వరాహ మహా పురాణము
అధ్యాయము – 16
ప్రభూ! అప్పుడు దేవ రాజగు ఇంద్రుని దుర్వాసుడు నిన్ను సుప్రతీకుని కుమారుడు పోద్రోలగా మనుజులతో కలిసి నివసింతునని శపించెను గదా!
బుద్ధి హీనుడా! సుప్రతీకుని కొడుకు నిన్ను స్వర్గము నుండి త్రోలి వైచును. అని దుర్వాసుడు పలుకగా దేవత లందరితో కూడిన దేవేంద్రుడు మనుష్య జన్మము పొంది ఏమి చేసెను?
మరియు ఆ దుర్జయుని భగవంతుడగు బ్రహ్మ కూల్చి వేసిన పిదప ఉత్తమ యోగ జ్ఞానము గల విద్యుత్తు సువిద్యుత్తు అనువారు స్వర్గమున నేమి చేసిరి? ప్రభూ! ప్రసన్నుడవై నాయీ సంశయమును తీర్పుము.
భూదేవీ! దేవేంద్రుడు దుర్జయునకు ఓడి భరత వర్షమున వారాణసి నాశ్రయించి యక్షులతో, నాగులతో, దేవతలతో కలసి నివసించెను.
అంత ఆ విద్యుత్ సువిధ్యుత్తులు యోగము నవలంభించి వాయు కార్య సంబంధము చేత దీర్ఘ తాప జ్వరమును కల్పించి యోగ మాయతో లోక పాలురను క్రమ్మునట్లు కావించిరి.
ఆ దుర్జయుడు మరణించె నని విని సముద్రము కడ నున్న చతురంగ బలమును రావించి దేవతల పైకి దండు వెడలిరి.
అట్లు పెను సేనతో వచ్చి వారు హిమవత్పర్వతము నాశ్రయించి నిలిచి యుండిరి.
దేవతలును గొప్ప సేన కూర్చుకొని రక్షణ ఏర్పాటులు కావించుకొని ఇంద్ర పదవి నొంద గోరిన వారై మెలకువతో మంతనము లాడు చుండిరి.
అందు దేవ గురుడు బృహస్పతి, మొదట గోమేధము చేయుడు. పిదప తక్కిన యజ్ఞము లన్నియు చేయ వలయును. దేవతలారా! ఇది పద్ధతి. ఇది నేను మీకిచ్చు ఉపదేశము, దీనిని త్వరగా నాచరింపుడు.
ఆతడిట్లు పలుకగా ఆ దేవతలు గోవులను, ఇతర పశువులను కూర్చుకొని వానిని సంచారము కొరకు వదలిరి. వారి రక్షకై సరమను ఏర్పరచిరి. (సరమ - దేవతల కుక్క)
దేవతల శునకము కాపాడు చున్న ఆ గోవులు అందందు తిరుగుచు ఆ రక్కసులున్న తావున కరిగెను.
అంత నా రక్కసులు ఆ గోవులను గాంచి పురోహితుడగు శుక్రునితో, ‘ప్రభూ! చూడు. దేవతల శుని సరమ కాపాడు చుండగా గోవుల నిందు త్రిప్పు చున్నారు. ఇప్పుడు మనమేమి చేయ వలయును’ అని అడిగిరి.
అంత శుక్రుడు రక్కసులతో ‘అసురులారా! వెను వెంటనే ఈ గోవులను పట్టు కొనుడు. జాగు సేయకుడు’ అని పలికెను.
ఇట్లన్న తోడనే ఆ దైత్యులు ఆ గోవులను చేజిక్కించు కొనిరి.
వారట్లు గోవులను హరింపగా సరమ అవి పోయిన దారిని శ్రద్ధతో వెదికెను. కడకు దితి కొడుకులు వానిని తోలుకొని పోవు చుండగా కనుగొనెను. దైత్యులును తమదారి నెరిగిన సరమను గాంచిరి.
కాంచి వారు మంచి మాటలతో సరమా! ఈ గోవుల పాలు పిండి నీవు త్రాగుము. అని వాని క్షీరమును దాని కొసగిరి.
