వరాహ మహా పురాణము
అధ్యాయము - 108
రాజా! ప్రత్తి ఆవును గూర్చి వివరించెదను. దాని నిచ్చుట వలన నరుడు మిక్కిలి శ్రేష్ఠమగు ఇంద్ర లోకమున కరుగును.
విషువము, అయనము, సంక్రాంతి పుణ్య కాలము, సంవత్సరాది, గ్రహణము అను సమయములలో, గ్రహ పీడలు సంభవించి నపుడు, పీడ కలలు, దయ్యములు కనబడి నపుడును పుణ్య స్థలము నందును, ఆవుల మందలున్న చోటను, పవిత్ర స్థలము నందును దీనిని చేయ నగును.
ఆవు పేడతో అలికిన భూమి యందు దర్భలను పరచి దానిపై తిలలను ఉంచి ఆ నడుమ ధేనువును నిలుప వలయును. వస్త్రములు, మాల్యములు, గందపు పూతలు, నైవేద్యము, ధూపము, దీపము మొదలగు వానితో పొగరు లేనివాడై పూజింప వలయును.
నాలుగు బారువుల పత్తితో చేయుట ఉత్తమ పద్ధతి. అందులో సగముతో మధ్యమ పద్ధతి. ఒక బారువుతో చేయుట అధమ పద్ధతి. ధన విషయములో వంచన పనికి రాదు. నాలుగవ భాగముతో దూడను చేయ వలయును.
బంగారు కొమ్ములతో, వెండి గొరిజలతో, పెక్కు పండ్ల దంతములతో రత్నములు కడుపున ఉండు నట్లుగా ధేనువును తీర్ప వలయును.
ఇట్లు అన్నియు నిండుగా నుండునట్లు ఆవును రూపొందించి శ్రద్ధతో కూడిన వాడై ఆ కార్పాస ధేనువును మంత్రములతో ఆవాహనము చేయ వలయును.
దర్భలు చేతదాల్చి పవిత్రుడై శ్రద్ధ గలవాడై దాన మంత్రములతో పాటు మునుపటి విధానమును చేయ వలయును.
దేవీ! నీవు లేక దేవ గణములు లేవు. నన్నీ సంసార మనెడు సముద్రము నుండి ఉద్ధరింపుము అని పలుక వలయును.
