు ధర్మము ఎట్లు పుట్టెనో, దాని మహిమ యెట్టిదో, దానికి సంబంధించిన తిథి యేమో వివరించెదను శ్రద్ధగా వినుము.

 

మునుపు అవ్యయుడు, శుద్ధుడు, పరమున కంటె అపరుడను పేరు గలవాడు అగు బ్రహ్మ ప్రజలను సృజింప గోరి మొదట వారి పాలన మార్గమేమా! అని ఆలోచించెను.

 

అట్లు చింతించు చుండగా ఆతని కుడి భాగము నుండి తెల్లని కుండలములు, తెల్లని మాల్యములు, మైపూతలు గల పురుషు డొకడు పుట్టుకొని వచ్చెను.

 

నాలుగు పాదములతో ఎద్దు వంటి ఆకారము గల ఆ పురుషుని గాంచి భగవానుడు ‘సాధూ! ఈ ప్రజల నందరిని పాలింపుము. నీవు జగత్తునకు మొదటి వాడవు కమ్ము’ అని పలికెను.

 

బ్రహ్మ యిట్లు పలుకగా ఆతడు చక్కని స్థితి గాంచి కృత యుగమున నాలుగు పాదములతో, త్రేత యందు మూడు పాదములతో, ద్వాపరమున రెండు పాదములతో, కలి యందు ఒక పాదముతో నిలిచి ప్రజలను పాలించెను.

 

బ్రహ్మణుల యందు ఆరు భేదములతో, క్షత్రియుల యందు మూడు భావములతో, వైశ్యుని యందు రెండు భావములతో, శూద్రుని యందు ఒక్క భావముతో ఆతడు నెలకొని అందరి యందున్న వాడై పాలన చేసెను. (బ్రాహ్మణుని యందు ఆరు భావములు 1. యజ్ఞము చేయుట. 2. యజ్ఞములు చేయించుట 3. వేదములు చదువుట 4. చదివించుట 5. దానము చేయుట 6. దానమును పుచ్చు కొనుట. క్షత్రియుని యందు మూడు విధములు 1. యజ్ఞము చేయుట 2. వేదమును చదువుట, 3. దానము చేయుట. వైశ్యుని రెండు తీరులు 1. వ్యవసాయము. 2. వాణిజ్యము, శూద్రుని యందు ఒక విధము వృత్తుల రూపమున పై మూడు వర్గముల వారికి తోడ్పడుట.)

 

సమస్త లోకముల యందును ద్వీపముల యందును ఆ ధర్ముడనెడు ప్రభువు పాలన గావించెను.

 

ద్రవ్యము, గుణము, క్రియ, జాతి అను నీ నాలుగును ఆతని పాదములు. సంహిత, పదము, క్రమము అనునవి ఈ వృషభ రూప పురుషుని మూడు కొమ్ములు. ఓం కారము మొదలు తుది అను రెండును ఈతని రెండు శిరస్సులు. విభక్తులు ఏడును ఏడు హస్తములు. ఉదాత్త, అనుదాత్త స్వరితములను మూడు విధములుగా రూపొందిన నాదమయ పురుషు డాతడు. జ్ఞాన సంపన్నులలో ముఖ్యుడై జగము నంతటిని పాలించు చుండెను.

 

వింత గొలుపు పనులు గల చంద్రుడు మునుపు అంగిరసుని తమ్ముడగు బృహస్పతి భార్యను తారను చేజిక్కించు కొని ఆ ధర్మ పురుషుని నొప్పించెను.

 

అప్పుడా ధర్మ ప్రభువు క్రూర కర్ముడు, బలవంతుడు నగు ఆ చంద్రుడు భయపెట్టగా భయంకరము, చొర రానిది అగు అడవికి చొచ్చెను.

 

అట్లు ధర్మ పురుషుడు అడవుల పాలుకాగా దేవత లందరు రాక్షసుల పత్నులను పట్టుటకై ధర్మ హీనులై వారి యిండ్లలో తిరుగ జొచ్చిరి. అట్లే రక్కసులు దేవతల యిండ్లలో తిరుగాడిరి.

 

ఇట్లు హద్దులు పోయి ధర్మము నశింపగా సోముడు చేసిన తప్పు వలన కోపించిన దేవతలును, రాక్షసులును స్త్రీ కారణముగ పెక్కు తీరుల ఆయు ధములను చేపట్టి పోర దొడగిరి.

 

అట్లు రక్కసుల యెడ కోపించి పోరాడు చున్న దేవతలను గాంచి సంబర పడి నారదుడీ వార్తను బ్రహ్మ కడ కరిగి వివరించెను.

 

అంత సర్వ లోకములకు తాతయగు బ్రహ్మ హంస వాహనము నెక్కి అటకు వచ్చి ఈ యుద్ధము నకు ప్రయోజన మేమి? అని పలుకుచు వారిని నివారించెను.

