వరాహ మహా పురాణము
అధ్యాయము - 59
రాజా! నీకు అవిఘ్నకరమను వ్రతమును గూర్చి చెప్పెదను. వినుము. అది చక్కగా చేసినచో విఘ్నము అనునది కలుగదు.
రాజా! ఫాల్గున మాసమున చవితి నాడు ఈ వ్రతమును చేపట్ట వలయును. రాత్రి పూట నువ్వులు కలిపిన భోజనము చేయ వలయును. దానినే హోమము చేసి బ్రాహ్మణునకును ముందు సమర్పింప వలయును.
ఈ వ్రతమును కూడ నాలుగు మాసముల కాలము చేయ వలయును. అయిదవ నెలలో సువర్ణముతో విఘ్నేశ్వరుని ప్రతిమను చేయించి అయిదు పాత్రల యందు నువ్వులతో కూడిన పాయసముతో పాటు దానము చేయ వలయును. ఇట్లు ఈ వ్రతమును చేసిన వాడు అన్ని విఘ్నముల నుండియు విడివడును.
మునుపు సగరుడు తన అశ్వమేధ యాగమునకు విఘ్నము కలుగగా దీనినే ఆచరించి ఆ యజ్ఞము సమాప్తి చేసికొనెను.
త్రిపురాసురులను వధించునపుడు రుద్ర దేవుడు దీని నాచరించియే వారి సంహారము గావించెను. నేనును సముద్రమును త్రావునపుడు ఈ వ్రతము నాచరించితిని. మరియు పెక్కండ్రు రాజులు, తాపసులు, జ్ఞానవంతులు విఘ్నములు లేకుండుటకై ఈ వ్రతమును చేసి యున్నారు.
‘శూరుడు, ధీరుడు, గజముఖుడు, లంబోదరుడు, ఏక దంతుడు అగు దేవునకు నమస్కారము’ అనుచు ఆ దినమున పూజింప వలయును. విఘ్నములు నశించుటకై తిరిగి హోమము నాచరించ వలయును.
ఈ వ్రతము నాచరించిన మాత్రమున నరుడు, నెరవేరిన ప్రయోజనములు కలవాడై వినాయకుని కృప చేత సర్వ విఘ్నముల నుండియు ముక్తుడగును.
