వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 23

 

 

మహర్షీ! గణపతి పుట్టుక కథ ఏమి? అతనికి ఆ ఆకార మెట్లు వచ్చెను. నా మనస్సునకు బరువుగా నున్న ఈ సంశయమును దీర్పుము.

 

 

మునుపు దేవతలు, తపో ధనులగు ఋషులు ఆయా పనులు చక్కగా సిద్ధి పొందునట్లు కార్యములను ప్రారంభించెడి వారు.

 

 

మంచి నడవడి కలవారి యందు పనులు ఆటంకముల తోడను, చెడు నడవడి కలవారి యందు ఏ విఘ్నములు లేకుండా ఫలించుటయు సంభవించెను.

 

 

అది చూచి దేవతలు, పితరులు శక్తి కొలది విచారించిరి. చెడు పనుల యందు విఘ్నము కలుగుటకై అందఱు ఆలోచించిరి.

 

 

అట్లు ఆలోచన చేయుచున్న దేవతల బుద్ధికి దొడ్డ బుద్ధి గల రుద్రుని కడకరుగ వలయునను భావన కలిగెను.

 

 

అంట వారందఱు కైలాస వాసియగు గురువు రుద్రుని కడ కరిగి దండ ప్రణామములు గావించి వినయముతో నిట్లు పలికిరి.

 

 

దేవదేవా! మహాదేవా! శూలపాణీ! త్రిలోచనా! దుష్టుల కార్యములకు విఘ్నములు కలిగించుటకై యోకనిని నీవు పుట్టింప వలయును.

 

 

దేవత లిట్లు పలుకగా పరమేశ్వరుడు పరమానందము నొంది రెప్పపాటు లేని కంటితో పార్వతిని చూచెను.

 

 

ఇట్లు దేవతల యెదుట ఉమను చూచు చున్న ఆ మహాత్ముని మదిలో ఆకాశమునకు రూపము లేని కారణమేమా? అని ఆలోచన బయలు దేరెను.

 

 

భూమికి ఆకృతి కలదు. నీటికి నట్లే కలదు. అగ్నికి, వాయువునకు ఆకృతి కలదు, ఈ ఆకాశమున కేల లేదు? అని భావించుచు దేవుడు నవ్వెను.

 

 

జ్ఞాన శక్తియగు ఉమను చూచి, రుద్రుడు ఆకాశమును చూచెను. మఱియు ముందే బ్రహ్మ శరీరుల శరీరమును గూర్చి పలికి యుండెను. పరమేశ్వరుడు నవ్వెను. ఈ నాలుగు కార్యముల తోడను, భూమి మొదలగు నాలుగు భూతము లందున్న గుణముల తోడను కూడి నవ్వుచున్న పరమేశ్వరుని నుండి గొప్ప ఆకారము, దొడ్డది యగు తేజస్సు, వెలిగి పోవుచున్న ముఖము, గొప్ప వెలుగు గల కుమారుడు దిక్కులను ప్రకాశింప జేయుచు పరమేష్ఠి గుణములతో కూడిన వాడై అపర రుద్రుడా యన్నట్లు ఏర్పడెను.

 

 

కాంతి, తేజస్సు, ఆకారము, రూపము అను వానితో ఆ మహాత్ముడు పుట్టుచునే దేవ కాంతలను మురిపించెను.

 

 

మహాత్ముడగు ఆ కుమారుని చక్కని రూపమును గాంచి ఉమా రెప్ప లార్పక వానిని చూచు చుండెను.

 

 

ఆ కుమారుని రూపము అందముగా కన్నులకు కైపు కలిగించు నదిగా ఉండుటను, స్త్రీల భావము చంచలమైన దగుటను పరికించిన పరమేశ్వరుడు స్త్రీల విషయమున శంక నొంది అతనిని ఇట్లు శపించెను.

 

 

కుమారా! ఏనుగు మోము, జారిన పొట్టయు, పాముల జందెము గలవాడ వగుదువు అని యిట్లు పట్టరాని కోపముతో పరమేశ్వరుడు శపించెను.

 

 

ముక్కంటి దేవర యేబది లక్షల రోమ కూపములలో చెమట నిండి పోయెను. అట్టి త్రిశూలధారి దేహమును విదిలించుచు పెను కోపముతో లేచెను.

 

 

త్రిశూలము చేత బట్టిన ఆ దేవుడు ఎట్లెట్లు తన మొదటిదగు దేహమును విదలించు చుండెనో అట్లట్లు ఆతని కేశములు విరాజిల్లు చుండెను. చెమట నీరు నేలపై కాలువలు కట్టెను.

 

 

ఏనుగు మోము గలవారు చీకటి చెట్ల వలె, కాటుక వలె, నల్లని దేహములు గలవారు, పెక్కు ఆయుధములు దాల్చిన వారు నగు వినాయకులు పెక్కు తీరుల వారు లేచి వచ్చిరి. అంత దేవత లందరు మనసులలో కలత పడి ఇదియేమి? అద్భుత కర్మ మాచరించుచు ఈ శివుడు ఇంత దొడ్డపని చేయు చున్నాడు? దేవతల కార్యమిత డొక్కడే చేయ గలవాడు. మఱి యీ పెక్కు స్వరూపములతో పని యేమి?

