వరాహ మహా పురాణము
అధ్యాయము - 38
ఆ కిరాతుడు మంగళ మైన మార్గము నవలంబించి ఆహారము వదలి, ఆ గురువును మనసులో స్మరించుచు తపస్సు చేసెను.
భోజన సమయము రాగా రాలిన ఆకులను తిను చుండెను. ఆతడొక నాడు ఆకలిపై కొనగా ఒక చెట్టు మొదటికి చేరుకొన్న వాడాయెను.
ఆకలి గొన్న వాడై దగ్గరగా నున్న ఆకును తిన గోరెను. ఇట్లు చేయు చుండగా ఆకాశమున అశరీర వాణి విన వచ్చెను.
‘అపవిత్ర మైన దానిని తినకు’ అని బిగ్గరగా అశరీర వాణి పలుకగా అంత నాతడు దానిని వదలి వైచి రాలిన మరియొక చెట్టు ఆకును కైకొనెను.
దాని విషయమున కూడ ఇట్లే నిషేధము విన వచ్చెను. మరొక దాని యెడలను అట్లే యాయెను. ఇట్లతడు అంతయు అపవిత్రమే అని తలచి ఏమియు తిన కుండెను.
ఏ ఆహారము లేని వాడై, గురువును స్మరించుచు, మెలకువతో ఆతడు తప మొనర్చెను. ఇట్లు పెక్కు కాలము గడువగా ఒకనాడాతని కడకు ఋషివరు డరుదెంచెను.
ఆతడు దొడ్డ బుద్ధి గల దుర్వాసుడు. ఆతడు తపము వలన పైకి లేచిన వచ్చెడు తేజస్సులతో జ్వలించు చున్న హవిస్సు వలె ఉన్న వాడును ప్రాణములు కడ బట్టిన వాడును అగు ఆ బోయ వానిని చూచెను.
ఆ వ్యాధుడును ఆ మహా మునికి తలతో నమస్కరించి ‘భగవానుడా! నీ దర్శనము వలన కృతార్థుడ నయితిని.’
ఇప్పుడు నాకు శ్రాద్ధ కాలము. నీవు అనుగ్రహింపుము. రాలిన ఆకులను పుచ్చు కొనుము. నేను వాని తోడనే శ్రాద్ధమును నిర్వహింతును. వాని తోడనే నీకు ప్రీతి కలిగింతునని పలికెను.
పరిశుద్ధుడు, ఇంద్రియము లను గెలిచిన వాడును, శుద్ధమైన భావములు కల వాడును అగు అతని తపస్సును పరీక్షింప గోరి దుర్వాసుడును పెద్దగా ఇట్లు పలికెను.
ఆకలితో నుండి, నీ కడకు వచ్చిన నాకు యవలు, గోధుమలు, సన్న బియ్యముల అన్నమును చక్కగా వండిన దానిని పెట్టుము.
ఆముని యిట్లు పలుకగా ఆ వ్యాధుడు పెద్ద ఆలోచనలో పడెను. నాకిట్టిది ఎక్కడ దొరకును? అని విచారించెను.
అట్లు చింతించుండగా ఆకాశము నుండి బంగారు పాత్ర శుభమై నది, సిద్ధులతో కూడినది ఒకటి పడెను. దాని నాతడు చేతితో గ్రహించెను.
అది కైకొని వెరగు పడుచు ఆ వ్యాధుడు దుర్వాసునితో ఇట్లు పలికెను. ‘మహర్షీ! నేను బిచ్చమెత్తి వచ్చు వరకు నీవు ఇచటనే నిలువుము. నా యందు అనుగ్రహము చూపుము.’
ఇట్లు పలికి ఆ మంచి బోయ చేరువలో నున్నదియు ధనములు మంచి యిల్లాండ్రు గలదియు నగు నగరమునకు భిక్ష మెత్తుటకై యరిగెను.
అతడిట్లు బయలు దేరి నంతనే వృక్షముల నుండి వెలువడి బంగారు పాత్రలు చేత ధరించిన సుందర వనితలు పెక్కు విధముల అన్నములను అతనికి అందించిరి. ఆతని పాత్ర పూర్తిగా నిండి పోయెను.