అట్లు రాక్షస నాయకులు పాలు సరమ కొసగి ఓ యమ్మా! ఈ గోవులను గూర్చి దేవ రాజునకు చెప్ప వలదని పలికిరి.
దైత్యులిట్లు పలికి ఆ శునిని వనమున వదలి వైచిరి. అంతనా సరమ వణకి పోవుచు వడివడిగా దేవతలకడ కరిగెను.
సరమ దేవేంద్రునకు మ్రొక్కు లిడెను.
దేవేంద్రు డామెకు మరుత్తులను దేవతలను చూపి ‘మహా బలులారా! మీరీ దేవ శునితో పాటు గుట్టుగా రక్షణకుగా నరుగుడు’ అని పలికెను.
దేవేంద్రుడట్లు చెప్పగా వారు సూక్ష్మమగు దేహముతో వడివడిగా నరిగిరి. వారును తిరిగి వచ్చి దేవేంద్రునకు నమస్కరించిరి.
దేవేంద్రుడు, సరమా! గోవు లేమైనవి? అని యడిగెను. సరమ తెలియదని బదులు చెప్పెను.
అంత ఇంద్రుడు కోపముతో యజ్ఞమునకై ఏర్పరచిన గోవులేవి? ఈ శుని సంగతి యేమి? అని మరుత్తుల నడిగెను.
దేవేంద్రుడిట్లు పలుకగా మరుత్తులు మెల్లగా దాపరికము లేకుండ సరమ చేసిన పనిని నివేదించిరి.
అంత పాకశాసనుడగు దేవేంద్రుడు పట్టరాని కోపముతో ఆ కుక్కను కాలితో మట్టగింప సాగెను.
‘బుద్ధిలేని దానా! నీవు పాలు త్రాగితివి. ఆ రక్కసులు గోవులను కాజేసిరి’ అని పలుకుచు సరమను కాలితో తన్న సాగెను.
ఇంద్రుని కాలి దెబ్బల వలన దాని నోటి నుండి పాలు వెలికి వచ్చెను. అట్లు వచ్చుచున్న పాలతో ఆ శుని గోవులున్న చోటి కరిగెను. దేవేంద్రుడు సేనలతో కూడి దాని వెంట నరిగెను.
అంత దేవేంద్రుడు దైత్యుడు అపహరించిన గోవులను గాంచెను. వానిని రక్షించు చున్న బలవంతులగు రక్కసలను దేవ సేనలు రూపు మాపెను. గోవులు రూపము చెడక వశ మాయెను.
పెల్లు బికిన సంతోషము గల సామంతులతో దేవరాజు గోవులను పొంది పరమానంద మందెను.
అట్లు గోవులను చేజిక్కించుకొన్న దేవేంద్రుడు వేల కొలదిగా వివిధములగు యజ్ఞము లాచరించెను. అట్లు చేయు చుండగా ఆతని బలము పెంపొంద సాగెను.
అట్లు పెంపొందిన బలముతో దేవేంద్రుడు దేవ సేనను ‘దైత్యులను రూపు మాపు కార్యమునకు సిద్ధపడు’ డని హెచ్చరించెను.
ఆతడట్లు పలుకగనే దేవతలు ఏర్పాటు లన్నియు కావించుకొని రాక్షసులను రూపు మాపుటకై దేవేంద్రునితో కూడి బయలు దేరిరి.
అట్లు వెడలి దేవతలు రక్కసుల మూకతో పోరాడి గెలిచిరి. చావగా మిగిలిన రక్కసులు భయముతో గుండె చెదరి సముద్ర జలములో మునిగిరి.
అట్లు దేవరాజు లోక పాలురతో కూడి స్వర్గము నాక్రమించి మునుపటి వలె ఏల సాగెను.
ఈ ఉత్తమ కథను ప్రతి దినము విను మానవుడు గోమేధ యజ్ఞము చేసిన ఫలము పొందును.
ఎవ్వడు గాని రాజ్యము కోల్పోయిన రాజు ఈ కథను శ్రద్ధతో నాలకించినచో, దేవేంద్రుడు స్వర్గమును పొందినట్లు, తన రాజ్యమును తిరిగి పొందును.