 

 

దేవతల లిట్లు చింతించు చుండగా వినాయకులతో భూమి యంతయు గగ్గోలు పడి పోయెను. అంట సాటిలేని బ్రహ్మ విమాన మెక్కి ఆకసమున నిలిచి యిట్లు పలికెను.

 

 

దేవతలారా! మీరు ధన్యు లయితిరి. అద్భుత మగు రూపము గల ముక్కంటి దేవర పరమేశ్వరుడు మిమ్ముల ననుగ్రహించెను. ఈ రూపము లన్నియు దేవతల శత్రువులకు విఘ్నములు కలిగించునవి.

 

 

తాత దేవతలతో ఇట్లు పలికి పిదప పరమేశ్వరునితో ఇట్లనెను. ప్రభూ! నీ మోము నుండి పుట్టిన ఆ స్వామి వినాయకులకు ప్రభువగు గాక! వీరందఱు అతని బంటులగుదురు గాక!

 

 

నీవు అందరి కంటే మిన్నగా నిర్మించిన ఒక్కడు శరీరముతో తిరుగు వాడై ఆకాశమున నిలుచు గాక! అతడు మొదట నాలుగు లక్షణములతో ఏర్పడిన వాడేయగు గాక! ఈ ఆకాశము చాల పెద్దది గదా! నీవు శ్రేష్ఠునే చేసితివి. ఇతరుని కాదు.

 

 

ఆ వినాయకునకు నీవు ప్రభువగుము. ప్రతిమల వంటి అస్త్రములను చేత దాల్చి యీ బాలునకు అస్త్రములను, వరములను ఇమ్ము. అని పలికి బ్రహ్మ దేవుడు వెడలి పోగా ముక్కంటి తన కొడుకుతో నిట్లు పలికెను.

 

 

నీవు వినాయకుడు, విఘ్నకరుడు, గజ ముఖుడు, శివ పుత్రుడు, గణేశుడు అను పేర్లతో ప్రసిద్ధి పొందుము. ఈ క్రూరమగు చూపులు భయము గొల్పు చేష్టలు గల ఈ వినాయకు లందఱు నీకు భంటు లగుదురు. తాపములు లేని వారొసగు పదార్థములతో పెంపొందిన దేహము గల వీరు ఆయా జనుల కార్యములను సఫలము చేయు చుందురు.

 

 

నీవును నీ మహానుభావము వలన దేవతలలో యజ్ఞములలో, ఆయా శుభ కార్యములలో మొట్ట మొదట పూజ నందు కొనెదవు. అట్లు కానిచో ఆయా కార్యముల సిద్ధిని నాశ మొందింతురు.

 

 

పరమేశ్వరు డిట్లు పలికి దేవతలలో పాటు బంగారు కుండలతో నున్న జలములతో అతని నభిషేకించెను. అట్లు వినాయకులతో అతడు విరాజిల్లెను.

 

 

అట్లు అభిషేకము పొందుచున్న ఆ గణ నాయకుని గాంచి దేవత లందఱు త్రిశూల పాణి సన్నిధానమున శ్రద్ధా శక్తులతో స్తుతించిరి.

 

 

ఏనుగు మోము దేవరయగు నీకు నమస్కారము. గణ నాయక! వినాయక! భయము గొల్పు పరాక్రమము గల నీకు మ్రొక్కులు.

 

 

విఘ్నకర్తా! నీకు నమస్కారము. సర్పములు మొల నూలుగా గల స్వామీ! నీకు వందనము. రుద్రుని ముఖము నుండి పుట్టిన దేవా! నీకు నతులు. జారు బొజ్జ గల దేవరా! నీకు కైమోడ్పు.

 

 

సర్వ దేవతలు నీకు మ్రొక్కు చున్నారు. అందు వలన వారికి ఎల్లవేళల విఘ్నములు లేకుండా జేయుము.

 

 

ఇట్లు దేవతల స్తుతుల నందు కొనిన గణనాయకుడు అభిషిక్తుడాయెను. ఉమా సహితుడగు రుద్రునికి కుమారు డాయెను.

 

 

ఇట్లు వినాయకుడు గణనాథు డగుట చవితి నాడు జరిగినది. అందు వలన చతుర్థీ తిథి తిథులలో శ్రేష్ఠమై యలరారినది.

 

 

ఈ తిథి యందు నువ్వులను భుజించి గణపతిని భక్తితో పూజించిన వాని యెడ గణపతి ప్రసన్ను డగును. ఇందు సందియము లేదు.

 

 

ఈ స్త్రోత్రము చదివిన వానికి, విన్న వానికిని విఘ్నములు కలుగవు. పాప మేవిధముగను అంటదు.