వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 91

 

మందరమునకు తపస్సునకై అరిగిన ఆ రజో గుణము వలన ఏర్పడిన పరమ శక్తి వైష్ణవి కౌమార వ్రత ధారిణి యై ఒంటరిగా విశాల యను చోట తపస్సు చేయు చుండెను. తపము చేయు చుండగా పెద్ద కాలమునకు ఆమె మనస్సు కలత పడెను.

 

ఆ క్షోభ వలన నిర్మలములగు కన్నులు, నల్లని నొక్కుల జుత్తు, దొండ పండు వంటి పెదవులు, నిడుపాటి కన్నులు, మొలనూలు గల నడుములు, మ్రోయుచున్న అందెలు గల పాదములు, వెలిగి పోవుచున్న దేహ కాంతియు గల కుమారీ జనుల పుట్టుకొని వచ్చిరి.

 

ఆ దేవి మనసు క్షోభ పడగా ఇట్లు కోట్ల కొలదిగా పెక్కు తీరులైన మొగముల కన్యలు పైకి లేచిరి.

 

అట్టి ఆ కుమారీ జనమును గాంచి ఆ దేవి ఆ పర్వతమున వెడల్పయిన బాటలు, బంగారు ప్రాసాదములు, లోపల నీరు గల భవనములు, మణులతో చేసిన సోపానములు రత్న జాలముల గవాక్షములు, అందుబాటులో ఉన్న ఉద్యానములు గల వందల కొలది భవనములున్న పురమును తపశ్శక్తి చేత నిర్మించెను.

 

భూదేవీ! ఆ భవనములు, ఆ కన్యలు లెక్క పెట్టరాని సంఖ్యలో ఉన్నవి. ప్రాధాన్యమును బట్టి ఆ కన్యల నామములను చెప్పెదను.

 

విద్యుత్ర్పభ, చంద్రకాంతి, సూర్యకాంతి, గంభీర, చారుకేశి, సుజాత, ముంజకేశిని, ఘృతాచి, ఉర్వశి, శశిని, శీలమండిత, చారుకన్య, విశాలాక్షి, పుష్టి గల స్తనములు గల ధన్య, చంద్రప్రభ, గిరిసుత, సూర్యప్రభ, అమృత, స్వయంప్రభ, చారుముఖి, శివదూతి, విభావరి, జయ, విజయ, జయంతి, అపరాజిత, వీరును ఇంకను వందల కొలది కన్యలును ఆ ఉత్తమ పురమున నివసించిరి.

 

వీరందరు ఆ దేవిని వెంట నంటి యుందురు. పాశమును, అంకుశమును ధరించు వారు, మంచి వారు. వారు కొలిచి యుండగా ఆ దేవి సింహాసమున కూర్చుండి, తెల్లని వింజామరతో స్త్రీలు విసరు చుండగా కౌమార వ్రతమును తాల్చి తపస్సు చేయుటకు ఉద్యుక్త ఆయెను.

 

యౌవనమున నున్నది, పూజ్యురాలు, చక్కని దేహపుష్టి కలది, సంపెంగలు, అశోకములు, పున్నాగములు, నాగ కేసరములు మొదలగు పూమాలలతో అన్ని యంగము లందును అర్చింప బడినది, ఋషులు, దేవతలు మొదలగు వారి నమస్కారములు కొను చున్నట్టిది, శ్రేష్ఠలగు కన్యలు పూజలు చేయు చున్నట్టిది అయి ఆ దేవి విరాజిల్లు చుండెను.

 

ఇట్లా దేవి సర్వాంగ భోగములు కలదియై తపస్సు చేయు చుండగా బ్రహ్మ కుమారుడు నారదు డచటికి వచ్చెను.

 

తపస్సే ధనముగా గలవాడు, బ్రహ్మ తనయుడు అగు అతనిని చూచి త్వరత్వరగా ఆ దేవి విద్యుత్ర్పభ యను సఖితో ఆతని కాసన మిమ్ము. కాలు గడుగు కొని నీరు, త్రావుటకు జలము త్వరగా ఇమ్ము అని పలికెను.

 

అట్లు ఆ దేవి పలుకగా విద్యుత్రభ నారదునకు ఆసనమును, పాద్యమును, అర్ఘ్యమును నివేదించెను.