అతడును తన్ను కృతార్థునిగా భావించుచు తిరిగి ఆశ్రమ మునకు వచ్చి మహర్షి శ్రేష్ఠుడగు ఆ దుర్వాసుని కాంచెను.
కాంచి ఆ భిక్షను శుచి యైన తావున ఉంచి ప్రసన్న బుద్ధియై ప్రణమిల్లి ఆ ఋషితో ఇట్లు పలికెను.
పూజ్యుడా! ఋషివరా! కాళ్ళు కడుగు కొనుము. నన్న నుగ్రహింతు వేని ఇట్లు చేయ దగును.
అతడట్లు పలుకగా ఆముని శుభమైన ఆతని తపో బలము నెరుగ గోరి ‘ఓయీ! నేను నదికి పోజాలను. నా కడ జల పాత్రయు లేదు’.
ఓ మహామతీ! నేను కాళ్ళెట్లు కడుగు కొందును? అని పలుకగా వ్యాధుడు అది విని మరల ఏమి చేయుదును? ఈతనికి భోజనము ఎట్లు అగును? అని విచారించెను.
మనసులో చక్కగా ఆలోచించి ఆ వివేకి గురువును స్మరించి ఆ బుద్ధి మంతుడు ఆ దేవికా నదిని శరణు చొచ్చెను.
అమ్మా! నదీమతల్లీ! నేను కిరాతకుడను. పాప కర్ముడను బ్రహ్మ హత్యలు చేసిన వాడను. అయినను నిన్ను భావించితిని. శరణు జొచ్చిన నన్ను కాపాడుము.
దేవత నెరుగను. మంత్రము నెరుగను. అట్లే పూజించు పద్ధతి నెరుగను. గురు పాదములను శ్రద్ధతో ధ్యానించి శుభమును గాంచు చున్నాను.
ఓ పుణ్యనదీ! ఇట్టి నా యెడల దయ చూపుము. ఋషి పాదములు గడుగు కొనుటకు నీటిని దగ్గరకు తెమ్ము. ఆలసింపకుము.
ఆ బోయ అట్లు పలుకగా పాపములను నశింప జేయు దేవిక సంశిత వ్రతుడగు దుర్వాసుడున్న కడకు వచ్చెను.
ఆ గొప్పనది దేవిక స్వయముగా ఆ ముని పాదములను కడుగుచు వ్యాధుని ఆశ్రమము కడ హ్రాదినియై ప్రవహించెను.
ఆ గొప్ప వింతను గాంచి దుర్వాసుడు అచ్చెరు వందెను. కాలు సేతులు కడుగు కొని ఆచమించి శ్రద్ధతో పెట్టిన ఆ అన్నమును మిక్కిలి ప్రీతుడై భుజించెను.
ఎముకలు మాత్రము మిగిలిన వాడు, ఆకలితో అల్లాడుచున్న వాడునగు ఆ బోయతో ఆ మహర్షి వేద అధ్యయనము, సంగ్రహ గ్రంథములతో కూడిన సమస్త వేదములు, బ్రహ్మ విద్యయు, పురాణములు నీకు ప్రత్యక్షము లగుగాక అని పలికెను.
దుర్వాసు డిట్లాతనికి వర మొసగెను. పేరు కూడ పెట్టెను. నీవు సత్య తపుడవు, ఆది ఋషి వగుదు వని పలికెను.
ఇట్లాతడు వర మీయగా నాతడు ఆ ముని శ్రేష్ఠునితో ఇట్లు పలికెను. స్వామీ! నేను బోయజాతి వాడనై వేదము నెట్లు చదివించెదను?
ఉత్తముడా! నీ ప్రాతదేహ మిపుడు పోయినది. నీవు ఆహారము కొనవైతివి గదా! ఇప్పుడు నీది తపో మయమైన శరీరము. ఇది వేఱు. సంశయము లేదు.
నీదగు ప్రాత విజ్ఞానము నశించి నది. ఇప్పటి నీ విజ్ఞానము శుద్ధము. అక్షరము (నశింపనిది) కావున ఓ మునీ! నీకు వేదములు శాస్త్రములతో పాటు స్పష్టముగా తెలియ వచ్చును.