 

వారందరు దీనికి కారణము సోముడని చెప్పిరి. ఆతని పీడ వలననే తన పుత్రుడగు ధర్ముడు అడవుల పాలాయె నని బ్రహ్మ తెలిసి కొనెను.

 

అంత బ్రహ్మ దేవ దానవులతో కలసి వడిగా ధర్ముడున్న చోటి కరిగెను. అందు నాలుగు పాదములతో వృషభము రూపుతో చంద్రుని వలె విహరించు చున్న ఆ ధర్ముని దేవతలతో పాటు గాంచి వారితో నిట్లు పలికెను.

 

ఈతడు నా మొదటి కొడుకు ధర్ముడను పేరు గలవాడు. మహాముని. సోదరుని భార్యను పట్ట నెంచిన చంద్రుడు ఈతని మిక్కిలి పీడించెను.

 

దేవతలారా! అసురులారా! మీరందరు ఇతనిని సంతోష పెట్టుడు. దాని వలన మీ ఉభయులకు సమముగా చక్కని స్థితి కలుగును.

 

అంత దేవత లందరు బ్రహ్మ మాట వలన ఆతని సంగతి నెరిగి నిండు చంద్రుని బోలు ఆతని స్తుతించిరి.

 

చంద్రుని బోలిన దేవా! జగత్పతీ! దేవరూపా! స్వర్గమునకు దారి చుపు వాడా! కర్మ మార్గమే స్వరూపమైన వాడా! సర్వమున నుండు స్వామీ! నీకు నమస్కారము.

 

నీవే యీ భూమి నంతటని రక్షించు చున్నావు. ముల్లోకమలును నీ రక్షణ యందే నిలిచి యున్నవి. జన లోకము, తపో లోకము, సత్య లోకము – అది యిది యననేల సర్వమును నీవే పాలించు చున్నావు.

 

చరాచర ప్రపంచమున నీవు లేనిది కొంచె మేనియు లేదు. నీవు లేని యెడల జగమంతయు అప్పటి కప్పుడు నాశన మగును.

 

నీవు సర్వ భూతములకు ఆత్మవు. సజ్జనులకు సత్త్య స్వరూపముతో, రజో గుణము గల వారికి రజ స్స్వరూపముతో, తమో గుణము మిక్కుటమైన వారికి తమో గుణమయ రూపముతో నీవు కన్పట్టుదువు.

 

దేవా! నీకు నాలుగు పాదములు, నాలుగు కొమ్ములు, మూడు కన్నులు, ఏడు చేతులు, మూడు బంధములు. ఇట్టి వానితో వృషభ రూపమున నున్న దేవా నీకు నమస్కారము.

 

నీవు లేని మేము పిచ్చి మార్గములను పట్టితిమి. ఆ మార్గమును మూఢుల కొసగుము. మాకు నీవే పరమ గతివి.

 

దేవత లందరు ఇట్లు కీర్తింపగా వృషభ రూప ధర్ముడు తుష్టి చెంది ప్రసన్నమైన మనసుతో శాంతమైన చూపుతో వారిని చూచెను.

 

ధర్మ పురుషుడు తన కంటితో చూచినంత మాత్రమున దేవత లందరు క్షణముతో మోహమును వదలి వైచిరి. చక్కని ధర్మముతో కూడిన వారైరి.

 

రక్కసులును అట్లే అయిరి. అంత బ్రహ్మ అతనితో ఇట్లు పలికెను. ధర్మా! ఈ దినము నుండి నీకు త్రయోదశి ప్రియమగు తిథి యగు గాక!

 

ఆ తిథినాడు ఉపవాస ముండి నిన్ను సాధించు వాడు. పాపము లన్నియు చేసిన వాడైనను వాని నుండి విముక్తి పొందును.

 

నీవు బహు కాలము తిరిగిన కారణమున ప్రభూ! ఈ అరణ్యమునకు నీ పేరుతో ధర్మారణ్యమను ప్రసిద్ధి కలుగును.

 

నాలుగు, మూడు, రెండు ఒకటి అయిన పాదములతో కృత త్రేతా ద్వాప కలి యుగము లందు నీవు లోకులకు గాన వత్తువు. అట్లు ఈ కర్మ భూమి యందును, పై లోకము లందును నీవు సాధారణముగా స్వగృహము నందు వలె నిలుచుచు ఈ విశ్వ మంతటిని పరిరక్షింపుము.

 

ఇట్లువారు పలికి నంత బ్రహ్మ దేవుడు దేవ దానవులు చూచు చుండగా అదృశ్యు డాయెను. ఆ దేవతలును దుఃఖమును వీడి ధర్మ సహితులై తమతమ గృహముల కరిగిరి.

 

ఈ ధర్ముని పుట్టుక కథను వినిపింప జేసిన వాడును, శ్రాద్ధ కర్మలలో దీనితో పితృ దేవతలకు తర్పణము చేయు వాడును త్రయోదశి యందు శక్తి కొలది పాయసముతో భోజనము పెట్టు వాడును స్వర్గమున కరిగి దేవతలతో కలిసి యుండును.