 

ఆసనమును స్వీకరించి వినయముతో ఉన్న నారద మునిని గాంచి ఆదేవి గొప్ప సంతోషముతో ఇట్లు పలికెను.

 

ఓ మునిశ్రేష్ఠా! నీకు స్వాగతము. ఏ లోకము నుండి యిచటికి విచ్చేసితివి? నీ పని యేమి? నీకు నేను చేయ వలసిన దేమి? నీకు ఆలస్యము జరుగరాదు. చెప్పుము.

 

ఆ దేవి యట్లు పలుకగా లోకజ్ఞుడగు నారదు డిట్లాడెను. తల్లీ! బ్రహ్మ లోకము నుండి యింద్ర లోకమునకు వెళ్లి అటు నుండి రౌద్ర చలమున కరిగి అట నుండి నిన్ను దర్శించు కొనుటకై ఓ దేవేశీ! నీ కడకు వచ్చితిని, అని పలికి కాంతి శాలియగు ఆ నారదుడా దేవిని పరికించి చూచెను.

 

ఒక్క ముహూర్తము ఆ దేవేశిని పరికించి నారదు డచ్చెరు వందెను. ఆహా! ఏమి రూపము! ఏమి కాంతి! ఏమి ధైర్యము! ఏమి వయస్సు! ఏమి నిష్కామత! అని మనసున చింతించెను.

 

దేవతలు, గంధర్వులు, సిద్ధులు, యక్షులు, కిన్నరులు, రాక్షసులు అను జాతులలో కాని ఇంక ఏ యితర స్త్రీలలో కాని ఇట్టి రూపము ఎందును లేదు. అని మనసున భావించి నారదుడు విస్మయము పొందెను.

 

వరదురాలగు ఆ దేవికి దండ ప్రణామము గావించి ఆకాశమున కెరిగెను. తొందరతో దైత్యరాజు పాలించు పురి కరిగెను.

 

ఆ పురి మహిషము. సముద్రము లోపల కలదు. అచటికా పూజ్యుడరిగి దున్నపోతు ఆకారము గల ఆ రాక్షస రాజును చేరుకొనెను.

 

వరములు పొందిన వీరుడు, దేవ సైన్యమును పెద్ద మొత్తములో రూపు మాపినవాడు అగు ఆ రాక్షసుని గాంచి భక్తితో ఆతడుచే సిన పూజలందు కొని లోకము లందు తిరుగు చుండు ఆ ముని ప్రీతినొంది తాను దేవతా పురమున చూచిన ఆ దేవి సర్వోత్తమ రూపమును గూర్చి ఉన్నదున్నట్లు వక్కాణించెను.

 

 

రాక్షస రాజా! ఒక కన్యా రత్నమును గూర్చి సావధానుడవై వినుము. వరదానము వలన ఆమో చరాచరమగు మూడు లోకముల సముదాయమును సాధించినది.

దైత్యా! నేను బ్రహ్మ లోకము నుండి మందర గిరి కరిగితిని. అందు వందల కొలది కన్యలతో బిలబిల లాడు దేవీ పురమును గాంచితిని.

 

అందు ముఖ్యురాలగు కన్య తపస్సు చేయు చున్నది. వ్రతమును పూని యున్నది. దేవతలతో, దైత్యులలో, యక్షులలో అట్టి ఆమెను నేనెచటను చూడలేదు.

 

ఈ బ్రహ్మాండము నడును నేను తిరుగు లాడుచు అట్టి కన్య నొక్క దానిని కూడ నేను ఎన్నడును కాంచ నైతిని.

 

దేవజాతి వారు, గంధర్వులు, ఋషులు, సిద్ధులు, చారణులు, ఇతరులగు రాక్షస నాయకులు అందరు ఆమె కడ పడి గాపులు పడి యున్నారు.

 

వరముల నొసగు ఆ దేవిని గాంచి వెంటనే నేనిటకు పరువెత్తి వచ్చితిని. దేవతలను, గంధర్వులను గెలువక ఆమె నొక్కడును గెలువ జాలడు.

 

ఇట్లు పలికి ఒక్క క్షణమచట నిలిచి ఆతనిని వీడ్కొని ధీశాలియగు నారదుడు ఆ క్షణమున అంతర్ధానము చెందెను.